అడుగుజాడ గురజాడ

కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘీక సంస్కరణ నాటిక వ్రాసిన శ్రీ గురజాడ అప్పారావు గారి 101 వ వర్ధoతి నేడు… ఆ మహామనిషిని ఒక సారి తలచుకుందాం.
– నవంబర్ 30 గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా-

గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

-వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.

-బాల్యం-విద్యాభ్యాసం
విశాఖ జిల్లా, ఎలమంచిలిలో, మేనమామ ఇంట్లో సెప్టెంబరు21, 1862 న, వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి శ్యామల రావు అనే తమ్ముడు ఉన్నారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా, రెవిన్యూ సూపర్వైజరు మరియు ఖిలేదారు గాను పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రిగారు కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో ఏం. ఆర్. కాలేజి, అప్పటిప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి గారు ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరుగా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

-వివాహం-సంతానం
1885 లో అప్పారావు గారు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం – ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887 లో సంవత్సరంలో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ పుట్టారు. 1890 లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించారు.

-ఉద్యోగాలు
అప్పటి కళింగ రాజ్యంగా పేరు పొందిన విజయనగరంలోనే అప్పారావుగారు ఉండడం జరిగింది. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో మంచి సంబంధాలు ఉండేవి. 1887 లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వీరు మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889 లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామల రావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావు గారిని తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించారు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృ భాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరనిఅన్నారు. గుండుకుర్తి వెంకట రమణయ్యగారు, “ఇండియన్ లీషర్ అవర్”ఎడిటరు కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించారు. 1891 లో విజయనగర సంస్థానంలో సంస్థానశాసనపరిశోధకునిగా నియామకం పొందారు.

1897లో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు. 1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం లభించింది.

-కన్యాశుల్కం
గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు.

1892 లో గురజాడ వారి కన్యాశుల్కం నాటిక వేయబడింది. అది మొదటి సారే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. ఈ నాటకం సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు గారు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి గారు ముఖ్యులు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రసంసించడంతో అప్పారావు గారికి ఎంతో పేరు వచ్చింది.1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897 లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. ఇది అప్పారావు గారు – మహారాజ ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరిగి వ్రాసారు. 1910 లో దేశమును ప్రేమించుమన్నా అన దేశ భక్తీ గీతాన్ని వ్రాసారు, ఇది ఎంతో పేరు పొందింది. 1911 లో మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డు అఫ్ స్టడీస్లో నియమించబడ్డారు . అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్యపరిషత్తు ప్రారంభించారు.
-అస్తమయం
1913 లో అప్పారావు గారు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు “ఫెలో”తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు.
-గురజాడ మరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు ఆయన రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; ఆయన ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap