వెండి తెరపై ‘కొండ‌పొలం’

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కొండపొలం. యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొండ‌పొలం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా…
చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రెండు పాటలు రాశాను. హరిహర వీరమల్లుతో పని చేస్తున్న సమయంలోనే కొండపొలం అవకాశం వచ్చింది. సన్నపురెడ్డి వెంకటరెడ్డి కొండపొలం అద్భుతంగా రచించారు. చ‌క్కటి కథనాన్ని అందించారు. అడవి గురించి మూడు నిమిషాల పాట రాశాను. అడవిని తల్లి ఒడి, గుడి, బడి అనే కోణాల్లోంచి చూసి రాశాను. చెట్టెక్కి అనే పాట కూడా రాశాను. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కీరవాణి, క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా చూసేందుకు నేను కూడా నిరీక్షిస్తున్నాను. నేను కొందరినీ చూసి ఊహించుకుని నవల రాశాను. వాటిని క్రిష్ తెరపై ఎలా చూపించాడా? అని ఎదురుచూస్తున్నాను. నేను కూడా అక్టోబర్ 8న సినిమా చూసేందుకు ఆత్రుతగా ఎదరుచూస్తున్నాను’ అని అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల అని ఈ సినిమా పోస్టర్లో వేయడం నాకు నచ్చింది. నవలు రాసే వారు కాదు.. చదివే వారు తగ్గారు. సోషల్ మీడియాలో అడ్డమైన చెత్త చదవడానికి టైం ఉంటుంది కానీ ఇలాంటి పుస్తకాలు చదివే టైం ఉండదు. నేను కూడా దానికి అతీతుడిని కాదు. సాహిత్యాన్ని.. అక్షరాలను ముత్యాలుగా మార్చి ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు క్రిష్‌. సినిమాకు నవలా సాహిత్యానికి మధ్య గ్యాప్ కాదు అగాథంలా ఉంది. చలం మైదానం లాంటి సినిమాలు తీయాలని వచ్చాను. ఎకనామిక్స్, ఈస్థటిక్స్ కలిపి సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. కానీ క్రిష్ దాన్ని అవలీలగా దాటేశారు. చంద్రబోస్ అద్భుతంగా పాట రాశారు. బతుకును కొరికే ఆకలి కేకలు అని లైన్ బాగా రాశారు. కరోనా సమయంలో సినిమా షూటింగ్ అవసరమా? అని అన్నాను. కానీ ఇలాంటి సమయంలోనే అవసరం.. కొందరికైనా పని కల్పిస్తాను అని క్రిష్ అన్నారు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వైష్ణవ్‌కు ఓ పక్క ఏడుపు తన్నుకొస్తుంది.. అందరూ వచ్చి పలకరిస్తున్నారు.. కానీ ధైర్యంగా ఉన్నాడు. అన్ని ఎమోషన్స్ ఆపుకున్నాడు. ఇంత చిన్న విషయంలో అంత బాధ్యతలను మోయడం మామూలు విషయం కాదు. బంధాన్ని పంచుకోవడం కాదు బాధ్యతను పంచుకునే తమ్ముడు దొరకడం సాయి ధరమ్ తేజ్ అదృష్టం. ఓబులమ్మ పాటను చూసినప్పటి నుంచి రకుల్‌ను ఆ పాత్రలో చూస్తున్నాను. ఎంతో గొప్పగా క్యారెక్టర్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇది గొప్ప చిత్రం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంకా మంచి నవలను రాయాలి. దాన్ని మేం సినిమాగా తీసేందుకు రెడీగా ఉంటాం. అడవిని మళ్లీ మన ఇంటికి తీసుకొస్తున్నందుకు క్రిష్‌కు థ్యాంక్స్’ అని అన్నారు.

సాయి చంద్ మాట్లాడుతూ.. ‘సినిమాలో నటించిన నటుడిగా ఇక్కడకు రాలేదు. ఓ తండ్రిగా వచ్చాను. ఉప్పెన సినిమాలో పాత్రను చేయమని చిరంజీవి గారు చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పినట్టు చేయకపోతే.. ఓ మంచి కొడుకును మిస్ చేసుకునే వాడిని. ఈ జనరేషన్‌లో ఇంత మంచి వాడు ఉండటం చాలా సంతోషం. ఉప్పెనతో తండ్రి పాత్రకు ఇంకా తనివితీరలేదని అనుకున్నాను. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అంటారు. అలా అప్పుడు క్రిష్ నుంచి ఫోన్ వచ్చింది. కొండపొలం కథను సినిమాగా చేస్తున్నామని చెప్పారు. తండ్రి పాత్ర అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. వైష్ణవ్ తేజ్ నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు’ అని అన్నారు.

ఎన్ స్క్వేర్ అధినేత నవీన్ మాట్లాడుతూ.. ‘నేను మెగా అభిమానిని. వారిని చూస్తూ, అభిమానిస్తూ పెరిగాం. కొండపొలం సినిమాకు టైటిల్ స్పాన్సర్ చేశాం. క్రిష్ గారి సినిమాలు చూస్తుంటాం. పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు గురించి ఎంతో ఆత్రుతగా చూస్తున్నాం’ అని అన్నారు.

మహేష్ విట్టా మాట్లాడుతూ.. ‘వైష్ణవ్ తేజ్ ఎంతో మంచివాడు. పరిచయం అయిన ఐదు నిమిషాల్లోనే ఎంతో బాగా నచ్చేస్తాడు. ముద్దు పెట్టుకోవాలనేంత నచ్చేస్తాడు. ఇక రకుల్ అంటే మనం ఫిట్ నెస్ ఫ్రీక్ అనుకుంటాం. కానీ మంచిగా తినాలి అని చెప్పేది. భాస్కర్ అనే మంచి పాత్రను ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

Kondapolam team

రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సమయంలో ఈ కథ చేయాలని అనుకున్నప్పుడు ఎలా అని అనుకున్నాను. అప్పుడు ఆర్థికంగా కొందరు సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్. ఆల్ ఇండియా వైడ్‌గా రైట్స్ కొనేశారు. ఐదు నిమిషాల్లో డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ క్లోజ్ చేసేశాడు. మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసిందన్న కాన్ఫిడెంట్ వచ్చింది. ఆయనే ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. అంకితభావం, హార్డ్ వర్కింగ్ వల్లే రకుల్ ఆ స్థాయికి వెళ్లారు. వరుణ్ తేజ్‌తో కంచె సినిమా చేశాం. వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం చేస్తున్నాం. వైష్ణవ్ తేజ్ ఓ స్టార్ అవుతారు. క్రిష్ గారి అద్భుతమైన చిత్రాల్లో కొండపొలం కూడా ఒకటిగా నిలుస్తుంద’ని అన్నారు.

క్రిష్ మాట్లాడుతూ.. ‘ఇంత త్వరగా ఎలా సినిమా తీస్తావ్ అని అడుగుతుంటారు. కానీ పని దినాలు తక్కువే అయినా పని వేళలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తుంటాం. నీకు అవసరం, ఇండస్ట్రీకి అవసరం వెళ్లు సినిమా చేయ్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మధ్యలో వేరే సినిమా చేసేందుకు ఒప్పుకున్న నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు. పుస్తకాల షాపులు మూసేస్తున్నారు. సినిమాకు కావాల్సిన ముడి పదార్థం స్టోరీ. కొంతమంది గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తే అది పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర. కొండపొలం పుస్తకం చదివిన తరువాత.. అందులో స్త్రీ పాత్ర లేదు. గొర్రెలు కాసేందుకు అడవికి వెళ్లిన కుర్రాడు.. మళ్లీ అదే అడవిని కాపాడే అధికారిగా వస్తాడు. అలాంటి స్టోరీలో అందమైన ప్రేమకథను జోడించి తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను. మళ్లీ సినిమా కోసం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారితో కథను రాయించాను. స్క్రీన్ ప్లే మాత్రమే నేను రాశాను. ఇక్కడకు వచ్చిన హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. బుచ్చిబాబు సానా వల్ల ఓ మంచి హీరో ఇండస్ట్రీకి దొరికాడు. బొడ్డు కోయడం చాలా కష్టం. అలా బొడ్డు కోసి ఆ బిడ్డను మాకు ఇచ్చాడు. మహేష్ విట్టా చెప్పినట్టుగా వైష్ణవ్ తేజ్‌ను కలిసిన ఐదు నిమిషాలకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.. నేను హగ్ చేసుకుని భుజం మీద ముద్దు పెట్టేశాను. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు బెంచ్ మార్క్ క్రియేట్ అయింది. అంతకంటే పై మెట్టు ఎక్కిస్తున్నాను. అలాంటి కథ, పాత్ర దొరికింది. ఓబులమ్మగా నటించిన రకుల్ గురించి చెప్పాలి. రకుల్ అంటే అందమైన అమ్మాయి, వర్కవుట్లు అని అంటారు. కానీ ఆమె లోలోపల వేరే ఉంది. క్రమశిక్షణ, అంకితభావం, డైలాగ్స్ నేర్చుకునే తీరు, ఆ యాసతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కథ చెప్పేటప్పుడే ఓబులమ్మ పాత్రలో రకుల్‌ను చూశాను. రకుల్‌ అని మరిచిపోయి ఓబులమ్మ అని పిలుస్తున్నాను. ఓబు అంటే అడవి అంత గొప్పది అని రాసుకున్నాను. ఈ పాత్రను ఒప్పుకున్నందుకు రకుల్‌కు థ్యాంక్స్. సాయి చంద్ గారి గురించి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అక్టోబర్ 8న సినిమా విడుదలైన తరువాత మాట్లాడుతాను. కీరవాణి గారు మా గైడ్‌లా మారారు. సినిమా ఇంత బాగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇలాంటి సమయంలో సినిమాను ఇంత బాగా రీచ్ అయ్యేలా చేసిన వంశీ శేఖర్‌లకు థ్యాంక్స్. ఇది మ‌నంద‌రం గర్వపడే సినిమా. ఎంజాయ్ చేసే చిత్రం. సినిమాను బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతీ నటికి గర్వంగా చెప్పుకునే పాత్ర రావాలని అనుకుంటారు. అలాంటి ఓ క్యారెక్టరే ఓబులమ్మ. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు, ఆ నమ్మకాన్ని నాపై ఉంచినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రాన్ని చేశాను. నాకు ఈ పాత్రను పోషించడంలో సంతృప్తి దొరికింది. నాకు ఈ పాత్ర ఎంతగా నచ్చిందో.. ప్రేక్షకులకు కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను.

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అడవి పెద్దబాలశిక్ష అంటారు. ఉప్పెన నా మొదటి చాప్టర్ అయితే.. కొండపొలం రెండోది. ఈ చిత్రంలో ఎంతో మంది దగ్గరి నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నారు. అందరినీ గమనిస్తూ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని నేర్చుకున్నాను. రాజీవ్, క్రిష్, సాయి బాబా గారు ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకరినొకరు ఏం చెప్పుకోకుండానే.. అన్ని తెలిసిపోతాయి. ఆ ముగ్గురి స్నేహబంధం చాలా గొప్పది. క్రిష్ అన్న దగ్గరి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. సినిమాను సాధారణ పరిస్థితుల్లో చేయలేదు. టీం అంతా కలిసి కెమెరాలు ఎత్తుకుంటూ అడవిలోకి వెళ్లాం. మా టీం అందరి కష్టమే కొండపొలం. ఈ క్యారెక్టర్ మనలో ఒకడు. మనకు ఎన్నో భయాలు ఉంటాయి. మూవీ ముందుకు వెళ్లే కొద్ది భయాలను ఎదుర్కొంటూ వెళ్తాడు. ఎన్నో కష్టాలు పడి.. పులిని ఎదురించడమే ఈ కొండపొలం. ఓ స్టెప్ వేస్తే పడిపోతామనే భయం ఉంటుంది. కానీ ఎన్ని సార్లు పడ్డా కూడా ముందుకు వెళ్లాలనే బలాన్ని కొండపొలం ఇస్తుంది. మీరు ఈ దేశాన్ని గర్వపడేలా చేయాలని ఆలోచనను మీలో రేకెత్తిస్తుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

SA: