సినీ రంగంలో దిల్ రాజు 20 ఏళ్ల జర్నీ

శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై డిస్ట్రిబ్యూటర్స్ గా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మాతలుగా ఎన్నో విజయవంతమైన వాణిజ్య, కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్. సామాన్య ప్రేక్షకుడి నాడిని పట్టిన ఈ ముగ్గురు అసలు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలనే దానిపై ఓ అవగాహన ఏర్పరుచుకుని ఒక వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూనే నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టారు. కథల పై పక్కా జడ్జ్ మెంట్, మిస్ ఫైర్ కాని ప్లానింగ్, పర్ ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో నిర్మాణ రంగంలోనూ తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. వీరు డిస్ట్రిబ్యూటర్స్గా, నిర్మాతలుగా సినీ జర్నీని ప్రారంభించి జూలై 24కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా  హైదరాబాద్ లో ప్రెస్ మీట్ వివరాలు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ :
“మా బ్యానర్ ప్రయాణం 1999లో ‘ఒకే ఒక్కడు’తో ప్రారంభమైంది. దానికి ముందు జూలై 24న ‘తొలిప్రేమ’ చిత్రాన్ని పార్టనర్ షిప్ లో రిలీజ్ చేశాం. పవన్ కల్యాణ్ గారిని స్టార్ ను చేసిన ఆ సినిమా అనుభవం గొప్పగా అనిపించింది. అలాగే ‘పెళ్లిపందిరి’ సినిమా నిర్మాతగా నేను ఇక్కడ ఉండటానికి కారణమైంది. డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్ ను స్టార్ట్ చేశాం. తర్వాత ప్రొడక్షన్ను పెంచి 16 ఏళ్లలో 32 సినిమాలు పూర్తి చేశాం. ఇది గ్రేట్ జర్నీ అని చెప్పగలను. ఈ 20 ఏళ్లలో మాకు వచ్చిన ఎక్స్ పీరియెన్స్ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా, వాళ్లు తీసే సినిమాల్లో స్క్రిప్ట్ దగ్గర నుండి రిలీజ్ వరకు మా బ్యానర్తో అసోసియేట్ అయ్యుంటారు. మా సంస్థలో వస్తున్న మంచి సినిమాల్లాగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషిగా సపోర్ట్ చేయబోతున్నాం. వీళ్లే కాకుండా మంచి స్క్రిప్ట్తో వచ్చే నిర్మాతలకు ఆహ్వానమే. ఇది కొత్త ప్రయాణం. ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి, తెలుగు చిత్రసీమను ముందుకు తీసుకుపోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం” అన్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ :
“రాజుగారు, శిరీష్గారు, లక్ష్మణ్గారు వేర్వేరు రంగాల నుండి సినిమా రంగంలోకి 20 సంవత్సరాల ముందు అడుగుపెట్టారు. సినిమా మీద పిచ్చితో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి ముందు డబ్బులు పొగొట్టుకుని, ఇళ్లలో తిట్లు తిని, మళ్లీ భూములు అమ్ముకుని ఆ డబ్బులు తెచ్చి ఇన్వెస్ట్ చేసి ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ బ్యానర్లో నేను నాలుగు సినిమాలు చేయడం మరచిపోలేని జ్ఞాపకం. ఈ 20 ఏళ్ల జర్నీ పూర్తయిన సందర్భంగా వీళ్లు తీసుకున్నది గొప్ప నిర్ణయం. నాలాంటి ఎంతో మంది దర్శకులు నిలదొక్కుకుంటారు” అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ :
“దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లు కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రయాణంలో నేను కూడా భాగమై ఉన్నాను. వారి కారణంగానే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దిల్ రాజుగారి జడ్జిమెంట్, శిరీష్ గారి ప్లానింగ్, లక్ష్మణ్ గారి ఎగ్జిక్యూషన్ కారణంగానే వారికి ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉంది. సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్గా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో శివలెంక కృష్ణప్రసాద్, హరి, మహేశ్ కొనేరు, బెక్కెం వేణుగోపాల్, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా విజయ్ చిల్లా, రాజీవ్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap