కళ.. కళ కోసం కాదు. కళ ప్రజల కోసం అని నమ్మి ఆచరించే దారిలో ఎందరో మహానుభావులు సాగిపోతున్నారు. ఆ క్రమంలో మార్గాలు వేరైనా లక్ష్యం ఒకటిగా పని చేస్తుంటారు. తెలుగు కమ్మదనం, అమ్మతనం, పల్లె అందాలు, ఔన్నత్యాన్ని జానపద కళారూ పంలో ప్రచారం చేస్తున్నారు దామోదర గణపతిరావు. వృత్తి విద్యాబోధన.. ప్రవృత్తి జానపద కళారాధన ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన దేశ, విదే శాల్లో జానపదాలు ఆలపిస్తూ 1500 ప్రదర్శనలు ఇచ్చారు. పల్లె సంస్కృతిని ప్రపంచానికి తెలియ జెప్పాలనే సంకల్పంతో జానపద గాయకుడిగా తన వంతు ప్రయత్నం చేస్తున్న దామోదర గణపతిరావు గారి జన్మదినం సందర్భంగా ది. 3-02-2019 న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో “జయహో జానపదం” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారి పరిచయం 64కళలుడాట్కాం పాటకుల కోసం…
రైతు కుటుంబంలో జన్మించిన రామోదర గణపతిరావు మహా గురువరేణ్యులు శ్రీ కిమిడి రమణమూర్తి శ్రీ జోస్యుల సాంబమూర్తి, శ్రీ విరాల రామచంద్రమూర్తి, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గార్ల శిక్షణలో జిల్లెళ్ళమూడి అమ్మ ఆశీస్సులతో యమ్.ఏ.(ఓ.యల్) పూర్తి చేసి, ప్రస్తుతం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేయుచున్నారు. స్వర్గీయ దర్శకరత్న పాటిబండ్ల బాబూరావు, సినీకవి’ కొండముది సాయి శ్రీహర్ష శిక్షణలో గుంటూరు జిల్లాలో రంగస్థలంపై తన 18వ ఏటనే పలు నాటకాలలో నటించారు. కీశే. వరంగల్ శంకర్, సారంగపాడి అనుచరునిగా కొన్నాళ్ళు జానపదగాన సంచారం చేశారు. ప్రజావాగ్గేయకారులు శ్రీ పంగపండు ప్రసాదరావు శ్రీ గద్దర్, పర్యావరణ కవి” శ్రీ గోరటి వెంకన్న, జాతీయ సినీగేయ ఉత్తమ కవి డా. సుద్దాల అశోక్ తేజ, సహజకవి శ్రీ గంటేడ గౌరునాయుడు, రాయలసీమ రత్నం, శ్రీ కలిమిట్టి మునెయ్య గార్ల ఏకలవ్య శిష్యునిగా పేరుగాంచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ ప్రోత్సాహంతో శతరూపులో పాల్గొన్న వీరు నేటి వరకు వెయ్యికి పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ జానపద గాన ప్రయాణంలో పాలకొల్లు రీ కళాలయ సంస్థ ‘కవి గాయక నటచక్రవర్తి’ రాయగడ జె.కె. తెలుగు సంఘం ‘జానపద గాయక రత్న’ విజయవాడ మహానటి సావిత్రీ కళాపీఠం ‘జానపద కిరీటి’ బిరుదులతో సత్యంచారు. డా. రామన్ ఫౌండేషన్ “ప్రజ్ఞ, విజయవాడ “ఎక్సరే”.. స్వచ్చంద సేవా సంస్థ మరియు రచయితల సంఘం వారి శ్రీశ్రీ శత జయంతి, 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇంకా ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, అభిమానుల సన్మానాలు కోకొల్లలు, ప్రస్తుతం “సంస్కార భారతి’ విజయవాడ నగర శాఖ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సాంస్కృతిక కమిటీ రాష్ట్ర సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వీరి వృత్తి ఉపాధ్యాయ, ప్రవృత్తి జానపద గానం.
(“జయహో జానపదం” కార్యక్రమంలో భాగంగా ‘విజయవాడ ఆర్ట్ సొసైటి ‘వారు చిత్రకళా ప్రదర్శన నిర్వహించబడుతుంది. ది. 03-02-2019 సాయంత్రం)
– కళాసాగర్ (9885289995)
View Comments (1)
Congrats, very good service.