నవరసభరితం నాటకం నాటకం

మార్చి నెల 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం – సందర్భంగా ప్రత్యేక వ్యాసం…
జీవకళ, జీవితాన్ని ప్రతిబింబించే కళ మాత్రమే కాదు. సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. అందుకే ఎన్ని సార్లు ఆడిన నాటకమయినా, ఎంతటి గొప్ప సంస్థ కళాకారుడికైనా, ఎంతటి ప్రయోక్తకైనా, ప్రతి ప్రదర్శన ఓ అగ్ని పరీక్షే, రంగస్థలానికి ముందు వుండే కళాకారులకి, వెనక వుండే సాంకేతిక నిపుణులకి సమన్యయంతో ఆవిష్కరించే నిత్య సజీవకళ నాటకం. అందుకే జీవితానికి దర్పణం నాటకం సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ వారిలో చైతన్యాన్ని కలిగించే ప్రచార సాధనం నాటకం.

సాహిత్య ప్రక్రియలలో నాటకరచన కష్టమైంది, క్లిష్టమయింది. రచయిత స్రష్ట అయితే నటుడు ఆ భావాన్ని వ్యక్తపరిచే వ్యాఖ్యాత అవుతాడు. నాటకం సర్వజనామోదకరమైనప్పుడు, అది రసానంద జనకమవుతుంది. నాటక ఇతివృత్తం సాంఘికమయినా, పౌరాణికమయినా, చారిత్రాత్మకమయినా, దాని అంతిమలక్ష్యం సమాజశ్రేయస్సేనని చెప్పకతప్పదు.
అందుకే, రంగస్థల అభివృద్ధికోసం, కళాకారుల సంక్షేమం కోసం ప్రతిసంవత్సరం మార్చి 27వ తారీఖునాడు ప్రపంచ వ్యాప్తంగా “ప్రపంచ రంగస్థల” దినోత్సవాన్ని జరుపుకుంటారు. పారిస్ లోని “ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్” వారు మార్చి నెల 27వ తారీఖు “ప్రపంచ రంగస్థల దినోత్సవంగా” నిర్దేశించారు. ఈ రంగస్థల దినోత్సవాన్ని మొట్టమొదటి సారిగా యునెస్కో ఆధ్వర్యంలో 1962 లో జరిపారు. రంగస్థల కళాకారులు, నాటక రచయితలు, ప్రయోక్తలు, సాంకేతిక నిపుణులు మొదలయినవారు భక్తి శ్రద్ధలతో ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతుల్ని, అలవాట్లని, సమస్యలని అందరికి అర్ధయమ్యే రీతిలో నాటక రచన ద్వారా, ప్రదర్శన ద్వారా ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నాటకం అతిశక్తి వంతమయిన సాధనం. నాటక ప్రదర్శన ద్వారా ప్రతిబింభించే సమస్యలు ప్రజల మనస్సులలో నాటుకుపోతాయనడం నిర్వివాదమయిన విషయం. ఈ రోజు కళాకారులంతా ఒక చోట చేరి నాటక రచనల గురించి, ప్రదర్శనా రీతుల గురించి, నాటకశాలల గురించి, కళాకారుల సంక్షేమం గురించి కూలంకషంగా చర్చిస్తారు. ఈ దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని రంగస్థల ప్రముఖులలో ఒకరు తమ సందేశాన్ని అందిస్తారు. అలా మొట్టమొదటి సందేశం ఫ్రాన్స్ కి సంబంధించిన రంగస్థల ప్రముఖులు జీన్ కోనిటో పంపారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వివిధ దేశాల రంగస్థల అనుభవనీయులు తమ సందేశాన్ని పంపిస్తున్నారు. ఈ సందేశాన్ని అన్ని దేశాలు తమ తమ భాషల్లోకి తర్జుమాచేసి, రంగస్థల కళాకారులికి అందిస్తారు. ఆ సందేశాల్లోని సారాంశం ఏమిటంటే
“రంగస్థలం ఒక శక్తివంతయిన ప్రక్రియ. నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి సాధనం నాటకం. నాటకం ఒక సంఘటన మాత్రమే కాదు. అదొక జీవన విధానం. మనమంతా రంగస్థల కళాకారులం. పౌరుడిగా సమాజంలో జీవించడం మాత్రమే కాదు. దాన్ని మార్పు చేయడం మన కర్తవ్యం.
ఈ మార్పు నాటక ప్రక్రియ వల్లే సాధ్యపడుంది. నాటకంలోని సంఘటనలు మనల్ని ఏడ్పిస్తాయి. మనల్ని నవ్విస్తాయి మనల్ని ఆలోచింపచేస్తాయి.
నాటకంలో మనకి కనిపించే నటులు మాత్రమే కాదు తెరవెనుక మనకి కనపడని అనేక మంది సాంకేతిక నిపుణులు వుంటారు. వీళ్ళందరి సహకారం, నైపుణ్యం వల్లే నాటక ప్రదర్శన విజయవంతమవుతుంది. ఈ సందేశాలు మన రంగస్థల కళాకారులికి స్ఫూర్తినివ్వాలి.
దాని ఆధారంగా మనం మంచి సందేశంతో కూడిన నాటకాలు ప్రదర్శించాలి. అందుకే ఈ రోజు రంగస్థల కళాకారులందరూ ఒక చోట సమావేశమై, రంగస్థలానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించుకోవాలి. నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని నాటకాలుగా రచించి ప్రదర్శిస్తే, ప్రేక్షకులు చైతన్యవంతులౌతారు. మనసులో దాగివున్న మనోభావాలను వ్యక్తపరిచే సాధనం రంగస్థలం. నాటకం అనేక సమస్యలకి శక్తివంతమయిన ప్రక్రియ. సుశిక్షితులైన నటీనటులు, రంగస్థలాలు, రంగస్థల సామాగ్రి, వేషభాషలు, విద్యుద్దీపనం లాంటి సమస్యలని అధిగమిస్తూ ఈ ప్రక్రియ ద్వారా నాటక కళారూపానికి జీవంపోస్తున్న కళాకారులందరూ ధన్యులు.
మన వైతాళికులు కందుకూరి (వ్యవహార ధర్మబోధిని) గురజాడ (కన్యాశుల్కం) నాటకాన్ని ఓ అస్త్రంగా సంధించి, సమాజంలో కుళ్ళును కడిగేందుకు రాచబాట వేసారు. సాంఘిక నాటక ఆవిర్భావమే అలా సంస్కరణలతో ప్రారంభమయింది. సమాజ పరిణామంలో ఇదో పెద్ద మలుపు. అటువటి నాటకాలు చూడటం. ఆడటం, ఆడించడం, ఉత్తమ సంస్కారంగా సమాజంలో చలామణి అయింది. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత సాంఘిక నాటకం ప్రగతిశీల భావాలతో అలా పరవళ్ళు తొక్కింది.

నాటకానికి సాహిత్యమే పునాది. నాటక రచన క్లిష్టమైనది. కష్టమైనది. ‘నాటకాంతం హి సాహిత్యమ్’ అన్నారు కదా పెద్దలు. గాఢమైన జీవితానుభవము, లోకానుభవము, ప్రాపంచిక జ్ఞానము. కవితాత్మ లేనిదే నాటక రచన చిక్కపడదు.
రచయిత నాటకం ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయంపై విశ్వాసం, పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలపై సహేతుక విశ్లేషణ, ప్రదర్శన, గమనం, గమ్యంపై స్పష్టమైన అవగాహన వుండాలి. ప్రదర్శనాంతరం ప్రేక్షకులపై పడే ప్రభావం ముందుగానే రచయిత గురైరగాలి. ప్రేక్షకులకు జవాబుదారి వహించాలి. అంటే నాటక రచనను సామాజిక బాధ్యతగానే పరిగణించాలి.
తెలుగు నాటకరంగం తొలిదశ ఈ నాటికి నూట ఇరవై అయిదేళ్ళు దాటింది. 1900 సంవత్సరం నాటికి తెలుగు నాటక రచన, తెలుగు నాటక రంగం పూర్ణవికాసం పొందుతూ వున్నాయి. గురజాడ అప్పారావు గారు “కన్యాశుల్కం” నాటకం రచించి, తెలుగు నాటక రంగంలో ఒక నూతనోత్తేజాన్ని కలిగించారు. ఈ నాటకం రాసి 125 ఏళ్ళు దాటినా ఆ పాత్రలు, ఇప్పటికీ సజీవ పాత్రలే. ఆనాటి సమస్య ఇప్పుడు లేకపోయినా, గురజాడ వారి నాటక శైలి, పాత్ర పోషణ, భాషా ప్రయోగం ఈ రోజుకి కూడా మనకి కొత్తగానే వుంటుంది.
బళ్ళారి రాఘవ నాటక రంగంలో నూతన విప్లవాన్ని తీసుకువచ్చారు. పాత పద్ధతులకి స్వస్తి చెప్పి నాటకరంగంలో కొత్త పోకడల్ని ప్రవేశపెట్టారు. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న విప్లవాత్మకమైన మార్పున్ని ప్రవేశపెట్టారు.
నాటకానికి కావల్సింది క్రమశిక్షణ, ఏకాగ్రత, శ్రద్ధ ఇవన్నీ లేనినాడు నాటక ప్రదర్శన రక్తి కట్టే అవకాశం లేదు. మరి ఆనాటి నటీనటులందరూ ఈ గుణాలన్నీ పుణికి పుచ్చుకున్నారు కనుకనే, ఆనాటి నాటకాలు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచివున్నాయి.
ఒక నాటకం రక్తి కట్టాలంటే, నటీనటులు, మొత్తం నాటకాన్ని ఆమూలాగ్రంగా చదివి కృషి చెయ్యాలి. త్యాగం, అకుంఠిత కృషి, చిత్తశుద్ది వుండాలి. అదుకే తన పాత్రకి తగ్గట్టుగా డైలాగ్ అభ్యాసం చెయ్యాలి. డైలాగులు పలకవలసిన రీతిలో పలకలేకపోతే, నాటకం అభాసు పాలయ్యే అవకాశముంది. అందుకే ఎక్కువసార్లు రిహార్సల్స్ చెయ్యాలి.
రచయిత, దర్శకుడు, నటుడు, ప్రేక్షకుడు నాటకానికి నాలుగు స్థంభాలు ఎటువంటి నాటకానికైనా ఈ నాలుగు స్థంభాలు చాలా ముఖ్యమైనవి. గత కాలంలో నాటకాన్ని తపస్సుగా భావించి దీక్షతో, క్రమశిక్షణతో తయారుచేసేవారు. ఆ నాటకాన్ని వీలైనన్నిసార్లు ప్రదర్శించేవారు. నాటకాన్ని కొన్ని నెలల తరబడి రిహార్సల్స్ చేసి పకడ్బందీగా తయారుచేసేవారు. నాటకం పట్ల వారికున్న అవగాహన, ఏకాగ్రత, శ్రద్ధతో మన నాటకరంగాన్ని నమ్ముకున్న నటీనటులు సినీ రంగంలో కూడా ప్రముఖులుగా ఉన్నారు.
అయితే, ఈనాటి నాటక రంగం గతకాలం వైభవంలా లేదు. ఈనాటి ఔత్సాహిక నాటకరంగాన్ని పరిషత్తులు పోషిస్తున్నాయి. ప్రేక్షకసంఘాలు కొన్నేళ్ళుపాటు నాటకానికి వెన్నుముకగా ఉండేవి. ఒక నాటకం తయారుచేస్తే, అన్ని ప్రేక్షక సంఘాలు ఆ నాటకాన్ని ప్రదర్శింపచేయడానికి ఆరాటపడేవి. కానీ, ఇప్పుడు ప్రేక్షక సంఘాలు తక్కువయ్యాయి.
నాటకాలను ఆదరించే వారూ తక్కువయ్యారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ – 1929 తెనాలిలో ప్రారంభమయిన ఆంధ్ర నాటక కళాపరిషత్ తెలుగు నాటకానికి జీవనాడి. మన రాష్ట్రంలో జరిగే అనేక పరిషత్తులకు మార్గదర్శి.
ఈ పరిషత్తు నిర్వాహకుల మీద ఇంకొక బాధ్యత ఉంది. ఈ పరిషత్తుల్లో ప్రదర్శించే నాటికల్ని, నాటకాల్ని చూసి ఈనాటి యువతరం ఇదే కాబోలు మన నాటక రంగం ఆనుకునే ప్రమాదం కూడా ఉంది. తెలుగు నాటకరంగానికి మరపురాని చరిత్ర వుంది. ఎన్నో గొప్ప నాటకాలను అప్పటి రచయితలు మనకు అందించారు. మనకు మంచి ప్రయోక్తలు, నటీనటులెందరో వున్నారు. గత వైభవం ఈనాటి తరానికి తెలియదు. అందువల్ల పరిషత్ నిర్వాహకులు సంవత్సరంలో రెండో, మూడో పాత నాటకాలను ఎంపికచేసి ప్రదర్శింపచేయాలి. పాత నాటకాలను ఈ తరానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాకుండా నాటకరచన, నాటక ప్రదర్శనారీతులు, ప్రయోగాల మీద కృషి చేసిన నటులు, రచయితలు, ప్రయోక్తలు మనకు ఎందరో వున్నారు. వాళ్ళ గురించి తెల్సుకోవాల్సిన అవసరం ఈ నాటి యువతకి ఎంతోవుంది. అప్పుడే మన నాటక రంగంపై అవగాహన, ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మన నాటక రంగం ఇంకా మరింత ముందుకు పోవాలంటే?

1. గుర్తింపు పొందిన నాటక సమాజాలకు కర్టెన్సు, మేకప్ సామాగ్రి కొనుక్కోడానికి ఆర్ధిక సహాయం ప్రభుత్వం అందించాలి.
2. నట శిక్షణాలయాలు రాష్ట్రంలో ముఖ్యమైన ప్రదేశాల్లో నెలకొల్పాలి. నాటక రంగానికి యువతని పరిచయం చెయ్యాలి. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ వారి సహకారంతో నాటకంలోని వివిధశాఖల గురించి వర్కుషాప్స్ నిర్వహించాలి.
3. ప్రేక్షక సంఘాలను పునరుద్ధరించాలి.
4. నాటకాలను ప్రదర్శించే వీలుగా రంగస్థలాల్ని నిర్మించాలి. నాటక సమాజాలకు రిహార్సల్స్ రూమ్ ప్రతి నగర పాలక సంస్థ ఉచితంగా ఏర్పాటు చెయ్యాలి.
5. తెలుగు నాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అకాడెమీలను పునరుద్ధరించాలి. తద్వారా కళాకారుల సంక్షేమానికి అడుగులు వేయాలి.
6. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో సదస్సులు ఏర్పరచి, నాటకరంగ ప్రముఖులచేత ఉపన్యాసాలు ఇప్పించి యువతలో ప్రేరణ కలిగించాలి.
7. నాటకాలు ఊరికే చూపించకుండా ప్రేక్షకులు టిక్కెట్టుకొని చూసే సంస్కృతి అలవాటు చెయ్యాలి.
విశ్వవిద్యాయాలలో నాటకానికి ప్రత్యేకమయిన విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. ఈ సౌకర్యం ప్రస్తుతం ఆంధ్రాయూనివర్శిటి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్శిటి, తెలుగు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే వుంది. నవ్వాంధ్ర రాజధానిలో వున్న నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా ఈ సౌకర్యం కలిగిస్తే ఇక్కడున్న కళాకారులికి ఉ పయోగకరంగా వుంటుంది.
ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మనం పేర్కొన్న విషయాలు అమలుపరిస్తే, మన నాటక రంగం అగ్రగామియై నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
-పాండురంగ
మాజీ సంచాలకులు, ఆకాశవాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap