విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

విజయవాడలో సోమవారం సాయంత్రం వస్త్ర ప్రదర్శనను మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు.
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యముతో జనవరి 20 నుండి ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది)
భారత దేశంలో చేనేత పరిశ్రమ 38.46 లక్షల చేనేత మగ్గములమీద సుమారు (130) లక్షల చేనేత కార్మికులకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయము తరువాత ఎక్కువ మందికి జీవనోపాధిని కల్పిస్తున్న రంగము చేనేత పరిశ్రమ.
మన ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో 2.79 లక్షల నూలు మరియు పట్టు మగ్గముల మీద సుమారు 10 లక్షల మంది చేనేత కార్మికులకు ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది.
చేనేత కార్మికులు ఎంతో శ్రమించి తమ సృజనాత్మక శక్తికి పదును పెట్టి గుర్తింపు తెచ్చిన ఈ చేనేత రంగము యొక్క గౌరవాన్ని కాపాడుటకు మరియు ఈ రంగములో నిరంతర ఉపాధి కల్పించుటకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వములు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ పథకములు అమలు చేస్తున్నాయని, దేశంలోని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో 18 శాతము చేనేత రంగం ద్వారా ఉత్పత్తి జరుగుతున్నదని మరియు 15 శాతము చేనేత ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయని మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. మిగతా వస్త్రాలతో పోలిస్తే చేనేత వస్త్రములు ప్రత్యేకమైన గుర్తింపునిస్తూ వినియోగదారులకు హుందాతనాన్నిన్నాయని. ప్రకృతి ద్వారా లభించే రంగులను వాడటం వలన, కాలుష్యాన్ని నివారించుటయే గాక వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని అన్నారు.
మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ చేనేత రంగంలో ఎప్పటికప్పుడు క్రొత్త డిజైనులను సృష్టించడం ద్వారా మిల్లులు మరియు పవరులూముల ఉత్పత్తులపై పోటీకి నిలబడి ప్రత్యేకతను నిలుపుకొంటున్నాయి.
ఈ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశాలు :
• చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు సరియైన మార్కెటింగ్ సదుపాయాన్ని కలుగజేయుట.
• దేశములోని వివిధ ప్రాంతములలో తయారు అయిన చేనేత వస్త్రములను ఒకే వేదిక మీద వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు.
• చేనేత రంగములో మగ్గాలపై అభివృద్ధి చేసిన అధునాతన డిజైన్లు మరియు వివిధ రకములను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు.
ప్రస్తుతము నిర్వహించబోతున్న ఈ “జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన” “ సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ & కేటరింగ్ టెక్నాలజీ,విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నందు  జనవరి 20 నుండి ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన అద్భుతమైన చేనేత ఉత్పత్తులు సరసమైన ధరలకు లబించును. వివిధ రాష్టాలలో ఉత్పత్తి అయిన చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయము కల్పించటంతో పాటు చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడానికి ఇటువంటి ప్రదర్శనలు దోహద పడతాయి.
ఈ ప్రదర్శనలో భారత దేశములో ప్రఖ్యాతి గాంచిన వివిధ రాష్టాల చేనేత మరియు పట్టు వస్తాలతో పాటు ఫర్నిషింగ్, కార్పెట్లు ఇంకా పేరుపొందిన ఆకర్షణీయమైన వస్త్ర సముదాయము అనగా తెలుగు రాష్ట్రాల నుండి ఉప్పాడ, చీరలూ, వేంకటగిరి, మాధవరం, ధర్మవరం, పోచంపల్లి, గద్వాల్ పట్టు చీరలు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, పొందూరు కాటన్ షర్టింగ్, లుంగీలు, పంచలు, దుప్పట్లు, టవల్స్ మరియు తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాలలో పేరుపొందిన చేనేత కళారూపాలు సందర్శకులను మంత్ర ముగ్ధుల్ని చేయనున్నాయి. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 75 చేనేత సహకార సంఘముల ఉత్పత్తిదారులు పాల్గొననున్నారు.
సందర్శకులకు వినోదాన్ని మరియు మానసిక ఉల్లాసము కల్పించుట కొరకు, ఈ ప్రదర్శన సందర్భంగా ప్రతిరోజు సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించనున్నారు. వస్త్ర ప్రదర్శనకు ప్రవేశము ఉచితము. మరియు అన్ని రకాల చేనేత ఉత్పత్తులు ఉత్పత్తి ధరలకు అందుబాటులో ఉంచబడినవి. కావున విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, చేనేత కళాకారులను ప్రోత్సహించవలసినదిగా ప్రజలందరిని చేనేత మరియు జౌళి శాఖ కోరుతుంది.

SA: