“AP లోక్ సభ & శాసనసభలో ఎవరెవరు?”

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా “ఎవరెవరు?” పుస్తకావిష్కరణ

జర్నలిస్ట్ మారిశెట్టి మురళీ కుమార్ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంధకర్త మురళీ కుమార్ ను అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ… ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు.

ఈ పుస్తకంలో ఏముంది:
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో ఎవరు ఎప్పుడు విజయం సాధించారు? వారు ఏ పార్టీ, ఏ సామాజిక వర్గాలవారు, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల శాతం వంటి సమాచారంతో చక్కటి విశ్లేషణలను “ఆంధ్రప్రదేశ్ లోక్సభ & శాసనసభలో ఎవరెవరు?” అనే ముఖ శీర్షికతో రూపొందించిన పుస్తకం రాజకీయాలలో ఆసక్తి ఉన్నవారికి, రాజకీయ ఔత్సాహికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 1952 నుంచి 2019 వరకూ జరిగిన ఎన్నికలలో విజేతలైన శాసనసభ సభ్యుల, లోక్ సభ సభ్యుల ఫోటోలతో కూడిన సమాచారాన్ని అక్షరబద్ధం చేశారు జర్నలిస్ట్ మారిశెట్టి మురళీ కుమార్.

డబ్భై ఏళ్ళ కాలంలో అంధ్ర ప్రాంతంలో 15 విడతలుగా జరిగిన ఎన్నికల సరళిని, గెలుపొందిన ప్రజా ప్రతినిధుల వివరాలను, ఫోటోలను సేకరించడం అంత సులువైన పనికాదు. ఇందుకు ఈ గ్రంథ కర్త అనేక పుస్తకాలను, పత్రికలను, ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ ను అధ్యయనం చేసి గతంలో వచ్చిన పుస్తకాలకు భిన్నంగా రూపొంచించడంలో మురళీ కుమార్ విజయం సాధించారని చెప్పవచ్చు. మూడు వేలకు పైగా ప్రజా ప్రతినిధుల  ఫోటోలు పొందుపరిచారు ఈ పుస్తకంలో. 456 పేజీలతో 1/4 డెమ్మీ సైజులో ఆర్ట్ పేపర్ పై రంగుల్లో అందంగా ముద్రించిన ఈ పుస్తకం అందరికీ ఉపయుక్తంగా వుంటుంది.

ఈ సమాచారం ఎవరికి అవసరం? అనే ప్రశ్న కూడా ఉదయించవచ్చు. ఓటు వేసే ప్రతి వ్యక్తికి ఈ సమాచారం ఖచ్చితంగా అవసరమే. నేడు రాజకీయ సమీకరణాలన్నీ సామాజిక వర్గ ప్రాతిపదికనే జరుగుతున్నాయి. ఏ కులం అభివృద్ధి అయినా, రాజ్యాధికారంలో అది సాధించుకున్న వాటాను బట్టే ఉంటుందన్నది మన కళ్లకి కనిపిస్తున్న వాస్తవం. రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయన్న డా. బి.ఆర్. అంబేద్కర్ మాటల్లో నిగూఢార్థం కూడా ఇదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన స్థానమేంటి? మన ఉనికిని కాపాడుకోవడానికి మన కార్యాచరణేమిటి? అని విశ్లేషించుకోవడానికి… భూత, వర్తమాన రాజకీయాలను ఆకళింపు చేసుకుని, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంతటి ప్రయోజనకర పుస్తకాన్ని అందించిన రచయిత, ప్రచురణ కర్తలు అభినందనీయులు.

-కళాసాగర్ యల్లపు

పేజీలు: 456, వెల : రూ.750/-

ప్రతులకు : 9848353503

SA:

View Comments (2)

  • A very good information is colleged by Sri Marisetty Murali Kumar. It is very much useful for every politician and journalists as well as who wants to learn polity. But, the price is not sweet.

  • చక్కగా విశ్లేషించారు