సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

ముగ్గురూ ముగ్గురే… ఎవరి రంగంలో వారు నిష్ణాతులే.. సాహితీ దిగ్గజాలే..
ఒకరు సైన్స్ రచయిత, ఇంకొకరు కవి, అనువాద బ్రహ్మ, మరొకరు ఆచార్యులు.

ఈరోజు(8-7-23) శనివారం 10.30 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో…
మల్లవరపు జాన్ స్మారక సాహితీ పురస్కారాల ప్రదానం జరుగుతుంది.‌ 2021, 2022, 2023
సంవత్సరాలకు గాను డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ముకుందరామారావు, ఆచార్య శిఖామణి గారికి పురస్కారాలను అందజేస్తారు.

డాక్టర్ నాగసూరి వేణుగోపాల్..
ఆయన ఆకాశవాణి డైరెక్టర్(రి) సాహితీవేత్త, సైన్స్రచయిత, బహుగ్రంధ, వ్యాసకర్త..విశ్లేషకుడు ఎన్నో పుస్తకాలకుసంపాదకుడు, ఇంకా… ఎంతో మంది రచయితలకు, అనువాదకులకు మార్గదర్శి. ఆయన అందరికీ తెలిసిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. ఆయన స్వీయరచన ‘వేణునాదం’ కొంత వరకు ఆయన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.‘అమరజీవి బలిదానం. పొట్టి శ్రీరాములు పోరాటగాథ’ ఒకప్పటి ప్రత్యేక రాష్ట్రోద్యమ పట్ల ఆయన అవగాహనను తెలియజేస్తుంది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంకోసం పొట్టి శ్రీరాములుగారి త్యాగనిరతిని తెలియజేసే అద్భుతమైన పుస్తకంఇది. ఇప్పటి వరకూ స్వంత రచనలు, సంపాదకత్వం ద్వారా 65 పుస్తకాలు వెలువడ్డాయి. మనకున్న వైజ్ఞానిక రచయితల్లో నాగసూరి ముందువరుసలో వుంటారు.‘సైన్స్ అత్యున్నత కళారూపం’ అనే పుస్తకం గురించి.. జగమెరిగిన ఈ సైన్స్ రచయిత గురించి ఎంత చెప్పినా తక్కువే..!!

ముకుంద రామారావు..
భారతీయ కవిత్వాన్ని పుక్కిటపట్టిన అపర అగస్త్యుడు. ఆయన జీవితమే సాహిత్యం.
ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం.ఆయన సాహిత్య వారథి.సాంస్కృతిక సారథి. కవిత్వం ఆయనరుచి..అనువాదం ఆయన అభిరుచి, ఆయన పేరు’ యల్లపు ముకుంద రామారావు’
కవి, “పంచభూతాల” (అనువాద) పరబ్రహ్మ. ఓ వైపు కవిత్వం, మరో వైపు అనువాదం
ఉఛ్వానిశ్వాసాలుగా బతుకుతున్న విశ్వనరుడు. సాహితీవేత్త ముకుందరామారావు.
సృష్టిలోని ‘పంచభూతాలు’గాలి, నీరు, నింగి, నేల, నిప్పు కాన్సెప్ట్ తో భారతీయ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు ముకుంద రామారావు. ఇలా..’న భూతో న‌భవిష్యతి’..
అన్న చందంగా ఒంటిచేత్తో అటు భారతీయ, ఇటు ప్రపంచ సాహిత్యాన్ని అపర అగస్త్యుడిలా పుక్కిటపట్టారు” ముకుంద రామారావు” నాకు తెలిసి భారతీయ సాహిత్యాన్ని గుప్పె ఇంతగా ఔపోసన పట్టిన రచయిత మరొకరు. లేరేమో!!

ఆచార్య శిఖామణి..
సాహితీరంగంలో ‘యానాం’ అంటే మొదటిగా గుర్తొచ్చేపేరు శిఖామణి. ఆయన తెలుగు విశ్వ
విద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు.. కవి విమర్శకులు.. సాహితీ పత్రిక కవి సంధ్య
సంపాదకులుగావున్నారు‌. చిన్నప్పుడెప్పుడో ఒక శ్రీనే దిద్దినట్టు గుర్తు నాకు… ఇప్పుడు నా కొడుక్కి మాత్రం రెండు శ్రీలు. దిద్దించవలసిన అవసరం. ఆయన చిన్నప్పుడు ఒక శ్రీ దిద్దారట. ఇప్పుడు మాత్రం రెండు శ్రీశ్రీ లను దిద్దాల్సిన అవసరం వుందట. దాన్ని తన కొడుకు ద్వారా దిద్దించాలనడం ఇప్పుడు శ్రీశ్రీ అవసరాన్ని, ఆయన కవిత్వప్రాముఖ్యతను చెప్పకనే చెప్పే సహృదయ సాహితీ వేత్త ఆచార్య శిఖామణి..!!
ఈ ముగ్గురికి పురస్కారాలివ్వడం ఆ పురస్కారాలకే పరిమళం అద్దడం లాంటిది….
పురస్కార గ్రహీతలకు అభినందనలు…
కార్యక్రమానికి అందరూ రండి… నేనూ వస్తున్నాను…

ఎ.రజాహుస్సేన్.

SA: