సంగీత అ’భయంకర’ శ్రీనివాస్….

ఒకసారి ‘మంగళ’ అనే ఓ ప్రముఖ కన్నడ కుటుంబ వారపత్రిక ముఖచిత్రంగా ఒక కుచ్చు టోపీ బొమ్మ వేసి “ఈ టోపీ వాలా ఇంటర్వ్యూ వచ్చేవారమే” అంటూ శీర్షిక రాసింది. కన్నడిగులకు వెంటనే తెలిసిపోయింది ఆ వ్యక్తి ఎవరనే విషయం. చంక నిండా పది పన్నెండు పుస్తకాల దొంతరలు, జేబునిండా డజన్లకొద్దీ రకరకాల రంగుల పెన్నులు, భుజం మీద శాలువా, చిరునవ్వు పెదాలతో ప్రసన్నంగా కనిపిస్తూ నిగర్విగా అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆ సంగీత స్రష్ట, బహుభాషా కోవిదుడు, విలువలున్న రచయిత, జోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, ప్రముఖ నేపథ్య గాయకుడు, పేరులో ఉన్నంత భయంకరుడు కాని ప్రతివాది భయంకర శ్రీనివాసుడు. ఈ సంగీత కోవిదుణ్ణి కలవడం యెంతో సులభం. మద్రాసు లోని ఉడ్ ల్యాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఉదయంపూట ఆయన హాజరు. ఆ హోటల్లో శ్రీనివాస్ కు ఓ ప్రత్యేక టేబుల్. ఎవరైనా వచ్చి ఆయన్ను కలిస్తే, నవ్వుతూ పలకరించి కాఫీకి ఆర్డర్ ఇస్తారు. హైదరాబాదు వస్తే ఆయన అడ్డా మినర్వా కాఫీ హౌస్. “సంగీతం లేనిదే మనిషి జీవితంలో చలనమూ, సంచలనమూ లేదు. మనిషి ప్రతి కదలికలోనూ, మాటలోనూ లయబద్ధమైన స్వరబద్ధమైన సంగీతం వుంది” అనేది శ్రీనివాస్ అభిప్రాయం. చిత్రసీమలో ఎవరి గురించీ చెడు మాట్లాడని సద్గుణశీలుడతడు. లతా మంగేష్కర్, సంగీత దర్శకులు రవి, జయదేవ్ లు అభిమానించే అరుదైన దక్షినాది నేపథ్య గాయకుడుడాయన. ఏప్రిల్ 14 న శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం

నేపథ్యం…

శ్రీనివాస్ పూర్తిపేరు ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు. పుట్టింది 22 సెప్టెంబరు 1930న కాకినాడకు సమీపంలోని గొల్లప్రోలు గ్రామంలో. శేషగిరియమ్మ, ఫణీంద్రస్వామి అతని తల్లిదండ్రులు. తండ్రి కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రారు గా పనిచేసేవారు. తల్లిది మంచి గాత్రం. ఆవిడ జానపదులు, సినిమా పాటలు పాడుతూ వుంటే శ్రీనివాస్ గళం కలుపుతూ వుండేవారు. శ్రీనివాస్ కు చిన్నతనం నుంచి రేడియో వినడం అలవాటు. అందులో వినవచ్చే మహమ్మద్ రఫీ పాటలంటే అతనికి ప్రాణం. తండ్రి వృత్తి రీత్యా సబ్ రిజిస్ట్రార్ కావడంతో శ్రీనివాస్ తన మేనమామ కిళాంబి కృష్ణమాచార్యులు ఇంట్లో ఉంటూ కాకినాడలో చదువుకున్నారు. తమ్ముడు రామనుజంతో కలిసి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తండ్రి పంపే పాకెట్ మనీ సరిపోక చిత్తు కాగితాలు అమ్మగా వచ్చిన డబ్బుతో సినిమాలు చూసేవారు. ఏ సినిమా విడుదలైనా మొదటి ఆటకే హాజరు! అప్పట్లో కాకినాడలో నాలుగు సినిమా హాళ్లు ఉండేవి. సినిమా నచ్చితే ఎన్నిసార్లు చూసేవారో లెక్ఖే లేదు. తెలుగు సినిమాలు ‘రత్నమాల’, ‘బాలరాజు’తో బాటు ‘కిస్మత్’, ‘అనోఖి అదా’ వంటి హిందీ సినిమాలు కూడా శ్రీనివాస్ ను ప్రభావితం చేశాయి. ఈ సినిమాల్లో ఏ పాటలు ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు వస్తాయో గుర్తు పెట్టుకొని, విని, నొటేషన్సు వంటి కొండ గుర్తులతో పాటల్ని గ్రంధస్తం చేసేవారు. ఆ అలవాటే తన చివరి మజిలీ దాకా అనునిత్యం పుస్తకాల్ని చేత్తో మొయ్యడం నేర్పింది. శ్రీనివాస్ లెక్ఖల్లో వెనకబడడంతో తన మేనమామ ఓ మేస్టారి వద్ద ట్యూషన్ కి చేర్చారు. ఆ వంకతో శ్రీనివాస్ కు రాత్రిళ్లు రెండో ఆట చూడడం, నిర్మానుష్యంగా వుండే వీధుల్లో ఒంటరిగా నడవడం అలవాటయ్యింది. ఒకరోజు మంచి శీతాకాలంలో శ్రీనివాస్ రెండో ఆటకు బయల్దేరారు. భయంలేకుండా ఉండేందుకు 1944 లో వచ్చిన చెంచులక్ష్మి చిత్రంలో రావు బాలసరస్వతి పాడిన ‘ఏలుకోవయ్యా ఓ గణేశా మమ్మేలుకోవయ్యా’ పాటని గట్టిగా పాడుతూ తెల్లటి దుప్పటి కప్పుకొని వెళ్తుండడం చూసి కొందరు స్టూడెంట్స్ ఆడపిల్ల అనుకొని శ్రీనివాస్ ని వెంబడించి ముసుగు తొలగించారు. వాళ్లకు శ్రీనివాస్ కనిపించారు. పాటలు బాగా పాడుతున్నాడని ఆ స్టూడెంట్స్ శ్రీనివాస్ ని వాళ్ళ రూమ్ కు తీసుకెళ్ళి పాటలు పాడించుకొని మరీ వదిలారు. అదే శ్రీనివాస్ కి అరంగేట్రం. పన్నెండేళ్ళ వయసులో అతని మేనమామ శ్రీనివాస్ చేత ఒక నాటకంలో పాటలు పాడించారు. అలా సంగీతం మీద శ్రీనివాస్ ఆపేక్ష పెంచుకున్నారు. సంగీతం మీద ఆసక్తివున్నా, అతని తండ్రి శ్రీనివాస్ కు శాస్త్రీయ సంగీతం నేర్పించలేదు. కాకినాడలో పట్టభద్రుడవటమే కాకుండా, హిందీ విశారద పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యారు శ్రీనివాస్. తండ్రికి శ్రీనివాస్ ను ప్రభుత్వ ఉద్యోగంలో నియమింపజేయాలనే ఆసక్తి వుండేది. కానీ శ్రీనివాస్ మద్రాసు వెళ్లి సినిమాల్లో పాటలు పాడుతానన్నారు. అప్పుడు తండ్రి అతణ్ణి ఒక జ్యోతిష్కుడి వద్దకు తీసుకెళ్ళి చూపిస్తే, గాయకుడిగా యితడు రాణించలేడని చెప్పాడు. దాంతో శ్రీనివాస్ కు పట్టుదల పెరిగింది. ఆ జ్యోతిష్కుని జ్యోతిషం తప్పని రుజువు చేయాలనుకున్నారు. పి.ఆర్ కళాశాలలో 1950లో బి.కాం పూర్తిచేసిన శ్రీనివాస్ న్యాయశాస్త్రంలో పట్టా కోసం మద్రాస్ వెళ్తానన్నారు. అసలు మద్రాస్ వెళ్లాలనుకున్నది సినిమాలలో పాటలు పాడుదామని. శ్రీనివాస్ పట్టుదల గ్రహించిన తండ్రి గారు 1951లో శ్రీనివాస్ ను మద్రాసుకు తీసుకొనివెళ్లి తన బంధువైన వైణిక విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి కి అప్పజెప్పారు. శంకరశాస్త్రి అప్పట్లో జెమినీ స్టూడియోలో ఉంటూ సాలూరు రాజేశ్వరరావు వద్ద సహాయకుడిగా పనిచేసేవారు. శంకరశాస్త్రి శ్రీనివాస్ ను జెమినీ. వాసన్ కు పరిచయం చేశారు. వాసన్ ఎదుట శ్రీనివాస్ ‘దీదార్’ సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో మహమ్మద్ రఫీ పాడిన “హుయే హమ్ జిన్ కే లియే బర్బాత్” పాటను పాడి వినిపించారు. వాసన్ కు శ్రీనివాస్ పాడే తీరు నచ్చింది. జెమిని పతాకం మీద ఆర్.కె. నారాయణ్ నవల ఆధారంగా నిర్మించిన హిందీ చిత్రం ‘మిస్టర్ సంపత్’ (1952)లో శ్రీనివాస్ ను నేపథ్యగాయకుడిగా వాసన్ పరిచయం చేశారు. ఆ చిత్రానికి ఈమని శంకరశాస్త్రి, కల్లా బాలకృష్ణ సంగీతం సమకూర్చగా శ్రీనివాస్ అందులో “అజీ హమ్ భారత్ కి నారీ హై సబ్ సే న్యారి”, “లైలా లైలా పుకారూ మై బన్ మే” (గీతా దత్ తో), “లో బారి జిప్సీ” (శంషాద్ బేగం తో) అనే మూడు పాటలను, మరి కొన్ని బిట్లు , కోరస్ లీడ్ లోనూ పాడారు. ఈ చిత్రం తమిళంలో కూడా వచ్చింది. తరవాత సౌండ్ రికార్దిస్ట్ జీవా సహాయంతో దక్షిణ భారత చిత్రసీమలోకి ప్రవేశించారు. ఒక వైపు సినిమాల్లో ప్రయత్నాలు సాగిస్తూనే ‘ప్రియాంక’,‘ప్రియభాషి’, ‘త్రిలోక సంచారి’, విశ్వసాక్షి’ వంటి కలం పేర్లతో అనేక రచనలు చేసారు. అవి చాలా పత్రికల్లో వచ్చాయి. 1954లో రత్తిహళ్లి నాగేంద్రరావు మూడు భాషల్లో ఒకేసారి ‘జాదకం’ (తమిళం), ‘జాతక ఫలం’ (తెలుగు), ‘జాతకఫల’ (కన్నడం) పేర్లతో సినిమా నిర్మించాడు. అందులో సంగీత దర్శకుడు గోవర్ధనం శ్రీనివాస్ చేత రెండు పాటలు పాడించారు. తెలుగు వర్షన్ లో “ఏలా దిగులేలా, ఈ కాలము మారునులే, మరువకే బేలా’’అనే నేపథ్య గీతం తెలుగులో శ్రీనివాస్ పాడిన తొలిపాట. అందులోనే ‘’లోకులు కాకులే లోకమే మాయ, మాయమాటలలోన’’ అనే పాటను కూడా శ్రీనివాసే ఒపాడారు.1955 లో ‘పుత్రధర్మ’ అనే మళయాళ సినిమాలో ‘మమలకల్ కప్పురత్తు’ అనే పాటను తొలిసారి పాడారు. నేటికీ ఆ పాట మళయాళుల ఇళ్ళలో వినిపిస్తూనే వుంటుంది.

నేపథ్య గాయకునిగా తెలుగు చిత్రాల్లో …

శాస్త్ర్రీయ సంగీతం గురుముఖంగా నేర్చుకోకుండా నేపథ్యగాయకునిగా రాణించిన వారిలో శ్రీనివాస్ పేరును ముందుగా చెప్పుకోవాలి. భలేరాముడు (1956) సినిమాలో సాలూరు రాజేశ్వరరావు సంగీతదర్శకత్వంలో పాడిన “భయమేలా ఓ మనసా భగవంతుని లీల, ఇదంతా పరమాత్ముని ఈ లీలా” అనేపాటతో శ్రీనివాస్ కు మంచి గుర్తింపు వచ్చింది. అందులోనే ‘’బంగారుబొమ్మా పదవే పోదాము, పైదేశం చూద్దాం’’ అనే సోలో సాంగ్, పి.లీలతో కలిసి ‘’గోపాలదేవా కాపాడరావా’, యే పాపమెరుఘని పసిపాప’’ అనే మరో రెండు పాటలు కూడా పాడారు. జయభేరి (1959) చిత్రంలో ఘంటసాల, రఘునాథ పాణిగ్రాహి లతో కలిసి పాడిన త్రిగళ గీతం ‘మది శారదాదేవి మందిరమే’ శ్రీనివాస్ కు మంచి పేరు తెచ్చింది. 1960 లో ‘భక్త కనకదాస’ అనే కన్నడ చిత్రంలో ఏకంగా 6 పాటలు పి.బి పాడడంతో కన్నడ చిత్రాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. పాటకు బాణీ కట్టే సంగీత దర్శకుని అంచనాలకు మించి పాడడం శ్రీనివాస్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తమిళంలో ఎం.ఎస్. విశ్వనాథన్ శ్రీనివాస్ తోనే ఎక్కువ పాటలు పాడించారు. తెలుగులో సాలూరు రాజేశ్వరరావు కి కూడా బేస్ వాయిస్ లో పాడే శ్రీనివాస్ గాత్రమంటే చాలా ఇష్టం. 1960 లో భీష్మ చిత్రం కోసం శ్రీనివాస్ “మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా” అనే పాటను సాళ్వుడు, అంబ పాత్రలకోసం సుశీలతో కలిసి ఆలపించారు. కల్యాణి రాగంలో మట్లు కట్టిన ఈ పాట వినేందుకు యెంత హాయిగా వుంటుందో పాడేందుకు చాలా కష్టం. ఇలాంటి పాటలు పాడేందుకు శ్రీనివాస్ నే సంగీత దర్శకులు ఎక్కువగా వాడుకునేవారు. అదే సంవత్సం విడుదలైన ‘శాంతినివాసం’ చిత్రంలో నాగయ్య కోసం “శ్రీరఘురాం జయరఘురాం సీతా మనోభిరాం” అనే పాటను ఘంటసాల సంగీత సారధ్యంలో శ్రీనివాస్ అద్భుతంగా పాడారు. “శ్రీరామ చంద్రః” అనే శ్లోకంతోబాటు హంసధ్వని రాగంలో ఈ పాట వినిపిస్తుంది. అలాగే రంగులరాట్నం సినిమాలో రాజేశ్వరరావు అతి క్లిష్టమైన పటదీప్ రాగంలో స్వరపరచిన “మనసు మనసు కలిసేవేళా మౌనమేలనే ఓ చెలియా” పాటను సుశీలతో కలిసి భావయుక్తంగా పాడారు శ్రీనివాస్. భక్తశబరి చిత్రంలో శ్రీనివాస్ ఆలపించిన “ఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి” పెండ్యాల స్వరపరచిన గీతాల్లో ఒక రససుధ అని చెప్పాలి. అయితే ఆయన కొన్ని సరదాగా వుండే హాస్య గీతాలు కూడా ఆలపించారు. కులగోత్రాలు సినిమాలో “రావే రావే బాలా హలో మై డియర్ లీలా ఇటురావే” (జమునారాణితో), “చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్వినచాలే” (సుశీలతో), దేవాంతకుడు సినిమాలో “గోగోగోగో గొంగూరా జైజైజైజై జైఆంధ్ర” పాటలు ఈ కోవలోనివే. ఇక గుత్తా రామినీడు 1966 లో భక్తపోతన సినిమా నిర్మించారు. అందులో భోగినీ దండకం, భాగవత పద్యాలు శ్రీనివాస్ చేత పాడించారు. శ్రీనివాస్ ఎంత గొప్పగా పాడినా నాగయ్య గారి భక్తపోతన సినిమా ముందు గుమ్మడి నటించిన సినిమా తేలిపోవడంతో శ్రీనివాస్ పాడిన పాటలు, పద్యాలు మరుగున పడ్డాయి. 1977లో బాపు నిర్మించిన స్నేహం, 1978లో నిర్మించిన గోరంతదీపం సినిమాల్లో మహదేవన్ శ్రీనివాస్ చేతనే ఎక్కువ పాటలు పాడించారు. ఇవి కాకుండా లేతమనసులు సినిమాలో విశ్వనాథన్ శ్రీనివాస్ చేతనే పాటలు పాడించారు. హీరో ఎన్టీఆర్ అయినా ఆడబ్రతుకు సినిమాలో “బుజ్జిబుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి”, “తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా”, మనసేమందిరంలో ‘’తలచినదే జరిగినదా దైవం ఎందులకో’’ వంటి అద్భుతమైన పాటలు పాడించారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీనివాస్ తెలుగులో పాడిన పాటలు కోకొల్లలు. తెలుగులో శ్రీనివాస్ ఎన్నో ప్రైవేట్ రికార్డులకోసం పాటలు పాడారు. వాటిలో ఎక్కువగా వున్నవి భక్తిపరమైనవే. కృష్ణశాస్త్రి రాసిన “పడవ నడపవోయ్”, “ఇదేకదా తొలిరేయి”, “ఉదయ సమీర సాంధ్య లాస్యము”, “ప్రణయసీమ పయనమౌదమా”, “రాదటే చెలి రాధికా” వంటి లలితగీతాలు బహుళ జనాదరణ పొందాయి.

భాగేశ్రీ తో ఘంటసాలను మైమరపిస్తూ…

ఒకే పాటను ఇద్దరు పాడితే సారూప్యం కోసం వెదకుతారు సంగీతాభిమానులు. ఎవరు బాగా పాడారు అనే విషయం మీద గొప్ప చర్చే జరుగుతుంది. అలాంటి సంఘటనలు అమరగాయకులు ఘంటసాల కు శ్రీనివాస్ ఎదురయ్యాయి. హిందీలో కిషోర్ కుమార్ నిర్మించిన ‘దూర్ గగన్ కి ఛావోం మే’ (1964) కథను ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్ అటు తమిళం ఇటు తెలుగు లో ‘రాము’ (1966) పేరుతో సినిమాగా నిర్మించారు. తమిళ చిత్రానికి ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకుడు. ఆయన సహాయకుడు ఆర్. గోవర్ధనం తెలుగు సినిమాకు సంగీతం కూర్చారు. ముఖ్యంగా కణ్ణదాసన్ రాసిన “నిలవే ఎన్నిడం నెరుంగాదే నీ నినైక్కుం ఇడత్తిల్ నాన్ ఇల్లై” అనే పాటను విశ్వనాథన్ హిందూస్తానీ రాగం భాగేశ్రీలో స్వరపరచి హిట్ చేశారు. ఎంతో ఆర్ద్రతతో ఆ పాటను విషాదభరితంగా ఆలపించింది శ్రీనివాస్, అభినయించింది జెమిని గణేశన్. తెలుగు వెర్షన్ కి సంగీత దర్శకుడైన ఆర్. గోవర్దనం ఘంటసాల చేత ఈ పాటను పాడించాలని రిహార్సల్స్ లో పి.బి తమిళ్ వెర్షన్ పాటను ఆయనకు వినిపించాడు. పి.బి పాట చాలా బాగుందని, ఆయన చేతే తెలుగు పాట కూడా పాడించమని ఘంటసాల ఎంత చెప్పినా, అది ఎన్.టి.ఆర్ కి బోల్డ్ వాయిస్ తో పాడాలి కనుక ఘంటసాల చేతనే పాడించడం జరిగింది. బి.ఆర్. పంతులు కన్నడంలో నిర్మించిన ‘గాలి మేడలు’(1962) చిత్రంలో ‘మమతలు లేని మనుజులలోన’ పాటని పి.బి చేత సంగీత దర్శకుడు టి.జి. లింగప్ప పాడించారు. తెలుగులో ఎన్.టి.ఆర్ హీరో కావడం చేత ఘంటసాలతో పాడించాలని చెప్పినప్పుడు కూడా మేష్టారు ఒప్పుకోలేదు. “పి.బి అంత మార్దవంగా నేను పాడలేను. పి.బి చేతే ఆ పాట పాడించండి” అని చెప్పినా చివరకు మేస్టారే ఆ పాట పాడవలసి వచ్చింది. ఇక చెంచులక్ష్మి (1958) సినిమాలో ‘’చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ అనే పాట తొలుత శ్రీనివాస్, సుశీల చేత పాడించారు. తర్వాత సినిమాలో అదే పాటను ఘంటసాల, జిక్కి చేత పాడించి చిత్రీకరణ జరిపారు. ఈ రెండు రికార్డులూ మార్కెట్ లో విడుదలయ్యాయి. అవి వేటికి అవే సాటి. అందులోనే ‘’చిలక గోరింక కులుకే పకాపకా నేనే చిలకైతే నీవే గోరింక, రావా నావంక’’ అనే పాటను కూడా తొలుత శ్రీనివాస్, సుశీల చేత పాడించారు. సినిమాలో మాత్రం అదే పాటను ఘంటసాల, జిక్కి చేత మరలా పాడించి సన్నివేశ చిత్రీకరణ జరిపారు. ఇవికూడా రికార్డులుగా విడుదలై మంచి పెరుయి సంపాదించాయి. 1969లో విడుదలైన ఏ.వి.ఎం వారి మూగనోము చిత్రంలో సంగీత దర్శకుడు ఆర్. గోవర్దనం శ్రీనివాస్ చేత ‘ఊవూరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా’’ అనే ఆరుద్ర రాసిన నేపథ్య గీతాన్ని పాడించారు. చిత్రీకరణ సమయానికి అదే గీతాన్ని ఘంటసాల చేత పాడించి చిత్రీకరణ జరిపారు. ఇవి రెండు కూడా రికార్డులుగా విడుదలయ్యాయి. రెండు పాటలూ హిట్టే!. చిత్రరంగంలో ఇలాంటి విషయాలు మామూలే!కార్తవరాణి కథ చిత్రంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన ‘’ఆనంద మోహనా ఖగరాజ వాహనా, అవతార లీలా విలాసా లోకేశా’’ అనే పాటను పి. బి. శ్రీనివాస్ అత్యద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రానికి జి. రామనాథ్, అశ్వద్ధామ సంగీతం సమకూర్చారు. అందులోనే శ్రీనివాస్ మరో రెండు పాటలు కూడా పాడారు.

తమిళ గాయకుడిగా …

నరసూ స్టూడియోస్ 1957 లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో భలేఅమ్మాయిలు చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. అందులో శ్రీనివాస్ చేత “నాణెమైన సరుకుందీ లాహిరీ”, “చీటికి మాటికి చీటీ కట్టి వేధించే వా నాడు” వంటి పాటలు పాడించారు. అదే సినిమాని ‘అడుత్త వీట్టు పెణ్’ (1960) పేరుతో అంజలీ పిక్చర్ వారు తమిళంలో పునర్నిర్మించారు. అందులో కూడా శ్రీనివాస్ ఆలపించిన “మాలయ్యిల్ మలర్ సొలయ్యిల్”, “కణ్ణాలే పేసి పేసి”, “వాడత్తా పుష్పమే వనిత్తా మణియే” పాటలు సూపర్ హిట్లయ్యాయి. సంగీత దర్శకుడు రామనాథన్ శ్రీనివాస్ ని బాగా ప్రోత్సహించారు. జెమినీ గణేశన్ కు శ్రీనివాస్ చేతనే సంగీత దర్శకులు ఎక్కువ పాటలు పాడించారు. తమిళంలో బలే పాండియన్, నెంజిల్ ఒరు ఆలయం(మనసే మందిరం), శుమైతాంగి, కాదలిక్క నేరమిల్లై(ప్రేమించి చూడు), పోలీస్ కారన్ మగళ్(కానిస్టేబుల్ కూతురు), పాదకాణిక్కై, మణప్పందల్ (ఇంటికి దీపం ఇల్లాలే), వీర తిరుమగన్ సినిమాలకు శ్రీనివాస్ పాడిన పాటలు అద్భుతాలు సృష్టించాయి. పావ మన్నిప్పు లో జెమిని గణేశన్ కోసం విశ్వనాథన్ స్వరపరచిన “కాలంగళిల్ ఆవళ్ వసందం” తమిళులకు యెంతో ఇష్టమైన పాట. శుమైతాంగిలో “మణిదన్ ఎన్బవన్ దైవమాఘళాo” అంటూ శ్రీనివాస్ పాడిన నిరాశా నిస్పృహలకు సంకేతమైన పాట కూడా తమిళులకు యెంతో ఇష్టం. ఇలా చెప్పుకుంటూపోతే రాయడానికి స్థలం చాలదు.

కన్నడ గాయకుడిగా …

కన్నడ కంఠీరవ రాజకుమార్ తన సినిమాల్లో పాటల్ని తనే పాడుకునేవారు. జి.కె. వెంకటేష్ కు శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. ఆయన ‘ఒహిలేశ్వర’ (1956) అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు శ్రీనివాస్ కు పాడే అవకాశం ఇద్దామని ప్రతిపాదిస్తే పెద్దమనసుతో రాజకుమార్ “సరే” అన్నారు. శ్రీనివాస్ ఆలపించిన “ఈ దేహదింద దూరనాడే ఏకే ఆత్మనే” అనే భక్తి గీతం రాజకుమార్ కు బాగా నచ్చింది. జి.కె వెంకటేష్ చొరవతోనే ‘భక్త కనకదాస’ చిత్రంలో రాజ్ కుమార్ కి అన్ని పాటలూ పి.బినే పాడారు. దాంతో రాజ్ కుమార్ సొంతంగా పాడుకోవటం మాని, పి.బి చేతనే తన సినిమాలన్నిటికీ పాటలు పాడించుకున్నారు. అలా ఈ ప్రస్థానం 20 సంవత్సరాలు కొనసాగింది. రాజ్ కుమార్ కి పి.బి దాదాపు 30౦ పైగా పాటలు పాడారు. 1974 వరకు రాజ్ కుమార్ లో పి.బి కంఠమే వినపడేది. ‘సంపత్తిగే సవాల్’ చిత్రానికి రాజ్ కుమార్ కి ‘యారె కూగదలి’ అనే పాట పి.బి పాడాల్సి వుండగా కారణాంతరాలవల్ల పాడలేకపోతే జి.కె వెంకటేష్ ఆ పాటను రాజ్ కుమార్ చేతే పాడించడంతో మరలా రాజ్ కుమార్ గాయకుడిగా మారారు. పి.బిని ఇప్పటికీ కన్నడిగులు తమవాడిగానే అభిమానిస్తారు. రాజకుమార్ సమకాలికులు కళ్యాణ కుమార్, ఉదయ కుమార్ లకు, ఆ తరవాతి తరంలో వచ్చిన గంగాధర్, శ్రీనాథ్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి హీరోలకు కూడా కూడా శ్రీనివాసే పాటలు పాడారు. ఒకానొక సందర్భంలో రాజకుమార్ “నేను శరీరమైతే శ్రీనివాస్ నా శారీరం” అని కీర్తించారు. ఆ ప్రియోక్తిని శ్రీనివాస్ తనకు పద్మ పురస్కారంతో సమానమని చెప్పుకున్నారు. కన్నడ చిత్రసీమకు అద్భుత సంగీతం సమకూర్చిన టి.జి. లింగప్ప, జి.కె. వెంకటేష్, విజయభాస్కర్, రాజన్ నాగేంద్ర, ఎం. రంగారావు శ్రీనివాస్ చేతనే ఎక్కువ పాటలు పాడించారు. ‘నాంది’ సినిమాలో “హోడొందు హాడువే నే కేళు మగువే”, ‘బెళ్లిమోడ’ చిత్రంలో “ఒడయితు ఒలవిన కన్నడి”, ‘ఉయ్యలె’ చిత్రం లో “నగుత హాడలె అళుత హాడలే” పాటలు కన్నడ లో హిట్టయిన వాటిలో కొన్ని మాత్రమే. విజయనగర వీరపుత్ర, గంధరగుడి, మన మెచ్చిద హడుగి, తాయి కరుళు సినిమాల్లో శ్రీనివాస్ అద్భుతాలు సృష్టించారు. విజయభాస్కర్ సంగీత దర్శకత్వంలోవచ్చిన ‘గజ్జెపూజ’ చిత్రంలో “పంచమ వేద ప్రేమద నాద ప్రణయద సరిగమ” పాట, ‘సౌభాగ్య’ చిత్రంలో వెంకటేష్ సంగీత సారధ్యంలో ఆలపించిన “రవివర్మన కుంచద కలే” (తెలుగులో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో-రావణుడే రాముడైతే) పాటలు శ్రీనివాస్ సంగీత చరిత్రలో కీర్తి కిరీకిరీటాలుగా నిలిచాయి.

శ్రీనివాస్ గురించి మరిన్ని విశేషాలు

ఏ.వి.ఎం వారు తెలుగులో హిట్ ఐన ‘నాదీ ఆడ జన్మే’ చిత్రాన్ని హిందీలో ‘మై భి లడ్కి హూ’(1964) పేరిట నిర్మించినప్పుడు రఫీ పాడాల్సిన పాటను లతతో కలిసి పాడే అవకాశం శ్రీనివాస్ కు దక్కింది. మద్రాస్ లో జరిగిన ‘చందా సే హోగా ఓ ప్యారా’ అనే పాట మ్యూజిక్ సిట్టింగ్స్ లో సంగీత దర్శకుడు చిత్రగుప్తను మేల్ సింగర్ ఎవరని లత అడిగితే ఆయన శ్రీనివాస్ పేరు చెప్పారు. పేరు వినగానే “ఒక మదరాసీ హిందీ పాటేంపాడుతాడు? అతనితో నేను పాడటమా” అంటూ మాట జారింది. చిత్రగుప్త “రఫీతో నువ్వు పాడటం లేదు కదా” అని అంటే, “రఫీ లేకుంటే ముఖేష్ లేడా, మన్నాడే లేడా.. ఎవరూ లేనట్టు ఈ మదరాసీతో పాడటమా” అంటూ లత ఒకరకంగా అవహేళన చేసింది. అది వినిన శ్రీనివాస్ మాత్రం మాట జారలేదు. తన పాటతోనే జవాబిచ్చారు. శ్రీనివాస్ హిందీ ఉచ్చారణకు లతా బిత్తరపోయింది. ఆయన స్వర శ్రావ్యతకు ఆశ్చర్యపడింది. బొంబాయి వెళ్లిన వెంటనే పదిమంది సంగీత దర్శకులకు శ్రీనివాస్ వాయిస్ ని సిఫార్సు చేసింది. లతాజీ అన్ని మాటలన్నా శ్రీనివాస్ కు ఆమెంటే ఎంతో గౌరవం. ఎంత గౌరవం అంటే… శ్రీనివాస్ తన కూతురుకి ‘స్వర్ణలత’ అని పేరు పెట్టారు. అంతే కాదు, లతా మంగేష్కర్ జీవిత చరిత్రను హాసం పత్రికలో సీరియల్ గా రాశారు. ఆమె పై ఒక్క పరుష వాక్యం కూడా రాయలేదు. వివాస్పద వ్యాఖ్యలకు శ్రీనివాస్ ఎప్పుడూ దూరమే! బొంబాయి వెళ్లడం ఇష్టం లేక శ్రీనివాస్ దక్షిణ భారత చిత్రరంగంలోనే స్థిరపడ్డారు. హిందీ సంగీత దర్శకుడు జయదేవ్ ఒక కన్నడ చిత్రానికి సంగీతం ఇస్తూ సుమన్ కల్యాణపుర్, పి.బి శ్రీనివాస్ లతో ఒక హాంటింగ్ డ్యూయెట్ పాడించారు. పి.బి స్వరాన్ని జయదేవ్ ఎంతగానో కొనియాడేవారు. ఎందుకంటే శ్రీనివాస్ ది సిల్కీ అండ్ బేస్ వాయిస్. ఎంతో మార్దవంగా వుంటుంది. బి.ఎస్. రంగా కన్నడంలో తీసి హిందీలోకి డబ్ చేసిన ‘మహిషాసుర మర్దని’ లో ‘జగ్ కీ తారన్ హారీ’ పాట పి.బి ఆలపించిన విధానం జయదేవ్ కి ఎంతో నచ్చిన పాట. బొంబాయి వచ్చినప్పుడల్లా పి.బి చేత ఈ పాటని పాడించుకొనేవారు.

1985 లో ఇళయరాజా ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘నథింగ్ బట్ విండ్’ అనే ఆల్బం తీసుకొచ్చారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ హిందీ చిత్ర సంగీత దర్శకుడు నౌషాద్ అలీ వచ్చారు. నౌషాద్ హిందీ ప్రసంగాన్ని పి.బి అనువదిస్తున్నారు. పి.బికి నౌషాద్ సాబ్ అంటే వీరాభిమానం. నౌషాద్ మాట్లాడుతూ “ఇళయరాజా నాకంటే గొప్ప కంపోజర్” అన్నారు. పి.బి కల్పించుకుని “నౌషాద్ జీ మీ మాట నేను అంగీకరించను. కాబట్టి మీ మాటను అనువదించను” అని కరాఖండిగా చెప్పేశారు.

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై తొలిసారి కాలుమోపిన సందర్భంగా 1969లో శ్రీనివాస్ “మాన్ టు మూన్”, “మూన్ టు గాడ్” అనేపాటలు రాసి, జానకితో కలిసి ఆలపించి రికార్డు చేసి, ఆ ఆల్బంను అలనాటి అమెరికన్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు అపోలో వ్యోమగామి ఆర్మ్ స్ట్రాంగ్ కు పంపారు. చంద్రుని నేపథ్యంలో వచ్చే పాటలు పాడడంలో శ్రీనివాస్ ఘనుడని తమిళులు భావిస్తారు.

గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తనకు బాగా ఇష్టమైన పాటగా కన్నెవయసు (1973) చిత్రంలో పాడిన “ఏ దివిలో విరిసిన పారిజాతమో” ను ఉదాహరిస్తూ వుంటారు. ఆ పాటను 1968లోనే శ్రీనివాస్ ‘గాంధీనగర’ అనే చిత్రంలో సత్యం సంగీత దర్శకత్వంలో పాడారు. బాలు కి శ్రీనివాస్ అంటే చాలా గౌరవం. ఒకసారి సంగీత దర్శకుడు ఎల్. వైద్యనాదన్ శ్రీనివాస్ పాడాల్సిన పాటను బాలును పాడమంటే, కాదని శ్రీనివాస్ చేతే పాడించారు. పైగా శ్రీనివాస్ ఆ పాటను పాడి రికార్డు చేసేదాకా అక్కడే వుండి పాట పాడాక ఆయనకు పాదాభివందనం చేసి మరీ వెళ్ళారు.

1956లో హిందీలో వచ్చిన ‘నయీ దిల్లీ’ సినిమాను తమిళంలో ‘కూడి వాగ్దాళ్ కోడి నణ్నై” గా నిర్మించారు. మాతృకలో కిషోర్ కుమార్ పాడిన “నఖరేవాలి దేఖనే మే దేఖ్ లో హై” అనే పాటలో యూడిలింగ్ వస్తుంది. తమిళంలో కూడా యూడిలింగ్ రావాలని నిర్మాత పట్టుబట్టడంతో ఆ పాటను ఆలపించిన శ్రీనివాస్ కు బ్రహ్మప్రళయమైంది. వారంరోజులు కుస్తీ పట్టి ఆ పాటను ఆలపించారు. యూడిలింగ్ అలవాటు లేని తమిళ ప్రేక్షకులు వాటిని నక్క కూతలు, కుక్క కూతలు అంటూ విమర్శించారు. కాదలిక్క నేరమిల్లై సినిమా వచ్చేసరికి యూడిలింగ్ ప్రక్రియ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకలిరాజ్యం’ సినిమాలో జానకి ఆలపించిన “తూ హై రాజా మై హూ రాణి” పాటను రాసింది శ్రీనివాసే. శ్రీనివాస్ హిందీలో చాలా గజళ్ళు పాడారు. ‘షాబాష్’ అనే కలం పేరుతో పి.బి ఎన్నో గజళ్లు రాశారు. దర్శకుడు బాపు తన ‘గోరంతదీపం’(1978) చిత్రంలో పి.బి చేత కొన్ని గజల్ సంప్రదాయపు గీతాల్ని పాడించారు. ‘పూలు తాకినంత కందిపోయే’(సినారె); ‘చీర మార్చి బొట్టు తీర్చి’(దాశరథి)గీతాల్ని పి.బి. అద్భుతంగా ఆలపించారు. ‘నవనీత సుమ సుధా’ అనే నూతన రాగాన్ని పి.బి ఆవిష్కరించారు. తెలుగులో రాజనందిని (1958) సినిమాలో రాజా, సుశీల పాడిన “అందాలు చిందు సీమలో” పాటను హిందీలో “నైనా జో నైన్ సే మిలే” అంటూ శ్రీనివాస్ పాడడం విశేషం.

కె.బి. తిలక్ నిర్మించిన అత్తా ఒకింటి కోడలే (1958) చిత్రంలో సంగీత దర్శకుడు పెండ్యాల ‘’పైలా పైలా పచ్చీసు పరువం లోని లేడీసూ మగాళ్లతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్సు’’ అనే పాటను రికార్డ్ చేస్తున్నప్పుడు రిథమ్ కాంప్లికేషన్ వలన శ్రీనివాస్, జిక్కి ఇద్దరూ టేకు మీద టేకులు తినవలసి వచ్చింది. ఎలాగైతేనేం అర్ధరాత్రి గాని ఆ పాట ఒక కొలిక్కి రాలేదు. ఏదో పాడేశాంలే అనిపించారు ఇద్దరూ. అయితే శ్రీనివాస్ కు గాని, పెండ్యాలకు గాని సంతృప్తిగాలేదు. చివరకు పెండ్యాల ఏంచేశారోగాని సినిమాలో ఆ పాటవిన్నప్పుడు ‘’ఇంత చక్కగా మేమెప్పుడు పాడాం’’ అనుకున్నారు శ్రీనివాస్. పాటను బాగా వచ్చేదాకా పాడే ప్రయత్నం చేయడంలో శ్రీనివాస్ ముందుంటారు.

దక్షిణభారతదేశ సినిమా గానాన్ని ప్రభావితం చేసిన గాయకుడుశ్రీనివాస్. దక్షిణభారతదేశపు తొలి గౙల్ దార్శనికుడు, రచన, గానంలో గౙలియత్ పై అవగాహనవున్న దక్షిణాది కళాకారుడు పి. బి. శ్రీనివాస్. ప్రణవం పేరుతో ప్రపంచంలో ఎనిమిది భాషల కవితా సంకలనాన్ని వెలువరించిన తొలి కవి కూడా అతడే. ఆయనకు ఎనిమిది భాషలమీద మంచి పట్టుంది. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. సంగీత దర్శకత్వం నెరపారు. వేలకొద్దీ కవితలు రాశారు. ఆకాశవాణికి పాటలు పాడారు. మూడు నాలుగు కన్నడ సినిమాల్లో వేషాలు కూడా వేశారు. తమిళనాడు ప్రభుత్వం శ్రీనివాస్ కు ‘కలైమామణి’ పురస్కారం అందించింది. కర్నాటక ప్రభుత్వం ‘రాజోత్సవ’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 14 ఏప్రిల్ 2013 న కాలం చేసిన ఆ మహానుభావుని గౌరవించని వారు ఎటొచ్చీ మన తెలుగువారే! అదే మన దౌర్భాగ్యం!!

-ఆచారం షణ్ముఖాచారి

1 thought on “సంగీత అ’భయంకర’ శ్రీనివాస్….

  1. 14 ఏప్రిల్ 2013 న కాలం చేసిన ఆ మహానుభావుని గౌరవించని వారు ఎటొచ్చీ మన తెలుగువారే! అదే మన దౌర్భాగ్యం!!…. CORRECT.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap