ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

పద్మశాలీ దుర్గారావు (43) గారు, నివాసం కళ్యాణపురి, ఉప్పల్, హైదరాబాద్.
వృత్తి పరంగా ప్రభుత్వ ఉద్యోగి. NGRI లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అయితేనేమి ప్రవృత్తి పరంగా కళాకారుడు. ఆర్టిస్టుగా ఎదగటానికి ఎన్నో కష్టాలతో, నష్టాలతో, ఇష్టంగా, గుర్తింపుతో ఎదిగానని చెప్పారు దుర్గారావు. చదువుకునే రోజులలో అంటే చిన్నప్పటి నుండి పేయింటింగ్స్ అంటే చాలా ఇష్టం.
ఆయిల్ కలర్స్, అక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ తో స్కెచ్చెస్, షేడింగ్స్, తంజావూరు, పాట్, తదితర అంశాలలో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కృషి చేసారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నారు. అందుకోసం ఎన్నో ప్రాంతాలు, ఊర్లు తిరిగారు. తనకు తెలిసిన ప్రతీ కళా ప్రదర్శనలు, కళా పోటీలకు పాల్గొనే వారు. అదే స్థాయిలో అవార్డులను కూడా అందుకున్నారు. అలాగే “నిహ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్” ను స్థాపించి నడిపిస్తున్నారు. ఎందరికో కోచింగ్ ఇచ్చారు. ఇస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ కు ఇప్పటి వరకు దాదాపుగా 55-60 వరకు గోల్డ్ మెడల్స్, 10 వరకు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. అంతేకాదు దుర్గారావుకు, తన పేరు మీద ప్రత్యేకంగా గోల్డ్, సిల్వర్ మెడల్స్, మరియు నాలుగు వరల్డ్ రికార్డ్స్ తో పాటు ఎన్నో బహుమతులు అందుకున్నారు. తన పేయింటింగ్స్ లను వందకు పైగానే గిఫ్ట్ గా అందజేసారు.
చూపుడు వేలితో ఓ వి”చిత్రం” ప్రక్రియను చేసారు. ఇతరలకు భిన్నంగా తన ప్రతిభను చూపాలన్న తపనతో, చదివి పడేసిన దినపత్రికలపై మూడు గంటలు పాటు శ్రమించి, చూపుడు వేలుతో, వివిధ రంగులను జోడిస్తూ, “జీసస్” చిత్రాన్ని గీసి పలువురలను అబ్బుర పరిచాడు దుర్గారావు గారు.
డ్రాయింగ్ లో టి.టి.సి., MFA (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) లో పూర్తి చేసారు. ఎన్నో గ్రూప్ షో లో పాల్గొన్నారు. ఎంత చేసిన, ఏమి చేసినా కళాకారుడికి ఆర్థికంగా లాభం పొందలేడనేది అసంతృప్తిగానే వుందన్నారు. ఆర్టిస్టుగా జీవతంలో నిలబడటం కష్టమే అంటూ ఇతరత్రా కళాకారులను గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు దుర్గారావు గారు.
ప్రభుత్వం ఆర్టిస్టులను గుర్తించి, ఏదైనా సహాయ కార్యక్రమాలు చేస్తే కళాకారులుగా ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆసరాగా వుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు పద్మశాలీ దుర్గారావు గారు.
జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు, తెలంగాణ కాపు రాజయ్య అవార్డ్ ను కూడా అందుకున్నారు.
చివరిగా “ఏ రంగంలోనయినా ముందు కష్టాలు తప్పవు. ఆ తర్వాత గొప్ప జీవితం ఉంటుంది. ఇది ఏ రంగంలో వారికైనా తప్పదని” చెబుతున్నారు దుర్గారావు గారు.

డా. దార్ల నాగేశ్వర రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap