కార్టూన్లు-నవ్విస్తాయి… కార్టూన్లు-కవ్విస్తాయి… కార్టూన్లు-ఆలోచింపజేస్తాయి… కార్టూన్లు ఆయుష్సును పెంచుతాయి.
అందుకే కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. కార్టూన్ అసామాన్యులనే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ. తెలుగు కార్టూన్ కు ఎనిమిది దశాబ్దాల చరిత్రవుంది. నాటి తలిశెట్టి నుండి నేటి నాగిశెట్టి వరకు ఎందరో కార్టూనిస్టులు తెలుగు కార్టూన్ రంగాన్ని సుసంపన్నం చేసారు. ఏ కళకైనా ప్రోత్సాహం వుంటేనే రాణిస్తుంది. ఎనభైలలో కార్టూనిస్టులను పత్రికలు ప్రోత్సహిస్తే, నేడు సోషల్ మీడియా కార్టూనిస్టులకు నూతనోత్సాన్ని నింపుతుంది. ఇది శుభపరిణామం. మనల్ని నిత్యం నవ్వించే కార్టూనిస్టుల గురించి తెలుసుకోవాలనే ఆశక్తి పాఠకులకుంటుంది. నెల-నెలా ఒక్కో కార్టూనిస్టు జీవితం, వారి కార్టూన్లు వంటి అనేక విషయాలను 64కళలు.కాం పాఠకులకు అందించే ప్రయత్నమే ఈ ‘మన కార్టూనిస్టులూ ఫీచరు. మార్చి నెల మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా కార్టూనిస్టు కుమారి రాగతి పండరి గారి కార్టూన్ కబుర్లు చెప్పుకొందాం.
సుఖం-దు:ఖం, నవ్వు-ఏడుపు ప్రతీ మనిషి జీవితంలో సహజం. అయితే లేని కష్టాల్ని సృష్టించుకొని జీవితాన్ని ఏడుస్తూ గడిపేవారు కొందరైతే, ఉన్న విచారాన్ని మరిచిపోయి నవ్వుతూ గడపటమే కాక తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ నాలుగు దశాబ్దాల పాటు కార్టూన్లు గీసారు కుమారి రాగతి పండరి. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మహిళా కార్టూనిస్టుగా ఎనిమిదేళ్ళ వయసులో 1972 సం.లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ద్వారా ఆరంగేట్రం చేసి అప్రతిహాసంగా కార్టూన్లు, కార్టూన్ ఫీచర్స్, కార్టూన్ కథలూ, కార్టూన్ సీరియల్స్ వివిధ పత్రికలలో సుమారు పదమూడు వేలకు పైగా గీసి తెలుగు పత్రికా ప్రపంచంలోని కార్టూన్ సామ్రాజ్యానికి ఆమె మకుటంలేని మహారాణిగా వెలుగొందారు.
“అంగవైకల్యం వల్ల నేను గడపదాటి ఎక్కడికి వెళ్లలేకపోయినా అభిమానులు రాసే ఉత్తరాలే నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. కార్టూనిస్టులు ఎవ్వరైనా విశాఖపట్నానికి వచ్చినపుడు మా ఇంటికి వచ్చేవారు. ఒకసారి జయదేవ్ గారు తన ఫ్యామిలీతో పాటు మా ఇంటికి వచ్చి కొన్ని కార్టూన్లు గీసి చూపించారు. అలాగే మా ఆతిధ్యం కూడా స్వీకరించారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన”అంటూ చెప్పుకొనేవారు.
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 19న, 2015 లో విశాఖలో కుమారి రాగతి పండరి కలం గీతలు ఆగిపోయినా, వారు పంచిన నవ్వులు పాఠకుల పెదవులపై నేటికీ నిలిచేవున్నాయి.
-కళాసాగర్
View Comments (1)
Great woman cartoonist....