నా మొదటి కార్టూన్ ‘ఈనాడు ‘ లో – రాకేష్

గత ఆరేళ్ళ నుండి హైదరాబాద్ ఆంధ్రజ్యోతి దిన పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్న రాకేష్ తెలుగులో ఇప్పుడున్న పొలిటికల్ కార్టూనిస్టులలో ఒకరు. 2003 లో ఈనాడు దిన పత్రిక ఒక కార్టూన్ పోటీ నిర్వహించింది, అందులో సెలక్ట్ అయ్యి ఆ తర్వాత మెదక్ జిల్లా ఎడిషన్ లో ఫ్రీలాన్స్ కార్టూనిస్టు గా కార్టూన్లు గీయడం ప్రారంభించారు. అలా… ‘ఈనాడు ‘ లో పూర్తికాలం ఆర్టిస్ట్ గా పది సంవత్సరాలు పనిచేసారు. రాకేష్ కు పంతోమ్మిదేళ్ళ వయస్సులోనే ‘ఈనాడు ‘ మెయిన్ పేజీలో బొమ్మలు గీసే అవకాశం వచ్చింది. అప్పటి నుండి 2014 వరకు సుఖీభవ, బిజినెస్, స్పోర్ట్స్, ఎడిటోరియల్, చతుర, విపుల … లో బొమ్మలు గీయడం జరిగింది. ఇందులో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, పోర్ట్రైట్స్ వంటివి వున్నాయి. రాకేష్ ‘ఈనాడు ‘లో పనిచేస్తున్న పనిగంటలు సాయంత్రం 5 గంటలనుండి రాత్రి 11.30 వరకు వుండేది. అందువల్ల చదువుకునే అవకాశం కలిగింది. తనలోని కళకు మెరుగుదిద్దుకోవాలనే తృష్ణ తో  బి.ఎఫ్.ఏ. లో చేరి నాలుగేళ్ళ  కోర్సు పూర్తి చేసారు. కార్టూనిస్టులలో బి.ఎఫ్.ఏ. చేసిన  వారు అరుదనుకుంటా ….   మొదటి నుండి పొలిటికల్ కార్టూన్ల మీద ఉన్న మక్కువతో ప్రస్తుతం పొలిటికల్ కార్టూనిస్ట్ గా స్థిరపడ్డారు. “ఈనాడు లో వున్న పదిసంవత్సరాలు శ్రీధర్ గారి సలహాలు, చీఫ్ ఆర్టిస్ట్ రవికిషోర్ గారి సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి ” అంటారు రాకేష్.

“ఈనాడు నాకు ఒక స్కూల్ లాంటిది. అక్కడే పదేళ్ళు పనిచేయడం వల్ల ఎంతో మంది సీనియర్ చిత్రకారుల, జర్నలిస్టుల పరిచయాలతో ఎన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం కల్గింది” అంటారు రాకేష్. బొమ్మలు, కార్టూన్లు పేరుకోసమో, డబ్బుకోసమో కాదు ప్రేమతో వెయ్యాలి అప్పుడే ఆర్టిస్టు గా, కార్టూనిస్టు గా పరిణితి చెంది, మంచి గుర్తింపు పొందగలుగుతాం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఎడిటర్ కె. శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో అనేక సమకాలీన సమస్యలపై ప్రతి రోజూ కార్టూన్లు గీస్తూ  పాఠకుల మన్ననలు పొందుతున్నారు.

వెల్దండ రాకేష్ పుట్టింది 1986 జూన్ 12 న మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి లో. చదువు బి.ఎఫ్.ఏ.(పెయింటింగ్) డిగ్రీ. మొదటి కార్టూన్ 2003 లో ఈనాడు జిల్లా ఎడిషన్లో.

-కళాసాగర్

SA:

View Comments (4)

  • మంచి ఐడియా లున్న కార్టూనిస్ట్ రాకేశ్.....
    శుభం భూయాత్.....

  • రాకేష్ గారు మీ కార్టూన్లు బాగుంటాయి.