సంగీత పద్మవిభూషణుడు మన అభిమాన ‘బాలు’డు

(జూన్ 4 బాలు జయంతి సందర్భంగా… ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం…))

ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం సంగీతం. కాలమేదైనా దేశమేదైనా ప్రపంచ వ్యాప్తంగా మానవ హృదయాలను ఆ సంగీతనాదమే తన్మయింపజేస్తుంది. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహింపచేసే సంగీతానికి ఎల్లలులేవు. అందులో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీసంగీతానికి పునాది వేసి జాగృతం చేశారు. తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది ‘బాలు’ అని మనం ముద్దుగా పిలుచుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఎంత యెత్తుకెదిగినా యెల్లలు దాటని ఆ యోగి పుంగవుడు ఆబాల గోపాలాన్ని పాట అనే సమ్మోహన శక్తితో కట్టిపడేసిన సంగీత దురంధరుడు. సంగీతమే కాదు అతని వ్యక్తిత్వానికీ ఓ విశిష్టత వుంది. 56 ఏళ్ల సంగీత ప్రస్థానంలో బాలు కంఠస్వరంలో అదే రసవాహిని ఉప్పొంగింది…మాధుర్యం అంబరాన్ని అంటింది. ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి రాగసాగరికల ద్వారా ఖండాతరాలలో వుండే భారతీయ సంతతిని సైతం జాగృత పరచి వారిని సంగీతం వైపు పయనింపజేశారు. భౌతికంగా అతడు మనముందు లేకున్నా, మన మనసుల్లోనే సుస్థిర స్థానం సంపాదించుకొని సజీవుడుగానే మసలుతూ తన గాన సంపదను గుర్తుచేస్తూనే వున్నాడు. బాలు జయంతి సందర్భంగా ఆ బాలేంద్రుని గురించి కొన్ని అనుభూతులు…

గాయకుడు కావాలని…

1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ (ఆంధ్రా క్లబ్) వారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న ‘బాలు’ కి అందులో ప్రధమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించిన ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తోబాటు మరో సంగీత దర్శకుడు ‘కోదండపాణి’ కూడా ముగింపు వేడుకలో ప్రేక్షకులమధ్య కూర్చుని బాలు ప్రధమ బహుమతి గెలుచుకున్న ఆ పాటను విన్నారు. ‘బాలు’ పాటపాడే విధానం అతనికి నచ్చింది. తనని తాను పరిచయం చేసుకొని బాలుని అభినందించారు. “గొంతు లేతగా వుంది. కొన్నాళ్ళు గడిస్తే సినిమాల్లో పాటలు పాడిస్తా”నని అభయమిచ్చారు. ఈ సంఘటనకు ముందు గూడూరు కళారాధన సమితి వారు నిర్వహించిన లలిత సంగీత పోటీలకు ప్రముఖ నేపథ్య గాయని జానకి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ పోటీల్లో బాలుకి ద్వితీయ బహుమతి వచ్చింది. ముఖ్య అతిధి జానకి ఆ వేదికమీద ప్రసంగిస్తూ బాలుకే ప్రధమ బహుమతి పొందే అర్హత వుందని, వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ళ భవిష్యత్తు అంధకారమౌతుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఆమె చెప్పిన మాటలు బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సినిమాలలో పాడేందుకు ప్రయత్నించమని ఆమె బాలుకి సలహా కూడా ఇచ్చారు. మద్రాసులో ఇంజనీరింగు (AMIE) చదువు కొనసాగిస్తూ సినిమా అవకాశాలకోసం బాలు తరచూ కోదండపాణిని కలుస్తూ వుండేవారు. సంగీత శిక్షణ తీసుకోకపోయినా, రాగతాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా వుండడంతో ట్యూను ఒకసారి వింటే యదాతధంగా పాడగలిగే విద్వత్తు బాలుకి సొంతం కావడం యెంతో లాభించింది. అంతేకాదు బాలుకి స్టేజి ఫియర్ అంటే తెలియదు. అన్నిటికి మించి బాలు గళం అతనికి భగవంతుడు ఇచ్చిన వరం… అంతకుమించి అతనికి లభించిన యోగమని చెప్పాలి.

