ప్రయోగాత్మక రంగస్థల దర్శకుడు దేశిరాజు

నేడు దేశిరాజు హనుమంతరావు గారి జయంతి.

దేశిరాజు హనుమంత రావుగారు తెలుగు నాటకరంగంలో ప్రయోగాత్మక నాటకానికి పెద్దపీట వేసిన దర్శకుడు.
ఈయన 23 జూలై 1945 న పరమేశ్వర రావు , విజయలక్ష్మి దంపతులకు విజయవాడలో జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా జిల్లా పరిషత్ స్కూలులో ఉపాధ్యాయుడు కావడంవల్ల, ప్రాథమిక విద్య కృష్ణా జిల్లా తేలప్రోలు, ముస్తాబాద్ లలో జరిగింది. తరువాత హైదరాబాద్ వచ్చి బి.ఎస్.సి. వరకు చదివారు.

ఆగ్రో ఇండస్ట్రీలో పి.ఆర్.ఒ. గా పని చేశారు. ప్రఖ్యాత నటుడు భానుప్రకాష్ గారి కళారాధన సంస్థలో జేరి, కొంతకాలంపాటు నాటకాలు వేసి, మెలోడ్రామాకి విసిగిపోయి, బయటకు వచ్చి, యండమూరి వీరేంద్రనాథ్ తో కలిసి “శ్రీనికేతన్” సంస్థ స్థాపించి, ప్రయోగాత్మ నాటకాలకు దర్శకస్రష్ట గా నాటకాన్ని కొత్త మలుపు తిప్పారు.

మరోమొహోంజోదారో ప్రథమంగా ప్రయోగాత్మక మయితే, డీన్ బద్రుగారి తాజీ తరువాతది. ఆ తర్వాత దేశిరాజు గారు దర్శకత్వం వహించిన అన్ని నాటకాలూ ప్రయోగాత్మకంగా నే సాగాయి. తన థ్యాస మొత్తం ప్రయోగాత్మకం మీదే పెట్టారు.
ఈ చర్య తో హనుమంతరావుగారు, గొప్ప నట దిగ్గజం పద్మవిభూషణ్ ఎ.ఆర్. క్రిష్ణగారికి సన్నిహితులయ్యారు.

ఎ.జి.ఆఫీస్ పోటీల్లో వేసిన “ఆర్తి” నాటకం, ఎ.ఆర్. క్రిష్ణగారితో కలిసి వచ్చిన గొప్ప బెంగాలీ దర్శకులు మృణాల్ సేన్ గారు చూసి, మర్నాడు హోటల్ కి హనుమంతరావుగారిని, దాంట్లో నటించిన సుబ్బరాయ శర్మ గారిని పిలిపించుకొని అభినందించారు.

కొత్త రచయితల్ని ప్రోత్సహించే నైజం వున్న హనుమంతరావుగారి ద్వారా, రచయితలు యండమూరి వీరేంద్రనాథ్, డి. ప్రభాకర్, పమ్మి వీరభద్రరావు, ఎల్.బి.శ్రీరాం, కె.వి.బలరామమూర్తి వెలుగులోకి వచ్చారు. హనుమంతరావుగారి దర్శకత్వం లో నటించిన నటులలో కోట శ్రీనివాసరావు, సుబ్బరాయ శర్మ, డి. రాంగోపాల్గారలు బాగా పేరు పొందారు.
మధుమేహం అస్వస్థత వల్ల దేశిరాజు హనుమంతరావుగారు హైదరాబాద్ లో 29-10-2010 న పరమపదించారు.
-సాగర్

SA: