సురేంద్ర కు ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ …

ఆర్టిస్టుగా, కార్టూనిస్టు గా నాలుగు దశాబ్దాల పత్రికా జీవితం సురేంద్ర ది. 1996 సంవత్సరం నుండి ‘ది హిందూ ‘ నేషనల్ డైలీలో కార్టూన్ ఎడిటర్ గా వున్నారు సురేంద్ర. నవ తెలంగాణా పత్రిక ప్రతీ యేటా బహుకరించే ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ ను 2019 సంవత్స్రానికి గాను కార్టూనిస్ట్ సురేంద్ర నేడు అందుకోనున్నారు. ఈ సందర్భంగా కార్టూనిస్ట్ సురేంద్ర పరిచయం 64కళలు.కాం పాఠకుల కోసం….

రామకృష్ణా రెడ్డి, చిన్నమ్మ దంపతులకు 1962లో హనుమనగుత్తి, కడపజిల్లాలో జన్మించిన సురేంద్ర చదివింది బియస్సీ. వీరి పూర్తి పేరు సురేంద్రనాద్ రెడ్డి. సురేంద్ర కార్టూనిస్టుగా మారడం అన్నది యాదృచ్ఛికంగా జరిగింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సర్ఎడిటర్‌గా ఉద్యోగం రావడంతో సురేంద్ర తండ్రి శ్రీరామకృష్ణారెడ్డి తన కుటుంబాన్ని 1978లో కడపనుండి విజయవాడకు తరలించారు. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న సురేంద్ర కు మామూలు పాఠ్యాంశాల కంటే పాఠ్యేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి వుండేది. తన తండ్రి రామకృష్ణారెడ్డి మంచి రచయితే కాక ఆంధ్రజ్యోతి వారపత్రికకు సర్ఎడిటర్ కూడా కావడంతో విజయవాడలోని వారింటికి చాసో, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, వేగుంట మోహన ప్రసాద్ ఇత్యాది ప్రఖ్యాతకవులు, సాహితీవేత్తలు వస్తుండడంతో వారిని చూడడమే కాక వారి యొక్క సంభాషణలను వినే అవకాశం కూడా సురేంద్ర కు కలిగింది. అంతేకాక శేఖర్, అరుణ్, రామకృష్ణ, తలసీరాం, శంకు, బాలి, రవిశంకర్, రాగతిపండరి వంటి వారి కార్టూనిస్టుల కార్టూన్లను సురేంద్ర తండ్రిగారైన శ్రీరామకృష్ణారెడ్డి సెలక్ట్ చేస్తూ వుండడంతో ప్రత్యక్షంగా వివిధ కార్టూనిస్ట్ యొక్క ఒరిజనల్ కార్టూన్లను చూసే అవకాశం కూడా కలగడంతో క్రమక్రమంగా సురేంద్ర కు కార్టూన్లపై ఆశక్తి ఏర్పడింది.

స్ఫూర్తి: ఆ రోజుల్లో ప్రముఖ చిత్రకారుడూ, కార్టూనిస్ట్ అయిన మోహన్ విశాలాంధ్ర దినపత్రికలో సర్ఎడిటర్ గానే కాక ఆర్టిస్ట్ గా కూడా పనిచేసేవారు. ఆర్టిస్ట్ గా విశాలాంధ్ర వారి పుస్తకాలకు ఆయన వేసే ముఖచిత్రాలు, ఆయన రాసే ఒక ప్రత్యేకమైన రాత సురేంద్ర ను బాగా ఆకర్షించేవి. అందుకేనేమో సురేంద్ర తొలినాళ్ళలో వేసిన కార్టూన్లపై మోహన్ ప్రభావం బాగా కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో సురేంద్ర తనదైన సొంతశైలిని ఏర్పర్చుకున్నారు. అలాగే ఆరోజుల్లో విజయవాడ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఎదురుగా ఉన్న మైత్రి బుక్ హౌస్ లో మంచి-మంచి రంగుల బొమ్మలతో ఉండే చైనీస్ పుస్తకాలు సురేంద్రను బాగా ఆకట్టుకునేవి. అందుచేతనే సురేంద్ర ఎక్కువగా ఆ మైత్రి బుక్ హౌస్లో ఉండేవారు. మైత్రి యజమాని శ్రీ విశ్వేశ్వరరావుగారు సురేంద్రను తన పెట్టే ప్రతి బుక్ఎగ్జిబిషకూ తీసుకువెళ్లడమే గాక సురేంద్రలోని బొమ్మలపట్ల ఆసక్తిని గమనించి “బాలకుంచె” అని పేరు పెట్టి బాగా ప్రోత్సహించారు. మొదట్లో తండ్రి రామకృష్ణారెడ్డి ఆలోచనలు ఇస్తే వాటి ఆధారంగా వివిధ కార్టూనిస్టుల గీతల ప్రభావంతో కార్టూన్లు వేసేందుకు ప్రయత్నం చేసేవాడు సురేంద్ర. కాలక్రమంగా స్వంతంగా వేయడం, తన మొదటి కార్టూన్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో తన కార్టూన్లు ప్రచురింపబడుతూ ఉండేవి.

ఉద్యోగ ప్రస్థానం: జీవితంలో కొందరి మంచి మిత్రుల పరిచయాలు, సహవాసాలు మనిషి ఉన్నతికి ఎంతలా దోహదపడతాయో చెప్పడానికి గొప్ప ఉదాహరణ సురేంద్ర జీవితం. సురేంద్ర తొలిసారిగా తన ఉద్యోగ ప్రస్థావాన్ని తన మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ కి స్వయానా బావగారు శ్రీ నిజం శ్రీరామూర్తిగారి సిపారస్ పై లేఅవుట్ ఆర్టిస్ట్ గా నెలకు రూ.250/-జీతంపై హైదరాబాద్ లోని శ్రీవినుకొండ నాగరాజు గారి “కమెండో” అన్న పత్రికలో ఉద్యోగం ప్రారంభించారు. హైదరాబద్ లో నివాసం, చాలీచాలని జీతం. ఈ సమయంలోనే పవిత్ర కూటమిలో ఒకరైన చిత్రకారుడు కాళ్ళ సురేంద్రను తన మరో మిత్రుడైన గులాంగౌస్ వద్దకు పంపించారు. కమెండోలో పనిచేసిన నాలుగునెలల కాలం గులాంగౌస్ దగ్గర గడిపితే ఆ తర్వాత ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న సురేంద్రను హైదరాబాద్లో అప్పటికే ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న శ్రీ కె. లక్ష్మారెడ్డికి పరిచయం చేసి పనిదొరికేలా చేసింది ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్ట్ అయిన మోహన్. 1983లో సురేంద్ర ఆదివారం, బాలచంద్రిక వారపత్రికలకు బొమ్మలు, కార్టూన్లు వేసేవారు. అదే కాలంలో బాలల అకాడమీ బాలచంద్రికకు సంబంధించిన చొక్కాపు వెంకటరమణ పరిచయం. ఆదివారం వారపత్రిక అనంతరం 1984లో ఆంధ్రభూమికి సురేంద్ర ను పరిచయం చేసిన వ్యక్తి చొక్కాపు వెంకటరమణ. ఆంధ్రభూమిలో సురేంద్ర 1984 నుండి 1990 వరకూ పనిచేసారు. ఆ కాలంలో గజ్జెల మల్లారెడ్డి రాజకీయ వ్యంగోక్తులుగా అల్లన కవితలకు సురేంద్ర వేసిన బొమ్మలు బాగా ఆదరణను పొందాయి. ఆ తర్వాత కాలంలో “అక్షింతలు” పేరుతో ఈ వ్యంగ్యోక్తులన్నీ పుస్తక రూపంలోకి రావడం జరిగింది. 1990 నుండి 1995 వరకూ “ఉదయం” దిన పత్రికలో పనిచేసారు. అనంతరం 1995 నుండి జూన్ 1996 వరకూ మరలా ఫ్రీలాన్సర్ గానే వుంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు పత్రికలయిన ఆంధ్రప్రభ, హిందీ మిలాప్, మరియు సిటిజన్స్ ఈవినింగ్ అనే ఆంగ్ల పత్రిక ఈ మూడింటికీ ఏకకాలంలో పనిచేసారు.
1996 జూన్ నుండి “ది హిందూ” ఆంగ్ల దినపత్రికలో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

సురేంద్ర కార్టూన్ ప్రదర్శన: 2011 మార్చినెల 19వ తేదీనుండి ఏప్రిల్ 2 వరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు, బెంగుళూరువారి ఆధ్వర్యంలో ఇండియన్ కార్టూన్ గాలరీ బెంగుళూరులో రెండు వారాలపాటు విజయవంతంగా తన కార్టూన్లను ప్రదర్శించి కార్టూన్ ఇష్టులను అలరించారు, ఆలోచింపజేసారు.

2 thoughts on “సురేంద్ర కు ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ‘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap