సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

(విధిచేసిన వింత…. వాణిజయరాం హఠాన్మరణం)ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం…

70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. కేవలం శ్రోతలే కాదు… ఆపాటను విన్నప్పుడల్లా ఆమె కళ్ళలో నీళ్లు వుబికేవి. ‘గుడ్డి’ సినిమాలో వినిపించిన ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అదే ఆమె పాడిన మొదటి సినిమా పాట. ఆ మొదటి పాటతోనే హిందీ చిత్రసీమలో వాణిజయరాం పేరు మారుమ్రోగి పోయింది. సంప్రదాయ కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతురాలైన వాణిజయరాం పాటలు విలక్షణంగా ఉండేవి. క్రమంగా నౌషాద్, మదన్ మోహన్, జయదేవ్, చిత్రగుప్త, ఓ.పి. నయ్యర్, ఆర్.డి. బర్మన్, కల్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి సంగీత దర్శకులు వాణిజయరాంకు మంచి అవకాశాలు ఇవ్వటం మొదలైంది. చలనచిత్రరంగం ఆమెను ‘భారతీయ నైటింగేల్’ అని పిలవసాగింది. అప్పటికే వేళ్ళూనుకొని వున్న కొందరికి బాలీవుడ్ లో ఆమె ఎదుగుదల రుచించలేదు. సహజంగానే రాజకీయం నడిపారు. సున్నిత మనస్కురాలైన వాణిజయరాం కి మనస్తాపం కలిగింది. వెంటనే మద్రాసుకి మకాం మార్చింది. అలా తెలుగు సినిమాల్లో ఆమె పాడిన పాటలు వినే భాగ్యానికి శ్రోతలు నోచుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమాలే ఆమెకు రెండు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు తెచ్చిపెట్టాయి. ఈరోజు (04-02-2023) చెన్నైలో అనుమానాస్పద రీతిలో వాణిజయరాం మరణించడం సంగీత ప్రియులకు ఎంతో బాధను పంచింది. శంకరాభరణం, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి చిత్రాల లో ఆమె చేత పాటలు పాడించిన కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి రెండు రోజులు కూడా కాలేదు… గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారం అందుకోవడం కూడా సాకారం కాలేదు. ఈ విషాద సమయంలో సంగీత ప్రాజ్ఞి వాణిజయరాం కు అంజలి ఘటిస్తూ, ఆమెకు సద్గతులు లభించాలని కోరుకుంటూ, వాణీజయరాం సంగీత ప్రస్థానం గురించి కొన్ని విశేషాలు మీకోసం.

సంగీత నేపథ్యం:

నవంబరు 30 , 1945 న తమిళనాడు లోని వెల్లూరులో వాణిజయరాం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఆమె అసలు పేరు ‘కలైవాణి’. ఆరుగురు అక్కచెల్లెళ్ళ సంతతిలో వాణిజయరాం ఐదవ సంతానం. తల్లి పద్మావతి ప్రముఖ వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగార్ శిష్యురాలు. కుటుంబ సభ్యులందరికీ సంగీతమంటే ప్రాణం. తన అక్క కడలూర్ శ్రీనివాస అయ్యంగార్ వద్ద సంగీత శిక్షణ పొందుతూవుంటే వాణి కూడా ఆమెతోబాటు కీర్తనలు పాడుతుండేది. వారి కుటుంబం వెల్లూరు నుంచి మద్రాసుకు మకాం మార్చిన తరవాత కడలూర్ శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్. బాలసుబ్రమణియన్, ఆర్.ఎస్.మణి ల శిష్యరికంలో కఠినమైన కర్నాటక సంగీతాన్ని ఆపోశన పట్టింది. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు వాణి బాగా పాడేది. తన ఎనిమిదవ ఏటనే వాణిజయరాం సంగీత కచేరి నిర్వహించింది. చిన్నతనం నుంచీ హిందీ పాటలు రేడియో సిలోన్ లో వినటం వాణికి అలవాటు. నేపధ్యగాయనిగా ప్రయత్నం చేస్తానంటే తల్లి ఒప్పుకోలేదు. పెళ్లయ్యేదాకా ఆ ప్రయత్నం మానుకోమంది. మద్రాస్ క్వీన్స్ మేరీ కాలేజిలో పట్టా పుచ్చుకున్న తరవాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో తొలుత మద్రాసులో, తరవాత మన హైదరాబాదులో ఉద్యోగం చేసింది. 1960లో జయరాంతో వివాహానంతరం వాణి మకాం బొంబాయి కి మారింది. వ్యాపార ప్రకటనలకు ‘జింగిల్స్’ పాడుతూ వాణిజయరాం బిజీగా ఉంటూనే ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వద్ద హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో శిక్షణ పొందింది. ఈ శిక్షణ ఎంత కఠినమైనదంటే రోజుకి 18 గంటలు ‘తుమ్రి భజన్’ లో మెలకువలు ‘గజల్’ ప్రక్రియలో సాంకేతికత నేర్చుకొవటానికే సరిపోయేది. ఈ శిక్షణా కాలంలోనే వాణిజయరాం తన మొట్టమొదటి హిందుస్తానీ క్లాసికల్ కచేరిని మార్చి 1, 1969న బొంబాయిలో ఏర్పాటుచేసి సభికుల్ని అలరించి విద్వాంసుల్ని ఆకట్టుకుంది. అప్పుడే ప్రముఖ సంగీత దర్శకుడు వసంత దేశాయిని కలవటం తటస్థించింది. వినూత్నమైన ఆమె కంఠస్వరానికి ముగ్దుడైన వసంత దేశాయి వాణిజయరాంతో తొలుత కుమారగంధర్వతో ఒక మరాఠీ యుగళగీతాన్ని పాడించారు. ఆ వెంటనే హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘గుడ్డి’ (1971) సినిమాలో మూడు పాటలు పాడించారు. వసంతదేశాయ్ మేఘమల్హర్ రాగంలో స్వరపరచిన “బోల్ రే పపీ హరా, పపి హరా” పాటను తన తొలి హిందీ పాటగా వాణిజయరాం 22 డిసెంబరు 1970న పాడింది. ఆ పాటకు ఐదు అవార్డులే కాక, ప్రతిష్టాత్మక ‘తాన్సేన్ సమ్మాన్’ అవార్డు కూడా వచ్చింది. తరవాత వాణి యెన్నో మరాఠి పాటలు పాడింది. పండిట్ కుమార గంధర్వతో కలిసి యుగళగీతాలు పాడింది. వసంత దేశాయితో మహారాష్ట్ర మొత్తం పర్యటించి గొప్ప మరాఠి పాటల రుచులను ప్రజలకు చేరువ చేసింది. పాఠశాల విద్యార్ధులకు మరాఠీ సంగీతంలో శిక్షణ ఇచ్చింది. నిద్రలేవగానే ఆమె నమస్కరించేది దేవుడి పటంతోబాటు మొదటి గురువు వసంత దేశాయి ఫోటోకే. అంతేకాదు అతని ఫోటోకి నిత్యం పూజ కూడా చేస్తుంది. ‘గుడ్డి’ విజయంతో వాణిజయరాం ముఖ్య సంగీత దర్శకులకే కాకుండా మరాఠి, గుజరాతి, మార్వాడి, భోజపురి భాషా చిత్రాలకూ పాటలు పాడింది. రఫీ, మన్నాడే, మహేంద్ర కపూర్, ముఖేష్, కిషోర్ కుమార్ ల సరసన ఎన్నో యుగళ గీతాలకు ప్రాణం పోసింది. నౌషాద్, చిత్రగుప్త, మదన్ మోహన్, ఓ.పి. నయ్యర్, ఆర్.డి. బర్మన్, కల్యాణ్ జి ఆనంద్ జి, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి హేమాహేమీలైన సంగీత దర్శకుల చిత్రాలకు అనేక హిందీ పాటలు ఆలపించింది. అయితే బాలీవుడ్ లో వున్న కొందరికి ఆమె ఎదుగుదల రుచించక రాజకీయం నడిపారు. సహజంగా సున్నిత మనాస్కురాలైన వాణిజయరాం బాలీవుడ్ ను వదలి మద్రాసుకు వచ్చేసింది.

దక్షిణ భారత గాన సరస్వతిగా… వాణి

వాణిజయరాం మద్రాసుకు తరలి రావటం వలన దక్షిణ భారత చిత్రసీమకు మేలే జరిగింది. మాతృభాష కాకపోయినా పాడిన అన్ని భాషల్లో మాటల స్వచ్చతతోబాటు నేటివిటీని జోడించి పాడటంచేత ఆమె కంఠాన్ని తమ స్వంత ఆడపడుచు స్వరంగానే అందరూ భావించి ఆదరించారు. మద్రాసు వచ్చిన కొత్తలో వాణిజయరాం చేత ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు ‘తాయ్యుం సెయ్యుం’ అనే చిత్రానికి పాడించారు. అనివార్యకారణాల వలన ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తరవాత శంకర్-గణేష్ ‘వీట్టుక్కు వందా మరుమగళ్’ (1973) చిత్రంలో సౌందర్ రాజన్ తో కలిసి “ఓరిడం వున్నిడం” అనే యుగళ గీతాన్ని పాడించటంతో తమిళంలో వాణిజయరాం బిజీ అయ్యారు. తరవాత శంకర్-గణేష్ సంగీత దర్శకత్వంలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎం.ఎస్. విశ్వనాథన్-బాలచందర్ జంట కలిసి పనిచేసిన అనేక తమిళ సినిమాలకు వాణిజయరాం అద్భుతమైన పాటలు పాడారు. వారి సంగీతసాంగత్యం చాలాకాలం కొనసాగింది. ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో వాణిజయరాం చాలా బిజీ అయ్యారు. కన్నక్కుడి వైద్యనాదన్, వి. కుమార్, జి.కె. వెంకటేష్, విజయభాస్కర్, కె.వి. మహదేవన్ సంగీత సారధ్యంలో వాణిజయరాం ఎన్నో తమిళ, కన్నడ పాటలు పాడారు. 1973లో ‘స్వప్నం’ అనే మళయాళ చిత్రానికి సలీల్ చౌదరి సంగీత దర్శకత్వంలో “సౌరయుద్ధత్తిల్ విదర్న్నూరు” అనే పాట పాడారు. ఆ పాట మలయాళంలో మంచి హిట్టయింది. మళయాళ సంగీతదర్శకులు ఎం.కె. అర్జునన్, దేవరాజన్, ఆర్.కె. శేఖర్, దక్షిణామూర్తి, బాబురాజ్, శ్యామ్, రవీంద్రన్, కన్నూర్ రాజన్, జెర్రీ అమలదేవ్ పనిచేసిన సినిమాలకు వాణిజయరాం కొన్ని వేలపాటలు పాడారు. అలాగే కన్నడ చిత్రసీమలో ఎల్. వైద్యనాదన్, టి.జి.లింగప్ప, ఉపేంద్ర కుమార్, హంసలేఖ సంగీత దర్శకత్వం నెరపిన వందలాది సినిమాలలో తన గళం వినిపించారు. తెలుగులో కోదండపాణి వాణిజయరాం తో ‘అభిమానవంతులు’ (1974) సినిమాకోసం “ఎప్పటివలె కాదురా నా స్వామీ” అనే ఒక జావళి పాడించారు. ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు తొలిసారి సినిమాలో ఈ పాటకు నర్తించటం విశేషం.

ఇక్కడో మరోవిషయాన్ని గుర్తు చెయ్యాలి. ప్రముఖ దర్శక నిర్మాత వి. శాంతారాం నిర్మించిన ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’(1955) లో హీరోయిన్ సంధ్యకి “జో తుమ్ తోడో పియా మై నహీఁ తోడో రే” అనే మీరా భజన్ ని సంగీత దర్శకుడు వసంత దేశాయి లతా మంగేష్కర్ చేత పాడించారు. ఈ పాటకి పద్మవిభూషణ్ శివకుమార్ శర్మ సంతూర్ వాద్యం వినిపించారు. హిందీ పాటల్లో సంతూర్ పరికరాన్ని వాడటం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ పాట బహుజనాదరణ పొందింది. 1979లో గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ సినిమాలో పాటలన్నీ సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ వాణిజయరాం తో పాడించారు. ముఖ్యంగా “జో తుమ్ తోడో పియా మై నహీఁ తోడో రే” అనే మీరా భజన్ ఆమె గళంలో అద్భుతంగా అమరింది. పైగా సంతూర్ వాయిద్యానికి బదులు రవిశంకర్ సితార్ వాద్యాన్ని స్వయంగా వాయించటంతో పూవుకు తావి అబ్బినట్లయింది. ఈ పాటకు వాణిజయరాం ‘ఫిలిం వరల్డ్ సినీ హెరాల్డ్’ బహుమతి అందుకుంది. అందరూ లతా పాటని, వాణిజయరాం పాటని పోల్చి చూసి, వాణి పాడిన పాటే బాగుందని తేల్చారు. ఇదే పాటని యష్ చోప్రా నిర్మించిన ‘సిల్ సిలా’(1981) చిత్రంలో సంగీత దర్శకులు శివ్-హరి మళ్లీ లతా చేత పాడించారు. అక్కడ కూడా లతా పాటకన్నా వాణిజయరాం ఆలపించిన భజనే గొప్పగా వుందని తేలింది. ‘మీరా’ చిత్రం విడుదలైన తరవాత నుంచి వాణిజయరాం ను “మీరా ఆఫ్ మోడరన్ ఇండియా” గా అభివర్ణించడం మొదలైంది. ఈ పాటకు వాణిజయరాం ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ బహుమతి కూడా అందుకుంది. లతాజీకి వాణిజయరాం మీద అసూయ పెరిగేందుకు ఇవన్నీ కారణాలయ్యాయి. ఈ రాజకీయాన్ని భరించలేని వాణిజయరాం హిందీ చిత్రసీమకు దూరంగా జరిగింది. అయితే, ఎం.ఎస్. విశ్వనాథన్, మహదేవన్, రాజన్-నాగేంద్ర, విజయ భాస్కర్, చక్రవర్తి, సత్యం, శంకర్-గణేష్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణిజయరాం ప్రతిభను చక్కగా వినియోగించుకొని, ఆమె గళం ద్వారా తమ పాటలకు వన్నె తెచ్చారు. తమిళంలో ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరం కూర్చిన ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగులో తూర్పు-పడమర) చిత్రంలో “ఏళు స్వరంగళుక్కుళ్” పాటకు 1976 లో జాతీయ స్థాయిలో ఆమె ఉత్తమ గాయనిగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తరవాత ఆ అదృష్టం తెలుగు చిత్రాలకే దక్కింది. ‘శంకరాభరణం’ (1980)లో ఆలపించిన “బ్రోచేవారెవరురా”, “మానస సంచరరే”, “దొరకునా ఇటువంటి సేవ” అనే మూడు పాటలకు సంయుక్తంగా; ‘స్వాతికిరణం’(1991) చిత్రంలో “ఆనతినీయరా హరా” అనే పాటకు వాణిజయరాంకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డులు దక్కాయి. ఇవి కాక గుజరాత్(ఘూంఘట్), తమిళనాడు (అళఘే ఉన్నై ఆరాధిక్కిరేన్), ఆంధ్రప్రదేశ్ (శంకరాభరణం), ఒడిషా (దేబ్జని) రాష్ట్రాల పురస్కారాలు కోకొల్లలుగా అందాయి. ‘2015లో ఆమె ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని, పి.బి. శ్రీనివాస్ అవార్డుని అందుకున్నారు. 1992లో ‘సంగీతపీఠ’ సన్మానాన్ని అందుకున్న అతి పిన్నవయస్కురాలు వాణిజయరాం కావడం విశేషం. తమిళనాడు ప్రభుత్వం వాణిజయరాంకు ‘కలైమామణి’ పురస్కారాన్ని, త్యాగరాజర్ భాగవతార్ పేరిట ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని, సుబ్రమణ్య భారతి అవార్డును, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అవార్డులను ప్రదానం చేసింది. చెన్నై లోని ముద్ర అకాడమీ వారు దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ సంగీతాన్ని అందించినందుకు వాణిజయరాంకు ‘ముద్ర అవార్డు’ బహూకరించారు. ఇంకా ఎన్నెన్నో బహుమతులు వాణిజయరాం కు దక్కాయి. ఘంటసాల జాతీయ బహుమతి, దక్షిణ భారత మీరా బహుమతి వాణిజయరాం అందుకున్నారు.

భక్తి పాటల జగధాత్రి…

భక్తి పాటలు పాడటంలో పదిహేనేళ్ళుగా వాణిజయరాం మహారాజ్ఞి గా వెలుగొందుతున్నారు. రఘునాథ పాణిగ్రహి తరవాత జయదేవుని అష్టపదులకు వూపిరినిచ్చిన గాయని వాణిజయరాం. ఆమె దాదాపు 18 భాషల్లో భక్తి గీతాలు ఆలపించారు. సంగీతోత్సవాల్లో వాణిజయరాం పాల్గొని ప్రదర్శనలిచ్చేవారు. “బద్రి కేదార్ ఫెస్టివల్”, “గంగా మహోత్సవ్”, “వారణాసి ఉత్సవ్”, “స్వామి హరిదాస్ ఫెస్టివల్” వంటి భక్తి ప్రధాన ఉత్సవాల్లో వాణిజయరాం కు ప్రధమ తాంబూలం దక్కేది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాణిజయరాం పాల్గొనని కచేరీలే లేవు. తులసీదాసు, భక్త కబీర్, మీరా, పురందరదాసు, అన్నమయ్య, త్యాగరాజు సంకీర్తనలను సంగీతరూపంలో ముద్రించి భద్రపరిచారు. బ్రిజు మహారాజ్ తో కలిసి ‘టుమ్రి’ భజనగీతాలు ఆలపించారు. ప్రఫుల్లకర్ సంగీత సారధ్యంలో ఒడిస్సీ గురుకులచరణ్ మహాపాత్ర తో కలిసి ‘గీతగోవిందం’ ఆల్బంకోసం వాణిజయరాం పాడారు. కుమార గంధర్వ తో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రుణానుబంధచ్య’ అనే మరాఠీ శాస్త్రీయ యుగళాన్ని ఆలపించారు. ఈ పాటకు వాణిజయరాం గురువు వసంతదేశాయ్ సంగీతం సమకూర్చారు. ఆమె సొంతంగా స్వరపరచిన ‘మురుగన్’ భక్తి గీతాలను ఆల్బంగా విడుదలచేశారు. ’సినిమా పాటలకి, భక్తి పాటలకి చాలా వ్యత్యాసం ఉంటుందని; భక్తి పాటలకు శ్రుతిని, రాగాన్ని, లయని సవరించుకొని పాడే సౌలభ్యత వుందని, అదే సినిమా పాటలైతే సంగీత దర్శకుడు బాణీ కట్టిన స్థాయిలోనే, ఆర్కెస్ట్రా ప్రాక్టీసు చేసిన స్థాయిలోనే పాడాల్సి ఉంటుందని వాణిజయరాం చెబుతుంటారు. భక్తి పాటలకు ఉచ్చారణ, సందర్భం, నేటివిటీ, రాగ ఛాయలు చాలా ముఖ్యమని, సంస్కృత పదాలను శబ్దాలంకార పూర్వకంగా వుచ్చరించాల్సి ఉంటుందని వాణి అభిప్రాయం. తనకి స్థానిక భాష రాకున్నా, పదోచ్చారణ, భావం అడిగి తెలుసుకొని ప్రాక్టీసు చేసి పాడుతారు. సింగర్ కి క్లాసికల్ బేస్ వుంటే రాగ లక్షణాలు అర్థమౌతాయి కనుక మంచి అవుట్ పుట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని వాణిజయరాం అంటారు. ఈమధ్య వాణిజయరాం ఎక్కువగా భక్తి గీతాల ఆల్బం రికార్డింగు మీద, శాస్త్రీయ సంగీత కచేరీలు చెయ్యటం పై దృష్టి సారించారు.

Presented by Shanmukhachari

తెలుగుదనం నిండిన గళం……

తెలుగులో వాణిజయరాం కు మంచి పేరు తెచ్చిన చిత్రాలను లెఖ్ఖ కట్టలేం. స్వప్నం, అంతులేని కథ, మరోచరిత్ర, ఘర్షణ, మల్లెపూవు, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, సీతాకోక చిలక, పూజ, శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. ఆమె ప్రముఖ కథక్ మేస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ తో అనేక ఆల్బమ్ లు చేశారు. పది వేలకు పైగా పాటలు పాడిన వాణిజయరాం కి భారత ప్రభుత్వం జనవరి 26 న జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పుంభావ సరస్వతి భర్త జయరాం మంచి సితార్ వాద్యకారుడు. వీరికి సంతానం లేదు. అందుకే తాము ఆర్జించిన సొమ్మును ఎన్నో సంఘసేవా కార్యక్రమాలకు, అనాధ పిల్ల సంరక్షణకు, చదువులకు వినియోగిస్తుంటారు. వాణిజయరాం చాలా సాధారణంగా వుంటారు. సౌమ్యశీలి. ఇంటిపనులకోసం ఎవరి మీద ఆధారపడరు. వంటపనులు, ఇంటి పనులు స్వయంగా చక్కదిద్దుకుంటారు. అనారోగ్యంతో వాణి భర్త జయరాం కాలం చేశారు. వాణిజయరాం మంచి కవయిత్రి, పెయింటర్ కూడా. అకాలమరణం చెందిన వాణిజయరాం కు సద్గతులు ప్రాప్తించాలని అందరం ప్రార్ధిద్దాం.

– ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap