ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం

కళాకారుడనేవాడు ఏ మాధ్యంలోనైనా తన భావాలకు రూపం కల్పించవచ్చు. అక్షరాలను విత్తులుగా నాటి కవితాసేద్యం చేయచ్చు. రంగుల్ని మేళవించి చిత్రాల్ని గీయచ్చు. రాగాల్ని మీటి హృదయాలను రాగరంజితం చేయచ్చు. గజ్జె కట్టి హృదయాల్ని ఘల్లు ఘల్లుమని గంతులు వేయించొచ్చు. రాతిని చెక్కిచెక్కీ అందమైన నాతిగా శిల్పించొచ్చు. ఏం చేసినా, ఎవడైనా-వాడు కళాకారుడే!

సాహిత్యంలో నోబెల్ బహుమతినిసాధించి, అత్యున్నతంగా వెలుగొందుతున్న సమయంలో విశ్వకవి టాగోర్ తన ముదిమి వయసులో కుంచెను పట్టారు. గొప్ప చిత్రకారునిగా పేరు పొందారు. అడవి బాపిరాజు సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాల్లో ప్రతిభ కనబరచి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. చిత్రకారునిగా ఉంటూ కవులైనవాళ్ళెందరో ఉన్నారు. డా. ఎస్వీ రామారావు, అంట్యాకుల పైడిరాజు, డా. కాపు రాజయ్య వంటి వారెందరో. ఇప్పుడీ జాబితాకి రామకృష్ణ తన పేరును కూడా జత చేస్తున్నారు.

 చిత్రకారుడుగా రామకృష్ణ చేతి వేళ్ళను కుంచెలుగా చేసుకుని వందలాదిగా కాన్వాసుల్ని ప్రకృతి శోభతో వర్ణాంచితం చేసిన /చేస్తున్న ‘నేచర్ స్పెషలిస్ట్. పదమూడున్నర గంటల్లో వంద ప్రకృతి చిత్రాలను తన చేతి వేళ్ళ కుంచెలతో చిత్రించి ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో తన పేరును నమోదు చేసుకున్న అపురూప కళాకారుడు..
కవిగా జీవితంలో ఒక్కోసంపుటి ఒక్కోమజిలీ దాటుకుంటూ సంపుటి నుండి సంపుటికి కవిత్వ రచనా పద్ధతిని, వస్తు శైలీ శిల్పాల నిర్వహణలో మార్పుల నేపథ్యమంతా రామకృష్ణగారి కవితాప్రస్థానంలో చూడగలం.
‘కలరవాలు’అనే తొలి కవితాసంపుటికి ‘వేకువ తొలి సవ్వడి’ అనే ట్యాగ్ లైనును ఉంచారు రామకృష్ణ కవిగా తన జన్మవేకువ సమయాన పక్షుల కిలకిలారావాల్లా ‘తొలి సవ్వడి’ చేస్తున్నానని చెప్పకనే చెప్పారు. కవిగా కూడా తనను తాను తెలుసు (పుకోవాలని ‘కల’గన్నారు, అందుకే తన కవితలను ‘కలరవాలు’ అన్నారు కాబోలు.

ప్రాతఃకాలంలో పిట్టలు చేసే వేకువ తొలి సవ్వడుల్లాంటి 64 కవితలను తొలి ప్రయత్నంలోనే మంచి కవిత్వం’ అనిపించుకొంది. ప్రకృతి వర్ణన నుంచి ప్రేమ సరాగాల మీదుగా, అక్కడక్కడ సమాజాన్ని స్పృశించుకుంటూ, జీవన గమనాన్ని జీవాత్మ, పరమాత్మల కలయిక దిశగా నడిపే పరమార్థంగా భావించే కవితల సమాహారం ఈ మొదటి సంపుటి.
రెండవ సంపుటి వచ్చేసరికి, కవితానిర్వహణ పూర్తిగా మారిపోయింది. కవితాఖండికల స్థానే ఒక దీర్ఘ కవితగా వచ్చింది. వస్తువు ఒక తుఫాను రాత్రి ఎనిమిదేళ్ళ పిల్లాడి మనసులో రేపిన భయకంపిత కలవరం. కొండల్లో సన్నగా పుట్టి, నెమ్మదిగా ప్రవహించి పాదాన్ని చేరి, అక్కడినుంచి మైదానంలో విశాలంగా పరచుకునే ప్రవాహం లాంటిది దీర్ఘకవిత. చక్కని పదచిత్రాలతో, మంచి ఇమేజరీతో కట్టలు తెగిన ప్రవాహంలా పొంగులెత్తిందీ కవిత. నలభై అయిదేళ్ళ వయసులో తన “తుఫాను రాత్రి’ అనుభవాలను దీర్ఘకవితగా మలచి, తుఫానుల్లో చిక్కి అవస్థలు పడ్డ ప్రాణుల ‘ఆత్మ’లకు అంకితమిచ్చి తన ఆత్మగతమైన సహానుభూతిని ప్రకటించారు రామకృష్ణ.

‘తుఫాను రాత్రి’, ఆ రాత్రిని అనేక కోణాల్లో దీర్ఘంగా వర్ణించిన కవిత. అమ్మ, నాన్నల తోడు లేని సమయంలో తుఫాను రేపిన అలజడుల్లో పూర్తిగా తడిసి గడ్డ కట్టుకుపోయిన చిన్నతనపు చిరు జ్ఞాపకాల అనుభవాలను అక్షరాల వెల్లువగా కూర్చిన వాస్తవిక భయోత్పాతం. ఆ తుఫాను రాత్రి రామకృష్ణ గారి మనసులో ఎప్పటికీ చెరిగిపోని, చెదిరిపోని గాఢ ముద్రను వేసింది. అందుకే, ఈ దీర్ఘకవితలో తుఫాను రాత్రి అనుభవాలను, అనుభూతులను చిన్న చిన్న అంశాలతో సహా ఉత్ర్పేక్షించి, తదనుభవాలను, అనుభూతులను పాఠకుడి మనసుపై కూడా అదేవిధంగా ముద్రింపబడేట్లు ఒక ప్రవాహోద్వేగ శైలితో వివరించారు రామకృష్ణ.

“తుఫాను’ను వస్తువుగా చేసుకుని రాసిన ఈ దీర్ఘకవితలో, సందర్భవశంగా ఎన్నెన్నో విషయాలను ప్రస్తావిస్తూ, విశాలమైన ఒక కాన్వాసుపై, తన మౌలిక కళైన చిత్రరచనను అక్షరబద్దం చేసి చూపారు.
ఈ కావ్యాన్ని శ్రీమతి లక్ష్మీకాంతం గారు ‘అంధ్రాత్’ పేరుతో హిందీలోకి అనువదించగా త్వరలో ఉత్తరభారత పాఠకులను అలరించనున్నది.
కలరవం నుంచి కలవరంగా మారిన కవిత్వ వెల్లువ, అలానే కొనసాగుతూ మూడవ సంపుటి వచ్చేసరికి ‘వికల కూజితం’గా మారింది. కూజితమే కాని, అందులో వికలత్వం కలగలిసిన కవిత్వం. సకలం వికలం…సజలం కకావికలం!
సమాజగతమైన ఆందోళనలను, అవసరాలను కలుపుకుంటూ చేదుబ్రతుకుల, అనాథల కష్టాల కాష్టాల కన్నీరు ఉప్పెనలను స్పృశించారు…

కలవని తీరాల మనుషుల ఒంటరి తనాన్ని, తేలిన గుండె జాడల్ని పసిగట్టి సమాజ నిజదర్శనం చేయించారు రామకృష్ణ, ఈయన కవిత్వ చిరునామా ‘కవినెరుగని కవిత్వం’ అనే కవిత. “నీటి చుక్కకై యుగాలుగా ఎదురు చూసే చూపులు ఆరి…నేలలా నెర్రులు బాసిన కళ్ళు నేడు వ్రాస్తున్నాయి కవిత్వం” అంటారు.

మౌలికంగా రామకృష్ణ ఒక కవిలపిట్ట. పిట్ట స్వభావం కూజితం. అది కలస్వనమైనా కావచ్చు, వికలస్వనమైనా కావచ్చు; అలాగే పిట్ట ఎప్పుడూ పూజితం. పచ్చగా, ఎర్రని ముక్కుతో ఉండేదైనా కావచ్చు, నల్లగా ఉండేదైనా కావచ్చు. 44 కవితల్ని కవిలెకట్టగా చేసి ముద్రించిన కవితాసంపుటి ఈ ‘వికల కూజితం’.

చిత్రకారుడు కూడా అయిన ఈ కవి మంచి భావుకుడు. మట్టి మనిషిగా రైతును సంభావిస్తూ –

“ఈ మట్టి పొరల్లోనే నేల నీళ్ళాడినప్పుడల్లా
పచ్చందాలకు సీమంతాలు జరిపింది” అంటారు. గొప్ప భావుకత. ఇటువంటి భావుకతతో చెబుతున్న భావానికి సీమంతం జరుపుతారు రామకృష్ణ తన చిత్రకారిత్వాన్ని అక్షరాల్లో బొమ్మ కట్టి చూపించగల నేర్పరి. అలాగే ఈయనది కథన కవిత్వం. తన స్వీయానుభవాలను జోడించి వస్తువును కథనాత్మక రీతిలో కవిత్వం చేస్తారు. అపరిచితుణ్ణి’ అనే కవిత ఉదాహరణ. సొంతూరుకు వెళ్ళిన కవిని ఎవ్వరూ గుర్తు పట్టరు. సొంతూరు వచ్చిన అపరిచితుల్లా కవి, పరాయీకరణకు గురవుతారు. ఆ నేపథ్యంలో ఒక చిగురంత ఆశ“నన్ను గుర్తుపడితే… ఈ మట్టే గుర్తు పట్టాలి

నన్ను పలకరించినా ఈ మట్టే పలకరించాలి…
ఇది నాతో ఆడిన నా చిన్ననాటి నేస్తం … … …. …..

ఇంతకన్నా ఎవరు కావాలి?

నన్నెరిగిన నా వారు ఈ ఊరిలో…”అని సంతృప్తి చెందుతారు. సామెతలను, జాతీయాలను అర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా తన కవిత్వాన్ని భావపరంగా సంపద్వతం చేస్తారు రామకృష్ణ.

ఆత్మకూరు రామకృష్ణగారు ‘అవ్యక్తు’ పేర చనిపోయిన తన తండ్రిగారి జ్ఞాపకాలను “తిరిగిరాని బంధంకోసం…’ అంటూ దీర్ఘకవితగా పలవరించారు. స్మృతుల భారం తగ్గించుకుందుకు రాసిన ఎలిజీ. ఇది తన నాల్గవ కావ్యం.

“…జీవన సేద్యంలో ఇన్నాళ్ళు తోడుగా నిలిచిన నాన్న, ఇక లేడన్న దుఃఖంతో విరిగిన కవి హృదయం వర్షించిన తండ్రి జ్ఞాపకాలే” ఈ అవ్యక్తం దీర్ఘకవితగా రూపొందించి, ఆ తండ్రి స్మృతికే ‘అంకితం ఇచ్చారు. నాన్నను కోల్పోయిన బాధ అవ్యక్తమనో, నాన్న స్మృతులు అవ్యక్తమనో-ఒక భావం మనసులో కదలాడగా ఈ దీర్ఘకవితకి ‘అవ్యక్తం’ అన్న పేరుంచారు రామకృష్ణ కానీ అత్యద్భుతంగా తన స్మృతులను, స్మృతుల నేపథ్యాలనూ సువ్యక్తం చేశారు. అదనంగా ఈ దీర్ఘకవితలో చెప్పుకోవలసిన అంశం ఒకటుంది. మొత్తం కవితని పది అంకాలుగా విభజించారు. వాటిలో చివరి మూడంకాలలోను ప్రత్యేకించి మరణవైరాగ్యాన్ని పలవరించారు. కాలానికి, చరిత్రకీ, దైవానికీ మరణంతో ఉన్న బంధాన్ని, జీవాత్మకు పరమాత్మతో ఉన్న అనుబంధాన్ని ఒక హేతుపూర్వకమైన తర్కంతో విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఒక ఉపనిషత్కారుని జిజ్ఞాసను మనం అనుభూతిస్తాం. జీవన్మరణాల పొలిమేరల్లో నిలచిన తాత్త్వికుడే అవుతారు కవి.

రామకృష్ణ కవితలు చిన్న చిన్న మాటల్లో తేలిక భావంతో తేలిపోయే కవితలనిపిస్తాయి అలవోకగా చదివితే. కానీ తరచి చూస్తే, ఆ చిన్న చిన్న మాటలే ప్రతీకలై, ఒక గుహనమైన భావాన్ని అందిస్తాయి. నిజానికిది మంచి కవిత్వం యొక్క ఒక లక్షణం. ఈ లక్షణాన్ని ఆత్మకూరు కవితల్లో చూడగలం.

ఐదవపుస్తకంగా చక్కని చేతివ్రాత నేర్వడానికి మెళకువల సర్వస్వంగా ‘హస్తలేఖనం ఓ కళఅన్న పుస్తకాన్ని సచిత్రంగా రూపొందించారు. ఇది గతంలో 64 కళలు.కామ్ అంతర్జాల పత్రికలో ధారావాహికగా సంవత్సరంపాటు వెలువడి వ్యాసాలు. అక్షరాలను అందంగా రాయడం ఒక రకంగా చిత్రలేఖనమే. అసలు చిత్రాల్లోంచి పరిణామక్రమంలో ఏర్పడ్డవే అక్షరాలు. దస్తూరి అనేది చిత్రాక్షరి. ఈ మాత్రం చెప్పి ఊరుకుంటే ఈనాటి సందర్భానికి అది సరిపోదు. అందుకే, ‘కలము వెర్సస్ కీ బోర్డు’ అన్న భావనను కూడ రామకృష్ణ ప్రత్యేకించి వివరించాల్సి వచ్చింది. “బుక్ కల్చర్’ పోయి ‘లుక్ కల్చర్’ వచ్చినట్లుగా, చేతిరాత చెరిగిపోయి ముద్రాక్షరాల రాత చోటు తీసుకుంటోంది.

నిరంతర చైతన్య చలితమైన చేతిని సక్రమంగా చలింపజేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. వయసుతో పాటు మారే కలంపట్లు వివరించి, కలానికి కుడి ఎడమైతే, రాత “తారుమారు’ అవుతుందంటారు. మంచి చేతి రాతకు మార్గాలు సూచిస్తూ, కూర్చొనే భంగిమనుంచి రాత పరికరాలు, మంచిరాతలో సిరాలు, పాళీల ప్రభావం వంటి ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించారు రామకృష్ణ

మన అక్షరాన్ని చక్కదిద్దే కళ హస్తలేఖనం. దాన్నే ‘లిపికర్మ కళ” అంటూ, చేతివ్రాలులో అక్షరాల వాలు గురించి పదాక్షర ఒద్దిక గురించి చర్చిస్తారు. కవి-చిత్రకారుడైన రామకృష్ణ కలం, కుంచెల నుండి వీలైనన్ని సృజనలు సమాజహితాన్ని, పాఠక-ప్రేక్షక అభిమతాన్ని చూరగొనేవిలా ఆవిష్కరింపబడాలని ఆకాంక్షిస్తూ…

– మాకినీడి సూర్య భాస్కర్

5 thoughts on “ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం

  1. వ్రాసిన మాకినీడిగారికి, ప్రచురించన 64కళలు వెబ్ మ్యాగజైన్ ఎడిటర్ కళాసాగర్ గారికి ధన్యవాదములు.

  2. తొలుత చిత్రకారుడిగా ప్రారంబించిన ఆత్మకూరు రామకృష్ణ గారు ఆపై చేతివేళ్ళ చిత్రకారుడిగా రికార్డులు కొల్లగొట్టి నేడు కవిగా రచయితగా అవతారమెత్తి అటు చిత్ర రచనలోను ఇటు వచనా కవిత్వంలోనూ రెండింటా రాణిస్తున్న రామకృష్ణ గారి గురించి మరో బహుముఖ ప్రజ్ఞాశాలి మాకందరికీ అత్యంత ఆత్మీయులు అయిన మాకినీడి గారి కలం నుండి వెలువడిన వ్యాసం బాగుండకుండా ఉంటుందా ..? ఎంత బాగా రాసిన మాకినీడి గారికి ,వ్యాసానికి ఆధార భూతుడైన చిత్రకారుడు రామకృష్ణ గారికి అభినందనలు.

    1. ఈ వ్యాసం పై మీ స్పందన చాల చక్కగా ఉంది. ఆలస్యంగా స్పందించినందుకు అన్యదా భావించకండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap