బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

“మనదైన మంచి సంగీతం దూరమౌతుందని, మనకు అపారమైన జానపద సంగీతం సజీవంగానే వుందని, దాని జాడలో వెళితే స్వరార్ణవాన్ని సృష్టించవచ్చ”ని తెలుగు చిత్రసీమకు పరిచయమైన కొత్తల్లోనే చెప్పాడు ఈ సంగీత కళానిధి రమేష్ నాయుడు. చెప్పడమే కాదు తెలుగు చిత్రసీమలో అడుగిడకముందే మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో సమకూర్చిన సంగీతానికి జానపదులు సహకరించాయని అక్షరాలా రుజువు చేశాడీ సంగీత సామ్రాట్. చలనచిత్ర కళలో సంగీతమనేది ఒక ముఖ్యమైన అంతర్భాగం. తెలుగు సినిమాల్లో సంగీతానికి ఒక విశిష్టత వుంది, ఒక చరిత్ర కూడా వుంది. జాతీయ స్థాయిలో మంచి సంగీతం గల తెలుగు పాటలు ఎన్నోవున్నాయి. అయితే రాను రాను పాశ్చాత్య సంగీత అనుకరణ ప్రభావంతో తెలుగు సినిమా పాటల్లో మాధుర్యం తగ్గడమే కాదు, సృజనాత్మతకు కూడా గండి కొడుతోంది. అందుకే మంచి పాటలు అని చెప్పుకోవలసివస్తే అలనాటి పాత సినిమా పాటలనే ఉదహరించవలసి వస్తోంది. నాటి స్థాయిని, నాటి మధురిమను గుర్తు చేసుకోవాలంటే సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆదినారాయణరావు, చలపతిరావు వంటి మహనీయులు సృష్టించిన పాటల్ని వినాలి. అటువంటి అద్భుత సంగీతాన్ని తెలుగు సంగీత ప్రియులకు పంచిన మహనీయుల్లో రమేష్ నాయుడు కూడా ఒకరు. మన తెలుగు సినీ సంగీతాన్ని గురించి ఒకానొక సందర్భంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ “పాశ్చాత్య సంగీతాన్ని గాని, పరాయి సంగీతాన్ని గానీ అనుకరించాల్సి రావడం నిజంగా శోచనీయం” అన్నాడు. కె.వి. మహదేవన్ తర్వాత గేయరచయిత పాట సాహిత్యం అందించిన తర్వాతే ఆ సాహిత్యానికి తగిన ట్యూను కట్టడం అనే పద్ధతిని కొనసాగించిన ఏకైక సంగీత దర్శకుడు రమేష్ నాయుడే. 1984లో వచ్చిన ఉషాకిరణ్ మూవీస్ వారి ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” అనే వేటూరి ముందుగా రచించిన ప్రేమలేఖకు స్వరాలు సమకూర్చింది అలానే! తన స్వరప్రయాణ చివరి మజిలీ వరకు రమేష్ నాయుడు అనుసరించిన పద్ధతి పాట రాసిన తర్వాతే మట్లు కట్టడం. అతడు ముందు రచ్చ గెలిచి తరవాత ఇంట గెలిచి, పెద్దల నానుడిని తారుమారు చేసిన ప్రత్యేక కళానిధి. రమేష్ నాయుడు జయంతి (27 నవంబర్) సందర్భంగా అతని సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి…

