
“విహారి” గారి కలం నుంచి వెలువడిన మరో అనర్ఘ రత్నం. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, సమాజంలోని పరిస్థితులు, సమాజం లోని జీవనం నుంచి ఉదాహరణల ద్వారా ఏమి నేర్చుకోవాలి “విహారి” గారి “వ్యక్తిత్వ పథం” శతకం ద్వారా తేట తెలుగులో ఉదాహరణలతో తెలియచేసారు.
108 పద్యాలు ఈ పుస్తకంలో కొన్ని “నది”,”తెలుగు విద్యార్థి” మాసపత్రికలలో వచ్చాయి. అవన్నీ కూర్చి, గుదిగుచ్చి ఒక పుస్తకంగా వచ్చింది.
ప్రతి ఉషోదయంలో వచ్చే తొలి సంధ్యలా ఒక నూతన భావా విష్కరణ మనసులో జరుగుతుంది అంటారు.
ఉత్తమ వాంఛలు వెయ్యి ఉండి ఉపయోగం ఏమిటి?
ఆచరణలో పెట్టిన ఒక్క నిర్ణయం మేలు. నిత్య సంతోషి ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటాడు అంటారు. తన పద్యంలో, చీమల పుట్ట నుంచి తగిన శ్రమ ఫలితం ఏమిటి నేర్చుకోవాలి,ఇది బ్రతుకు చదువు అంటారు. కాయ తీగకు భారము ఎప్పటీకీ కాదు, కోతీ తల్లీబిడ్డలను చూసి నేర్చుకోవాలి. ఏమిరా!, అన్ని పిలుపు ఎంతో హాయిగా, ఆత్మీయంగా ఉంటుంది.
గొప్ప వాళ్ళ చరిత్ర లే మనకు పాఠాలు, అంటూ గిరిధర్ కుచేల స్నేహం, రాజేంద్రప్రసాద్ గారిని, బుద్ధుడి గురించి గుర్తు చేశారు. నటన లేకుండా జీవించు మంచి నడత మేలు మనిషికి అంటారు ఓ పద్యం నందు, జీవనానికి కావలసిన అవకాశాలు వాటంతటవే రావు, మనమే వెతికి పట్టుకొని సాధించాలి, ఇది జీవనం విధానం అని తెలిపారు.
పర్యావరణ కాలుష్యము గురించి, మనిషి జీవితానికి దాని వలన జరిగే అపకారం గురించి హెచ్చరించారు.
అవకాశవాదం, మదము వల్ల మంచి ధ్వంసం అవుతుంది, అగ్నితో గాలి చేరితే ఏమవుతుంది ఉదాహరణగా చెపుతారు. సత్యం శివం సుందరం అయిన ఆలోచనలు, ఆచరణకు ఆహ్వానం సమాజంలో ఉంటుంది, దీనికి మహిత వ్యక్తిత్వం ఉన్న హనుమంతుడు ఉదాహరణ గా తీసుకోవాలి అంటారు.
భూత దయ,కరుణ కడదాకా మనిషిని నిలబెడుతుంది. శీలము పతనం అయితే వంశీ నాశనమే కాదు,జాతి నాశనం కూడా జరుగుతుంది అంటారు.
“బ్రతుకు చదువది వ్యక్తిత్వ పథము జూపు” అనే చివరి పాదంతో ఎన్నో జీవన ధర్మాల పాఠాలను ఉదాహరణలతో చెప్పారు. భవిష్యత్ తరాలకు మంచి పుస్తకంగా ఈ శతకం ఉపయోగ పడుతుంది అని చెప్పవచ్చు. ఈ శతకం వేమన, సుమతీ శతకాలు దీటుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
మంచి శతకం సాహిత్యం అందరి అలమరాలో ఉండాల్సిన పుస్తకం.
-శిరిపురపు అన్నపూర్ణ
ప్రతులకు: వ్యక్తిత్వ పథం (శతకం)
రచయిత: విహారి
వెల: రూ. 60/-
మొబైల్: 98480 25600