మర్యాదరాముడు… నవ్వులరేడు పద్మనాభుడు

ప్రతి మనిషి జీవితంలోను సుఖదుఃఖాలుంటాయి, మిట్టపల్లాలూ వుంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కానేరవు. అందుకు అతని జీవితం మినహాయింపు కాదు. అతడు ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యాన్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన అమృతమూర్తి. వెండితెరమీద యెంతో బిజీ నటుడుగా ఉన్నప్పటికీ నాటకరంగాన్ని విదిచిపెట్టని కళాజీవి. నిర్మాతగా మారి ఎందరో చిన్న కళాకారులకు ఉపాధి కల్పించిన సహృదయుడు. అతడే నవ్వులరేడు బసవరాజు పద్మనాభం. ఆగస్టు 20 న పద్మనాభం జయంతి. ఈ సందర్భంగా పద్మనాభం సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుందాం….

బాల్యంలో బంగారం…

పద్మనాభం పుట్టింది ఆగస్టు 20, 1931న కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రిపురంలో. తల్లిదండ్రులు వెంకట శేషయ్య, శాంతమ్మ. కరణీకం తండ్రి వృత్తి. పద్మనాభం కు చిన్నప్పటినుంచీ సంగీతమంటే మక్కువ. ఐదేళ్ళ వయసులోనే కపిలవాయి రామనాథ శాస్త్రి, వేమూరి గగ్గయ్య పద్యాలను అనుకరించి పాడుతూ వుండేవారు. ఆరోజుల్లో సినిమాలు డేరాలు వేసి ఆడేవారు. చిన్నతనంలో పద్మనాభం ఆ డేరా హాళ్ళలో ద్రౌపదీ వస్త్రాపహరణం, వందేమాతరం, సుమంగళి, భక్త ప్రహ్లాద వంటి సినిమాలు ఎన్నో చూసి అందులో పాటలూ, పద్యాలూ పాడుతూవుండేవారు. వారి వూళ్ళో చింతామణి నాటకం ఆడుతుంటే అందులో బాలకృష్ణుడు వేషం వేశారు పద్మనాభం. ఒకసారి మోటబావిలో బెండ్లు కట్టుకొని ఈతకొడుతూ మునిగిపోతుంటే ఓ స్నేహితుడు రక్షించాడు. ప్రొద్దుటూరు హైస్కూలులో చదువుకుంటూ, చేతిలో చిల్లి గవ్వ లేకుండా సైకిలు కొనాలని మద్రాసు వెళ్ళారు. పాటలు, పద్యాలు పాడి డబ్బు సంపాదించి సైకిలు కొనాలని అతడి ఉద్దేశ్యం. అది సాధ్యమా! జెమినీ స్టూడియో వద్ద కన్నాంబ అడ్రసు తెలుసుకొని త్యాగరాయ నగర్ మలానీ వీధిలో హిందీ ప్రచార సభ కు దగ్గరలో వున్న ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె పద్మనాభం ను చూసి “ఎవరు నాయనా” అని అడిగితే, “మాది ప్రొద్దుటూరు. మీ సినిమా ‘చండిక’ చాలాసార్లు చూశాను. మీదగ్గర పాటలు పాడి డబ్బు సంపాదించి సైకిలు కొనుక్కుందామని వచ్చాను” అని చెప్పడంతో ఆమె ఓ నవ్వు నవ్వి మంచి భోజనం పెట్టింది. ఆమె పద్మనాభం ను రాజరాజేశ్వరి ఆఫీసుకు తీసుకెళ్ళి సి.ఎస్.ఆర్, కొచ్చెర్లకోట సత్యనారాయణ, కల్యాణం రఘురామయ్య, దాసరి కోటిరత్నం సమక్షంలో పాటలు, పద్యాలు పాడించింది. అలా ’పాదుకా పట్టాభిషేకం’ లో గుహుడి పాటకు కోరస్ పాడారు పద్మనాభం. ‘మాయాలోకం’ చిత్రంలో శరబందిరాజు ఏడుగురు కొడుకుల్లో మొదటివాడిగా నటించారు. గూడవల్లి రామబ్రహ్మంకు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ మద్రాసులోనే పెరిగారు. అప్పుడు పద్మనాభం కు జీతం నెలకు 40 రూపాయలు. పద్మనాభం కు పద్యాన్ని భావయుక్తంగా ఎలా పాడాలో నేర్పిన మహనీయుడు సి.ఎస్.ఆర్. రఘురామయ్య ఉదయమే కసరత్తు చేసేవారు. పద్మనాభం ఆయనకు మాలీషు చేస్తుంటే రఘురామయ్య దీవించేవారు. సి.ఎస్.ఆర్ బృందంలో పద్మనాభం దాదాపు 50 కి పైగా నాటకాలు వేశారు. చిన్నవాడుగా వుండగా అతడు నటించిన రెండవ సినిమా నాగయ్య గారి ‘త్యాగయ్య’. అందులో త్యాగయ్య శిష్యుని పాత్రకోసం గుండు గీయించుకొని నటించారు. తరవాత ‘ముగ్గురు మరాఠీలు’ సినిమాలో ‘తంతీరావు’ పాత్రను పోషించారు. అందులో నెలకు జీతం 60 రూపాయలు. తరవాత నారద-నారది, యోగి వేమన, భక్త సిరియాళ వంటి చిత్రాల్లో చిన్నిచిన్న వేషాలు వేశారు. జెమినీ వారి ‘వింధ్యరాణి’ సినిమాలో పద్మనాభం తనపాట తనే పాడుకున్నారు. 1948లో కొంత గ్యాప్ రాగా పద్మనాభం తన సొంతవూరుకు వెళ్ళిపోయారు.

విజయా సంస్థలో అడుగుపెట్టి…

జెమినీ వారు ‘వీరకుమార్’ సినిమా తీస్తూ ముందు అనుకున్న అగ్రిమెంటు ప్రకారం పద్మనాభంను మద్రాసు రమ్మన్నారు. ఆ సినిమా దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య. ఆయన పుణ్యమా అని విజయా సంస్థతో పరిచయం అయ్యింది. ‘వీర కుమార్’ సినిమా నిర్మాణంలో ఉండగానే విజయా వారు ‘షావుకారు’ సినిమా తీస్తున్నారు. ఎల్.వి. ప్రసాద్ సిఫారసుతో అందులో పోలయ్య వేషానికి పద్మనాభంను తీసుకున్నారు. జీతం నెలకు 150 రూపాయలు. అంతకుముందు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘త్యాగయ్య’లో నటించి ఉండడంతో ‘గుణసుందరి కథ’ సినిమాకోసం పాటపాడమంటే పద్మనాభం పాడలేకపోవడంతో, మరలా సింహాద్రిపురం వచ్చేశారు. ఈలోగా ‘షావుకారు’ సినిమా విడుదలైంది. పద్మనాభం పాత్రకు సరైన గుర్తింపు వచ్చింది. అదృష్టవంతుణ్ణి ఆపేదెవరు? ఆ సినిమా కె.వి. రెడ్డి మనసు మార్చుకునేలా చేసింది. కె.వి. రెడ్డి అప్పుడు విజయా వారి ‘పాతాళభైరవి’ చిత్రానికి పింగళి నాగేంద్రరావుతో కలిసి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అందులో సదాజపుడు పాత్రకోసం పద్మనాభానికి కబురు పంపారు. సినిమా శతదినోత్సవం చేసుకుంది. ‘పాతాళభైరవి’ సినిమాకు జీతంతోబాటు 500 రూపాయల బోనస్ ఇచ్చారు. “మోసం గురూ” అనే పద్మనాభం డైలాగు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పుడు కోడంబాక్కం లోని విజయా-వాహిని స్టూడియోకి దగ్గరలోఒక గది అద్దెకు తీసుకొని అందులో బాలకృష్ణ తోబాటు ఆయన కలిసి వుండేవారు. కాంట్రాక్టు ప్రకారం ‘పెళ్ళిచేసి చూడు’, ‘చంద్రహారం’లో నటించారు. అప్పుడే గుబ్బి ప్రొడక్షన్స్ వారి ‘కాళహస్తి మహాత్మ్యం’ సినిమా లో ఆఫర్ వచ్చింది. పారితోషికం వెయ్యిరూపాయలు ముట్టింది. ‘సతీ అనసూయ’ లో నారదుడి వేషం బాగా కుదిరింది. ఆ పరంపర కృష్ణప్రేమ, సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామకథ, సతీ తులసి, ప్రమీలార్జునీయం సినిమాలకూ కొనసాగి వాటిలో కూడా నారడుడుగా నటించడం జరిగింది. ఇన్ని సినిమాలలో నారదుడు పాత్రను ఒక హాస్యనటుడు పోషించడం విశేషమే. ఎన్.టి. రామారావు సొంతచిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’ లో రామారావు తమ్ముడిగా పద్మనాభం నటించారు. అలాగే ‘కార్తవరాయని కథ’ లో కామెడీ విలన్ వేషం పోషించారు. పద్మనాభం హాస్యనట పోషణకు బాబ్ హోప్, డానీ కే, లారెల్ హార్డీ వంటి హాలీవుడ్ నటులు స్పూర్తి. ‘రాజమకుటం’ సినిమాలో పద్మనాభం గుమ్మడి కొడుకు భజరంగడు పాత్ర పోషిస్తే అందులో హాస్యం బాగా పండింది. 1957 లో పద్మనాభం సినిమాల్లో బాగా బిజీ అయ్యారు. అప్పట్లో సంగీత దర్శకుడు కోదండపాణి, సుదర్శనం, పద్మనాభం కలిసి టి. నగర్ లోని అబ్దుల్ అజీజ్ వీధిలో అద్దె ఇంట్లో వుండేవారు. పద్మనాభం ఆడే నాటకాలకు కోదండపాణి సంగీతం సమకూర్చేవారు. జగ్గయ్య కోదండపాణికి ‘పదండి ముందుకు’ సినిమాలో సంగీత దర్శకుడిగా తొలి అవకాశం కలిపించారు. 1950లో సైకిలు కొన్న కుర్ర పద్మనాభం 1958 నాటికి ఒక ఇల్లు ఏర్పరచుకోగలిగారు. పద్మనాభాన్ని సంపూర్ణ హాస్యనటుణ్ణి చేసిన చిత్రం అన్నపూర్ణావారి ‘వెలుగు నీడలు’ చిత్రం. ఆ సినిమాలో నటనకు సంతృప్తి చెందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఎ.వి. సుబ్బారావు ‘భార్యాభర్తలు’ సినిమాలో కామెడీ విలన్ ఆంజనేయులు పాత్రను ఇచ్చారు. హాలీవుడ్ హాస్యనటుడు జెర్రీ లూయిస్ ని అనుకరిస్తూ అలాంటి తలకట్టుతోనే ఆ పాత్రకు జీవం పోస్తూ అద్భుతంగా నటించారు పద్మనాభం. తరవాత ‘వాగ్దానం’, ‘తండ్రులు-కొడుకులు’, ‘ఇద్దరు మిత్రులు’, ‘కులగోత్రాలు’, ‘గులేబకావళి’, ‘పూలరంగడు’, ‘దాగుడుమూతలు’ సినిమాల్లో పద్మనాభం కు బాగా పేరుతెచ్చే వేషాలు వచ్చాయి.

Padmanabham

దేవత తో నిర్మాతగా…

1960లోనాటక నిర్మాణానికై పద్మనాభం వల్లం నరసింహారావు తో కలిసి ‘రేఖా అండ్ మురళీ ఆర్ట్స్’ అనే సంస్థను నెలకొల్పి పాలగుమ్మి పద్మరాజు రచించిన ‘శాంతి నివాసం’(తరవాతి కాలంలో సుందర్లాల్ నహతా అదే మకుటంతో సినిమాగా నిర్మించారు), ‘శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’ నాటకాలను వందలకొద్దీ ప్రదర్శనలిచ్చేవారు. ‘రేఖ’ వల్లం నరసింహారావు అమ్మాయి అయితే, ‘మురళి’ పద్మనాభం కొడుకు. వీరిద్దరి పేరుతో ఆ సంస్థ వెలిసింది. పద్మనాభం ఆడే నాటకాలకు కథ, సంభాషణలు వీటూరి (వీటూరి వెంకట సత్యసూర్యనారాయణ మూర్తి)రాసేవారు, కోదండపాణి సంగీతం సమకూర్చుతుండేవారు. ఒకసారి వీటూరి పద్మనాభం కు ‘దేవత’ కథ వినిపించడం జరిగింది. ఆ కథ నాటకానికి సరిపోదు కనుక సినిమాగా తీస్తే హిట్ అవుతుందని వీటూరి ధీమా వ్యక్తం చెయ్యడంతో పద్మనాభం ఆలోచనలో పడ్డారు. కోదండపాణి కథను విని బాగుందని చెప్పారు. అందులో కథానాయికది ద్విపాత్రాభినయం కావడంతో సెంటిమెంటు పండుతుందని భావించి వీటూరితో కలిసి రామారావు వద్దకు వెళ్లి పద్మనాభం కథ వినిపించారు. కథ విని రామారావు “గో అహెడ్ బ్రదర్. నేను ఈ సినిమా చేస్తాను” అని పద్మనాభం కు అభయమిచ్చారు. సావిత్రి కూడా కథ విని బాగుందని చెప్పింది. అయితే ఆమె అప్పుడు మూడు నెలల గర్భవతి. ప్రసవం అయ్యాక తీద్దాం అని అంటే పద్మనాభం ”లేదమ్మా. మూడు నెలల్లోనే సినిమా పూర్తి చేస్తాం” అని చెప్పి ఆమెను ఒప్పించారు. ఇల్లు తాకట్టు పెట్టి నలభైవేలు పోగుచేశారు. వాణీ ఫిలిమ్స్ కాకర్ల వెంకటేశ్వరరావు సహకారంతో వాహినీ స్టూడియో రెండవ ఫ్లోరులో మూడు నెలల్లోనే సినిమా పూర్తిచేశారు. సినిమా 24 జూలై 1965 న విడుదలై అశేష ప్రజానీకం, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొని ఆరు కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఆ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన 12 సినిమాలలో 8 ఘనవిజయం సాధిస్తే అందులో ‘దేవత’ సినిమా కూడా వుండడం విశేషం. దేవత సినిమా నిర్మాణం జరగుతుండగా చిత్తూరు నాగయ్యకు ‘పద్మశ్రీ’ పురస్కార ప్రకటన వెలువడింది. షూటింగ్ స్పాట్లోనే నాగయ్యను పద్మనాభం పూలమాలలతో ముంచెత్తి, సత్కార కార్యక్రమం నిర్వహించారు. ‘త్యాగయ్య’ సినిమాలో నటించినప్పటినుండి పద్మనాభం నాగయ్యను “నాన్నగారూ” అని పిలిచేవారు. రేణుకా ఆఫీసులో తనకు పాతిక రూపాయలిచ్చి అన్నంపెట్టిన ఆ మహా మనీషిని సత్కరించడం అదృష్టమని భావించారు పద్మనాభం. ఈ సినిమాలో యన్టీఆర్-సావిత్రిల కొడుకుగా నటించింది పద్మనాభం కుమారుడు మురళి. ఈ సినిమా తరవాత ‘పొట్టి ప్లీడరు’ (1966), ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ (1967), ‘శ్రీరామ కథ’ (1969), ‘కథానాయిక మొల్ల’ (1970), ‘ఆజన్మ బ్రహ్మచారి’ (1974), ‘మాంగల్య భాగ్యం’ తోబాటు తుఫాను బాధితుల సహాయార్ధం ‘సినిమా వైభవం’ వంటి సినిమాలు నిర్మించారు. ఆయా చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ‘కథానాయిక మొల్ల’ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతి లభించింది. ‘తేనెమనసులు’ చిత్రంలో “మాస్టారూ డ్రిల్ మాస్టారూ” అనే పాటను సుశీలతో కలిసి పాడారు.

ఆకాశం నుంచి పవనాంధో లోకానికి…

చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకురావాలంటే లౌక్యం అవసరం. అదిలేకనే మహానుభావులు చిత్తూరు నాగయ్య వంటివాళ్ళు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం మినహాయింపు కాదు. 1975 లో ‘సినిమా వైభవం’ సినిమాకోసం దశరథరామయ్య అనే పెట్టుబడిదారు వద్ద పద్మనాభం 60 వేలు అప్పుచేశారు. అందుకు హామీగా దేవత, పొట్టిప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, శ్రీరామకథ సినిమాల నెగటివ్ లను తాకట్టు పెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు దశరథరామయ్య పరమౌతాయనేది అగ్రిమెంటు. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను రాయలసీమ, ఆంధ్ర, నైజాం ఏరియాలకు రెండు లక్షల డెబ్భై ఇదు వేలకు అతడు అమ్మేశాడు. అప్పు తీరగా మిగతా డబ్బు పద్మనాభం కు ఇవ్వలేదు. పైగా సినిమా నెగటివ్ లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ పద్మనాభంకు న్యాయం జరగలేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. చివరికి దశరథరామయ్య మరణించాక వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని నెగటివ్ లు పద్మనాభం పరం చేశారు. పద్మనాభం తిరిగి నాటక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. తనవాడనుకున్న తమ్ముడు పురుషోత్తం కూడా పద్మనాభంకు తనవంతు నష్టాన్ని పంచాడు.

మరిన్ని విశేషాలు…

1991 లో పద్మనాభం బృందం అమెరికాలోని 19 రాష్ట్రాల్లో పర్యటించి ‘దొంగగారు వస్తున్నారు,స్వాగతం పలకండి’, ‘మనిషి గోతిలో పడ్డాడు’, ‘కన్యాశుల్కం’, ‘తులసీ డ్యాం’ వంటి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారి బృందంలో వున్న ప్రమీలారాణి హటాత్తుగా మరణించింది. పద్మనాభం కుంగిపోయారు. తరవాత ఎక్కడ నాటకాలు ఆడినా రంగస్థలంమీద కాలుపెట్టగానే “ప్రమీలారాణి ఆత్మ నాలో వుంది. ఆమె అస్థికలు వెనక స్టేజీలో వున్నాయి” అని ప్రకటించి, ఆమెకు నివాళులర్పించి నాటకం మొదలెట్టేవారు. రంగస్థల నటులకు పద్మనాభం ఇచ్చే గౌరవం అలాంటిది.

‘దేవత’ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేయడానికి సావిత్రి ఇంటికి వెళ్లి అడ్వాన్సుగా డబ్బు ఇస్తూ వుంటే అందులోంచి వంద రూపాయల నోటు పొరబాటున జారి కిందపడింది. సావిత్రి ఆ నోటును తీసి కళ్ళకు అద్దుకుంటూ “ఇది మంచి శకునం. మీ దేవత వందరోజులు ఆడుతుంది” అని దీవించింది.

చిన్నతనంలో ఓ గుడ్డివాని కంచంలో రాయివేసి అందులోవున్న చిల్లర డబ్బులు దొంగతనం చేశాడు పద్మనాభం. పెద్దయ్యాక ఈ సంఘటన పద్మనాభం ను తొలచివేసింది. ‘జాతకరత్న మిడటం భొట్లు’ సినిమాలో మిడతంభొట్లు ని రాజుగారి వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఓ గుడ్డివాడిని చూసి “ఇతడు ఏమి నేరం చేశాడు” అని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన గుడ్డివానిని తీసుకొచ్చి షాట్ ఒకే అయ్యాక కొంతడబ్బు ఇచ్చి పంపారు పద్మనాభం. ఆ పాప పరిహారార్ధం ఇదు వేలు లిటిల్ ఫ్లవర్ వారి బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఆరోజుల్లో అది పెద్దమొత్తం క్రింద లెక్క.

దేవత చిత్రంలో “కన్నుల్లో మిసమిసలు కనిపించనీ” అనే పాట సాతనూర్ డ్యాం వద్ద చిత్రీకరణ జరిపిన సందర్భంగా ఒక చిన్న సంఘటన చోటుచేసుకుంది. యన్టీఆర్ ని కారులో యెక్కించుకొని రాత్రిపూట సాతనూర్ బయలుదేరారు పద్మనాభం. యన్టీఆర్ వెనక సీటులో పడుకున్నారు. చెంగల్పట్టుకు దగ్గరలో రోడ్డు మీదకు ఒక పులి వచ్చింది. ముందు సీట్లో వున్న పద్మనాభం, డ్రైవరుకు ధైర్యం చెప్పి స్పీడు తగ్గించ మన్నారు. పులి వంద అడుగుల రోడ్డును ఒక్క గెంతులో దాటేసింది. డ్రైవరు పద్మనాభంతో “సార్ పులిని చూసి మీరు భయపడలేదే” అని అడిగాడు. పద్మనాభం సమాధానమిస్తూ “నిజమేరా. పులికి నేను భయపడలేదు. వెనక సింహాన్ని తీసుకెళుతున్నాం. నాకు అదంటేనే భయం” అన్నారు. తిరువణ్ణామలై దాటాక డ్రైవరుకి టీ తాగిద్దామని నాలుగు గంటలకు కారు ఆపగా యన్టీఆర్ లేచారు. పద్మనాభం జరిగింది అన్నగారికి చెప్పారు. “నన్నుకూడా లేపాల్సింది. నేనూ చూసేవాణ్ణిగా” అన్నారు యన్టీఆర్. పద్మనాభం తాపీగా “పులి వెళ్లి పోయిందిగా. అంతగా అవసరం వస్తే సింహాన్ని లేపేవాణ్ణి సార్” అనడంతో నవ్వులు విరిశాయి.

అలాగే దేవత సినిమాలో “బొమ్మను చేసి ప్రాణము పోసి” అనే పాట విషయంలో కూడా మరో విశేషం జరిగింది. ఈ క్లైమాక్స్ పాట కోసం వీటూరి రెండు పల్లవులు రాశారు. మొదటిది “నవ్వలేవు యేడ్వలేవు ఓడిపోయావోయ్ మేధావి…నవ్వించువాడు, యేడ్పించువాడు వున్నాడు వేరే మాయావి” అనేది. రెండవది “బొమ్మనుచేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా”అనేది. మొదటి పల్లవిలో డబ్బింగు ఛాయలు ఉండడంతో రెండవ పల్లవిని అందరూ “ఒకే” చేశారు. కానీ ఇరవై రోజులు గడచినా ఈ పాటకు చరణాలు కుదరలేదు. ఒకవైపు సావిత్రి గర్భవతి కావడంతో త్వరగా సినిమా పూర్తి చేయాలని, అప్పుడు పద్మనాభం మహాకవి శ్రీశ్రీని కలిశారు. పల్లవిని మార్చకుండా శ్రీశ్రీ రెండు చరణాలను రెండ్రోజుల్లోనే రాసి యిచ్చేశారు. వీటూరి రాసిన పల్లవిని మార్చకుండా శ్రీశ్రీ చరణాలు రాసి తన గొప్పమనసును చాటుకున్న మహత్తర గీతమిది. ఇప్పటికీ ఈ పాట ప్రతి పాటకచేరీలో తప్పనిసరిగా వినిపిస్తూనే వుంటుంది.

తెలుగు సినిమా వజ్రోత్సవం సందర్భంగా సోనీ హాలిడేస్ సంస్థ వారు పద్మనాభంకు ‘జంధ్యాల’ పేరిట బంగారు పతకాన్ని బహూకరించారు. నాలుగు వందల పైచిలుకు సినిమాలలో నటించిన పద్మనాభం 20, ఫిబ్రవరి 2010న గుండె నొప్పితో చెన్నై లో మరణించారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap