గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయస్థాయి చిత్రలేఖన ప్రదర్శన 
ప్రథమ బహుమతి అమలాపురం చిత్రకారుడికి.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని చిత్రలేఖన ప్రదర్శన పోటీల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రేమ సమాజంలో  చోడవరం చిత్రకళా నిలయం, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు బొడేట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరం ఫర్‌ బెటర్‌, ఆర్క్‌ సహకారంతో  రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి చిత్రలేఖన ప్రదర్శనను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జాతీయ స్థాయిలో చిత్రలేఖన ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా చిత్రలేఖన, ప్రదర్శన పోటీలు నిర్వహించాలని తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. చోడవరంలో అనేక కల్యాణ మండపాలు నిర్మిస్తున్నామని, వాటిలో చిత్రలేఖనానికి సంబంధించి కార్యాలయాన్ని కేటాయిస్తామని అన్నారు. అనంతరం ప్రేమ సమాజం కార్యాలయం ఆవరణలో మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, అస్సోం, కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన చిత్రాలను ప్రదర్శించారు. సీనియర్ల నుంచి 160, విద్యార్థుల నుంచి  3,500పైగా చిత్రాలు వచ్చాయని సూర్యనారాయణ ఎమ్మెల్యేకు వివరించారు. చిత్రాలను ఎమ్మెల్యేతోపాటు సింహాచలం భూముల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.శేషశైలజ, చోడవరం ఫారెస్టురేంజ్‌ అధికారి రామ్‌నరేష్‌, వెంకటరావు (ఏడమ్స్‌ స్కూల్‌) తదితరులు తిలకించారు.

ఈ చిత్రకళా ప్రదర్శనలో అమలాపురానికి చెందిన కళాకారుడు రవిశాస్త్రి గీసిన పందెం కోడిపుంజులు ప్రథమ బహుమతిని సాధించింది. ద్వితీయ బహుమతిని విజయవాడకు చెందిన డి.వెంకటేష్‌, తమిళనాడుకు చెందిన డి.రామకృష్ణారావుల  కృష్ణుడు, జల్లికట్టు చిత్రాలు కైవసం చేసుకున్నాయి. తృతీయ బహుమతికి  ఎం.ప్రశాంతి (ఏలూరు), పి. నాగేశ్వరరావు (విశాఖ), మళ్ల శివ (అనకాపల్లి)కి చెందిన మహిళ రక్షణ చిత్రం, స్వచ్ఛభారత్‌లో విశాఖ రైల్వేస్టేషన్‌, చిత్రకారుడి చిన్ననాటి బాల్యం చిత్రాలు ఎంపికయ్యాయి. విజేతలకు రూ.10వేలు, రూ.5వేలు, రూ.3వేలు చొప్పున నగదు బహుమతులతోపాటు జ్ఞాపికలను అందజేసారు. వీటితో పాటు రూ.1000 చొప్పున మరో 12 మందికి నగదు బహామతులు, రూ.500 చొప్పున 20 మందికి నగదు బహుమతులను అందించారు.. ఈ కార్యక్రమంలో శిల్పి రవిశంకర పట్న్యాక్, చిత్రకారులు దేవీప్రసాద్, శిల్పి దివిలి అప్పారావు ఇంకా అనేకమంది చిత్రకారులు పాల్గొన్నారు.

5 thoughts on “గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

    1. ధన్యవాదాలు మనోహర్ గారు ..మొదట అభినందనలు చెప్పాల్సింది బొద్దేటి సూర్యనారాయణ గారికి చోడవరం లాంటి గ్రామీనప్రాంతంలో తొలిసారిగా జాతీయస్థాయిలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్పవిషయం .అందుకు నిర్వాహకులందరికి అభినందనలు .ఇందులో నా గ్రామీణ క్షురకుడు చిత్రానికి ప్రఖ్యాత చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు అవార్డ్ రావడం చాల ఆనందదాయకం .ధన్యవాదములు మిత్రమా —ventapalli satyanarayana

  1. మొదటి ప్రయత్నంలోనే సూర్యనారాయణ మాస్టారు చక్కని విజయాన్ని సాధించారు.. ఇదే ఉత్సాహం తో ప్రతీ సంవత్సరం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరెంతో మంది చిత్రకారులను ప్రోత్సహిస్తూ వుండాలని ఆశిస్తు….
    అభినందనలతో…
    మీ అంజి

  2. అవార్డ్స్ ఎంపిక సరిగా లేదు. ఇంకా బాగా చేసివుండాల్సింది. కొంత మంది చిత్రకారులను నిరాశకు గురిచేసింది. గుంటూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap