విజయవాడ లో విజయోత్సాహం…

సాయం సంధ్య వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో అభిమానుల కేరింతల నడుమ మహర్షి సినిమా సక్సెస్ మీట్ మే 18 న శనివారం రాత్రి ఘనంగా జరిగింది. విజయవాడ లోని పిన్నమనేని సిద్ధార్థ హోటల్ మేనేజ్మంట్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినిమా కథానాయకుడు మహేష్ బాబు, హీరోయిన్ పూజా హెగ్డ, నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, అశ్వనీదత్, దిల్రాజులతో పాటు, దర్శకుడు వంశీ పైడిపల్లిలు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ దర్శకులు కె.రాఘవేంధ్రరావు, సినీ హీరో అల్లరి నరేష్లతో పాటు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటుడు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ముందే చెప్పారు.. మహర్షి సినిమా ప్రివ్యూషో సమయంలోనే సినిమా విజయవంతం అవుతుందని, మే 18న విజయవాడలో సక్సెస్ మీట్ పెడతామని నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ముందే చెప్పారని, అలాగే నేడు పెద్ద సంఖ్యలో అభిమానుల నడుమ జరుపుకోవడం సంతోషంగా ఉందని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంధ్ర రావు మాట్లాడుతూ మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడుకు దర్శకత్వం వహించానని, ఆ సమయంలో తనను మామయ్య అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహేష్ బాబుతో తాను నటించిన మూడో చిత్రం ఇది అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రా హాస్పటల్ పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు మాట్లాడుతూ సేవలోనూ మహేష్ బాబు ముందున్నారన్నారు. ఆయన దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా, గుండె జబ్బులున్న చిన్నారులు 300 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు మహేష్ బాబు సహకారం ఆయన సేవాగుణానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన నృత్యాలు కుర్ర కారును హోరెత్తించాయి. అదేవిధంగా చిత్రంలోని పాటలు వేదికపై పాడిన గాయకులు అందరినీ అలరించారు. శ్రీముఖి, సింహ యాంకరింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి సభల్లో నయినా కొంత మంది రైతులకు ఆర్థిక సహాయం అందించి వుంటే బావుండేదని పలువురు సభలో మాట్లాడుకోవడం వినిపించింది. మొదటి 2 వారాలకు టికెట్ రేట్లు పెంచి వసూళ్ళలో రికార్డ్ లు గురించి మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు.

SA: