‘రాజమండ్రి చిత్రకళా నికేతన్’ అభినందన సభ

రాజమహేంద్రవరంలోని ప్రఖ్యాత చిత్రకారులు, మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ స్కూల్ నిర్వాహకులు వై.సుబ్బారావుగారు తమ చిత్రాలతో ఒక ప్రత్యేక ఆర్ట్ గేలరీని ఏర్పాటుచేసి రాజమండ్రి చిత్రకారులకు ఆదర్శంగా నిలిచారు.

అదే విధంగా చేతితో ప్రకృతి చిత్రాలను క్షణాల్లో చిత్రించి రికార్డు నెలకొల్పిన, విజయవాడ కేంద్రీయ పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణగారు ఇటీవల సంస్కార భారతి సంస్థ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును, భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ మరియు మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ సంస్థల ద్వారా మాదేటి రాజాజీ పురస్కారాన్ని పొందడమే కాక సాహిత్యంలో కూడా విశేష కృషి చేస్తూ గుర్తింపు సాధిస్తున్నారు. వీరిరువురూ చిత్రకళలో విశేష కృషి చేస్తున్న మామా అల్లుళ్ళు.
శ్రీయుత ఎల్లా సుబ్బారావుగారు గురించి చిత్రకారులు, కళావిమర్శకులు వెలువరించిన వ్యాససంపుటిని ఇటీవల “సువర్ణతూలిక” అనే పేరుతో గ్రంద్తం ఆవిష్కరించడం జరిగిన సందర్భాన్ని కూడా పురస్కరించుకుని అక్టోబర్, 20వ తేది 2019,ఆదివారం, ఉదయం 10 గంటలకు,రాజమహేంద్రవరం దామెర్ల రామారావు ఆర్ట్ గేలరీలో వీరిరువురినీ ఒకే వేదికపై రాజమండ్రి చిత్రకళా నికేతన్ అభినందించడం జరిగినది.ఈ అభినందన సభకు చిత్రకారులు, కళాభిమానులందరూ విచ్చేసి సభను జయప్రదం చేయడం జరిగినది.

ఈసందర్భంగా సువర్ణ తూలిక వ్యాసకర్తలైన టేకి మృత్యుంజయరావు గారికి, శ్రీమతి ఎన్.వి.పి.యస్.యస్.లక్ష్మికి “చిత్ర-రచనా కళాసేతు” బిరుదు ప్రదానమూ మాదేటి రవిప్రకాష్ గారికి ఆత్మీయ సత్కారము జరిగింది.

SA: