ఆనందాచారి వేలు శిల్ప, చిత్రకళా రంగాల్లోనే కాకుండా ఆలయ నిర్మాణలోనూ అనేక ప్రయోగాలు చేసి విఖ్యాతి పొందారు. వేలు పేరు చూస్తే ఆంధేతరుడను కొంటారు. కాని ఆయన నూరు పైసల ఆంధ్రులు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో ఒక శిల్ప కుటుంబంలో 1952 జూన్ 1 న జన్మించారు. వీరి పూర్తి పేరు ఆనందాచారి వేలు. స్థానికంగా పాఠశాల విద్య చదివి, తిరుపతి దేవస్థానంకు చెందిన శిల్పకళాశాలలో నాల్గు సంవత్సరాలు శిల్ప విద్యనభ్యసించి 1975లో ప్రధమ శ్రేణిలో డిప్లమో తీసుకున్నారు. 1983లో గుంటూరులోని శ్రామిక విద్యాపీఠంలో డ్రాయింగ్, పెయింటింగ్, బ్లూప్రింట్ మేకింగ్లలో శిక్షణ పొందారు. 1985లో బి.ఎ., 1988లో డ్రాయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత హైద్రాబాద్ ఎండోమెంటు బోర్డు శిల్పకళా విద్యాశాఖలో శిల్ప అధ్యాపకుడిగా అడుగుపెట్టి, సహాయ స్థపతి, ఉప స్థపతి లాంటి పదవులందుకొని, 2010లో పదవీ విరమణ తర్వాత 2011 లో స్థపతి సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. 2013-14 లో శ్రీశైల దేవస్థానం స్థపతి సలహాదారుడిగా పనిచేసారు. 2016 నుండి యాదాద్రి దేవాలయ నిర్మాణంలో పనిచేస్తూ.. 2018 లో అడిషనల్ స్థపతిగా భాద్యతలు పొంది, 2019 లో స్థపతి సలహాదారుడిగా నియమించబడి సుమారు 300 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
-కళాసాగర్