కోడి రామకృష్ణ జయంతి నేడు …

జూలై 23 కోడి రామకృష్ణ జయంతి స్పెషల్ వ్యాసం ….

తెలుగు చిత్రసీమలో గురువుకు తగ్గ శిష్యునిగా పేరు తెచ్చుకుని శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఒకే ఒక్కరు. ఆయన.. కోడి రామకృష్ణ దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రియ శిష్యుడు. అవును. ఆయన ఎన్ని రకాల సినిమాలు తీశారు! ఎన్ని విజయాలు సాధించారు! కుటుంబ కథా చిత్రాలు.. యాక్షన్ సినిమాలు.. హాస్యభరిత చిత్రాలు.. అభ్యుదయ సినిమాలు.. ఫాంటసీ మూవీలు.. ఎన్నెన్ని తీశారు! గ్రాఫిక్స్న ఉపయోగించుకుంటూ ఆయన రూపొందించిన సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయి!! నిస్సందేహంగా ఆయన విలక్షణత్వం మూర్తీభవించిన దర్శక దిగ్గజం. నిజానికి ఆయన సంపాదించుకున్న పేరుకంటే ఆయన గొప్ప స్థాయి దర్శకుడు. తన గురువు వెళ్లిపోయిన రెండేళ్లలోపే ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో కానరాని తీరాలకు వెళ్లిపోయి టాలీవుడ్ కు తీరని లోటు మిగిల్చారు రామకృష్ణ, జూలై 23 ఆయన జయంతి సందర్భంగా అర్పిస్తున్న నివాళి ఇది… 1949 జూలై 23న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ 1974లో చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టారు. 1981లో ప్రతాప ఆర్ట్స్ అధినేత కె. రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడయ్యారు. సందర్భవశాత్తూ దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాత మనవడు’ నిర్మాత రాఘవే. నిజానికి రామకృష్ణ “తరంగిణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. అయితే చిరంజీవి కాల్వీట్లు ఇవ్వడంతో రాఘవ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో రామకృష్ణను దర్శకునిగా పరిచయం చేశారు. ఆ తర్వాత ‘తరంగిణి’కి దర్శకత్వం వహించిన రామకృష్ణ, మూడో సినిమా ‘ఆలయ శిఖరం’ను చిరంజీవితోటే రూపొందించారు. ఆ తర్వాత ఆయన శతాధిక చిత్రాలు తీసినా దర్శకుడిగా ఎప్పుడూ ఆకలితోటే ఉండేవారు. మరిన్ని చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని రంజింపజేయాలని ప్రయత్నిస్తూనే వచ్చారు.

సినిమా ఎలాంటిదైనా.. సెంటిమెంట్ కామన్!
ఒక చక్కని చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన రామకృష్ణ కెరీర్ ఉజ్వలంగా ప్రకాశించడంలో నిర్మాతల పాత్ర ఎంతైనా ఉంది. సినిమా అంటే తపన ఉన్న చక్కని నిర్మాతలు ఆయనకు లభించారు. అందుకే వారి అభిరుచులకు తగ్గ సినిమాలు రూపొందిస్తూ సుదీర్ఘ కాలం దర్శకుడిగా రాణించారు. ఏదో ఒక తరహా సినిమాలే తియ్యాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అన్ని రకాల సినిమాలు తీశారు. గమనించాల్సిన విషయమేమంటే ఆయన ఏ తరహా సినిమా రూపొందించినా అందులో ఏదో ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ ఉండటం! సెంటిమెంట్ లేని జీవితం ఉండదని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే దాన్నెప్పుడూ ఆయన మిస్సయ్యేవారు కాదు. అయితే ఆయన బాగా ఇష్టపడి చేసినా.. సరిగా ప్రమోషన్ లేకనో, పెద్ద సినిమాల మధ్య నలిగిపోయో.. రెండు సినిమాలు సరిగా ఆడలేదు. వాటిని కొన్ని మార్పులతో మళ్లీ తియ్యాలనే కోరిక ఆయనలో ఉండేది. ఆ రెండు సినిమాలు – ‘అదిగో అల్లదివో (1984), ‘జెండా’ (2002)

తాజ్మహల్ బదులు.. తాజ్మహల్ బొమ్మతో షూటింగ్!
ఒకటి అనుకొని, ఇంకొకటి చేయాల్సి వచ్చినప్పుడు ఏ దర్శకుడైనా ఇబ్బంది పడతాడు. రామకృష్ణకూ అలాంటి సందర్బాలు ఒకట్రెండు వచ్చాయి. భానుచందర్, శారద, శరత్ బాబు కాంబినేషన్లో రూపొందించిన ‘ఉదయం’ (1987) చిత్రానికి ఆయన అలాంటి ఇబ్బందే పడ్డారు. అందులో భానుచందర్ తాజ్మహల్ ముందు నుంచి వచ్చే సన్నివేశం ఒకటుంది. అయితే ఆ కాలంలో తాజ్మహల్ దగ్గర సినిమా షూటింగ్లను నిషేధించారు. ఆ సంగతి రామకృష్ణకు తెలీదు. నిర్మాత ద్వారంపూడి నరసారెడ్డికి అక్కడ షూటింగ్ పెట్టమని చెప్పారు. అక్కడ కాకుండా ఇంకో మంచి ప్యాలెస్ దగ్గర ఆ సన్నివేశం తీయ్యమని ఆయనకు నరసారెడ్డి సూచించారు. తాజ్మహల్ దగ్గర తప్ప ఇంకో చోట ఆ ఎఫెక్ట్ రాదనేది రామకృష్ణ ఉద్దేశం. ఆ సంగతి చెబితే, అప్పుడు తాజ్మహల్ దగ్గర షూటింగ్స్ కు అనుమతి లేని విషయం నిర్మాత తెలియజేశారు. అదే సమయంలో నరసారెడ్డి ఇంట్లోని తాజ్ మహల్ బొమ్మ రామకృష్ణ దృష్టిలో పడింది. ఆయన మనసులో ఓ ఆలోచన మెదిలింది. ఆ బొమ్మనే పెద్దదిగా చూపిస్తూ, హీరో దాని ముందు నుంచి వచ్చే సన్నివేశాన్ని తీసేశారు రామకృష్ణ చిత్రీకరణపరంగా తనకెదురైన ఇబ్బందిని అలా అధిగమించేశారు.. శక్తిమంతమైన స్త్రీ పాత్రల సృష్టికర్త :
ఆయన సినిమాల్లోని సెంటిమెంట్ను బాగా పండించేది స్త్రీ పాత్రలే. తన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లోనే “అప్పటి సీత నుంచి ఇప్పటి సీత దాకా ఆడది ఆడదే. సంసారాన్ని బాగు చేసుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా అది ఆడదాని చేతుల్లోనే ఉంది” అని సంగీత పాత్రతో చెప్పించారు రామకృష్ణ ‘భారత్ బంద్’, ‘పోలీస్ లాకప్’, ‘అరుంధతి’ వంటి సినిమాల్లో హీరోయిన్ కేరెక్టర్లను శక్తిమంతంగా మలచారు. ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో నాయిక పాత్రలకు ప్రాముఖ్యం కనిపిస్తుంది. ఆ క్రమంలో ప్రసిద్ద బాలీవుడ్ తార ఐశ్వర్యా రాయని డైరెక్ట్ చెయ్యాలని ఆయన భావించారు. రెండుసార్లు ముంబై వెళ్లి ఆమెకు కథలు కూడా వినిపించారు. అయితే ఆమె ‘అరుంధతి’ రీమేక్ పై ఆసక్తి చూపించారు. అప్పటికే ‘అరుంధతి’ డబ్బింగ్ వెర్షన్ హిందీలో విడుదలవడంతో కొత్త కథతో సినిమా చేద్దామని రామకృష్ణ ప్రతిపాదించారు. ఆ కథలు నచ్చకపోతే అప్పుడు ‘అరుంధతి’ని రీమేక్ చేయవచ్చని ఆయన సూచించారు. అందుకు ఐశ్వర్య సరేనన్నారు. కానీ ఆమెతో సినిమా చెయ్యాలనే ఆయన కోరిక నెరవేరలేదు.

సినిమాలు ఆగాయి.. ఆయనా ఆగిపోయాడు!
రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి చిత్రం.. కన్నడంలో వచ్చిన ‘నాగరహవు’ (2016). ఇది ఆయన తొలి కన్నడ చిత్రం. దివంగత కన్నడ అగ్ర నటుడు విష్ణువర్ధన్ పాత్రను డిజిటల్గా సృష్టించి, ఈ సినిమా రూపొందించి రికార్డ్ సృష్టించారు రామకృష్ణ తెలుగులో ఈ సినిమా ‘నాగాభరణం’ పేరుతో విడుదలైంది. కాగా ఆయన మొదలు పెట్టిన రెండు సినిమాలు పూర్తి కాకుండా ఆగిపోవడం విచారకరం. ఒకటి.. అర్జున్, లక్ష్మీ రాయ్ జంటగా మొదలు పెట్టిన ‘రాణీ రాణిమ్మ” కాగా, మరొకటి పుట్టపర్తి సాయిబాబా పై సినిమా. వీటిలో “రాణీ రాణెమ్మ’ దాదాపు పూర్తయ్యాక ఆగిపోతే, సత్య సాయిబాబా పై సినిమా సగం తీశాక ఆగిపోయింది. అందులో సత్యసాయిగా మలయాళ నటుడు దిలీప్ నటించారు. ఇవి కాకుండా ‘అంకుల్ ఆంజనేయులు’, ‘చింతచెట్టు’ అనే సినిమాల్ని ఆయన తియ్యాలనుకున్నారు. వీటిలో ‘అంకుల్ అంజనేయులు’ అనేది ఆంజనేయస్వామి, నలుగురు పిల్లలపై నడిచే కథ. ‘చింతచెట్టు’.. సస్పెన్స్, సెంటిమెంట్ మేళవించిన కథ. ప్రాణం తియ్యడానికి వచ్చిన యముడిని ఏడాది కాలం గడువు అడిగి, కుటుంబాన్ని చక్కదిద్దుకున్న ఓ యువకుడి కథ. వీటిని తీయకుండానే మన మధ్యలోంచి వెళ్లిపోయారు రామకృష్ణ.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap