“రావెళ్ల” పేరుతో గత 15 సంవత్సరాలుగా కార్టూన్లు గీస్తున్న డాక్టర్ రావెళ్ల శ్రీనివాస రావు కార్టూన్లు, బాల సాహిత్యం, కథా రచన, కవిత్వం మొదలైన రచనా ప్రక్రియల్లో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల వారి పరిచయం వారి మాటల్లోనే చదవండి.
రావెళ్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు రావెళ్ల శ్రీనివాసరావు 6-10-1968 న గుంటూరు జిల్లా బలిజేపల్లి గ్రామంలో పుట్టాను. అమ్మ నారాయణమ్మ, నాన్న రాధాకృష్ణ మూర్తి. మాది వ్యవసాయ కుటుంబం. 5వ తరగతి దాకా సొంత ఊరిలోనూ, ఆరవ తరగతి నుండి ఇంటర్ దాకా వేమూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలోనూ చదివాను.
అనంతరం తెనాలి వి.ఎస్. ఆర్ కళాశాలలో బి.యస్.సి. చదివి, 1987 లో గుంటూరు గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ లో సీటు రావడం తో జాయిన్ అయి, 1989 నుండి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను.
కొల్లూరు, వేమూరు, వడ్డేస్వరం, ఓర్వకల్లు, పెదపులివర్రు, తుళ్లూరు లలో పనిచేశాను. ప్రస్తుతం రాజధాని లోని పెనుమాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 1 తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 2000 సంవత్సరం నుండి విజయవాడ లో వుంటున్నాము.
రెండు సంవత్సరాలు ఈనాడు కల్చరల్ కంట్రిబ్యూటర్ గా పని చేసాను. ఉద్యోగం వచ్చినా చదువు ఎక్కడా ఆగలేదు. డిగ్రీ తరువాత పి.జీ పొలిటికల్ సైన్సు, తదుపరి పి.జి. తెలుగు చేసాను. ఇంకా చదవాలనే జిజ్ఞాసతో యమ్.ఈ.డి. కూడా చదివాను. 2007లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్ డి.లో జాయిన్ అయి 2010లో డాక్టరేట్ డిగ్రీ అందుకున్నాను తదుపరి ఏపీ సెట్ లో ఉత్తీర్ణత సాధించాను. నా మొదటి కార్టూన్ 2002లో ఆంధ్ర భూమి వీక్లీ లో ప్రచురించారు. ఆ తర్వాత ప్రియ దత్త , స్వాతి, ప్రభ ఇలా అన్ని పత్రికలలోనూ నా కార్టూన్లు వచ్చాయి. ఈనాడు, ప్రజాశక్తి వారి ప్రోత్సాహం మరువలేనిది. దాదాపు గీసి పంపిన వాటిలో ఎక్కువ కార్టూన్లు అచ్చుకు నోచుకున్నాయి. బొమ్మలు బాగా కుదిరేవి కాదు. అయినా ప్రాక్టీసు ( ఇప్పటికీ ) చేస్తూ బాగా గీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కళాసాగర్ గారు 2002 లో నిర్వహించిన కార్టూన్ మేళాలో నా కార్టూన్లు కూడా ప్రదర్శించారు. అప్పటి ఆ ఆనందం చెప్పలేనిది. తరువాత కలిమి శ్రీ గారితో పరిచయం అయింది . వారు కార్టూన్ వేయడంలో కొన్ని మెలకువలు చెప్పారు. హాస్యానందం రాము గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్నో కార్టూన్లు తమ పత్రికలో ప్రచురించారు. అవార్డులోయ్ అవార్డులు శీర్షికన 25 కథలను నాతో వ్రాయించి ప్రచురించారు. తలిశెట్టి రామారావు, శేఖర్ అవార్డులు రావడంతో పాటు 12 రాష్ట్రస్థాయి బహుమతులు అందుకున్నాను.
2017 లో తానా వారు నిర్వహించిన పిల్లల నవలల పోటీలో నా “కిట్టు సాహసం” నవల పదివేల రూపాయల బహుమతిని గెలుచుకుంది. స్వాతి వీక్లీలో రెండు హాస్య కథలు రావడంతో హాస్య కధలు కూడా రాయగలననే నమ్మకం కుదిరింది. ఈ మధ్య ప్రజాశక్తి సండే బుక్ లో వచ్చిన ‘ఆదెమ్మ’ కథ కు మంచి గుర్తింపు ఒచ్చింది.
జయదేవ్ గారికి నాకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రచురిస్తే ఒక బుక్ అవుతుంది. నేను సేకరించినన్ని కార్టూన్లు ఎవరూ సేకరించి ఉండరని అనుకుంటున్నాను. నేను ఒక మంచి పాఠకుణ్ణి. వారంలో రెండు పుస్తకాలను చదవందే నిద్రపోను. స్పందించి రాస్తాను. రాయాలని రాయలేను. నాకు పరిచయమైన వాళ్లంతా నా మిత్రులే. మంచి కార్టూనిస్ట్ గా, బాలసాహితీ వేత్తగా, కధకునిగా పేరు తెచ్చు కోవాలన్నదే నా ఆశయం. నన్ను 64 కళలు లో పరిచయం చేస్తున్నందుకు కళాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మరచిపోలేని విషయాలు
- సత్యమూర్తి గారు ఫోన్ చేసి నా కార్టూన్ బాగున్నది మెచ్చుకున్నప్పుడు.
- జయదేవ్ గారి గ్లాచు మీచ్యు బుక్ కి పట్టుబట్టి మరీ ముందు మాట వ్రాయించుకోవడం
- రేడియో లో “భారీశత్రువు” రూపకానికి వచ్చిన స్పందన.
View Comments (3)
Good
Congrats Ravella garu
Hearty congratulations Dr.Ravella Sir!