ఇరవయ్యవ శతాబ్దపు ప్రధమార్ధంలో బొంబాయి కి చెందిన ఆరుగురు చిత్రకారుకారులు (ఎఫ్,న్.సౌజా, ఎస్ హెచ్.రజా, ఎం. ఎఫ్. హుస్సేన్ ఎస్కే..బాక్రే,, హెచ్.ఏ.గడే మరియు కెహెచ్. ఆరా) ప్రోగ్రసివ్ ఆర్టిస్ట్స్ అనే గ్రూప్ గా ఏర్పడి భారతీయ చిత్రకళకు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు రావడం జరిగింది. వీరిలో “ఎస్కే బాక్రే” అన్న ఒకే ఒక్కడు శిల్పి కాగా మిగిలిన అయిదుగురు చిత్రకారులే. అందులో కెహెచ్.ఆరా అనే ఒక చిత్రకారుడు మన హైదరాబాదు కు చెందిన తెలుగు వాడయితే మిగిలిన అయిదుగురు ఉత్తరాది వారే. మొత్తం గ్రూపు నందలి ఆరుగురు అంతర్జాతీయంగా గొప్ప ఖ్యాతి గడించినవారే. అదే విదంగా 1990-2004 ఆ ప్రాంతంలో ఆంద్ర ప్రదేశ్ నందలి గుంటూరు ప్రాంతమునకు చెందిన ఐదుగురు చిత్రకారులు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి జాతీయ స్థాయిలో గుంటూరు కళా పాండవులు అన్న పేరుతో ఒక గొప్పగణనీయమైన పేరు గడించడం జరిగింది.
దాసరి నాగవర్ధన రావు, జి.నరసింహారావు, రాజ్ కపూర్, ఎస్. విజయ్ కుమార్ మరియు ఒస్మాన్ ఖాన్ అనే ఈ అయిదుగురు భిన్న భావాలతో విభిన్న ఆలోచనలతో సృజనాత్మకతతో కూడిన స్వతంత్ర ఆలోచన మరియు ఆచరణలతో వీరు నాడు జాతీయ స్థాయిలో దేశంలోని డెల్లి, బొంబాయి, కలకత్తా, చెన్నై, కొచ్చిన్, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలన్నింటా ప్రదర్సనలు చేసి ఏ.ఎస్.రామన్, సంజీవ్ దేవ్ లాంటి గొప్ప గొప్ప కళా విమర్శకుల యొక్క ప్రశంసలకు నోచుకోవడం జరిగింది. వీరిలో ఒకరు సాంప్రదాయ రీతి ఇంకొకరు ఆధునిక రీతి, వేరొకరు నైరూప్యరీతిలో ఇంకొకరు వేరొక రీతిలో ఎంచుకున్న అంశం లోనే కాక వాటిని చిత్రించే తీరులోనూ కూడా భిన్న వైరుధ్య శైలులలో చిత్రాలు సృజియిస్తూ గొప్ప ఖ్యాతి గడించిన అయిదుగురిలో ప్రాకృతిక స్వరూపాలను ప్రధాన అంశంగా ఎంచుకుని కాన్వాస్ పై తన అద్భుతమైన ఆవిష్కరణతో నేటికీ ప్రేక్షకులను మైమరపిస్తున్న గొప్ప చిత్రకారుడు సామంచి విజయ్ కుమార్.
కొండలు,గుట్టలు, పర్వతవాలు ప్రాంతాలు, ప్రవహించే జలపాతాలు, లోయలు, ఎర్రటి ఎడారి ప్రాంతాలు, నిర్మల నీల దృశ్యాలు, చల్లటి హిమశిఖరాలు, వంటి సహజమైన ప్రకృతి ప్రదేశాలు విజయకుమార్ గారి కుంచె విదిలలింపు రంగుల పోహలింపులతో అత్యంత సహజంగా కాన్వాస్ పై ఆవిష్క్రుతమై చూపరులను విస్మయ పరుస్తాయి. నిజ ప్రకృతి ప్రదేశాలకు చెందిన ఛాయా చిత్రాలా అన్న బ్రాంతిని కలిగిస్తాయి. ఆ చిత్రాలను చూసిన ఎవరికైనా వాస్థవ ప్రకృతి వొడిలో వుండే వాటిని చిత్రించి వుంటారు అనేభావం కలుగుతుంది. కాని విచిత్రం ఆయన చిత్రాల్లో ఎక్కువబాగం స్టుడియోలో వుండి తన మనసు పుటల్లో ఊహించుకొని ఆవిష్కరించినవే. వర్ణ సమ్మేళనం, కుంచె విదిలింపులపై అతనికి గల సాధికారత ఇంతటి సహజసిద్ధమైన వ్యక్తీకరణతో కూడిన చిత్రణకు బాసటగా నిలిచాయని చెప్పవచ్చు.
విజయ్ కుమార్ గారి ఒరిజినల్ చిత్రాలు తొలిసారిగా నేను రాజమహేంద్రవరంలో చూడడం జరిగింది. 2018 జూలై నెల 21,22 తేదీలలో రెండురోజులపాటు వైభవంగా అక్కడ జరిగిన భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ వారి తొలి వార్షికోత్సవవేడుకలలో విజయకుమార్ గారు కాన్వాస్ పై ప్రకృతిని ప్రతిష్టించే విదానాన్ని ఖమ్మం నుండి వెళ్ళిన నేను నామిత్రుడు బీర శ్రీనివాస్ ఇద్దరం తొలిసారిగా చూడడం జరిగింది. ఆ కార్యక్రమంలో విజయకుమార్ గారితో పాటు పూణే నుండి వొచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు అరుణ్ కుమార్ సోనేనే, విశాఖ పట్నం కేంద్రీయ విద్యాలయం నుండి వొచ్చిన మరో చిత్రకారుడు శశిభుషణ్ గారు మరియు రాజమండ్రి కి చెందిన చిత్రకారిణి పట్నాల రాదారాణి ల చిత్రప్రధర్శనతో పాటు మొదటి రోజు విజయ్ కుమార్ గారి ల్యాండ్ స్కాప్ లైవ్ డెమో కార్యక్రమంకుడా పెట్టడం జరిగింది. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు రెండో రోజు కూడా యీ కార్యక్రమాన్నిమరలా పెట్టడంతో రెండవ రోజు వెళ్ళిన మాకు ప్రకృతిని కాన్వాస్ పై ఆయన సృష్టించే విధానాన్ని తొలిసారిగా ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగింది.
సాధారణంగా ప్రకృతి చిత్రణ చేసేటప్పుడు నిజ ప్రకృతి ఒడిలోకి వెళ్లి తాను చూస్తున్న ప్రకృతిని యదాతద చిత్రణ చేయడం ఒక ఎత్తయితే మనసు పుటల్లో ఊహించి ప్రకృతి చిత్రణ చేయడం మరోఎత్తు. ఇందులో మొదటి విదానం కంటే రెండవ విధానం క్లిష్టతరమైనది. స్వేచ్చాయుతమైనది. మొదటి రీతిలో బాహ్యంగా వున్న ప్రకృతిని చూస్తూ చిత్రిస్తే, రెండవదానిలో చిత్రకారుడు తన మనసు పుటల్లో ఊహిస్తూ స్వయంగా ఆయన ఊహ మేరకు చిత్రించవలసి వుంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా చిత్రించడం కంటే ఊహను వాస్తవంగా చిత్రించడం కష్టం, దానితో ప్రేక్షకులను మెప్పించడం అన్నది ఇంకా కష్టం. క్లిష్టతరమైన ఈ రెండవ విధానంలోనే వీరు గొప్ప సిద్ధ హస్తులు. వీరు సృష్టించిన ప్రకృతి దృశ్యాలలో ఎక్కువ బాగం ఆ విదంగా సృష్టించినవే.
కళను సృష్టించడం వేరు ఆ కళను ప్రజల ముందుకు తీసుకెళ్ళడం వేరు. విజయ్ కుమార్ రెండింటా విజయం సాదించారని చెప్పడానికి వ్యక్తిగతంగాను సామూహికంగాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు చేసిన ప్రదర్శనలే ఉదాహరణగా చెప్పవచ్చు.గెలుపొందిన బహుమతులే ఋజువుగా చెప్పవచ్చు.1981 లోనే ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమి నుండి అందుకున్నఅవార్డ్ తో పాటు. డిల్లి, మద్రాస్ లలిత కళా అకాడమిలనుండి మరియు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి గోల్డ్ మెడల్ మరియు రాష్ట్రం లోని కోనసీమ చిత్రకళా పరిషద్ నుండి చిత్రకళ వైజయంతి పురస్కారం తో పాటు ఇంకా ఇతర ప్రముఖ కళా సంస్థల నుండి ఎనో అవార్డ్స్ అందుకున్నారు.
ప్రకృతి చిత్రణలో గొప్ప సాధికారతను తనదైన ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న విజయ్ కుమార్ గారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.
– వెంటపల్లి సత్యనారాయణ (9491378313)
View Comments (3)
Congratulations sir big fan of you from guntur mallikarjuna chari your painting is excellent sir
శ్రీ యుతులు సోమంచి విజయకుమార్ గారి చిత్రకళా తీరు తెన్నులను గురించి చక్కని వ్యాఖ్యానంతో శ్రీ వెంటపల్లి గారి రచన చాలా సహజంగా
సమంజసంగా ఉంది. విజయ్ కుమార్ గారికి, వెంటపల్లి గారికి అభినందనలు.
Thank u so much madam