
అరువది శరత్ చంద్రికలు కవిత్వ ఫలమ్ములై ఒప్ప
అంతరంగ ప్రేమ ఉదయించె అరుణమై
గాఢ నిగూఢ, వ్యంగ కోమల పద భావార్ధ సంపదల్
కవి హృదయ సీమను వికసించెను కమలములై
గ్రామ సీమల మనో సౌందర్య స్వరూపము,
రాజకీయ ఎత్తుగడల విన్యాసములు,
యుద్ధ సౌహార్ద నాటకములు, మరణ మృదంగం పై
వ్యాపార తాడనమ్ము, కార్మిక కర్షక జీవన సంఘర్షణలు
వెలిగించె గా కవితా దీపములు.
మాడభూషి సంపత్ కుమార్ గారు వారి 60 శరత్తులలో అమ్మ నాన్నలతో అనుబంధం, ప్రేమ జల్లుల ను కొత్తగా వ్యక్తపరిచారు. కరోనాలో పరిస్థితులు, పరిణామాలు కొంత వ్యంగ ధోరణిలోనే, చావు అనివార్యం అంటూ తన బాధ చెప్పుకొచ్చారు.
మనుషుల మధ్య వర్గ వైషమ్యాల వల్ల ఎవరు బాగు పడినట్టు అంటారు. అబ్దుల్ కలామ్ ఆకాశయానం చేశారు అంటూ, తాను పంపిన ఉపగ్రహాలను పర్యవేక్షణ చేయటానికి వెళ్లి ఉంటారేమో అంటారు కవి. తన గ్రామం మీద, మద్రాసు నగరం మీద తన ప్రేమ, అనుబంధం గుర్తు చేసుకున్నారు. కవి కవిత్వం తనను నిద్ర పోనివ్వదు అన్నారు.
చరిత్ర ఎలా వక్రీకరిస్తున్నారు వ్యంగ్యంగా చెపుతారు.”జీవితాన్ని తెరిచి, తెరిచి,పిలిచి విరిచి కరిచి చూసినప్పుడు మాత్రమే అందులోని ఆంతర్యం తెలుస్తుంది”, అంటారు. “మనిషి సంతోషం కోసం గాలించినప్పుడల్లా దుఃఖం సర్పంలా మెడకు చుట్టుకుంటుంది”, “అబద్ధాన్నికి వేయి తలలు, నిజానికి ఒకే బాణం తెగిపడాల్సిందే అంటారు ఆవేశంగా.
“మేఘం దూది పింజలా సంతోషం గా ఎగురుతూ గాలి తాకిడికే భోరున విలపిస్తుంది భూమి ఆకాశం తడిసి ముద్దయ్యేటట్టు” జననం, మరణం, జీవితం, చీకటి, అవసరం, ఆధార్, ఇష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందం, ప్రేమ ఇలా ఒక మనిషి జీవన చక్ర భ్రమణం సున్నితంగా, వ్యంగ్యంగా రచించారు. అందరం ఏదోవిధంగా దొంగతనం చేస్తూనే ఉన్నారు అంటారు.”వేలు” కవితలో ఆ వేలితో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, కానీ వేలెత్తి తప్పును ప్రశ్నించ లేక పోతున్నారు అంటూ బాధ వ్యక్తం చేశారు. యుద్ధాలు, వాటి రాజకీయ ఎత్తుగడలలో ఎంత మంది మధ్యలో బలైపోతున్నది చెపుతూ, “యుద్ధానికి ముందు రోజు కరచాలనానికి చేతులు ఎందుకు అంగీకరించవో”, “ఆలింగనానికి శరీరాలు ఎందుకు సహకరించవో” అని ప్రశ్నించారు.
వికారి నామ సంవత్సర, శరత్కాలం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టానని కవి పరోక్షంగా తన కవిత్వంలో చెప్పారు. 60 శరత్తులు మధ్య కాలాన్ని గణిస్తే, హృదయంలో కదలికలు తెస్తాయి, మనసులోని మర్మాలను పలకరిస్తాయి అంటూ, తన “ఊరు” గురించిన కవితలో తన జీవన ప్రయాణం ఎలా గడిచిందో, తన భావబంధాలు వ్యక్త పరిచారు.
“పరిష్కారం” కవితలో మనిషి చేయి దాటినప్పుడు, ప్రకృతి తనకు తానుగా పరిష్కారం చూపిస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు కవి.
“ప్రవహించే కవి” కవి ప్రవహిస్తూ నదిలా, ఖగోళం దాటి ప్రవహిస్తూ” కాలాన్ని నిద్రపోనివ్వడు” అంటారు.
“టెలుగు టల్లీ”, అనే వ్యంగ్య కవితలో తెలుగు దుస్తితి చెప్పారు.
ఈ అరవై శరత్తులలో మానవ జీవితంలో వచ్చే అనేకానేక పార్శ్వాలను, విషయాలను, సున్నితంగా వ్యంగ్యంగా కవి స్పర్శించారు. భావోద్వేగ భరితంగా ఉంటాయి ఈ 60 శరత్ చంద్రికా కిరణాలు.
అందరికీ తప్పక నచ్చే పుస్తకం, ఎందుకంటే అందరి జీవితంలో ఎక్కడో అక్కడ ఆ సందర్భాలు వచ్చే ఉంటాయి.
హృదయాలను స్పర్శించే కవిత్వం. తప్పక చదవాల్సిన పుస్తకం అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
-శిరిపురపు అన్నపూర్ణ
ప్రతులకు: 60 శరత్తులు
రచయిత: అచార్య ఎం. సంపత్ కుమార్
వెల: రూ. 150/-