తెలుగు భాష, తెలుగు చిత్రకళపై నాట్స్ వెబినార్

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి ముఖ్యఅతిధిగా ‘నాట్స్’ వెబినార్

భాషే రమ్య, సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు లలిత కళావేదిక అధ్వర్యంలో ప్రతి నెల ఆన్లైన్ వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు భాష, చిత్ర కళా వైభవంపై వెబినార్ నిర్వహించింది. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు డాక్టర్ కొండపల్లి నీహారిణి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలుగు భాషా వైభవాన్ని, తెలుగు మాధుర్యాన్ని ఆమె తెలుగు సాహిత్యం నుంచి చక్కగా వివరించారు. ప్రముఖ చిత్ర కళాకారుడు, చిత్ర కళాతపస్విగా పేరుగాంచిన కొండపల్లి శేషగిరిరావు గీసిన చిత్రాలను ఆమె ఈ సందర్భంగా చూపించి ఆ చిత్రాల అంతరార్థాన్ని కూడా నీహారిణి వివరించారు. ఆనాడు కొండపల్లి శేషగిరిరావు చిత్రాలకు ఎంతటి ఆదరణ ఉండేది అనేది వివరించారు.

ఈనాడు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు నిలువెత్తు చిత్రాన్ని కూడా కొండపల్లి శేషగిరిరావు చిత్రించిందేనని నిహారిణి తెలిపారు. బొమ్మల్లో హావభావాలను స్పష్టంగా చిత్రీకరించి అవి చూడగానే మనస్సును ఆకట్టుకునేలా.. మనకు కొత్త విషయాలు చెప్పేలా కొండపల్లి శేషగిరిరావు బొమ్మలు ఉండేవని ఆమె వాటిని చూపిస్తూ వివరించారు. ఈ కార్యక్రమానికి శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, గిరి కంభంమెట్టు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు నాట్స్ చేస్తున్న కృషిని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి వివరించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అభినందించారు.

SA: