నేడు బాలమురళీకృష్ణ 89 వ జయంతి

భాషా సాంకృతిక శాఖ నిర్వహణలో జూలై 6 న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో బాలమురళీకృష్ణ 89 వ జయంతి జరుగనుంది. సాంకృతిక శాఖ మాత్యులు అవంతి శ్రీనివాస్ అధ్యక్షులుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో పలు సాంకృతిక కార్యక్రామాలతో పాటు, అన్నవరపు రామస్వామి గారి వాయులీన వాద్య కచేరి వుంటుంది.
బాల్యం…
బాలమురళీకృష్ణ 1930, జూలై 6న తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. కొచ్చర్లకోట రామరాజు ఆయన మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాడు. ఉన్నట్టుండి ఆయన కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరాడు. ఆయన తదనంతరం ఆయన శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు. ఆయన ప్రముఖ సంగీతకారుడు మరియు వేణువు, వయోలిన్, వీణ విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.

1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయన గురువు సుసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాలు సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశాడు.ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు
బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషితో కలిసి ముంబయిలో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడుగా సేవచేసారు.

బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేశియా, సింగపూర్ మరియు అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడాడు. ఫిబ్రవరి 18 న అనకాపల్లిలో చివరిసారిగా కచేరీ చేశాడు.

పురస్కారాలు…

బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని: సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాథ జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాథ మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.

దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించాడు. కర్నాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్న 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. సినీ సంగీత దర్శకునిగానూ, సినీ గాయకునిగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు. 2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం
కచేరీలు
కువైట్ లో 2006 మార్చి 29 న జరిగిన కచేరీలో బాలమురళీకృష్ణ తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగాడు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది.

రాగాలు
మహాతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించాడు.ఈ కొత్త రాగాలు కనిపెట్టడం వల్ల ఆయన కొన్ని విమర్శలకు కూడా గురయ్యాడు

సినిమాలు
1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమా ద్వారా ఆయన గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు. తర్వాత ఆయన గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయనచేత పాడిస్తూ వచ్చారు. 1967లో రోజా రమణి ప్రహ్లాదుడిగా, ఎస్. వి. రంగారావు హిరణ్యకశిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన నారదుడిగా నటించాడు. అదే సినిమాలో ఆయన ఆది అనాదియు నీవే దేవా, నారద సన్నుత నారాయణా, వరమొసగే వనమాలి పాటలు కూడా పాడాడు. అలాగే నర్తనశాల చిత్రంలో ఆయన పాడిన సలలిత రాగ సుధారస సారం,
శ్రీరామాంజనేయ యుద్ధంలో మేలుకో శ్రీరామా, ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీరామ జయరామ, గుప్పెడు మనసు చిత్రంలో మౌనమె నీ బాస ఓ మూగ మనసా, మేఘసందేశం చిత్రంలో* పాడనా వాణి కల్యాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. కన్నడ సినిమా మధ్వాచార్యకు ఆయన అందించిన సంగీతానికి గాను 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా,హంసగీతెలో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.

జీవితంపై పుస్తకాలు
బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణ ఉపోద్ఘాతం రాశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap