సినీమా పోస్ట్ ప్రొడక్షన్ కు ఓకే

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినీ పరిశ్రమ ప్రముఖులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమావేశం…

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. 21-05-20,గురువారం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్ లను నిలిపివేయడం జరిగిందని అన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినీమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియో ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు.

స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడు సానుకూడా ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, బౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. షూటింగ్ ల నిర్వహణకు, దియేటర్ లను తెరిచేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పద్మభూషణ్ చిరంజీవి, సేనియర్ నటులు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ…

◆సినీ పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు..

*సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంశాలపై సమావేశంలో చర్చించినట్టు మంత్రి తెలిపారు..

◆ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ఉందని, అయినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.

◆షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

◆ప్రభుత్వం కూడా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని తలసాని తెలిపారు.

*చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా దాదాపు 14వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap