అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 09
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంను 2003 అక్టోబరు 31 న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన “అవినీతి వ్యతిరేక సదస్సు” ద్వారా ఈ రోజును నిర్ణయించారు.
అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు చాలా ఎక్కువగా దిగజారుతాయి. అన్ని రంగాల్లోను దారిద్రము అస్థిరత చాలా పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, అంతర్జాల వ్యవస్థ, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది.
అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, స్టాక్ మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి. మన దేశ రూపాయి మారక విలువ రోజు రోజుకు దిగజారిపోతున్నది. ప్రజలు వారి హక్కులను కాపాడుకోటానికి కోర్టులను మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్, టీవీ, ప్రింట్ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులు అందించడం లో, పాలనా వ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు.
అనుమానాస్పద లావా దేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించు కోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు. అవినీతి పాల్పడినవారు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలి. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులకు పూర్తిగా రాజకీయాల నుండి తొలగించాలి. రాజకీయ వ్యవస్థలో అవినీతి తొలగించేందు కు సంస్కరణలు చేపట్టాలి.
ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధి విధానాలు ఏ పని ఎన్నిరోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్ చార్టర్లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలుజరిగేలా కార్యాచరణ ఉండాలి. సమాజంలో అణువణువునా అవినీతి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అవినీతి, అధికారం ఒకే నాణేనికి రెండు ముఖాలుగా మారిపోయాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని ఉరి తీసినా, చైనాలో అవినీతిని అడ్డుకోలేక పోయారు.
భారతదేశంలో సుమారు తొమ్మిదికోట్ల మంది నిరుద్యోగులున్నారు. ఎనిమిదికోట్లు మంది పాఠశాలలకు దూరంగా ఉన్నారు. 35కోట్లుమంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. 52కోట్ల మందికి రక్షిత మంచినీరే లేదు. మరెందరికో మరుగుదొడ్లు సౌకర్యం లేనేలేదు. వీరందరికీ మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతీఏటా రూ.10లక్షల కోట్లు, రోజుకు రూ.2,750కోట్లు, గంటకు రూ.115కోట్లు, నిముషానికి రూ.1.80కోట్లు ఖర్చు పెడుతున్నారు. గత 7దశాబ్దాలుగా మరి మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్న సొమ్ము ఏమవుతుంది? ఇదే సామాన్యుడ్ని తొలుస్తున్న ప్రశ్న.
ఎక్కడ చూసినా అవినీతి. ఏ పధకం ఊసెత్తినా అవినీతే. ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా అవినీతివరదే. ఎయిడ్స్ మహమ్మారీకన్నా ఎక్కువగా అదుపులేని పెనుభూతంగా మారి అభివృద్దికి అడ్డుగోలు అవుతుంది. చైనాతో పోలిస్తే అభివృద్దిలో వెనుకంజ వేస్తూ అవినీతిలో మాత్రం మనదేశం ముందుంది.
2007లో ఢిల్లీకి చెందిన ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్పడీస్ (సిఎంఎస్) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో 11 ప్రజాసేవ అంశాల్లో ఏదో ఒకదానిని పొందేందుకు మూడువంతులు మంది నిరుపేదలు ఏడాది పరిధిలో రూ.900కోట్లు లంచాలుగా చెల్లించినట్లు తేలింది. యూరప్లోని కొన్ని దేశాల్లో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉండగా, ఆఫ్రికాదేశాల్లో అవినీతి తారస్థాయిలో ఉంది.