డబ్బుల్లేకుండా బొంబాయి వెళ్లి…

ఆ కుర్రాడికి పద్నాలుగేళ్ళు. విజయవాడకు దగ్గరలోని కొండపల్లి అతడి వూరు. పాటలు పాడడం అతనికి సరదా. హార్మోనియం మెట్లమీద సుతారంగా వ్రేళ్ళు కదిలించేవాడు. విజయవాడ, గుంటూరు నగరాల్లో చదువుకుంటున్నప్పుడు పదిమంది మిత్రులను చేరదీసి హార్మోనియం వాయిస్తూ పాటలు పాడి వారిచేత శహభాష్ అనిపించుకునేవాడు. అతడికి సంగీతం మీద అభిమానం పెరగడానికి అతని తాతగారే కారణం. అతడు వయోలిన్ బాగా వాయించేవారు. ఇంటిలో అందరూ పాటలు పాడేవారు. అయితే అతడు సంగీతం నేర్చుకోలేదు. నేర్చుకుందామనే ధ్యాసకూడా లేదు. కానీ, ఎందుకో బొంబాయి వెళ్ళాలనిపించింది. అనుకున్నదే తడవుగా విజయవాడలో బొంబాయి వెళ్తున్న రైలు ఎక్కేశాడు. హిందీ భాష రాదు. జేబులో ఐదు రూపాయలకు మించి చిల్లర లేదు. రైలు బండయితే ఎక్కాడేగాని బొంబాయి వెళ్లి యేమిచెయ్యాలో ఆలోచించలేదు. అయితే అతడికి తన ఆప్తమిత్రుడు బోధించిన మాటలే గుర్తుకొస్తున్నాయి. “నువ్వు ఈ వూళ్ళో వుంటే లాభంలేదు. నువ్వు పాటలు బాగా పాడుతావు. బొంబాయి వెళ్ళావంటే మహమ్మద్ రఫీలా మంచి గాయకుడివైపోతావు. నేను నీకు తోడు. బయల్దేరు” అంటేనే రైలు బండెక్కాడు. అతడే… అతి తక్కువ వ్యవధిలో అద్భుత సంగీత దర్శకుడిగా రూపాంతరం చెందిన పసుపులేటి రమేష్ నాయుడు. అతడు పుట్టింది జూన్ 27, 1933 న కొండపల్లిలో. బొంబాయి స్టేషన్లో దిగి స్టూడియోల వెంట, సంగీత దర్శకుల ఇళ్ళ వెంట కాళ్ళు అరిగేలా తిరిగారు. తిండి లేదు, ఉండటానికి ఆసరా కూడా లేదు. ఓ చెట్టు మూలన కూర్చొని ఏడవసాగాడు. దారినపోయే ఒక పెద్దాయన ఆగి “ఎవరు బాబూ. ఎందుకేడుస్తున్నావు” అంటూ హిందీలో ప్రశ్నించాడు. రమేష్ నాయుడు తెలుగులో చెప్పిన సమాధానం అతనికి అర్ధం కాలేదు. తనకు తెలిసిన ఒక తెలుగాయన వున్నాడు. అక్కడకు పదమని రమేష్ ను తీసుకెళ్ళి బసంత్ స్టూడియోలో కెమెరామన్ గా పనిచేస్తున్న రావు కు పరిచయం చేశాడు. అయన పుణ్యమా అని బసంత్ స్టూడియోలోనే కెమెరా విభాగంలో చిన్న పని దొరికింది. తరవాత సౌండ్ విభాగానికి మారాడు. బసంత్ స్టూడియోలో పాటల రికార్డింగు కూడా జరుగుతూ వుండేది. తన లక్ష్యం కూడా గాయకుడిగా రాణించాలనే! కోరస్ లో పాడేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆ స్టూడియోకి దగ్గరలోని ఒక కాందిశీకుల కాలనీలో రమేష్ మకాం. అక్కడ రమేష్ నాయుడుకి ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు సినిమాల్లో పాటలు రాయాలని వచ్చాడట. అతడు రమేష్ తో “నేను పాటలు రాస్తాను. వాటికి బాణీలు కట్టి నువ్వు పాడు. ఇద్దరం సినిమా నిర్మాతలను కలుద్దాం. నేను రాసే పాటల సాహిత్యం వారికి నచ్చితే, ఆ పాటలు నువ్వే పాడాలని షరతు పెడతాను” అంటూ ప్రోత్సహించి, ధైర్యంచేసి బి.ఆర్. చోప్రా వద్దకు వెళ్ళారు. చోప్రా ఏ మూడ్ లో వున్నాడో ఒక పాట ఇచ్చి బాణీ కట్టి పాడమన్నాడు. రమేష్ కు భగవంతుడు ఇచ్చిన యోగం అదే…. సాహిత్యం ఎటువంటిదైనా వరసలు కట్టి పాడడం. చోప్రాకు ఆశ్చర్యం వేసింది. మరో పాట సాహిత్యాన్ని ఇస్తే రమేష్ నాయుడు ఆ పాటకు కూడా బాణీ కట్టి పాడేశాడు. “నిన్ను సంగీత దర్శకుణ్ణి చేస్తాను. నీ హిందీ భాష బాగలేదు. హిస్ మాస్టర్స్ వాయిస్ వారికి వుత్తరం ఇస్తాను. అక్కడికెళ్ళి వాద్యపరికరాలు ఎలా వాడాలో నేర్చుకో” అంటూ సిఫారసు లేఖ ఇచ్చాడు. ఇంకేముంది రమేష్ ఆ కంపెనీలో చేరాడు. అక్కడ జోషి అనే సంగీతకారుడు రమేష్ ను బాగా ప్రోత్సహించి, పాటలకు వరసలు కట్టడంలో, వాద్యాలు వాయించడంలో కూడా మంచి శిక్షణ ఇచ్చాడు. జోషికి రమేష్ ప్రతిభ మీద నమ్మకం కుదిరింది. అప్పట్లో శంషాద్ బేగం గాయనిగా మంచి ప్రాచుర్యంలో వుంది. సినిమాలలో తప్ప ఆమెకు ప్రైవేటు రికార్డులు లేవు. అందుకు కారణం… ఎవరు స్వరాలు కట్టినా ఆమెకు నచ్చేది కాదు. అలాంటిది రమేష్ నాయుడు బాణీలు కట్టిన రెండు పాటలు పాడేందుకు ఆమె ఒప్పుకుంది. రమేష్ నాయుడుకి ధైర్యం వచ్చింది. కారణాంతరాలవలన శంషాద్ బేగం పాటలు పాడలేదు. కానీ, కొన్ని మరాఠీ సినిమాలకు వరసలు కట్టే అవకాశాలు కల్పించే సాయం చేసింది. అలా రమేష్ నాయుడు స్వరాలు సమకూర్చిన మరాఠీ పాటల్ని మోహన్ తారా అనే గాయకుడిచేత రమేష్ నాయుడు పాడించాడు. ఈలోగా ఒక మరాఠీ సినిమాకు కొత్త సంగీత దర్శకుడు కావాలని ప్రకటన ఇచ్చి, వచ్చినవారి చేత ఒక పాట ఇచ్చి బాణీలు కట్టమన్నారు. ఆ పందెంలో రమేష్ నాయుడు గెలిచాడు. “భాండివల్ పాహిజే” అనే ఆ మరాఠీ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చాడు. సంగీత దర్శకుడిగా అతడికి అదే తొలి చిత్రం. పైగా తొలి పాటను రికార్డింగ్ చేసింది అతని పుట్టినరోజు కావడం యాదృచ్చికం. అప్పుడు రమేష్ నాయుడు వయసెంతో తెలుసా… కేవలం పదహారేళ్ళు.

తరలి వచ్చిన అవకాశాలు…

ఆ మరాఠీ చిత్రాల విజయంతో రమేష్ నాయుడు కి అవకాశాలు రాసాగాయి. కొన్ని పంజాబీ, గుజరాతీ, అస్సామీ చిత్రాలకు, ఒక నేపాలీ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించాడు. అలా 12 భాషల్లో సంగీత దర్శకత్వం నిర్వహించిన ఘనత నాయుడుది. ఆల్ ఇండియా రేడియోలోనే కాకుండా రేడియో సిలోన్ లో కూడా రమేష్ నాయుడు కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించి ప్రసారం చేశాడు. అప్పుడే రమేష్ నాయుడు కు ఎస్.కె. పాటిల్ తో పరిచయం అయ్యింది. ఆయన ద్వారా ప్రముఖ దర్శక నిర్మాత, రచయిత, నటుడు కిషోర్ సాహుతో సాంగత్యం ఏర్పడింది. అప్పుడు… అంటే 1950లో కిషోర్ సాహు షేక్ స్పియర్ నాటకం ‘హ్యామ్లెట్’ ను హిందీలో సినిమాగా తీసే ప్రయత్నంలో వున్నాడు. రమేష్ నాయుడు ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లీషు నాటకాన్ని పోలిన చిత్రంకావడంతో పాశ్చాత్య ధోరణిలో పాటలు రూపొందించడానికి రమేష్ నాయుడు అహోరాత్రాలు చాలా కష్టపడ్డాడు. దాంతో క్షయ వ్యాధి సోకి అతడి ఆరోగ్యం దెబ్బతింది. పుణే శానిటోరియంలో చేరి తొమ్మిది నెలలపాటు చికిత్స తీసుకున్నాడు. హామ్లెట్ చిత్రం పరాజయం పొందింది. కానీ సంగీతం చాలా బాగుందనే టాక్ వచ్చింది. అలా హిందుస్తాన్ చిత్ర సంస్థ నాలుగు సినిమాలకు సంగీతం సమకూర్చే కాంట్రాక్టును రమేష్ నాయుడుకు ఇచ్చింది. అందులో బి.ఆర్. చోప్రా నిర్మించే ‘ఏక్ హీ రాస్తా ’, దర్శకనిర్మాత నక్షబ్ నిర్మించే కొత్త చిత్రం, మినర్వా మూవీటోన్ వారు నిర్మించే సినిమాలు, భాస్కర్ ప్రొడక్షన్స్ నిర్మించే నాలుగో చిత్రం కూడా వుంది.

తెలుగు చిత్రసీమ పిలుపు…

అదేసమయంలో బొంబాయిలో ఒక సాంకేతిక నిపుణుల సమావేశం జరిగింది. రమేష్ నాయుడు అందులో పాల్గొన్నాడు. ఆ సమావేశానికి తెలుగు సినీ దర్శకుడు, ఎన్.టి. రామారావు మిత్రుడు అయిన డి. యోగానంద్ హాజరై రామారావు సొంత చిత్రం “తోడుదొంగలు” చిత్రాన్ని అక్కడ ప్రదర్శించాడు. యోగానంద్ తో నాయుడుకి పరిచయమైంది. అలా యోగానంద్ రమేష్ నాయుడుని మద్రాసుకు రప్పించారు. అక్కడ సెల్వకోటి పిక్చర్స్ వారు యోగానంద్ దర్శక పర్యవేక్షణలో నిర్మాత పి.వి. కోటేశ్వరరావు నిర్మించిన ‘స్వయంప్రభ’ (1957) చిత్రానికి రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం నిర్వహించాడు. అందులో జూనియర్ శ్రీరంజని, అమర్ నాథ్, రాజసులోచన ముఖ్య తారాగణం. అందులో జూనియర్ శ్రీరంజని, అమర్ నాథ్, రాజసులోయిచన ముఖ్య తారాగణం. తెలుగులో రమేశ్ నాయుడుకి అదే తొలి చిత్రం. రమేష్ నాయుడు స్వరపరచిన “గారాల బాలా నిదురించవేల? పాడింది లోకమే సిరిజోల” (పి.సుశీల), “లేరా అందాల రాజా… రారా ఆనందమొంద” (జిక్కి), “మగరాయ కతమేమిరా… నీ నగుమోము వెరపించరా” (జావళి-జిక్కి) పాటలు ఆరోజుల్లో మంచిహిట్లయ్యాయి. తెలుగులో రమేశ్ నాయుడుకి అదే తొలి చిత్రం. వెంటనే ప్రముఖ నటీమణి, నిర్మాత సి. కృష్ణవేణి నిర్మించిన “దాంపత్యం” (1957) సినిమాకు కూడా సంగీత దర్శకత్వం నిర్వహించాడు. అలా ఒకేసారి రమేష్ నాయుడుకి రెండు సినిమాలకు సంగీతదర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చింది. అందులో ‘స్వయంప్రభ’ చిత్రం ముందుగా విడుదలైంది. ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ‘దాంపత్యం’ సినిమాలో “ఈనాటి అమ్మాయిలూ బాబో గడుగ్గాయిలు”, “తానేమి తలంచెనో, నా మేనే పులకించేను”, ‘’ఇటువంటి హాయి లేదే లేదే ఈ నటనలు నీకొరకే’’, “నడి వీధిలో జీవితం సుడిగాలిలో దీపము”, “మా ఇల్లు స్వర్గసీమ, మధురాతి మధురసీమ” పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 1959 లో ప్రముఖ ఛాయాగ్రాహకుడు కమల్ ఘోష్ దర్శకత్వంలో, బాలయ్య కృష్ణకుమారి జంటగా భాస్కర్ ప్రొడక్షన్స్ నిర్మాత భాస్కరరావు నిర్మించిన ‘మనోరమ’ (1959) చిత్రంలో హిందీ గాయకుడు తలత్ మెహమూద్ చేత రమేష్ నాయుడు ఇదు పాటలు పాడించడం విశేషం. “అందాల సీమా సుధా నిలయం ఈ లోకమే దివ్య ప్రేమమయం”, “గతి లేనివాణ్ణి గుడ్డివాన్ని బాబయ్యా గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్యా”, “మరచి పోయావేమో మాయని బాసలు మనకివే ఓ సఖీ”, “అనురాగము లేనే లేదులే”, “విరబూసే ఈ పూవు నీ పూజకొరకే” పాటలు తలత్ చేత పాడించి హిట్ చేశారు. అందులో సుశీల ఆలపించిన “చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కిరావే గోగుపూలు తేవే” పాట నేటికీ మంచి జోలపాటగా పేరు తెచ్చుకుంది. మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎం.ఆర్. జయరాం నిర్మించిన ‘శాంత’ (1961) సినిమాలో ”అట్టు అట్టు పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతోటి పెట్టు చెట్నీతోటి కలేసికొట్టు” (పిఠాపురం, స్వర్ణలత) “ఓ పలువన్నెల పావురమా ఈ పరుగేలనే” (శ్రీనివాస్, జానకి), “కలలోని కవితా లతా కళలూర చేరవే నా జత (శ్రీనివాస్, జానకి)”, “నా పాప ఫలమో, నా ప్రేమ వరమో ఓ పాప నిన్నేమందును” (సుశీల) మొదలైన పాటలను రమేష్ నాయుడు హిట్ చేశారు.

Ramesh naidu music sitting

కలకత్తా నుంచి చెన్నపట్నంలో పునః ప్రవేశం…

రమేష్ నాయుడుకి కలకత్తా వెళ్లి వాళ్ళు నిర్మించే కళాత్మక, సందేశాత్మక చిత్రాలకు సంగీతం అందించాలనే కోరిక కలిగింది. వెంటనే కలకత్తా పయనమయ్యారు. అక్కడ ‘దాదు’ అనే బెంగాలీ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆ చిత్ర విజయంతో మరో ఎనిమిది వంగభాషా చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో విజయవంతమైన ‘లవకుశ’ సినిమాను బెంగాలీ భాషలోకి అనువదించినపుడు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చింది రమేష్ నాయుడే. రమేష్ నాయుడుకి కలకత్తా నగరం, వాతావరణం నచ్చింది. అక్కడి అమ్మాయినే వివాహం చేసుకొని అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. కలకత్తాలో రమేష్ నాయుడు పదేళ్ళు వుండి బెంగాలీ, ఒరియా, నేపాలీ సినిమాలకు సంగీతం సమకూర్చారు. విజయలక్ష్మి మూవీస్ అధినేత జి.వి.ఎస్. రాజు ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు రమేష్ నాయుడుని కలిసి “తెలుగు సినిమాలకు మీరు ఎందుకు సంగీతం అందించడం లేదు. మీకు మద్రాసులో మంచి పేరున్నది. రండి మద్రాసుకు” అంటూ ఆహ్వానించారు. తెలుగు వాతావరణాన్ని, తెలుగు జనాన్ని దూరం చేసుకుంటున్నానా అనే ఆలోచనలో పడ్డారు రమేష్ నాయుడు. 1971 లో మద్రాసు వచ్చి జి.వి.ఎస్. రాజు నిర్మించిన ‘అమ్మమాట’ (1972) చిత్రానికి సంగీతం సమకూర్చారు. అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన “ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా వేలెడైనా లేవురా వేదాంలా విలువైన మాట” అంటూ సుశీల పాడిన పాట, అలాగే సినారె రచించగా సుశీల పాడిన “ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్, ఈరోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్”, ఎల్.ఆర్. ఈశ్వరి తనదైన శైలిలో పాడిన “మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు, లగ్గమెప్పుడురా మావా అంటే మాగమాసం యెల్లేదాకా మంచిరోజే లేదన్నాడే ఆగేదెట్టాగా, అందాకా యెగేదెట్టాగా (సినారె)”, జానకి ఆలపించిన మరో సినారె పాట “సద్దు మణగనీయవోయి చందురూడా, ముద్దు తీరుతుందిలే అందగాడా, కుదిరింది ఇద్దరికీ బలే జాతా, ముందుంది చూడవోయ్ అసలు కథ” వంటి పాటలతో రెండవ ఇన్నింగ్స్ సూపర్ హిట్లతో మొదలెట్టారు రమేష్ నాయుడు. ఈ సినిమాకు పని చేస్తుండగానే రమేష్ నాయుడుకి నిర్మాతలు కె. రాఘవ, గిరిబాబు లతో పరిచయమయ్యింది. శ్రీధర్ ప్రొడక్షన్స్ క్రింద కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో గిరిబాబు నిర్మించిన ‘జీవితం’ (1973) సినిమాలో పాటలన్నిటినీ రమేష్ నాయుడు హిట్ చేశారు. “ఇక్కడే కలుసుకున్నాము…ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో, ఏ జన్మలోనో, ఎన్నెన్ని జన్మలలోనో (సినారె-రామకృష్ణ, సుశీల)”, “తొలిరేయి ఇది తొలి రేయి, ఇద్దరమూ చేరి సగమూ, ముద్దూ ముచ్చట పంచుకునే తొలిరేయి (సినారె-సుశీల)”, ‘’మామిడి తోపుల్లోనా మాపటేల మాటేసి, చిక్కుడుపాదు కాడా చీకటేల కట్టేసి, చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి, మాయచేసి పోతివినాగులూ… నా మాట మరచి పోతివిరో నాగులూ (సినారె-ఈశ్వరి)” వంటి పాటలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. సినిమా కూడా విజయవంతమైంది. తర్వాత రాఘవ నిర్మించిన ‘తాత మనవడు’ (1973) చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఈ సినిమా సిల్వర్ జూబిలీ చేసుకుంది. అందులో సినారె రాయగా రామకృష్ణ అద్భుతంగా పాడిన “అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం… వింత నాటకం” సూపర్ హిట్టయింది. “ఈనాడే బాబూ నీ పుట్టినరోజు, ఈ ఇంటికే, కొత్త వెలుగు వచ్చిన రోజు (సినారె-సుశీల)”, ఎల్.ఆర్. ఈశ్వరి ఆలపించిన కొసరాజు గీతం ‘’నూకాలమ్మను నేనే, మీ పీకలు నొక్కేస్తానే’’ పాటలు జనంలోకి చొచ్చుకొనిపోయాయి. ఈ సినిమాలకు పనిచేస్తూ ఉండగానే విజయా సంస్థ నిర్మించిన ‘గంగ మంగ’(1973), కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) చిత్రాలకు సంగీతం నిర్వహించే అవకాశాలు వచ్చాయి. వాటి విజయంతో సంసారం సాగరం, చందన, మీనా, రాధమ్మ పెళ్లి, బంట్రోతు భార్య, ఇంటింటి కథ, దేవదాసు (కృష్ణ), చదువు సంస్కారం, ముద్దబంతి పువ్వు, తూర్పు పడమర, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, కల్యాణి, హేమాహేమీలు, మంగళతోరణాలు, మేఘసందేశం, మల్లెపందిరి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, అహ! నాపెళ్ళంట, స్వయంకృషి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు అద్భుత సంగీతాన్ని అందించి అమరుడయ్యారు రమేష్ నాయుడు. దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల, విజయ నిర్మల తాము నిర్మించిన అధిక శాతం చిత్రాలకు రమేష్ నాయుడునే సంగీత దర్శకునిగా నియమించుకున్నారు. కవులు రాసిన పాటలకు బాణీలు కట్టేవాడే కానీ ముందుగా బాణీ ఇచ్చి పాటలు రాయించేవారు కాదు రమేష్ నాయుడు. అలా తెలుగులో కె.వి. మహదేవన్ తరవాత రమేష్ నాయుడు పేరే చెపాల్సి వుంటుంది. గాయకుడిగా స్థిరపడాలని బొంబాయి వెళ్ళిన రమేష్ నాయుడు అలా తెలుగు సినిమారంగంలోనే సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. అంతేకాదు తనలోని గాయకుడికి పని చెబుతూ దర్శకనిర్మాత గిరిబాబు నిర్మించిన చందన చిత్రంలో సినారె రచించిన “ఓ రామసక్కని బంగారు బొమ్మా, నీ రాత రంపపు కోత ఆయెనా” , పాటను, “తల్లి గోదారికి ఆటు పోటుంటే తప్పుతుందా మనిషికి తలరాత” అనే నేపథ్య గీతాలను పాడి ప్రేక్షకులను అలరించారు. ఒక అద్భుత సంగీత దర్శకుడిగా వంద చిత్రాలకు పైగా సంగీతం అందించినన్ వెలిగిన రమేష్ నాయుడు సెప్టెంబర్ 2, 1988 న విశ్వనాథ్ చిత్రం “స్వయంకృషి’ విడుదలకు రెండ్రోజులముందే మరణించడం దురదృష్టమే.

అలరించిన కొన్ని రమేష్ నాయుడు పాటలు…

రమేష్ నాయుడు తెలుగులో వంద చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలలో పాటలుకొన్ని…

శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి (మీనా)
దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా (దేవుడు చేసిన మనుషులు)
ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు ( రాధమ్మ పెళ్లి)
దీపానికి కిరణం ఆభరణం (చదువు సంస్కారం)
ఈ కాలం పది కాలాలు బ్రతకాలని (దేవుడే గెలిచాడు)
శివరంజనీ నవరాగిణీ (తూర్పు పడమర)
చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు (చిల్లరకొట్టు చిట్టెమ్మ)
జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని)
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా (కల్యాణి)
ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తిలో (జయసుధ)
అలివేణీ ఆణిముత్యమా (ముద్దమందారం)
ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా (మేఘ సందేశం)
కొలువైతివా రంగశాయి (ఆనంద భైరవి)
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు (శ్రీవారికి ప్రేమలేఖ)
కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది (దేవదాసు)
సిగ్గు పూబంతి సీతామాలక్ష్మి (స్వయంకృషి)

– ఆచారం షణ్ముఖాచారి
(94929 542556)

1 thought on “బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

  1. He is one of the music maestros in film industry. Unfortunately, the movie field couldn’t give proper recognition to his creativity and originality. He never copied the tunes of others. It’s our luck, this creative genius was born in Andhra Pradesh.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap