వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

తెలుగు చిత్రకళామాతకు రెండు కళ్లుగా భాషించిన అమర చిత్రకారులు వడ్డాది పాపయ్య, బాపు. మన చిత్రకళకు జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రకారులు కూడా. వపా వర్ణచిత్రాలు, నీటి రంగుల చిత్రాలు తనదైన శైలిలో చిత్రించి తెలుగు వారి అభిమానాన్ని పొందారు. రెండోవారు బాపు, కార్టూన్లు, చిత్రాలతోనూ, ఇలస్ట్రేషన్లతోనూ, ఎంతో ప్రఖ్యాతి చెందారు. వివిధ భాషలలో 50 కి పైగా కళాత్మకమైన సినిమాలను తీసి తనదైన ముద్రతో అభిమానులను ఆకట్టుకున్నారు బాపు. ఆయన కాలధర్మం చేసి నాలుగేళ్లయింది. తమ కళా ప్రతిభతో ఈ ఇరువురు మన సంస్కృతి ఉన్నంతవరకు చిరస్మరణీయులే. ఇరువురు పత్రికల ద్వారానే ప్రాచుర్యం పొందారు. మన చిత్రకళారంగంలో ఇరువురు చిరంజీవులే.

కళలకు నిలయమైన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పాలకొల్లులో ఈ ఇరువురు పేరుతో స్థానిక ప్రముఖుల సహకారంతో, ప్రముఖ చిత్రకారుడు రాఖీ 2016లో ‘వపా, బాపు ఆర్ట్ అకాడెమి’ ని  స్థాపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ దక్షిణ భారత చిత్రకారుల కార్యశాల, కళాప్రదర్శన పోటీలు నిర్వహించి ఔత్సాహికులను ప్రొత్సహిస్తున్నారు. ఈ సంకల్పానికి లైన్స్ క్లబ్ యధాశక్తి సహకారం అందిస్తున్నారు.    

అకాడమీ 4 వ వార్షికోత్సవం జనవరి 26 నుండి 28 వరకు పాలకొల్లు లో అత్యంత వైభవంగా నిర్వహించారు. 26న స్థానిక మున్సిపల్ వైస్చైర్మన్ శ్రీమతికి రాజమణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు కార్యశాలను ప్రారంభించారు. మద్దాల వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జి. గాంధీ భగవాన్ రాజా, శ్రీ బి. వెంకట శ్రీ కోరాడ వెంకట్రావు తదితరులు స్ఫూర్తివంతమైన సందేశాన్ని కళాకారులకు ఇచ్చారు. 27న పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో చిత్రకళ చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు కె.వి.ఆర్ మోహన్ ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి 200 మంది విధ్యార్దులు పాల్గొన్నారు. చిత్రకారులు కళారత్న శ్రీ దేవిప్రసాద్ ప్రముఖ చిత్రకారులు శ్రీ కడలి సురేష్  శ్రీ కీళ్ళ మూర్తి లను ఘనంగా సత్కరించారు సన్మాన గ్రహీత శ్రీ ప్రసాద్ వారిని ఉచితరీతిన సత్కరించి గురుదక్షిణ తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వపా, బాపు ల చిత్రకళా ప్రతిభ, వ్యక్తిత్వం   గురించి సుంకర చలపతిరావు సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు శ్రీ గంగాధర్ కుమారుడు శ్రీ సోము, ప్రముఖ చిత్రకారులు సుబ్రహ్మణ్యం, శ్రీ మజ్జి కాంతారావు, శ్రీ ఉదయ శంకర్, శ్రీ డి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 28న కార్యశాలలో రూపొందించిన 50 వరకు చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహారావు ప్రారంభించి చిత్రకారులు అభినందించారు. అనంతరం పాఠశాలలో పాల్గొన్న చిత్రకారులకు మురళీకృష్ణ జ్ఞాపికలు అందజేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన వివిధ కళాకారులు తమ తమ శైలిలో చిత్రాలు రూపొందించి కళాకారులు విశేషంగా ఆదరించారు. ఉన్నంతవరకు దివంగత పాపపు ఇంతవరకు ఇంతకుమించిన నివాళి ఇంకేముంటుంది. కార్యక్రమ రూపశిల్పి రాఖీ ని, ఈయనకు సహకరించిన అందరిని అభినందించాల్సిందే.        

– సుంకర చలపతిరావు

SA:

View Comments (2)