పడిలేచిన కడలి తరంగం యల్.వి. ప్రసాద్

దశాబ్దాల భారతీయ సినిమా చరిత్రకు అందమైన గుర్తుగా నిలిచిన మహనీయుడు ఎల్.వి. ప్రసాద్. ప్రసాద్ పూర్తి పేరు అక్కినేని లక్ష్మి వరప్రసాద్. సినిమారంగంలో ఆర్జించిన సంపదను సినీరంగ అభివృద్ధికే వెచ్చించి, సినిమా పరిశ్రమను విస్తరింపజేసిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఎల్.వి. ప్రసాద్ పేరు ముఖ్యంగా చెప్పుకోవాలి. అందుకే ఆయన సినిమా ‘వరప్రసాది’గా కీర్తి పొందారు. ‘కృషి వుంటే మనిషి ఋషి ఔతాడు..మహాపురుషుడౌతాడు” అనే నానుడికి ప్రత్యక్ష సాక్షి ఎల్.వి. ప్రసాద్. సినిమారంగానికి వెళ్ళిన తొలిరోజుల్లో చిన్నచిన్న వేషాలు వేశారు. వెట్టి చాకిరీ చేశారు. పస్తులున్నారు. కానీ ధైర్యాన్ని, ఓర్పును మాత్రం వీడలేదు. చివరికి సినిమాహాలు గేటు కీపర్ వుద్యోగం చెయ్యడానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు. నెలకు పదిహేను రూపాయల జీతానికి కూడా ఆయన పనిచేశారు. ముప్పై రూపాయల జీతానికి ఇంపీరియల్ కంపెనీలో చేరారు. స్టూడియోలో ట్రాలీ ఆపరేటరుగా, నిర్మాణశాఖలో సహాయకుడిగా, చిన్నపాత్రలు పోషించే నటుడిగా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, ధార్మికునిగా అంచెలంచెలుగా ఎదిగిన నిత్య సినీ కృషీవలుడు ఎల్వీప్రసాద్. 1931 మార్చి 14 న విడుదలైన తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’లో నాలుగైదు చిన్న వేషాలు వేశారు. అదే సంవత్సరం అక్టోబరు 31 న విడుదలైన తొలి తమిళ టాకీ ‘కాళిదాస్’లో ఆలయ పూజారి వేషాన్ని, 1932 ఫిబ్రవరి 6 న విడుదలైన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుని సహచరుడు మొద్దబ్బాయి పాత్రను పోషించి, మూడు తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత సాధించిన ఒకే ఒక వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కారు ప్రసాద్. ఎన్.టి. రామారావుని ‘మనదేశం’ సినిమాలో తొలిసారి నటింపజేసిన ప్రసాద్ ని చూస్తే రామారావుకు లేచి నిలబడేటంత భక్తి. అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ అందుకు మినహాయింపు కాదు. మూకీ సినిమాలనుంచి సినిమా స్కోపు సినిమాలదాకా ఆయన ప్రస్థానం సాగింది. ఆయన ఎదుగుదల వెనుక ఒక ధ్యేయముంది. అటువంటి అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ వర్ధంతి సందర్భంగా వారిని గురించిన కొన్ని విశేషాలు…

కష్టాల బాల్యం… బొంబాయి పయనం…
అక్కినేని లక్ష్మి వరప్రసాద్ 17 జనవరి 1908న ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో జన్మించారు. ప్రసాద్ తండ్రి అక్కినేని శ్రీరాములు మధ్యతరగతి రైతు. తల్లి బసవమ్మ గృహిణి. బాల్యంలో ప్రసాద్ మంచి తెలివి తేటలు గల విద్యార్థిగా వున్నా, అతనికి చదువుమీద పెద్దగా శ్రద్ధ ఉండేదికాదు. తరచూ తన గ్రామాన్ని సందర్శించే నాటక బృందాలు ప్రసాద్ ను ఎక్కువగా ఆకర్షించేవి. ఇంగ్లీష్ స్కూళ్లను బహిష్కరించవలసిందని బాపూజీ అప్పట్లో ఇచ్చిన పిలుపు ప్రసాద్ ని ప్రభావితుణ్ణి చేసింది. దాంతో హైస్కూలులో ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాల్సిరావడంతో మరీ నిరుత్సాహపడిపోయారు. ముఖ్యంగా బాగా చదువుకొని కలెక్టరు కావాలని తండ్రి ఆశిస్తే, ప్రసాద్ డ్రామాలు వేస్తూ, మూకీ సినిమాలు చూస్తూ కాలం గడిపేవారు. తండ్రి బలవంతంగా ప్రసాద్ కు చదువు చెప్పించలేదు. మనసుకి నచ్చిన పనిచేసుకోమని సలహా ఇవ్వడంతో ప్రసాద్ అరక దున్నారు. సేద్యం మీద దృష్టి సారించారు. వ్యవసాయ పనులమీద ఆయనకు ఎక్కువగా ఏలూరు వెళ్ళాల్సిన అవసరం పడేది. పెదవేగి గ్రామానికి ఏలూరుకి మధ్యలో వారి మేనమామ ఇల్లుండేది. 16 ఏళ్ల వయసులో మేనమామ కూతురు సౌందర్యమనోహరమ్మను ప్రసాద్ ప్రేమించారు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను 1924లో వివాహమాడారు. అప్పట్లో ప్రేమించి పెళ్ళాడడం ప్రసాద్ చేసిన గొప్ప సాహసం అనిచెప్పాలి. తండ్రి అప్పులుచేసి బంజరు భూములను సాగులోకితెచ్చే క్రమంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టారు. కానీ వ్యవసాయం కలిసిరాలేదు. వ్యధను మిగిల్చింది. భూములు సాగుబడిలోకి రాకముందే ఖర్చులు తడిపి మోపెడయ్యాయి. ధాన్యం గాదెల్లోకి చేరకముందే చక్రవడ్డీల రూపంలో అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం అప్పులపాలయింది. అప్పులబాదను తట్టుకోలేక తండ్రి ఏలూరు కోర్టులో దివాలా పిటీషను (Insolvency Petition) వేశారు. దాంతో ఊరువూరంతా ప్రసాద్ కుటుంబాన్ని చిన్నచూపు చూడసాగింది. ఆ కష్టాల్లోనే మనోహరమ్మకు కూతురు పుట్టింది. దిక్కుతోచలేదు. 1930 జనవరి 1న, 22 ఏళ్ళ ప్రాయంలో ప్రసాద్ ఎవరికీ చెప్పకుండా డబ్బు సంపాదించాలనే మిషతో రైలెక్కి వంద రూపాయలతో బొంబాయి చేరిపోయారు. అదికూడా ప్రసాద్ చేసిన సాహసమనే చెప్పుకోవాలి. ప్రసాద్ కు స్థానిక భాషరాదు. బొంబాయి నగరంలోని దాదర్ లో ఒక చిన్న హోటల్లో మకాం పెడితే, ప్రసాద్ పెట్టెలోని డబ్బును ఎవరో దొంగ కాజేశాడు. అలా అత్యంత దయనీయ పరిస్థితులను తట్టుకుంటూ 21 మాసాలు అక్కడే గడిపారు. కోహినూరు స్టూడియో ప్రక్కనే వుండే ఒక దర్జీ వాని కొట్టులో ఆశ్రయం పొందారు. ఆ స్టూడియోకి వచ్చే సినిమాతారలందరికీ ఆ టైలరే దుస్తులు కుట్టివాడు. ప్రసాద్ కు సినిమాలలో పనిచేయాలనే ధ్యాస వున్నదని తెలిసి ఆ దర్జీవాడు వీనస్ పిక్చర్స్ లో నెలకు 15 రూపాయల జీతం మీద పని ఇప్పించాడు. తెల్లవారే లేచి చీపురుతో ఆ టైలర్ దుకాణాన్ని శుభ్రంచేసి, పగటిపూటంతా స్టూడియోలో పనిచేసి వచ్చేవారు. దురదృష్టం వెంటాడడంతో ఆ వీనస్ పిక్చర్స్ వారు అసలు సినిమానే నిర్మించలేదు. అయితే మోతీ అనే నటి సోదరుడు ఆ వీనస్ పిక్చర్స్ లో పరిచయం కావడంతో ప్రసాద్ కు రాత్రిపూట ఒక కార్నివాల్ లో పనిచేసే వుద్యోగం దొరికింది. రెండు రూపాయల కూలి కోసం రాత్రిపూట రెండు గంటల దాక ఆ కార్నివాల్ లో “కాయ్ రాజా కాయ్” అంటూ అనౌన్సరుగా పనిచేసి, అర్థరాత్రి ఐదు మైళ్ళు నడిచి మరలా దర్జీ కొట్టుకు చేరుకొని సేదతీరేవారు. తర్వాత అఖ్తర్ నవాజ్ కు చెందిన ఇండియా పిక్చర్స్ లో చేరి ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ అనే మూకీ సినిమాలో చిన్న వేషం వేశారు. చిల్లర నటుడు కావడంతో ఆ సంస్థలో వెట్టిచాకిరి చేయాల్సి వచ్చేది. సామాన్లు, రిఫ్లెక్టర్లు మోయడం వంటి బండపనులు చేసేవారు. ఒకసారి రైల్వే స్టేషన్ కు పదిహేను మైళ్ళ దూరంలో షూటింగుకోసం ఒక రహదారి బంగాళాలో మకాంపెట్టిన అఖ్తర్ నవాజ్, డబ్బు సర్దుబాటు కాకపోవడంతో రాత్రిరాత్రే ఎవరికీ చెప్పకుండా ఉడాయించాడు. దాంతో ఆ సంస్థ సభ్యులతోబాటు ప్రసాద్ అలా రెండ్రోజులు అవస్థపడి పదిహేను మైళ్ళు నడిచి చివరికి ఎలాగోలా బొంబాయి చేరుకున్నారు. తర్వాత ఆర్దేషిర్ ఇరాని ఆరంభించిన ఇంపీరియల్ ఫిలిం కంపెనీలో నెలకి ముప్పై రూపాయలతో వుద్యోగం దొరికింది. ఆర్దేషిర్ ఇరాని కనుసన్నల్లో మెలిగారు. దాంతో ఇరానీ నిర్మించిన తొలి టాకీచిత్రం ‘ఆలం ఆరా’లో నాలుగు చిన్నచిన్న పాత్రల్లో నటించారు. ఇంపీరియల్ స్టూడియోలో ఉన్నప్పుడే ఆయన పేరు ‘ఎల్వీ ప్రసాద్’ గా మారింది. అలా పేరు మార్చినవాడు ఆ కంపెనీలో రోజూ హాజరుపట్టీ వేసే గుమాస్తా అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆ స్టూడియోలోనే ‘మీసాల పులి’గా పేరుగాంచిన హెచ్.ఎం. రెడ్డి ఇరానీకి సహాయకుడిగా ఉంటూ పృద్విరాజ్ కపూర్ తో రెండు మూకీ సినిమాలు నిర్మించారు. ‘ఆలం ఆరా’ విజయంతో అర్దేషిర్ ఇరాని దక్షిణ భారతదేశంలో సినిమా నిర్మించాలని భావించి హెచ్.ఎం. రెడ్డిని దర్శకుడుగా నియమించి ‘కాళిదాస్’ పేరుతో టాకీ సినిమా నిర్మించారు. ‘కాళిదాస్’ చిత్రానికి శ్రద్ధగా పనులు చేస్తున్న ప్రసాద్ ని గమనించిన అర్దేషిర్ ఇరాని అందులో ఆలయ పూజారిగా నటించే అవకాశాన్ని కలిపించారు. సమాంతరంగా తెలుగులో నిర్మిస్తున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో కూడా ప్రసాద్ చేత ప్రహ్లాదుని సహవిద్యార్థి మొద్దబ్బాయిగా నటింపజేశారు. ఈ రెండు చిత్రాలు విడుదలై విజయవంతమయ్యాక తొలిసారి ఏలూరు వెళితే, తనకు పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలిసి ప్రసాద్ బాధపడ్డారు. భార్యను వెంట తీసుకుని మరలా బొంబాయి చేరుకున్నారు. భుక్తికోసం డ్రీమ్ ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ ఉద్యోగం దొరికింది. రాత్రిపూట సినిమాహాలులో డ్యూటీ చేస్తూ పగలు ఉద్యోగప్రయత్నాలు కొనసాగించారు. హెచ్.ఎం. రెడ్డి భారత్ మూవీటోన్ సంస్థకు ‘సావిత్రి’ అనే తెలుగు సినిమా కు దర్శకత్వం వహిస్తూ ప్రసాద్ కు సత్యవంతుడు వేషాన్ని ఇచ్చారు. ఈలోగా విజయా సినీటోన్ వారు హిందీలో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ‘సీతా స్వయంవర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు, కంపెనీ వారితో విభేదాలు రావడంతో ఆయన తప్పుకున్నారు. ప్రసాద్ ఆ చిత్రం పూర్తయ్యేదాకా వుండి, ఆ చిత్రానికి ప్రతినిధిగా సినిమా డబ్బాలు మోస్తూ బొంబాయితోబాటు రాష్ట్రమంతా తిరిగారు. తర్వాత ‘న్యూ ఎరా’ అధిపతి రజనీకాంత పాండ్య నిర్మించిన ‘మత్స్యగంధి’ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజరుగా ప్రసాద్ పనిచేశారు. అదే ఊపులో జమునాదాస్ నిర్మించిన ‘స్త్రీ’ చిత్రానికి కెమెరామన్ గా పనిచేశారు. అప్పట్లో పగలు షూటింగుల్లో పాల్గొంటూ రాత్రి పూట సినిమా హాలు గేట్ కీపర్ వుద్యోగం చేస్టూవచ్చారు. సినిమా పులి హెచ్.ఎం.రెడ్డి మద్రాసు వెళ్ళిపోయి సినిమా నిర్మిస్తూ ప్రసాద్ కు వేషం ఇచ్చేందుకు కబురంపారు.

మద్రాస్ కు పయనం…
పదేళ్ళ బొంబాయి జీవితానికి స్వస్తి చెప్పి 1940లో ప్రసాద్ మద్రాసులో అడుగు పెట్టారు. మద్రాసు యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పోరేషన్ వారు నిర్మించిన ‘బొండాం పెళ్లి’, ‘చదువుకున్న భార్య’ చిత్రాలలో హెచ్.ఎం.రెడ్డి ప్రసాద్ ను నటింపజేశారు. తర్వాత 1941లో హెచ్.ఎం.రెడ్డి రోహిణీ పతాకం మీద నిర్మించిన ‘తెనాలి రామకృష్ణ’ లో ప్రసాద్ కు రెండు పాత్రలు లభించాయి. మొదటిది మంత్రి తిమ్మరుసు పాత్ర, రెండవది కరటక శాస్త్రి పాత్ర. అంతే కాకుండా హెచ్.ఎం. రెడ్డికి సహాయ దర్శకుడిగా వుంటూ, స్క్రీన్ ప్లే రచనలో తంగిరాల హనుమంతరావు, సదాశివబ్రహ్మం లకు సహాయకుడిగా సమర్థవంతంగా పనిచేశారు. మరుసటి సంవత్సరం ‘సత్యమేజయం(లేక) ఘరానా దొంగ (లేక) ఆనెస్ట్ రోగ్’ అనే చిత్రానికి కూడా సహాయ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచనకు సహాయకుడిగా పనిచేస్తూ ఆ సినిమాలో ప్రధాన ‘దొంగ’ పాత్ర పోషించారు. 1942లో తాండ్ర సుబ్రహ్మణ్యం అనే ఆయన ‘కష్టజీవి’ అనే తెలుగు చిత్రాన్ని బొంబాయిలో నిర్మించాలని సంకల్పించి దాని డైరెక్టర్ గా ప్రసాద్ ని నియమించారు. దాంతో ప్రసాద్ మరలా బొంబాయికి తన మకాం మార్చాల్సివచ్చింది. కానీ, ఈ సినిమాకి పురిట్లోనే సంధికొట్టి మూడురీళ్లు తయారయ్యాక ఆగిపోయింది. ప్రసాద్ మరలా మద్రాస్ కు మకాం మార్చారు. అయితే ఆయన మద్రాసులోనే ఉంటూ బొంబాయిలో అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదలుకోకుండా తెలివిగా కష్టపడి పనిచేశారు. వాటిలో ‘దర్బన్’ సినిమా ఒకటి. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరమై మద్రాసు సినిమారంగం ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు బొంబాయిలో ‘దర్పణ్’ సినిమా ద్వారా ప్రసాద్ కు ప్రత్యామ్నాయం దొరికింది. ఆ వెంటనే గీతాంజలి ఫిలిమ్స్ వారు నిర్మించిన ‘సవాల్’ హిందీ చిత్రానికి బొంబాయిలో వుంటూ సహాయదర్శకత్వం వహించారు. అది పూర్తవగానే హీరోయిన్ ముంతాజ్ శాంతి భర్త వలీసాహెబ్ ‘లేడీ డాక్టర్’ సినిమా నిర్మిస్తూ ఎల్.వి. ప్రసాద్ ని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. అక్కడే ‘నెక్ పర్వీన్’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆరోజుల్లోనే పృద్విరాజ్ కపూర్ ‘పృథ్వి థియేటర్’ నాటక సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ తొలి ప్రదర్శన ‘శకుంతల’, ‘దేవర్’ నాటకాలలో ప్రసాద్ నటించారు. తర్వాత ‘దేవర్’ నాటకాన్ని సినిమాగా నిర్మించినప్పుడు ఆ సినిమాకు స్క్రిప్టు కూడా రాశారు.

LV Prasad with Bhanumati

చల్లపల్లి రాజా పిలుపుతో తిరిగి మద్రాస్ కు…

బొంబాయిలో వుండగా సారథి స్టూడియోస్ అధిపతి చల్లపల్లి రాజా కె.ఎస్. ప్రకాశరావు చేత ప్రసాద్ ను మద్రాస్ కు రావలసిందిగా కబురంపారు. సారథి సంస్థ నిర్మించ తలపెట్టిన ‘గృహప్రవేశం’ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ కు సహాయకారిగా ఉండేందుకే ప్రసాద్ కు ఆ పిలుపు. అప్పటికే గూడవల్లి రామబ్రహ్మం సారథి సంస్థ నుంచి తప్పుకొని వున్నారు. గోపీచంద్ రాసిన కథకు ప్రసాద్ మలుపుతిప్పే సన్నివేశాలను సూచించడంతో రాజావారు సంతుష్టుడై, ప్రసాద్ నే ఆ చిత్రానికి దర్శకత్వం వహించమని కోరడంతో ఆ బాధ్యతను ప్రసాద్ తీసుకున్నారు. అయితే ‘గృహప్రవేశం’ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ప్రసాద్ ఒక షరతు పెట్టారు. ఆ సినిమాలో కథానాయకుడిగా తనే నటించాలనేదే ఆ షరతు. తెలుగులో దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న తొలిచిత్రం కావడంతో ఒకవేళ దర్శకునిగా విఫలమైనా, నటుడిగా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందనే దూరదృష్టితో ఆ షరతు విధించడం జరిగింది. ప్రసాద్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘గృహప్రవేశం’ చిత్రం 1946 అక్టోబరు 4 న విడుదలై విజయవంతమైంది. సారథి సంస్థ నుంచి విడిపోయిన గూడవల్లి రామబ్రహ్మం శారదా ప్రొడక్షన్స్ సంస్థ నెలకొల్పి ‘పల్నాటి యుద్ధం’ కథను సినిమాగా తీయాలనే సంకల్పంలో వుండగా, ‘గృహప్రవేశం’ చిత్ర విజయవార్త ఆయన చెవినపడి, ప్రసాద్ కు కబురంపి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు సినిమా ఆరు రీళ్ళు తయారయ్యాక రామబ్రహ్మానికి పక్షవాతం సోకి మంచానపడ్డారు. రామబ్రహ్మం మరణంతో చిత్రనిర్మాణ బాధ్యత ప్రసాద్ భుజస్కందాలపై పడింది. బొంబాయిలో వున్న తన పలుకుబడి నుపయోగించి ‘చందారావు మోరే’ అనే మరాఠీ చిత్రంలోని కొన్ని యుద్ధ సన్నివేశాలను కొనుగోలుచేసి ‘పల్నాటియుద్ధం’లో వాటిని కలిపి తక్కువ బడ్జెట్ లో ప్రసాద్ ఆ సినిమాను పూర్తిచేశారు. 24 సెప్టెంబరు 1947న విడుదలైన ‘పల్నాటి యుద్ధం’ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. తర్వాత కె.ఎస్. ప్రకాశరావు నిర్మించిన ‘ద్రోహి’ (1948) చిత్రానికి ప్రసాద్ దర్శకత్వం వహించారు. అందులో రౌడీ రాముడు పాత్రను ప్రసాద్ పోషించగా ప్రకాశరావు హీరోగా, జి.వరలక్ష్మి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రవిజయం ప్రసాద్ కు దర్శకుడిగా, మంచి నటుడిగా పేరు సంపాదించి పెట్టింది. తర్వాత మీర్జాపురం రాజా సమర్పణలో నాగయ్య, కృష్ణవేణి నటించిన ‘మనదేశం’(1949) చిత్రానికి ప్రసాద్ దర్శకత్వబాధ్యతలు నిర్వహించారు. నటరత్న ఎన్.టి. రామారావుని ఈ చిత్రంలోనే ఇనస్పెక్టర్ పాత్రలో ప్రసాద్ పరిచయం చేశారు. ‘మనదేశం’ సినిమాలో ప్రసాద్ కు మంచి పేరొచ్చింది. 1950లో విజయాసంస్థ అధిపతులు నాగిరెడ్డి-చక్రపాణి తమ తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ (ఇరుగు పొరుగుల కథ అనే ట్యాగ్ లైన్ తో) సినిమా నిర్మించనెంచి ప్రసాద్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. చక్రపాణి సమకూర్చిన కథ, సంభాషణలతో సినిమా తయారైంది. ఎన్.టి. రామారావు ను హీరో పాత్రకు, ఆరోజుల్లో రేడియో నాటికల్లో పాల్గొంటున్న జానకిని హీరోయిన్ పాత్రకు తీసుకున్నారు. ‘మనదేశం’ చిత్రంలో చిన్నపాత్ర పోషించిన ఎస్.వి. రంగారావును ‘సున్నం రంగడు’ పాత్రలో విలన్ గా ప్రవేశపెట్టారు. చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినా దర్శకుడిగా ప్రసాద్ పేరును నిలబెట్టింది. ఆపై సాధనా వారి ‘సంసారం’ (1950) సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించారు. అందులో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరూ హీరోలే. జానపద హీరోగా వెలుగొందుతున్న అక్కినేనికి సాంఘిక చిత్రాల హీరోగా పేరుతెచ్చిన చిత్రం ‘సంసారం’. అందులోనే హీరోయిన్ పుష్పలత స్నేహితురాళ్ళలో ఒకరిగా సావిత్రి తెరంగేట్రం చేసింది. సినిమా బాగా ఆడింది.

తర్వాత 1952లో విజయా వారు ప్రసాద్ దర్శకత్వంలోనే ‘పెళ్ళిచేసిచూడు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఎన్టీఆర్, జి. వరలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా విజయవంతం కావడంతో తర్వాత అంజలి పిక్చర్స్ వారి ‘పరదేశి’ (1953), ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన ‘పెంపుడు కొడుకు’ (1953) చిత్రాలకు ప్రసాద్ దర్శకత్వం వహించారు. ‘పరదేశి’ ద్విభాషా చిత్రంలో అక్కినేనిచేత వయసుమళ్ళిన పాత్రను పోషింపజేయడమే కాకుండా హిందీ చలనచిత్ర పితామహుడు వి. శాంతారాం సహకారంతో శకుంతల నృత్య దృశ్యాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. ‘పరదేశి’, ‘పెంపుడు కొడుకు’ సినిమాలు గొప్పగా ఆడలేదు. తర్వాత వచ్చిన సినిమా ప్రసాద్ పేరును ఆకాశానికి యెత్తేసింది. అదే ‘మన్మోయి గరల్స్ స్కూల్’ పేరుతో రవీంద్రనాథ్ టాగూర్ రాసిన కథకు మార్పులుచేసి చక్రపాణి తీర్చిదిద్దిన విజయా వారి హాస్యప్రధాన చిత్రం ‘మిస్సమ్మ’ (1955). తొలుత తెలుగు, తర్వాత తమిళంలో కూడా నిర్మించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఎ.వి.ఎం వారు హిందీలో మీనాకుమారి హీరోయిన్ గా ‘మిస్ మేరి’ పేరుతో పునర్నిర్మిస్తే ఆ చిత్రానికి కూడా ప్రసాదే దర్శకత్వం వహించారు. హిందీ చిత్రం కూడా సూపర్ హిట్టే!

1955లో లక్ష్మీ పిక్చర్స్ పేరుతో ప్రసాద్ స్వంత చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘ఇలవేలుపు’ విజయం సాధించింది. ప్రసాద్ వ్యక్తిగత జీవితానికి ఈ చిత్ర కథకు కొంత సంబంధం వుంది. ఆయన కొంతకాలం అనారోగ్యంతో వున్నప్పుడు భీమవరంలోని శ్రీరామకృష్ణ ప్రకృతి ఆశ్రమంలో చికిత్సపొందారు. ఇలవేలుపు కథలోని తొలి దృశ్యాలకు అంకురార్పణ జరిగింది ఈ ఆశ్రమంలోనే. సహజత్వానికి మరికొంత రసవత్తరమైన కల్పనతో ప్రేమకథను జోడించి సదాశివబ్రహ్మం చేత చిత్రకథను తయారు చేయించారు. తన శిష్యుడు డి. యోగానంద్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి నిర్మాణ పర్యవేక్షణ వహించారు. ఇదే చిత్రాన్ని రాజకపూర్, మీనాకుమారిలతో ‘శారద’ పేరుతో తొలిసారి హిందీలో నిర్మించి దర్శకత్వం వహించి ప్రసాద్ విజయం సాధించారు. ఈ చిత్రం ప్రసాద్ ఇమేజ్ ని పెంచడమే కాకుండా ఉత్తరభారతదేశంలో కనకవర్షం కురిపించింది. తర్వాత విజయా వారి ‘అప్పుచేసి పప్పుకూడు’ (1959) హాస్యరస సినిమాకి ప్రసాద్ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రరంగంలో బిజీగా వుంటూ ఈ సినిమాతో ప్రసాద్ తెలుగు సినిమాల దర్శకత్వానికి దూరమయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి తెలుగు చిత్రం ఇదే. అయితే తన ఆఖరి తమ్ముడు, ఎడిటర్ అక్కినేని సంజీవికి దర్శకత్వ బాధ్యతలు కట్టబెడుతూ 1965 లో తెలుగులో ‘ఇల్లాలు’ చిత్రాన్ని నిర్మించారు.

ఇంటగెలిచి దర్శకనిర్మాతగా ఇతర భాషల్లోకి…
‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రం తర్వాత హిందీలో ‘చోటే బెహన్’ (1959-తెలుగులో ఆడపడుచు), ‘బేటీ బేటా’ (1964-తెలుగులో సంతానం) హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, మధ్యలో ‘తాయిల్లపిళ్ళై’ (1961), ‘ఇరువుర్ ఉళ్ళం’ (1963) తమిళ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. నిర్మాతగా వ్యవహరిస్తూ తన ప్రధమ శిష్యుడైన తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘ససురాల్’ (1961-తెలుగులో ఇల్లరికం), ‘హమ్ రాహీ’ (1963- తెలుగులో భార్యాభర్తలు) వంటి హిందీ చిత్రాలను నిర్మించారు. 1966లో తెలుగులో వచ్చిన ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాను ‘దాదిమా’ పేరుతో, ‘బ్రతుకుతెరువు’ చిత్రాన్ని ‘జీనేకి రాహ్’ (1969) పేరుతో, ఎన్టీఆర్ చిత్రం ‘తల్లా పెళ్ళామా’ చిత్రాన్ని ‘బిదాయి’ (1974) పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు. అలాగే ‘మూగమనసులు’ చిత్రాన్ని హిందీలో ‘మిలన్’ (1967) పేరుతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, ‘రాజూ-పేద’ చిత్రాన్ని ‘రాజా అవుర్ రంక్’ (1968) పేరుతో ప్రత్యగాత్మ దర్శకత్వంలో, ‘పునర్జన్మ’ చిత్రాన్ని ‘ఖిలోనా’ (1970 ) పేరుతో చందర్ వోహ్రా దర్శకత్వంలో నిర్మించారు. అలాగే ప్రసాద్ ప్రొడక్షన్స్ నుంచి 1975లో ‘ప్రియవిడై’ అనే చిత్రాన్ని తమిళంలో, ‘మనె బెళగిద సోసే’ అనే చిత్రాన్ని కన్నడంలో నిర్మించారు. అలా 1996 వరకు ఓ డజను సినిమాలను నిర్మించడం జరిగింది. చందర్ వోహ్రా దర్శకత్వంలో ‘ఉదార్ కా సిందూర్’ (1976), స్వీయ దర్శకత్వంలో ‘జయ్-విజయ్’ (1977-తెలుగులో చిక్కడు-దొరకడు), దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘ఏ కైసా ఇన్సాఫ్’ (1980-తెలుగులో న్యాయంకావాలి). కె. బాలచందర్ దర్శకత్వంలో ‘ఏక్ దూజే కేలియే’ (1981-తెలుగులో మరోచరిత్ర), చందర్ వోహ్రా దర్శకత్వంలో ‘మేరా ఘర్ మేరా బచ్చే’ (1985), క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్వాతి’ (1986-తెలుగులో స్వాతి) మొదలైన హిందీ చిత్రాలను ప్రసాద్ నిర్మించారు. బెంగాలి, ఒరియా, మలయాళం భాషల్లో కూడా ప్రసాద్ కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. దర్శకుడిగా ప్రసాద్ చివరి సినిమా ‘జయ్-విజయ్’. అలాగే ‘ది క్లయంట్’, ‘యూ సెడ్ ఇట్’ పేరుతో రెండు డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు. 1970లో ‘ది క్లయంట్’ డాక్యుమెంటరీ చిత్రానికి షికాగోలో జరిగిన చలనచిత్రోత్సవంలో అవార్డు వచ్చింది. అదే సంవత్సరం కుటుంబ నియంత్రణపై ‘బాప్ రే బాప్’ అనే లఘుచిత్రాన్ని కూడా ప్రసాద్ నిర్మించారు. అలా అరవై నాలుగేళ్ల పాటు సాగిన సుదీర్ఘ కాలపు చలనచిత్ర ప్రస్థానంలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి ప్రసాద్ ఎన్నో సేవలు అందించారు. “నేను పడ్డ కష్టాలన్నీ బొంబాయిలోనే పడ్డాను. నేర్చుకోవలసింది కూడా అక్కడే నేర్చుకున్నాను. బొంబాయి నాకు ఓర్మిని నేర్పింది. నా జీవితం అతి సామాన్యం. ఒక ధ్యేయంతో శ్రమించాను, కృషి చేశాను. ఆ అనుభవాలే పాఠాలు నేర్పాయి. నా విజయాలకు ముఖ్య కారణం అదే” అని ప్రసాద్ వినమ్రంగా చెప్పుకునేవారు.

సేవలు… సదుపాయాలు…
1965 ప్రాంతంలో నిర్మాత రంగనాథదాస్ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి, ఆర్ధిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దానిని ఎల్.వి. ప్రసాద్ కు ఇవ్వజూపారు. దానిని కొని ప్రసాద్ ఆధునీకరించారు. అలా ఆసియా ఖండానికే గర్వకారణమైన ప్రసాద్ స్టూడియో అక్కడ వెలసింది. ప్రసాద్ రెండవ కుమారుడు రమేష్ అమెరికాలో విద్యనభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను స్వీకరించారు. 1976లో హైదరాబాదులో ఫిలిం లేబొరేటరీ (ప్రాసెసింగ్ యూనిట్) స్థాపించి విదేశాలలో వుండే ఆధునిక సదుపాయాలతో సమానంగా సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. ఫిలిం & టెలివిజన్ అకాడమీ స్థాపించారు. ఎన్.టి.ఆర్ మార్గ్ లో మల్టిప్లెక్స్ సినిమాహాలు, మాల్ నిర్మించారు. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రదానం’ అనే సూక్తికి అనుగుణంగా 1987లో బంజారా హిల్స్ లో ‘ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి’ ని నెలకొల్పారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆ ఆసుపత్రి వుండే రోడ్డుకు ‘ఎల్.వి. ప్రసాద్ మార్గ్’ అని పేరు పెట్టారు. జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. “నేనుకంటి ఆసుపత్రి ఎందుకు స్థాపించానో తెలుసా? ప్రజలకు కళ్ళు బాగావుండి మరిన్ని సినిమాలు చూడాలని” అంటూ ఒకానొక సందేర్భంలో ప్రసాద్ చమత్కరించారు. 1981లో మద్రాసులో జరిగిన బాలల చలనచిత్రోత్సవానికి ప్రసాద్ జ్యూరీ ఛైర్మన్ గా వ్యవహరించారు.

సత్కారాలు…సన్మానాలు…
భారత ప్రభుత్వం 1983లో ప్రసాద్ కు ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బహుమతి ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంద్రరాష్ట్రంలో 1981లో మొదటిసారి ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును ప్రవేశపెట్టినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా తొలి అవార్డును ఎల్.వి.ప్రసాద్ కు బహూకరించారు. 2006లో భారత తంతి తపాలా శాఖ ఎల్.వి. ప్రసాద్ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 1992లో ఫిలింఫేర్ సంస్థ ప్రసాద్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. 1987లో ఆంధ్రప్రదేశ్ కళా వేదిక ‘ఆంధ్రరత్న’ పురస్కారాన్ని అందజేసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు 1985లో ‘కళాప్రపూర్ణ’ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1983లో ఈనాడు సంస్థ నిర్వహించిన ‘సితార’ అవార్డుల ఉత్సవంలో ఎల్.వి. ప్రసాద్ కు ‘కళాతపస్వి’ బిరుదు ప్రదానంచేసి సత్కరించింది. దక్షిణ భారత టెక్నీషియన్స్ అసోసియేషన్ 1982లో ‘రామనాథ్ అవార్డు’ బహూకరించింది. 1980లో నాటి ఉపరాష్ట్రపతి ఎమ్. హిదయతుల్లా ఎల్.వి. ప్రసాద్ కు ‘ఉద్యోగపత్ర’ అవార్డును ప్రదానం చేశారు. 1979లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ‘రాజా శాండో మెమోరియల్ అవార్డు’ను బహూకరించారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ చేతులమీదుగా ‘లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్’ అవార్డును అందుకున్నారు. చివరిరోజుల్లో 1980లో వచ్చిన ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంలో నటించారు. హిందీ, తెలుగు భాషల్లో 20 చిత్రాలను నిర్మించారు. 86 ఏళ్ళ వయసులో 22 జూన్ 1994 న ఎల్.వి.ప్రసాద్ సహజ మరణం పొందారు.

-ఆచారం షణ్ముఖాచారి
(04020 54256)

1 thought on “పడిలేచిన కడలి తరంగం యల్.వి. ప్రసాద్

  1. ఎల్ ని ప్రసాద్ గురించి సమగ్ర విశ్లేషణతో చక్కని విషయాలు తెలిపారు….ధన్యవాదములతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap