పునఃసృష్టికి చిక్కిన ‘శ్రీకూర్మం’ కుడ్యచిత్రం

శ్రీకాకుళం జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శివారు జిల్లా. అయినప్పటికీ, మాధ్యమాల పుణ్యమా అని యాత్రీకుల ఇష్టాలను మళ్ళించి, ఉల్లములను ఆకర్షించి తన వైపుకు లాగుకుంటున్న ప్రాచీన క్షేత్రం శ్రీకూర్మం. ప్రముఖ పర్యాటక(భక్తి) కేంద్రం. అతి ప్రాచీనమైనది. విష్ణు భగవానుని రెండవ అవతారం కూర్మావతారం. సాగరమథనం వేళ కూర్మరూపునిగా వెలసిన విష్ణువుని భూమండలంపై కూర్మనాథునిగా కొలిచే ఏకైక ఆలయం శ్రీకూర్మం.
ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. సూక్ష్మంగా చెప్పాల్సి వస్తే ఈ యొక్క క్షేత్రాన్ని మిగతా ఆలయాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణ భక్తులు కూడా గుర్తించే విశేషమైన విశేషాలు ఎన్నో ఇక్కడ ఉండగా, చిత్రకళ ప్రేమికులను ఆకర్షించే ఓ ముఖ్యమైన విషయం ఈ దేవాలయ అంతర మండప గోడలపై దాగి ఉన్నది.

కుడ్యచిత్రాల(వాల్ పెయింటింగ్స్)ను మ్యూరల్ పెయింటింగ్స్ అంటారు. ఆంధ్రుడు గతాన్ని మరిచిపోయినా, చరిత్ర పుస్తకపుటల్లో చెరిగిపోయినా ఇప్పటికీ ఆ దేవాలయం లోపలి గోడలపై దర్శనమిస్తున్నాయి పూర్వచిత్రకారుల ప్రతిభాపాఠవాలను జ్ఞప్తికితెస్తూ. ఆ చిత్రకళా వైభవాన్ని మామూలు కళ్ళు 20% మాత్రమే చూడగలవు. చిత్రకారులుకు ఓ 40% గోచరమవుతుంది. అటువంటి ఆ చిత్రాలను జాగ్రత్త చేయాలన్నా; ఆధునిక ఛాయాగ్రాహకునికి కూడా దుస్సాధ్యమైన విషయం. ఆ కృషి రంజింప చేయలేని పరిస్థితి. కానీ, ఓ తూలిక (కుంచె) అందుకు పూనుకున్నది. దాని యజమాని ‘మంచెం’. మత్స్యపురి వాసి. పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రాబ్యాంకులో ఉన్నత పదవులు నెరిపి ఉద్యోగ జీవితానికి విరామం పలికాక, ఇంతటి సాహసానికి పూనుకుని చిత్రలేఖనాన్ని అవిశ్రాంతంగా కృషిచేసి ఆ కుడ్య చిత్రాల్లో దాగిన కళను స్పష్టపరచేలా, వెలుగు పరచేలా గ్రంథం ప్రచురించారు. ఇదంతా దైవప్రేరణగాక మరేమని చెప్పాలి. ఎందుకంటే సమాజానికి పట్టని, ఆదరణకునోచని ఓ రంగం చిత్రకళారంగం. ఆస్వాదనకు ప్రేక్షకుడు, ఆదరణకు పోషకుడు కరవు. చిత్రలేఖనం గూర్చి నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ మాటనే చెబుతాను.

మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు బాల్యం నుండి చిత్రలేఖనాన్ని మక్కువతో సాధన చేస్తున్న చిత్రకారుడు. ఒక పట్టభద్రుడైన చిత్రకారునికున్నంత గరిమ మంచెంలో ఉన్నది. జలవర్ణ క్షాళనం(వాష్ టెక్నిక్)పై మక్కువ అమితంగా ఉండటం వలన, ప్రముఖ చిత్రకారులు ఉల్చిగారిని గురువుగా ఆశ్రయించి మెళకువలను నేర్చారు. తన ప్రతిభాపాఠవాలతో గురు ప్రశంసాభినందనలను పలు సందర్భాల్లో అందుకున్నారు.
శ్రీకూర్మం కుడ్యాలపై నాటి చిత్రకారులు ఏ ఆదరణ లభించితే అంతటి ప్రయాసలకోర్చి చిత్రాలను చిత్రించారో తెలియదు. కానీ, ఈ పరుగుల ప్రపంచంలో మూడు సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి శ్రమించి 50 చిత్రాలను రూపొందించి, పుస్తకంగా ప్రచురించ గలిగారు. మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు చిత్రకళా ప్రపంచాన్ని తనవైపు త్రిప్పుకో గలిగారు.

గోడలపై చిత్రాలను చిత్రించే విధానం, రంగులు భిన్నమైనవి. అయితే రావు గారు ట్రాన్స్పరెంట్ రంగులను వాడడంలో దిట్ట. వాష్ టెక్నిక్ అనేది అతి ప్రాచీనమైన విధానం. నీటి రంగులను వేసిన తర్వాత ఆ పేపర్లో ఇంకిన ఆ రంగును ఎంత నిలుపుకోగలదో అంతే ఉంచి మిగతా రంగును వాటర్ వాష్ తో తీసివేయటం దీని ప్రత్యేకత. అలా లేయర్ పై లేయరు వేస్తూ ఆ చిత్రంలో వెలుగునీడలను తేల్చి, దృశ్యవాస్తవికతను ప్రదర్శించేందుకు చిత్రకారుడు శ్రమిస్తాడు. మంచెం గారు గొప్ప సాహసాన్ని బాధ్యతగా తీసుకొని, చిత్రరచనకు పూనుకొని కృతకృత్యులయ్యారు. అంతటితో ఆగక పుస్తకం రూపంలో అచ్చేసేందుకు పూనుకున్నారు.

ఈ కుడ్య చిత్రాలను పరిశీలించి, అవగాహహించుకుని, చర్చించి- సమగ్రమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి, ఎటువంటి సందేహాలు లేకుండా, మూలంలోని భావాన్ని రసజ్ఞతను ఇనుమడింప చేస్తూ, వీక్షకుల మనోఫలకాలకు హత్తుకునేలా, ఆస్వాదించేలా రూపొందించారు. క్రొత్త చిత్రాలను వేసిన చిత్రకారుడు ఏ నగరంలోనో; ఏ గ్యాలరీలోనో నాలుగైదు రోజులపాటు ప్రదర్శించినట్లయితే చిత్రాల ఆర్భాటం అంతటితో ముగిసిపోతుంది. కానీ, ఈ చిత్రాలు అలా కాదు. హిందూ భక్తుల, ఆంధ్రుల చిత్ర సంపదకు సంబంధించిన కీర్తిగరిమ… అంతా వీటిలో నిండి ఉంది. అందుకే చిత్రకారుడు ఓ అడుగు ముందుకు వేసి వ్యయప్రయాసలకు వెనుకాడక పుస్తక రూపంలో అచ్చు వేయించడం జరిగింది. ఆందుకు యావత్ ఆంధ్రావళి అభినందించి తీరాలి.

పుస్తకం సైజులోనూ (16X10 అంగుళాలు) వైవిధ్యం ఉన్నది. పొడవైన కుడ్యచిత్రాలను ప్రస్తుతించేందుకు చిత్రకారుడు కోరిక మేరకే పుస్తకాలంకార నిపుణుడు పూనుకొని ఉండి ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకం రూపకల్పనలో కళాసాగర్ గారి ప్రతిభ గోచరిస్తుంది. చిత్రకళ పుస్తకాలకు ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. వీరు పుస్తకానికి ఎంచుకున్న వర్ణాలు మెడికల్ రంగం విరివిగా వాడే లేలేత రంగులనే వాడారు. వర్ణ సాంద్రతను పాటించారు. పుస్తకాన్ని రంగుల్లో ఆర్ట్ పేపర్ పై అందంగా ముద్రించారు. మంచెం గారు శ్రీకూర్మం కుడ్యచిత్రాలకు వైద్యం జరిగినట్లుగా, స్వస్థత పొందిన రూపాలకు దర్పణంగా ఈ పుస్తకం నిలుస్తుందన్నది వారి భావనగా నా కనిపిస్తున్నది. ఆ గోడలపై చిత్రాలను భవిష్యత్ తరాల ముందు నిలిపేందుకే మంచెం గారు పునఃసృష్టికి పూనుకున్నారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన శ్రీకూర్మం కుడ్యచిత్రాలు ఈ పుస్తకం ద్వారా బహుళ ప్రజాదరణ పొందగలవు. ఆంగ్ల మాధ్యమంగా శిస్ట్లా వారి ముందుమాటలో వెలువడిన ఈ గ్రంథం ఖండాంతర యాత్రికులను ఇటకు ఆకర్షించగలదన్న విషయంలో సందేహము లేదు. వివిధ ఇతివృత్తాలతో అమరిన 42 మ్యూరల్ పెయింటింగ్స్ ను చూసి మగ్ధుడైనట్లుగాను, ఇంతటి అపురూపమైన ఈ చిత్రాలు దక్షిణ భారత చిత్రకళలకు ప్రాతినిథ్యం వహించే పుస్తకాలల్లో ఇప్పటివరకు కనిపించకపోవటం తనను ఆశ్చర్యాన్ని గురిచేసినట్లుగాను చెప్పుకున్నారు. అరుదుగా లభించే చిన జీయర్ స్వామివారి అనుగ్రహభాష్య వాక్యం ఈ పుస్తకానికి దొరకటం మరింత వన్నె తెచ్చింది.

ఇంతటి పుస్తకం అచ్చయ్యాక… “ఇంతకూ ఆ గోడలపై వెలసి, వెలిసిపోతున్న చిత్రాలను కాపాడాలన్న తపన, తలంపు సుబ్రమణ్యేశ్వర రావు గారు ఆ దేవాలయ అధికారుల్లో కల్పించ గలిగాడా?” అన్నది ఓ ప్రశ్నగా మిగిలినప్పటికీ, ఆంధ్ర రాష్ట్రంలో వాష్ టెక్నిక్ లో చిత్రాలను వేస్తున్న కళాకారులు చాలా అరుదుగా ఉన్నారు. నేటి తరం చిత్రకారులకు ఈ ప్రక్రియ అపరిచితంగా ఉండిపోయింది. ఆంధ్ర చిత్రకళ ఉద్యమం, ఉద్దీపన ఈ టెక్నిక్ తోనే మొదలైందన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన సత్యం. శ్రీకూర్మం కుడ్యచిత్రాల రూపకర్తల ఆత్మధారణ చేసిన మంచెం కుంచె ఆ యొక్క చిత్రకారుల ప్రతిభకు శాశ్వతత్వాన్ని ఇచ్చింది. చిరస్మరణీయుల్ని చేసారు. తననూ కృతార్థుణ్ణి చేసింది.

ఈ పుస్తకం చూసినవారు శ్రీకూర్మం వెళ్ళకమానరు. వెళ్లినవారు తమ యాత్ర ఇంత అసంపూర్ణంగా ముగిసిందా అన్న అసంతృప్తిలో పడిపోతారు. శ్రీకూర్మ క్షేత్రం తాబేలుకు మల్లే తలా, కాళ్లు, చేతులను దాచుకున్నట్లుగా ఈ చిత్ర సంపదను తనలో దాచుకున్నది. అరుదైన ఈ చిత్ర సంపదను మంచెం గారి కుంచె చలువతో మనమందరం వీక్షించగలుగుతున్నాం స్పష్టంగా. వీరు చేసిన చిత్రకళా సేవను నారాయణ సేవగా భావిస్తున్నాను. జన్మ ధన్యత గావించుకున్నారు. స్పష్టతను కోల్పోయిన ఆ చిత్రాల నుండి కడిగిన ముత్యాల్లాంటి చిత్రాలను తీర్చిదిద్దిన మంచెం గారు శతధా, సహస్రదా ప్రశంస పాత్రుడు.

సమీక్షకుడు: కవి-చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ
ప్రతులకు:
ఆర్టిస్ట్ : మంచెం సుబ్రమణ్యేశ్వర రావు
వెల: రూ. 360/-
మొబైల్: 89850 42227

1 thought on “పునఃసృష్టికి చిక్కిన ‘శ్రీకూర్మం’ కుడ్యచిత్రం

  1. వివిధ పనులతో నిరంతరం సందడిగా ఉండే కళాసాగర్ గారు ఇలా పుస్తకాలను, పుస్తక రచయితలను ఇతోదికంగా తన వంతు ప్రోత్సాహన్ని ఇలా చక్కగా అందిస్తూ, తన పాఠకులకులను అలరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap