కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఉత్తర భారతదేశంలో పుట్టిన ఈ కలంకారీ కళ శ్రీకాళహస్తి లో వందేళ్ళకిందటే ప్రారంభించబడింది… అలాంటి ప్రాచీన కళలో జాతీయస్థాయిలో రాణిస్తున్న ఓ కళాకారున్ని గురించి తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా, పిచ్చాటూరు మండలం, కారూరు గ్రామంలో పూజారి మునిస్వామిరెడ్డి, మునియమ్మ దంపతులకు 15-7-1957న ఓ రత్నం జనించింది. ఆ రత్నం పేరే మునిరత్నం. నవరత్నాల సరసన పదవ రత్నంగా భావించి వీరిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశారు. తండ్రి మునిస్వామిరెడ్డి ప్రఖ్యాతిగాంచిన జానపద కళాకారులు, మునిరత్నంకు బాల్యంనుండే కళలపట్ల అభిరుచి పెరిగింది. పాఠ్యపుస్తకాల్లోని బొమ్మలను పలకపై గీస్తూ స్వయంశిక్షణ పొందారు. గ్రామీణ వాతావరణం కావటంచేత గేదెలు తోలుకొస్తూ దారిలో గోడలమీద బొగ్గుతో బొమ్మలు గీస్తూ ఉండేవారు. తన తండ్రి నాటకరంగ కళాకారులు కూడా కావటంతో నాటకాలపై దృష్టి మళ్ళింది. తండ్రి అనారోగ్యానికి గురికావటంతో తన తండ్రి ప్రదర్శించే నాటకాలను సినిమా ఫక్కీలో ప్రదర్శించడంతో ప్రజాదరణ లభించింది.
కుటుంబం : కారూరు గ్రామానికి చెందిన దేశమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.
చిత్రకళపై అభిరుచి : తన బాల్య స్నేహితుడు టైలర్ బాలిరెడ్డి సలహా మేరకు మద్రాసులోని శంతను చిత్ర విద్యాలయం ద్వారా 2 సం.రాల చిత్రకళ కోర్సును పోస్టల్ విధానంలో పూర్తిచేశారు. ఓ పర్యాయం శ్రీకాళహస్తిలోని తన బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రక్క ఇంట్లో కొత్త తరహాలో వనమూలికలతో తయారుచేసిన రంగులతో చిత్రాలను గీయడం మునిరత్నం చూశారు. ఆ విధానాన్ని కలంకారీ విధానం అని తెలుసుకున్నాడు. ఈ పద్ధతిపై ఇష్టాన్ని పెంచుకుని శ్రీకాళహస్తిలోని కలంకారీ కాలేజీలో 1980వ సం.లో చేరి రెండేళ్ళ కలంకారీ డిప్లొమా పూర్తిచేశారు.
కలంకారీ డిజైనర్ గా : 1986వ సం.లో మద్రాసులోని అజయ్ పబ్లిసిటీ డిజైన్స్ సంస్థలో సహాయకునిగా చేరారు. తాను నేర్చుకున్న కలంకారీ కళను సినిమా పోస్టర్స్ లోకి చొప్పించి డిజైన్స్ రంగంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలంకారీ గురువు మునికృష్ణయ్యతో కలసి కలకత్తాలోని శాంతినికేతన్ కు వెళ్ళి అక్కడ విద్యార్థులకు కళాభవన్ విభాగంలో కలంకారీ చిత్రకళను నేర్పించారు.
2018వ సం.లో రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని A.P. State Council of Science &Technology వారు తిరుపతిలో Special National Science Day Celebration జరిగినపుడు మునిరత్నం కలంకారీ చిత్రాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. 2019వ సం.లో కేంద్రప్రభుత్వ ఆధీనంలోని Ministry of Textiles ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో మునిరత్నం చిత్రించిన సత్య హరిశ్చంద్ర నాటకానికి National Merit Certificate దక్కింది.
మారుమూల గ్రామంలో పుట్టి జాతీయస్థాయి మేటి కళాకారునిగా ఎదగటం కష్టసాధ్యమైన విషయం. అంచలంచెలుగా ఎదుగుతూ కలంకారీ కళనే నమ్ముకుని, రంగుల స్వప్నాన్ని సాకారం చేసుకుని ప్రకృతే తన ఆరాధ్యదైవంగా భావించి, ప్రకృతిలో లభించే మూలికలతో తయారుచేసిన రంగులతోనే చిత్రాలను గీస్తూ పరోక్షంగా పర్యావరణ పరిరక్షకులుగా విరాజిల్లుతున్న మునిరత్నం తెలుగుజాతి మణిరత్నం. ఈ రత్నం పద్మశ్రీ పురస్కారానికి నూరుశాతం అర్హులు. ఆయన సుదీర్ఘ కలంకారీ ప్రయాణంలో వేలాది శిష్యులను తయారించారు. కళ ఎప్పటికీ అజరామరమే. దోచుకోలేనిదీ, దాచుకోలేనిది కూడా. కేంద్రప్రభుత్వం కలంకారీ రంగంలో కళారత్నమైన మునిరత్నాన్ని పద్మశ్రీ ఇచ్చి సత్కరించి చిత్రకళను గౌరవిస్తుందని ఆశిద్దాం.
-డా. తూములూరి రాజేంద్రప్రసాద్ (9490332323)
___________________________________________________________________
– డా. జి.వి. సాగర్, చిత్రకారులు, తిరుపతి
View Comments (1)
ఇలాంటి పరిచయాలు అవసరం
thank you