తొలి ప్రయత్నమే నిష్ణాతులలో…

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కోదండపాణి బాలుకి ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ (1967) సినిమాలో తొలిసారి బాలుకి పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం కోదండపాణి ప్రతిపాదనకు మద్దతు పలికారు. వీటూరి రాయాగా మాల్కోస్, యమన్, కల్యాణి, భాగేశ్వరి రాగాల్లో స్వరాలల్లిన “యేమి ఈ వింత మోహం” అనే ఆ రాగమాలికను రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ వారి కార్యాలయంలో కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని బాలుకు రికార్డింగ్ రోజు మాత్రమే తెలిసింది. రికార్డింగ్ రోజు విజయా గార్డెన్స్ లోని రికార్డింగ్ థియేటర్ కు వెళ్ళిన బాలుకు పి.సుశీల, ఈలపాట రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్ కనిపించారు. తడబాటులోవున్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేసి బాలు ఆలపించిన “యేమి ఈ వింత మొహం” పాట ట్రాక్ మొత్తాన్ని వారందరికీ వినిపించారు. ఆపైన ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966 న విజయా గార్డెన్స్ లో రికార్దిస్ట్ స్వామినాథన్ అధ్వర్యంలో రికార్డయింది. అందులో బాలు వర్షన్ మొదటి టేక్ లోనే ‘ఓకే’ కావడం విశేషం. జూన్ 2, 1967న విడుదలైన ఈ సినిమాలో బాలు వర్షన్ ను శోభన్ బాబు మీద చిత్రీకరించారు. అలా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేచింది. బాలు సగర్వంగా ఎప్పుడూ చెప్పేమాట ఒకటుంది. “కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే యీనాడు బాలు అనే గాయకుడు వుండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద యెంత నమ్మకమంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా లేదు. నా మొదటి పాట విజయా గార్డెన్స్ ఇంజనీరు స్వామినాథన్ గారితో చెప్పి ఆ టేప్ చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే వుంచేట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు స్టూడియోకి వచ్చినా, వారికి వినిపించి, అవకాశాలు యిమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి గారి ఋణం నేను తీర్చుకోలేను”. బాలుకి కోదండపాణి మీద ఎంతటి భక్తి ప్రపత్తులున్నాయో అని తెలుపేందుకే ఈ సందేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. తరవాత చంద్రశేఖర ఫిలిమ్స్ వారు నిర్మించిన ‘మూగజీవులు’ సినిమాలో బాలు పాడిన “దయలేని లోకాన” అనే పద్యాన్ని కోదండపాణి మహదేవన్ కు వినిపించగా ఆయన డి.బి. నారాయణ నిర్మించిన ‘ప్రైవేట్ మాస్టారు’ సినిమాలో “పాడుకో పాడుకో…పాడుతూ చదువుకో” అనే పాటను మహాదేవన్ సంగీత దర్శకత్వంలో బాలు చేత పాడించారు. యన్టీఆర్, నాగేశ్వరరావు లకు పాడే అవకాశాన్ని బాలుకి ఇచ్చింది కూడా మహాదేవనే. ‘ఏకవీర’ లో యన్టీఆర్ కు, ‘ఇద్దరు అమ్మాయిలు’ లో అక్కినేనికి మహాదేవన్ బాలు చేత పాడించారు.

బాలు తొలితరం గీతాలు…

‘ప్రైవేట్ మాస్టారు’ సినిమాలో బాలు పాడిన పాట తరవాత దర్శకుడు విశ్వనాధ్ సహకారంతో ‘సుఖ దుఃఖాలు’ సినిమాలో “మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు”, “అందాలు చిందే ఆకళ్ళలోనే బంగారు కలలే దాగున్నవి” అనే పాటలు బాలుచేత కోదండపాణి పాడించారు. ప్రైవేట్ మాస్టారు లో బాలు పాడిన పాట విని బాపు-రమణలు ‘బంగారు పిచిక’ సినిమాలో బాలు చేత “ఒహోహో.. బంగారు పిచ్చికా”, “మనసే గని తరగని, గని తగ్గని గని” పాటలు పాడించారు. అసలు బంగారు పిచ్చిక చిత్రంలో బాలు హీరోగా నటించాల్సి వుంది. కారణాంతాలవలన ఆ అవకాశం చంద్రమోహన్ కు దక్కిందనేది వేరే విషయం. మహాదేవన్ ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో “రావమ్మా మహాలక్ష్మి రావమ్మా”, “చుక్కలతో చెప్పాలని”, “చాలులే నిదురపో జాబిలికూనా” పాటలు కూడా బాలుచేతనే పాడించారు. ఆ తరవాత పద్మనాభం నిర్మించిన ‘శ్రీరామకథ’ లో కోదండపాణి “రామకథ శ్రీరామ కథ” అనే టైటిల్ సాంగ్, “రాగమయం.. అనురాగమయం” పాటలు, మరికొన్ని పద్యాలు, శ్లోకాలు బాలు చేత పాడించారు. అలాగే కోదండపాణి సంగీత దర్శకత్వంలో ‘మంచి మిత్రులు’ సినిమాలో ఘంటసాలతో కలిసి “ఎన్నాళ్ళో వేచిన ఉదయం” పాటను బాలు పాడారు. ఈ పాటలన్నీ సూపర్ హిట్లుగా నిలవడంతో బాలుకు మరిన్ని సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ‘మహాబలుడు’ సినిమాలో “విశాల గగనంలో చందమామ”; ‘ఆస్తులు-అంతస్తులు’ లో “ఒకటై పోదామా ఊహల వాహినిలో” పాట; సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘టక్కరిదొంగ-చక్కనిచుక్కసినిమాలో “నడకలు చూస్తే మనసౌతుంది”, “కలలుగనే కమ్మని చిన్నారీ” పాటలు, ‘ముహూర్తబలం’ సినిమాలో మహాదేవన్ సంగీత సారధ్యంలో “బుగ్గ గిల్లగానే సరిపోయిందా” పాటలు బాలుకి మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఆ పరంపరలోనే సారథి స్టూడియోవారి ‘ఆత్మీయులు’ సినిమాలో “చిలిపి నవ్వుల నిను చూడగానే” పాటను సాలూరు రాజేశ్వరరావు బాలుచేత పాడించారు. ఆపై ‘జగత్ కిలాడీలు’ సినిమాలో “వేళ చూస్తే సందెవేళ… గాలి వీస్తే పైరగాలి” పాట, ‘మనుషులు మారాలి’ సినిమాలో “తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం”, “పాపాయి నవ్వాలి పండగే రావాలి” పాటలు, ‘బందిపోటు బీమన్న’ చిత్రంలో “నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ వుందో” పాట, ‘ఏకవీర’లో ఘంటసాలతో కలిసి “ప్రతిరాత్రి వసంత రాత్రి” పాట, మరికొన్ని పద్యాలు బాలు గళంలో మారుమోగాయి. దాంతో గాయకుడిగా బాలు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆవిధంగా 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన ఈ పాటలు ఇప్పుడు వింటుంటే యెంత వీనుల విందుగా, హాయిగా వుంటుందో చెప్పనలవికాదు.

ఆయిరం నిలవే వా…

ఒకరోజు బాలు ఎ.వి.యం స్టూడియోలో ఎల్.ఆర్. ఈశ్వరితో కలిసి ఓ యుగళగీతం పాడుతుండగా, షూటింగ్ గ్యాప్ లో బయటకు వచ్చిన ఎం.జి. రామచంద్రన్ కు ఆ పాట వినిపించింది. అది తమిళంలో తను నటించిన ‘నీరుం నిరుప్పుం’ తెలుగు వర్షన్ లోనిది కావడంతో ఎం.జి.ఆర్. నిశితంగా ఆ పాటను ఆలకించి మరుసటిరోజు బాలుని పిలిపించారు. తను తీయబోయే ‘అడిమై పెణ్’ భారీ చిత్రంలో “ఆయిరం నిలవే వా” పాటను బాలుచేత పాడించమని మహాదేవన్ కు చెప్పారు. మరో పది రోజుల్లో పాట రికార్డింగు ఉందనగా బాలుకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మరోవైపు ఈ చిత్ర సన్నివేశాలను చిత్రీకరించేందుకు జైపూర్ (రాజస్థాన్)లో 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో షెడ్యూలు తయారైంది. “ఆయిరం నిలవే వా” పాట చిత్రీకరణ కూడా అక్కడే ప్లాన్ చేశారు ఎం.జి.ఆర్. అయితే బాలు అనారోగ్యం విషయం ఎం.జి.ఆర్ కు తెలిసింది. బాలు మాత్రం తనకు అవకాశం చేజారినట్లే భావించారు. ఆ పాటను వేరెవరితోనో పాడించేసి చిత్రీకరణ జరిపివుంటారని ఊహించారు. కానీ, ఇరవై రోజులయ్యాక ఎం.జి.ఆర్ మేనేజరు బాలు వద్దకు వచ్చి “రిహార్సల్ కు రాగలవా” అని అడిగారు. “అనుకున్న పాట పోతేపోయింది మరొకటి దక్కిందేమో” అనుకొని సంతోషపడుతూ బాలు మహాదేవన్ ను కలిశారు. బాలు ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే “ఆయిరం నిలవే వా” పాటనే పుహళేంది బాలు చేత ప్రాక్టీసు చేయించడం, రెండ్రోజుల తరవాత ఆ పాట రికార్డింగు పూర్తవడం వంటి పనులు చకచకా జరిగిపోయాయి. బాలు సుశీలతో కలిసి “ఆయిరం నిలవేవా ఒరు ఆయిరం నిలవే వా… ఇదైవోరం సువై తేడా పుదు పాడల్ విళి పాడా పాడా” అంటూ హృద్యంగా పాటను ఆలపిస్తుంటే కొందరు రికార్డింగు గదిలోకి తొంగితొంగి చూస్తూ బాలు పాడే విధానాన్ని గమనిస్తున్నారు. బాలుకు తరవాత తెలిసింది… వారంతా ఎం.జి.ఆర్ తో సినిమాలు తీసే నిర్మాతలని. పాట రికార్డింగు పూర్తయ్యాక యమ్జీఆర్ నిర్మాతలతో మీటింగ్ పెట్టి, బాలుని తన నిర్మాతలకు పరిచయంచేసి “ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు. నేను నటించే మీ చిత్రాలలో ఇతనిచేత ఒక్క పాటైనా పాడించండి” అంటూ నిర్మాతలకు సందేశమిచ్చారు. బాలు యమ్జీఆర్ కు కృతఙ్ఞతలు చెబుతూ “సారీ సర్! టైఫాయిడ్ జ్వరం నన్ను మంచం మీద పడేసింది. నా వలన మీ షూటింగుకు అంతరాయం కలిగింది” అంటుంటే, ఎం.జి.ఆర్ స్పందిస్తూ ‘’ఈ పాట మూడు వారాలక్రితమే వేరే వారితో పాడించుకొని షూటింగు పూర్తి చేసేవాడినే. కానీ నువ్వు నాకు పాడుతున్నావని పదిమందికీ తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆ పాట వేరొకరు పాడితే, నీ పాట నచ్చలేదేమో అనే అపవాదు చోటుచేసు కుంటుంది. అది నీభవిష్యతుకు దెబ్బ. అందుకే జైపూర్ షూటింగ్ షెడ్యూల్ ని వాయిదావేశాను. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ భుజం తట్టారు. ఆ పాటకు తమిళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గాయకుని బహుమతి ప్రదానం చేసింది. విశేషమేమంటే ఈ సినిమాకు మహాదేవన్ సంగీత కర్తయినా, యమ్మెస్. విశ్వనాథన్ మాత్రం తన సంగీత విభావరిలో బాలు చేత ఈ పాటను తప్పక పాడించేవారు. అదీ బాలు పాడిన తొలి తమిళ పాట గొప్పదనం!

తుంబుర నాదమే…

స్వర్ణయుగ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడే అరుదైన అదృష్టం బాలుకు దొరికింది. పెండ్యాల సారధ్యంలో తొలిసారి బాలు ఒక పద్యం పాడారు. అది నచ్చి ‘మా నాన్న నిర్దోషి’ సినిమాలో పెండ్యాల బాలుచేత మూడు పాటలు పాడించారు. అవి “అలకలు తీరిన కన్నులు యేమనె ప్రియా” అనే హిట్ సాంగ్, “ఏమండి అబ్బాయిగారు ఎలా వున్నారు” అనే టీజింగ్ పాట, “నింగి అంచుల వీడి నేలపై నడయాడి” అనే గజల్ అద్భుతమైన పాటలు. ఆలాగే సత్యం సంగీత దర్శకత్వంలో ‘పాలమనసులు’ సినిమాలో బాలు పాడిన “ఆపలేని తాపమాయే అయ్యయ్యో” అనే తొలిపాట సినిమాలో చోటు చేసుకోలేదు. తరవాత సత్యం సినిమాలకు దాదాపు బాలు పాడిన పాటలే అధికం. తాతినేని చలపతిరావు దర్శకత్వంలో బాలు తొలిసారి పాడిన పాట ‘చిరంజీవి’ సినిమాలో “జీవితమెంతో తీయనిది” అనేది. అలాగే మాస్టర్ వేణు ‘అర్ధరాత్రి’ సినిమాలో “ఈ పిలుపు నీకోసమే” పాటను తొలిసారి బాలుచేత పాడించారు. ఆదినారాయణరావు ‘అమ్మకోసం’ సినిమాలో “గువ్వలా ఎగిరిపోవాలీ” పాటను, టి.వి.రాజు ‘నిండు హృదయాలు’ సినిమాలో మొదటి అవకాశమిచ్చి “మెత్తమెత్తని సొగసు” అనే పాట పాడించాక చాలా సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఇంకా సాలూరు రాజేశ్వరరావు, యం.యస్. విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్ నాయుడు, చక్రవర్తి, అశ్వత్థామ, రాజ్-కోటి, రాజన్-నాగేంద్ర, కీరవాణి, మణిశర్మ వంటి స్వర్ణయుగ సంగీత దర్శకులవద్ద బాలు కొన్ని వేల మరపురాని మధురమైన పాటలు పాడారు. అలా వివిధ భాషల్లో ముప్పై వేల పాటలకు పైగా పాడిన బాలు పాటలు పాడడం మానలేదు… మరణించేదాకా ఆ కంఠస్వరం అలా పాడుతూనే వుంది.

తొలిరోజుల్లో బాలు…

బాలు జూన్ 4, 1946 న తమిళనాడులో కోనేటమ్మపేట అనే గ్రామంలో జన్మించారు. ఆ గ్రామం ఇప్పుడు తమిళనాడులో ఉంది. నెల్లూరు పట్టణంలో తండ్రి సాంబమూర్తి నిష్టాగరిష్టుడైన హరికథా భాగవతార్. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శిస్తూ వుండేవారు. తల్లి శకుంతలమ్మ గృహిణి. బాలుకి చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి. సంగీతంలో బాలుకి తొలి గురువు తండ్రిగారే. ఐదేళ్ళ వయసులో బాలు ‘భక్తరామదాసు’ నాటకంలో తండ్రితో కలిసి నటించారు. ప్రాధమిక విద్యను నగరి గ్రామంలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసి, స్కూలుఫైనల్ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పుడు చదువులోనే కాదు, ఆటల్లోకూడా బాలు స్కూలులో ప్రధముడే. ఆ స్కూలులో పనిచేసే జి.వి. సుబ్రహ్మణ్యం అనే మాస్టారు బాలుచేత ‘చెంచులక్ష్మి’ సినిమాలో సుశీల ఆలపించిన “పాలకడలిపై శేషతల్పమున” అనే పాటను పాడించి టేప్ మీద రికార్డు చేసి వినిపిస్తుంటే తన గొంతును తానే వింటున్న బాలుకి అదొక మధురానుభూతిగా మిగిలింది. మరో మేష్టారు రాధాపతి గారి ప్రోత్సాహంతో ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘ఆత్మహత్య’, వంటి నాటికల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజిలో పి.యు.సి. చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో బాలుకి ఆ నాటకంలోని స్త్రీ పాత్రకు గళమిచ్చే అవకాశం వచ్చింది. తరవాత విజయవాడ ఆకాశవాణిలో తను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఒక లలిత గీతానికి బహుమతి కూడా లభించింది. పి.యు.సి. పరీక్షలు రాసి నెల్లూరు చేరుకొని బాలు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేశారు. ఆ బృంద సభ్యులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. తరవాత అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావడంతో అక్కడ వాతావరణం నచ్చక మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి నెల్లూరు వచ్చేశారు. ప్రత్యామ్నాయంగా మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్ విద్యకు సరిసమానమైన AMIE కోర్సులో చేరారు. ఒకవైపు చదువుకుంటూనే సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేశారు. ఇంజనీరింగ్ కోర్సు రెండవసంవత్సరం వచ్చేనాటికి బాలుకి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో “హ్యాపీ బర్త్ డే టు యూ” అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద కూడా దర్శనమిచ్చారు. తరవాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనలోని నటుడికి పదును పెట్టారు. ముఖ్యంగా ‘మిధునం’ చిత్రంతో బాలు నటన పరాకాష్టను చేరుకుంది.

మరిన్ని విశేషాలు…

శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడిన వారం రోజులకే ‘నక్కరే అదే స్వర్గ’ అనే కన్నడ సినిమాలో పాడే అవకాశం బాలుకి వచ్చింది. తమిళంలో ఎం.ఎస్. విశ్వనాథన్ బాలుచేత ‘హోటల్ రంభ’ అనే చిత్రంకోసం “అంతానోడు ఇప్పడి ఇరుందు ఎత్తనై నాలాచు” అనే పాటను తొలిసారి పాడించారు. దురదృష్టవశాత్తు ఆసినిమా విడుదలకునోచుకోలేదు.తరవాత ‘శాంతినిలయం’ చిత్రంలోసుశీలతో కలిసి “ఇయరకై ఎణ్ణుమ్ ఇల్లయ కణ్ణి” అనే పాటపాడారు. కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్ సారధ్యంలో ఒకేరోజు 21 పాటలు పాడి బాలు రికార్డు సృష్టించారు. అలాగే ఒకేరోజు తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి మరో రికార్డు సాధించారు. హిందీ సంగీత దర్శకుడు ఆనంద్ మిలింద్ కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాసు తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. బాలు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్… ఓ మంచి నటుడు కూడా. సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట ‘మన్మధలీల’ తెలుగు చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. తదనంతరకాలంలో కమల్ హసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, నాగేష్, కార్తిక్, రఘువరన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ వంటి నటులకు తన గొంతు ఎరువిచ్చారు. ముఖ్యంగా ‘దశావతారాలు’ చిత్రంలో కమల్ నటించిన ఏడు పాత్రలకు వైవిధ్యమైన గొంతుతో సంభాషణలు పలికిన తీరు అచ్చెరువుగొలిపింది. అన్నమయ్య, శ్రీ సాయి మహిమ చిత్రాల్లో డబ్బింగ్ చెప్పినందుకు బాలు ఉత్తమ డబ్బింగ్ కళాకారునికి ఇచ్చే నంది బహుమతులు గెలుచుకున్నారు. రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ‘గాంధి’ చిత్ర తెలుగు డబ్బింగ్ వర్షన్ లో గాంధి పాత్రధారి బెన్ కింగ్స్ లే కు గాత్రదానం చేసింది బాలు గారే. ఉత్తమ గాయకుడిగా బాలు ఆరు జాతీయ బహుమతులు అందుకున్నారు. అవి శంకరాభరణం (1979), ఏక్ దూజే కే లియే (1981), సాగరసంగమం (1983), రుద్రవీణ (1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్ (1995-కన్నడ), మిన్సార కణవు (1996-తమిళం). జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ‘మైనే ప్యార్ కియా’ చిత్రానికి ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో ఉత్తమ గాయకునికి ఇచ్చే ఫిలింఫేర్ బహుమతులు బాలుని ఏడు సార్లు వరించాయి. ఉత్తమ గాయకునిగా 18 నంది బహుమతులతోబాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ‘మయూరి’ చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో lనటనకు ప్రత్యేక జూరీ బహుమతి లభించింది. తమిళ చిత్రాల్లో ఆలపించిన పాటలకు నాలుసార్లు, కన్నడ సినిమాల్లో పాడిన పాటలకు మూడుసార్లు ఉత్తమ గాయకుని బహుమతులు కూడా బాలుకి దక్కాయి. రాజాలక్ష్మీ ఫౌండేషన్, సుర్ సేన్, అక్కినేని, లతామంగేష్కర్ జాతీయ బహుమతుల తోబాటు లెక్ఖలేనన్ని ఇతర బహుమతులు బాలుని వరించాయి. 2001 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి బాలుని సత్కరించింది. 2011లో పద్మభూషణ్ అవార్డును బాలు అందుకున్నారు. మరణానంతరం భారతప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.


-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap