తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి

మే 20 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా…

భారతదేశంలో కార్టూనింగ్ 20వ శతాబ్దపు ప్రారంభంలోనే మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కార్టూన్లను హాస్యాత్మకంగా తెలుగు శైలిలో వ్రాసిన ఘనత తలిశెట్టి రామారావుకే చెందుతుంది. ఆయన 1927 నుంచే ఈ రంగంలో పనిచేశారు. ఆయన శైలి అనేక మందిని ప్రభావితం చేసింది, మరియు తరువాతి తరాల కార్టూనిస్టులకు మార్గదర్శకంగా నిలిచింది.

రామారావు కార్టూనింగ్‌కు కొత్త రూపాన్ని పరిచయం చేయడమే కాకుండా, సమాజాన్ని ప్రతిబింబించే విశిష్టమైన శైలిని కూడా ఆవిష్కరించారు. ఆయన హాస్యచిత్రాలు చూసే వారిని నవ్వించడంతోపాటు ఆలోచించుకునేలా చేశాయి.

రామారావు 1906లో మే 20 న ఒరిస్సా లోని జయపురం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నపిల్లవాడైనప్పుడే తండ్రిని కోల్పోయారు. తల్లి దుస్తులు కుట్టుతూ ఆయన్ను పెంచింది. రామారావు తల్లి పనికి సహాయం చేయడంతో పాటు వినూత్నమైన, ఆకర్షణీయమైన నమూనాలు రూపొందించి కస్టమర్లను ఆకట్టుకునేవారు.

స్కూల్‌ నుంచే ఆయన కార్టూన్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. బ్లాక్‌బోర్డుపై బొమ్మలు గీయడం ద్వారా ఆయన తన ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చారు. చక్కని గీతలతో బొమ్మలు వేయగలిగిన రామారావు విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకూ ఇష్టమైనవారయ్యారు.

హెడ్‌మాస్టర్ డా. గిడుగు సీతాపతి తలిశెట్టి ప్రతిభను గుర్తించి, ఆయనకు విజువల్ ఆర్ట్స్ పట్ల ప్రోత్సాహం ఇచ్చారు. Oxberg సహా అనేక విజువల్ ఆర్ట్స్ పుస్తకాలు అందించి, వాటిలోని బొమ్మలను గీయాలని సూచించారు. లండన్‌ నుంచి దిగుమతి చేసిన పుస్తకాలు, మాసపత్రికలు చదవాలని కూడా ప్రోత్సహించారు. ఆ కృతజ్ఞతగా తలిశెట్టి, హెడ్‌మాస్టర్‌కి ఒక కారికేచర్ గీశి అందించారు.

స్కూల్ పూర్తి చేసి, ఆయన పర్లాకిమిడిలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, విజయనగరంలో డిగ్రీ చదివారు. అనంతరం జయపురం రాజు విక్రమదేవ వర్మ నుంచి ఆర్థిక సహాయం పొందుతూ మద్రాసులో న్యాయశాస్త్రం చదివారు.

లా చదువుతున్న సమయంలోనే రామారావు తన కళాకౌశలాన్ని మెరుగుపర్చడంపై కృషి చేశారు. అప్పట్లో దేశోద్ధారక రామారావుతో పరిచయం ఏర్పడి, వారి సహకారంతో భారతీ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ పత్రికల్లో కార్టూన్లు ప్రచురించగలిగారు. తరువాత రామారావు పర్వతీపురంలో న్యాయవాదిగా స్థిరపడ్డారు.

కార్టూన్లతో పాటు రామారావుకు రచనా నైపుణ్యం కూడా ఉంది. ఆయన అనేక వ్యాసాలు రాశారు, వీటిలో విజువల్ ఆర్ట్స్‌కి సంబంధించిన అంశాలు, హిందూ-బౌద్ధ కళల ప్రాముఖ్యత, అజంతా-ఏలూర్ల గొప్ప చిత్రాలు, శిల్పాలు మొదలైనవి సాధారణ పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా వివరించబడ్డాయి.

1931లో ఆయన “భారతీయ చిత్రకళ” అనే 208 పేజీల గ్రంథాన్ని రచించారు. ఇది తెలుగులో వెలువడిన మొట్టమొదటి కళాపరిశోధనా పుస్తకంగా చరిత్రలో స్థానం పొందింది.

సుభాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap