ఎన్టీఆర్ – భారతరత్న

మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతిలోకి అడుగుపెట్టిన సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ మహనీయుడు పుట్టి వందేళ్లు పూర్తయ్యే గొప్ప సందర్భం.ఊరూవాడా ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయం.ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ‘మహానాడు’ నిర్వహించడం దాదాపుగా 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న ఆనవాయితీ.

అది మాత్రం నిరాఘాటంగానే జరుగుతోంది.
కానీ, ఎన్టీఆర్ స్మృతి పథంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాల్సిన పురస్కార ప్రదాన మహోత్సవాలు సక్రమంగా సాగడం లేదు.
అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఈ విషయంలో దాదాపుగా మొదట నుంచీ ఇదే తంతు నడుస్తోంది.
పుట్టినరోజు రాగానే “ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి”… అనే నినాదం వినిపిస్తూ ఉంటుంది.
అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు.. అనే స్పృహలోకి అందరూ వచ్చేశారు. చంద్రబాబు గట్టిగా పూనుకొని ఉంటే, ఎప్పుడో వచ్చిఉండేదనే మాటలు కూడా వింటూనే ఉన్నాం.కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ ప్రకటిస్తే,ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తతంగం ఇష్టంలేకనే చంద్రబాబు మిన్నకున్నాడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంలో బిజెపి (ఎన్ డి ఏ) అధికారంలో ఉండి, తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయాల్లో కూడా ఈ సంకల్పం నెరవేరకపోవడానికి అదే కారణమని చంద్రబాబుపై మొదటి నుంచీ ఉన్న ప్రధానమైన ఆరోపణ.

ఈ విషయంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు సరళిలోనే ఉన్నారని మరోమాటగా చెప్పుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ / యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి మంత్రిగానూ పనిచేశారు. ఆమెది కూడా ఇదే అభిప్రాయం కాబట్టి, భారతరత్న కోసం ఆమె కృషి చేయలేదనే విమర్శ పురందేశ్వరిపై కూడా ఉంది. నిజానిజాలు ఎలా ఉన్నా, ఎన్టీఆర్ కు భారతరత్న దక్కకపోవడానికి ఆయన కుటుంబసభ్యులే ప్రధాన కారణమనే కోణం ప్రజల్లోకి బలంగానే వెళ్లిపోయిందని ఎక్కువ శాతం రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు ‘భారతరత్న‘ ఇవ్వాల్సిన తెలుగువారి జాబితా పెరిగిపోయింది.
2022 ఘంటసాల శతజయంతి సంవత్సరం. ఘంటసాలకు ప్రకటించాలనే డిమాండ్
ప్రజల నుంచి బాగా పెరుగుతోంది.
కొన్ని సాంస్కృతిక సంస్థలు, ఘంటసాల అభిమానులు విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టారు.
గత సంవత్సరం పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు ‘వందేళ్ల పండగ’.పీవీ విషయంలో తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా మద్దతు వచ్చింది. కానీ అనుకున్నది జరగలేదు.
ఆ మాటకొస్తే మంగళంపల్లి బాలమురళీకృష్ణకు కూడా దక్కలేదు.ఈ సందర్భంలో, బాలమురళి తరచూ చెప్పే మాటలను ఒకసారి సరదాగా గుర్తు తెచ్చుకుందాం. భారతరత్న ఇంతవరకూ
మీకు ఎందుకు రాలేదు? అనే ప్రశ్న మీడియాతో పాటు చాలామంది ఆయనకు సంధిస్తూ ఉండేవారు.
“భారతరత్న నాకు రాకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు.
నేను తెలుగువాడిని కాబట్టి, బ్రాహ్మణుడను కావడం చేత,మగవాడిని కాబట్టి…”. అదీ! మంగళంపల్లి వారి సమాధానం.మిగిలిన రెండు విషయాలు ఎలా ఉన్నప్పటికీ, తెలుగువాడు కాబట్టి రాలేదని అనుకుందాం.ప్రణబ్ ముఖర్జీ జీవించి ఉన్నప్పుడే అందుకున్నారు. అక్కడ పీవీకి అన్యాయం జరిగిందని భావించక తప్పదు.

సంగీత రంగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్ కు దక్కాయి కానీ, మంగళంపల్లిని వరించలేదు. ఇలా చూస్తే… ఎన్టీఆర్ కూడా పీవీ నరసింహారావు, మంగళంపల్లి పంక్తిలోకి చేరిపోయారు. మొత్తంగా చూస్తే, ‘భారతరత్న’ అందుకున్న తెలుగువారు ఇంతవరకూ ఒక్కరు కూడా లేకపోవడం విషాదం.
తెలుగువారిలో ఐక్యత కరువవ్వడం, రాజకీయంగా ఎదిరించే సత్తా లేకపోవడం,
ప్రజల్లో పోరాటపటిమ అటకెక్కడం మొదలైన కారణాల వల్ల అనుకున్నవి, రావాల్సినవి, కావాల్సినవి ఏవీ సాధించలేక పోతున్నామన్నది వాస్తవం.
భారతరత్నకు అర్హులైన తెలుగుమహనీయులు ఎందరో ఉన్నారు. అందులో చాలామంది నేడు జీవించి కూడా లేరు.

ఏ పురస్కారమైనా, గౌరవమైనా బతికివున్నప్పుడు అందించడమే వివేకం.
కేవలం జీవించి ఉన్నప్పుడే కాదు, ఆరోగ్యంగా చురుకుగా ఉన్నప్పుడు ఇవ్వడమే సరియైనది.
సరే! మరణానంతరం ప్రకటించినా అర్హులైనవారందరికీ అందాలి. టెండూల్కర్ వంటివారికి భారతరత్న ఇవ్వడంపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్, ఘంటసాల, మంగళంపల్లి, పీ.వీ. నరసింహారావు నూటికి నూరు శాతం అర్హులు. అక్కినేని నాగేశ్వరావు, పి సుశీల, ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం, బాపు వంటి మహనీయులు ఎందరో మన తెలుగునాట ఉన్నారు. ఎవరికి ముందు వచ్చినా, ఎవరికి తర్వాత ఇచ్చినా, వీరందరూ అర్హులే. ఎన్టీఆర్ వంటి జాతిరత్నం విషయంలో రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు మాని, కృషి చేయడం అందరి కర్తవ్యం.

-మాశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap