నీటిరంగుల మేటి సహజచిత్రకారుడు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 4

ముఖ్యంగా ముఖచిత్రాలు చూసి కొందరిని వార, మాసపత్రికలు కొనేలా చేసిన ప్రముఖ చిత్రకారుడు, భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు వడ్డాది పాపయ్య పౌరాణిక జానపద ఘట్టాలలోని అక్షరాలకు రూపాల నిచ్చి, వాటికి జీవంపోసిన చిత్ర బ్రహ్మ వడ్డాది పాపయ్య. అతి చిన్న నాటనే రాజారవివర్మ చిత్రించిన చిత్రాన్ని చూసి ప్రభావితుడైన పాపయ్య స్వాధ్యయనంతో మేటి చిత్రకారునిగా ఎదిగిన మేరు నగధీరుడు. పాపయ్య చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుతనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు, మన దేవీ దేవతా మూర్తులు ప్రధాన చిత్ర వస్తువులుగా ఉంటాయి. తన తొలినాట చిత్రాలను కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు వారి ఆంధ్ర పత్రిక, భారతి వంటి పత్రికలలో ప్రచురించారు. తరువాత పాపయ్య రేరాణీ, మంజూషా, అభిసారిక వంటి పత్రికలలో చిత్రాలు గీశాడు. పాపయ్య చిత్రకారుడే కాకుండా చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన దేవి భాగవతం కథలు వ్రాసి విష్ణుకథ అనే పౌరాణిక ధారావాహికను కూడా వ్రాసి, వాటికి తగిన బొమ్మలు వేసి తన బహుముఖ ప్రజ్ఞను చాటిన ఈ తెలుగు చిత్ర చింతామణి సన్మానాలకు, సత్కారాలకు దూరంగా ఉండే చిత్రకారుడు నిరాడంబరుడు వడ్డాది పాపయ్య నేటికీ మన ధృవతార.

(వడ్డాది పాపయ్య జన్మదినం సెప్టెంబర్ 10, 1921)

SA: