(కె.ఎన్.వై. పతంజలి సాహిత్య పురస్కారం వరించిన సందర్భంగా …)
నాలుగు దశాబ్దాలకు పైగా సాహిత్య సృజనని కాలక్షేపంగా కాక సామాజిక బాధ్యతగా భావించిన నిబద్ధ రచయిత అట్టాడ అప్పలనాయుడు. కథకుడిగా నవలాకారుడిగా నాటక రచయితగా వ్యాసకర్తగా ఉత్తరాంధ్ర సమాజం నడిచిన అడుగుల సవ్వడినీ అక్కడి ప్రజా శ్రేణులు అనుభవిస్తోన్న గుండె అలజడినీ వినిపిస్తున్న అప్పల్నాయుడు తెలుగులో ఉద్యమ సాహిత్య నిర్మాతగా విశిష్ట పాత్ర పోషించాడు. వంశధార, నాగావళి, ప్రళయావతి నదీ తీరాల్లో రక్తసిక్తమైన వంద సంవత్సరాల చరిత్రని అతను తన రచనల్లో నమోదు చేసాడు. ఎమర్జెన్సీ తర్వాత వొక చేతిలో కలం, మరో చేతిలో ‘పువ్వుల కొరడా’ (1978) ధరించి కథన రంగంలో దిగిన అప్పల్నాయుడి రచనలపై శ్రీకాకుళం గిరిజన ఉద్యమ ప్రభావం అమితంగా వుంది. ఉద్దానంలో తిరగబడ్డ ఆదివాసీ అతని కథల్లో తొలి కథానాయకుడు. అప్పటి నుంచీ యిటీవల ‘బీల’భూముల్లో జీవ విధ్వంసానికి కారణమైన థర్మల్ ప్రాజెక్ట్ వ్యతిరేక వుద్యమం వరకూ పీడిత ప్రజా సమూహాలతో భౌతికంగా కల్సినడిచిన నిమగ్న సాహిత్య రాజకీయ జీవితం అతనిది. అందుకే అమాయకత్వంతో దోపిడీకి గురైన గిరిజన రైతాంగం బుగతల రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టడానికి దారితీసిన పరిస్థితుల్ని ‘పోడు పోరు’ (1983) గా కథీకరించాడు. ఆ విధంగా శ్రీకాకుళం ఉద్యమానికి సాహిత్య రూపమిచ్చి కొండగాలి, కొత్తగాలి తేడాలని యెరుక చేసిన భూషణం మాష్టారు ఆగినచోట అప్పల్నాయుడు మొదలయ్యాడు. ఆధునిక అరణ్య పర్వాన్ని కథామాధ్యమంగా వ్యాఖ్యానించాడు (1987). అడవిబిడ్డని షావుకార్లు సొండీలు బుగతలు దోచుకొన్న వైనం గురించి, దానికి వ్యతిరేకంగా జరిగినసాయుధ పోరు గురించి విశ్లేషించాడు. ‘నేలని తలకిందులు జేసి పండించినోడు-పాలనని తలకిందులజేసి, బతుకు పండించు కుంటాడ’ని ధీమాగా చెప్పాడు (మమకారం-1994).
తన సాహిత్యంలోకి అతి సహజంగా జొరబడ్డ కళింగాంధ్ర నేల బిడ్డల జీవన విధ్వంసం అప్పల్నాయుడిని అలవిగాని కల్లోలాలానికి గురిచేసింది. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైనప్పటికీ పాలకుల నిర్ల క్ష్యంవల్లో ప్రాంతేతరుల ఆధిపత్యంవల్లో ఆనకట్టల్లేక నీటి పారుదల సౌకర్యాలు లేక పంటల్లేక ఉపాధిలేక అప్పులు పుట్టక చేసిన అప్పులు తీర్చలేక ఆకలికి తాళలేక చస్తూ బతకలేకపొట్ట చేతబట్టుకుని పుట్టిన వలసలు వొదిలి వలస బోయే రైతుల దైన్యాన్ని చూసి తల్లడిల్లాడు (బతికిచెడిన దేశం-2005). ఆర్థి కమే కీలకమై మానవ బాంధవ్యం మాసిపోయేల చేసున్న వ్యవస్థల పట్ల ఆగ్రహం ప్రకటించాడు. (నేను-నేనె-2005) వలసల్లో ప్రజలు సామూహిక జీవితానికి దూరమై ముక్కలుగా విడిపోవడం చూసి ఆర్తి చెందాడు. పార్లమెంటరీ రాజకీయాల్లో సైతం వెనకబడ్డ ప్రాంతాలపై అభివృద్ధి చెందిన ప్రాంతాల ఆధిపత్యం కొనసాగే తీరుని వ్యాఖ్యానిస్తూ రాసిన అతని రచనలు (షా-2005) అతని సాహిత్యజీవి తంలో మలుపుగా భావించవచ్చు. అతణ్ణి ఉత్తరాంధ్ర ప్రాంతీయ అస్తిత్వానికి ప్రాతినిధ్య రచయితగా గుర్తించడమో కుదించడమో జరిగింది. నిజానికి ఉత్తరాంధ్రని నిర్దిష్టంగా లక్ష్యీకరిస్తూ దేశవ్యాప్తంగా అమలౌతున్న కార్పోరేట్ మార్కెట్ శక్తుల దోపిడీనీ అందుకు వత్తాసుగా నిలబడ్డ రాజ్యం వికృతంగా అమలుచేసే హింసనీ తెలియజెప్పడమే అతని సాహిత్య ప్రణాళిక. ఉధృత ప్రవాహ సదృశమైన శైలి అప్పల్నాయుడి రచల్లో చూస్తాం. ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన విలక్షణమైన వెటకారం అతని బలం. క్రోధాన్ని వ్యంగ్యంగానూ దుఃఖాన్ని అధిక్షేపంగానూ ఆక్రోశాన్ని యెత్తి పొడుపుగానూ బలహీనతని పరిహాసంగానూ మలచే నేర్పు అతని సొంతం. కొద్దిపాటి మాటల్లోనే ఆలంకారికంగా కవితాత్మకమైన-ప్రతీకాత్మకమైన నేపథ్యాన్ని నిర్మించగలడు, మనుషుల వ్యక్తిత్వాన్ని నిరూపించగలడు. సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితుల్ని పతంజలి లాగా బ్లాక్ కామెడీలోకి తర్జుమా చేయడంలో సైతం అప్పల్నాయుడు సిద్ధహస్తుడు (ఒక పొట్టివాడూ కొందరు పొడుగువాళ్ళ కథ, 2004). సంభాషణల్లో సహజంగా చోటుచేసుకునే కళింగాంధ్ర యాస అతని రచనలకు అపూర్వమైన సొగసుని అద్దాయి.అప్పల్నానాయుడు కళింగ యుద్ధ క్షతగాత్రుడు అయినప్పటికీ యెక్కడా నిరాశాపూరితమైన రచన చేయలేదు. పీడితుల వంచితుల బాధాసర్పదష్టుల పరాజితుల చరిత్రని నమోదు చేసినా పోరాట కేతనం దించలేదు. అందుకే రాజ్యమే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారి దోచుకుంటే సహించలేక గొడ్డలెత్తిన మంగయ్య దగ్గర్నుంచీ ‘ట్టిపా’ వరకూ తిరగబడ్డ పాత్రలనే అతను సృష్టించాడు. అన్యాయానికి యెదురొడ్డి సాయుధమై నిలబడ్డ ప్రజాస మూహాలు “నిరాయుధం’గా (2017) మారినా ఉద్యమ చైతన్యం మాసిపోలదనీ పోరుబాట వదిలేది లేదనే తన రచనల ద్వారా నిరూపించాడు.
-ఎ. కె. ప్రభాకర్
View Comments (2)
Thanq Sir
Welcome sir