
‘రహస్యం’ సినిమాలో గిరిజా కళ్యాణ యక్షగానం పూర్వపరాలు
ప్రైవేటు పాటగా తొలిసారి…
1963 ప్రాంతంలో హైదరాబాదు శంకరమఠంలో కంచికామకోటి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు గానగంధర్వులు ఘంటసాల కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవ నిర్వాహకుల అభ్యర్థన మేరకు ఘంటసాల ‘గిరిజా కల్యాణ యక్షగానం’ ఆ సందర్భంగా ఆలపించడం జరిగింది. తన సహకళాకారులైన తిరుపతి రాఘవులు, పట్రాయని సంగీతరావు గాత్ర సహకారం అందించగా, ఉలిమిరి లలిత్ ప్రసాద్, సంగీతరావులు వరసగా తబలా, హార్మోనియం మీద వాద్య సహకారం అందించారు, అప్పుడు హైదారాబాదు ఆకాశవాణి వారు ఈ గిరిజా కళ్యాణ యక్షగానాన్ని రికార్డు చేశారు. అయితే స్టూడియో రికార్డింగు కాకపోవడంతో ఈ ధ్వని ముద్రణలో నాణ్యత కాస్త లోపించింది. ఈ ప్రదర్శనకు ముందే ఘంటసాల గిరిజా కల్యాణాన్ని మద్రాసు పుష్పగిరి పీఠాధిపతి సమక్షంలో గానం చేశారు.
యక్షగాన నేపథ్యం…

లలితా శివజ్యోతి బ్యానర్ మీద ప్రతిష్టాత్మక ‘లవకుశ’ చిత్రాన్ని నిర్మించిన శంకరరెడ్డి తదుపరి ప్రయత్నంగా ‘రహస్యం’ (1967) చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య స్వయంగా కూచిపూడి భాగవతులు కావడంతో అందులో ‘గిరిజా కళ్యాణం’ యక్షగానాన్ని నృత్య ప్రదర్శనగా చేర్చారు. తెలుగు సినీ కవికుల గురువు మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ యక్షగానాన్ని రచించగా ఘంటసాల ఆ యక్షగానాన్ని ఒక సంగీత జలపాతంలా మలిచారు. ఈ పాటలో ఘంటసాలకు మల్లిక్, రాఘవులు, సుశీల, లీల, కోమల, వైదేహి, సరోజిని, పద్మ గాత్ర సహకారం అందించగా వేదాంతం రాఘవయ్య సూత్రధారునిగా నటించడం విశేషం. నిజానికి మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ గిరిజా కళ్యాణం ఘట్టాన్ని ‘ఉషాకల్యాణం’ అనే సినిమాకోసం రాశారు. అయితే ఆ సినిమా నిర్మాణం ఆగిపోగా ఈ యక్షగాన గేయం మల్లాది వద్దే వుండిపోయింది. ఆ తరవాత 1963 ‘జ్యోతి’ మాసపత్రిక ఆగస్టు సంచికలో ఈ గేయం ‘కేళీగోపాలం’ శీర్షికన ప్రచురితమైంది. ఆ తరవాత 1967లో మల్లాది ‘కేళీగోపాలం’ పేరిట నాలుగు రూపకాలు వున్న పుస్తకాన్ని ప్రచురించి, ‘గిరిజా కళ్యాణం’ ఘట్టాన్ని అందులో ఒక భాగంగా చేర్చారు. గిరిజా కళ్యాణం రూపకంలో కొద్ది మార్పులు చేసి ‘రహస్యం’ చిత్రంలో దర్శకుడు వేదాంతం రాఘవయ్య ప్రవేశపెట్టారు.
యక్షగాన ఇతివృత్తం…
పార్వతీదేవి (గిరిజ) హిమవంతుని కుమార్తెగా జన్మించి పరమశివుని భర్తగా పొందాలని తన సేవలతో శివుని ఆరాధిస్తుంది. తారకాసురుడు అనే అసురుని సంహరించేందుకు పరమశివుడు తపోనిష్టలో వుంటాడు. శివుని తపోభంగం చేయమని దేవేంద్రుడు ప్రణయానికి అదిదేవుడుడైన మన్మధుని ఆదేశిస్తాడు. శివుని సేవలోవున్న పార్వతీదేవికి సహాయం చేస్తానంటూ మన్మధుడు ముందుకొస్తాడు. కానీ గిరిజామాత అతణ్ణి వారిస్తుంది. అయినా వినకుండా దేవేంద్రుడు చెప్పినట్టు మన్మధుడు శివుని మీదకు పూలబాణం విసరి తపోభంగం కావిస్తాడు. శివుడు కోపోద్రిక్తుడై కణకణలాడే నిప్పులు చిందే మూడవ కన్ను తెరచి మన్మధుని భస్మం కావిస్తాడు. రతీదేవి ప్రార్థించగా శివానుగ్రహ ఫలితంగా మన్మధుడు పునరుజ్జీవం పొందుతాడు. అయితే మన్మధుడు తన భార్య రతీదేవికి మాత్రమే అగుపిస్తాడని, ఇతరులకు రూపం లేకుండా కనిపిస్తాడని శివుడు శాపాన్ని సవరిస్తాడు. పూర్వం ద్రాక్షాయణి రూపంలో అగ్నిప్రవేశంచేసిన గిరిరాజతనయను పరిణయమాడడంతో యక్షగానం ముగుస్తుంది.
కూచిపూడి యక్షగానం… సాహిత్య, సంగీత విశేషం…
ఈ కూచిపూడి నాట్య కళలో భాగవతులు (సూత్రధారులు) వాద్యమేళాలతో ఆరంభం నుంచి మంగళాశాసనం వరకు వివిధ రాగాలలో పాడుతూ, వచన ప్రక్రియ ద్వారా వివరణ ఇస్తూ యక్షగానాన్ని ప్రదర్శించడం పరిపాటి. సాధారణంగా ఈ యక్షగాన ప్రదర్శనలకు కొన్ని గంటల సమయం పడుతుంది. కొన్నిసార్లు తెల్లవారేదాకా ఈ ప్రదర్శన జరగడం కద్దు. అయితే ఈ యక్షగానాన్ని ‘రహస్యం’ చిత్రంలో కొన్ని నిమిషాలపాటు మాత్రమే ప్రదర్శించి రక్తికట్టించడం మల్లాది, వేదాంతం వారల గొప్పతనంగా చెప్పుకోవాలి. ఘంటసాల ఈ యక్షగానానికి సంగీత రూపమిచ్చిన తీరు ఆయన స్వరవిజ్ఞతకు అద్దం పడుతుంది. ఈ రాగ, భావ, తాళ యోగ వైవిధ్యభరితమైన నాట్యరూపకం పండిత పామరులను అలరించి మెప్పుపొందింది. మల్లాది గారికి సంగీత ప్రవేశం వుండడంచేత వారు సూచించిన రాగాలలోనే ఘంటసాల గిరిజా కల్యాణానికి రూపకల్పన చేశారు. ఈ ‘గిరిజా కళ్యాణం’ రూపకంలో ఘంటసాల ఉదయరవిచంద్రిక, కాంభోజి, అఠాణా, రీతిగౌళ, వసంత, సరస్వతి, బెగడ, శహన, దేవగాంధారి, హిందోళ, మాధ్యమావతి వంటి జన్యరాగలతోనే స్వరపరచారు.
‘అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదాంబా పరాకు’ అంటూ ఘంటసాల బృందం ఆలపించే ప్రారంభ పంక్తుల్ని కాంభోజి రాగంలో పలికించారు. తరవాత వచ్చే ‘ఉమామహేశ్వర ప్రసాద లబ్ద పూర్ణజీవనా గజాననా’ అంటూ వచ్చే వచనంతో కూడిన పూర్తి పాఠాన్ని ఉదయరవిచంద్రిక రాగంలో స్వరపరచారు. పాట మొదలైన తరవాత బృందంతో కలిసి ఘంటసాల ఆలపించే ‘అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా, లలిత కళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులై’ అనే పూర్తి చరణాన్ని మాధ్యమావతి రాగంలోనూ; చెలికత్తెలు ఆలపించే ‘రావో రావో లోల లోల లోలంబాలక రావో, లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి….రాజసులోచన రాజాననా’ అనే పంక్తుల్ని కాంభోజి రాగంలోనూ; ఆ చెలికత్తెలే ఆలపించే ‘చెలువారు మోమున లేలేత నగవులా కలహంస గమనాన కలికి ఎక్కడికే’ అనే పంక్తిని అఠాణా రాగంలో పాడించారు. ఇక మన్మధుడు ప్రవేశిస్తూ ‘తగదిది తగదిది తగదిది ధరణీధర వర సుకుమారీ తగదిది, అండగా మదనుడుండగా, మన విరిశరముల పదనుండగా’ అంటూ కించిత్ గర్వంగా ఆలపించే చరణాన్ని ఘంటసాల వసంత రాగంలో స్వరపరచారు. ఎందుకంటే, మన్మధునికి వసంతుడనే పేరుకూడా వుంది కనుక. ఇక పార్వతి మన్మధుని దూకుడు ధోరణిని వారించే విధంగా ఆలపించే ‘ఈసుని దాసుని చేతువా, అపసద అపచారము కాదా…. నాస్వామి నన్నేలునోయీ, నీ సాయమే వలదోయీ’ అనే చరణాన్ని రీతిగౌళ రాగంలో వినిపించారు. చెలికత్తెలు మన్మధుని వారించే ‘కానిపని మదనా అది నీచేత కానిపని మదనా, అహంకరింతువా… హరుని జయింతువా’ పంక్తులను శహన రాగంలో… ‘చిలుక తట్టడివౌత ఎందుకీ హుంకరింత, వినకపోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి’ అంటూ హెచ్చరించే పంక్తుల్ని సరస్వతీ రాగంలో స్వరపరచారు. ఇక హిందోళరాగంలో పార్వతి ఆలపించే ‘సామగ సాగమ సాధారా శారద నీరద సాకారా, ధీనా ధీనా ధీసారా’ చరణాన్ని వినిపించారు. మన్మధ సంహారం జరిగిన తరవాత రతీదేవి ‘విరులన్ నిను పూజాసేయగా, విధిగా నిన్నొక గేస్తుజేయగా’ అనే పద్యం ఆలపించిన తరవాత పార్వతి పలికే ‘అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో’ అనే చరణాన్ని దేవగాంధారి రాగంలో నడిపించారు. ఇక చివరగా అందరూ పాడే ‘బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం, విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి జయమంగళం’ అంటూ మధ్యమావతి రాగంలో ఆలపింపజేసి గిరిజా కల్యాణ ఘట్టానికి శుభమంగళం పలికించారు ఘంటసాల. ఇక మల్లాది వారి సాహిత్య పదప్రయోగ వైచిత్రి నభూతో న భవిష్యతి.
–ఆచారం షణ్ముఖాచారి