సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

“మాటలాడే వెన్నెముక
పాటలాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
ఈనాటి కవిసమ్రాట్టూ
గోదావరి పలకరింత
కృష్ణానది పులకరింత
తెలుగు వాళ్ల గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మిహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్థి
అనవరతం తెలుగునాటి ప్రకాస్తి
ఛందస్సులేని ఈ ద్విపద
సత్యా నికి నా ఉపద”
“విశ్వనాథ” వారిని గురించి బెబుతూ అంటాడు శ్రీశ్రీ. “స్పష్టత ఆయనలోని రచనలోని తొలి గుణం. వ్యక్తిగా, రచయితగా ముక్కుసూటిగా చెప్పగల వ్యక్తి. మిత్రులను మందలించడమే కాక, శత్రువులను సైతం ప్రేమించగల సహృదయతకల వ్యక్తి. ఆయనను కొందరు ఛాందసుడు అన్నారు. కొందరు ఉదారుడు అన్నారు. మరికొందరు “పాషాణ పాకప్రభువు” అన్నారు. వీరగ్రాంధికవాదిగా పేరుబడిన వ్యక్తి”. ఆయనే కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ.

వెలుగు చీకట్లు రెంటిలో “అందుసగము ఇందు సగము వంటి వాడను ” అని చెప్పుకున్న విశ్వనాధ వారే” నే నేర్చినన్ని మాటలు నేర్వరెవ్వరును” అని కూడా అని విమర్శకుల దృష్టిలో అహంకారి అయ్యాడు. నన్నయ, తిక్కన్నలు నన్నాదేశించారని చెప్పుకున్నవాడు.
ఆధునికాంధ్రసాహిత్య నిర్మాతలలో విశ్వనాధవారి స్థానం మాత్రం కైలాశ శిఖరం వంటిదే. విశ్వనాధ వారు 1895 సెప్టెంబర్ 10న కృష్ణాజిల్లా నందమూరులో పార్వతమ్మ, శోభనాద్రి దంపతులకు జన్మించాడు. తిరుపతి వేంకటకవులలో ఒకరు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి శిష్యుడు. ఇంకా విశ్వనాధ వారి వ్యక్తిత్వాన్ని మలచిన ఆధ్యాత్మిక గురువుల విమలానంద భారతిగారు.

విశ్వనాథవారు బందరులో హైస్కూలు విద్య చదివారు తరువాత కళాశాలలో ప్రవేశించారు. సహాయ నిరాకరణ పిలుపుతో కళాశాల వదలి వచ్చేశాడు. తరువాత బందరు జాతీయ కళాశాల, హిందూ కళాశాలలో పనిచేస్తూ, పట్టభద్రుడయ్యాడు. 1932లో గుంటూరు ఏ.సి. కాలేజీలో అధ్యాపకులుగా ఉన్నారు. అక్కడా ఇమడలేక 1938లో పి.జి. స్థాయిలో సంస్కృతం చదివారు. తరువాత విజయవాడ కాలేజీలో పనిచేశారు. పదవీ విరమణ అనంతరం కరీంనగర్‌లో ప్రిన్సిపాల్ గా కళాశాలలో పనిచేశారు.

విశ్వనాథవారు విద్యార్థి దశనుండే కవితలు చెప్పేవారు. కొడాలి ఆంజనేయులు గారితో కలిసి జంటకవిత్వం కూడా పందించాడు. ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఆయన చేపట్టని ప్రక్రియలేదు. నవ్యకవిత్వ శాఖలన్నిటా ప్రవేశించి శిఖర సమానుడయ్యాడు. 1932లో భార్య వరలక్ష్మిగారు మరణించారు. భార్యావియోగంతో ‘వరలక్ష్మీ త్రిశ” అన్న స్మృతి కావ్యం రచించారు. నవలా సాహిత్యంలో కాలుపెట్టిన విశ్వనాథవారు 1917లో “అంతరాత్మ” అన్న తొలి నవల రాశారు. 1976లో చివరిదైన “నందిగ్రామరాజ్యం ” రచించారు. మొత్తంగా 59 నవలలు రచించారు. వీటిలో మంచిపేరు తెచ్చినది “ఏకవీర”(1930). వ్యక్తి ధర్మానికీ, వ్యవస్థా ధర్మానికీ మధ్య చెలరేగిన సంఘర్షణను హృద్యంగా ఈ నవల చర్చిస్తుంది. ఆ రోజులలోనే ఈ నవల మనో విశ్లేషణకు దారులు తీసినది.

ఏకవీరలోని శ్రీకాత్మకత వేయి ముఖాలుగా విస్తరించి “వేయిపడగలు” (1934) అన్న నవలగా రూపుదిద్దుకుంది. ఈ నవల మూడు తరాల జీవితాలకు అద్దం పడుతుంది. ఈ నవలను విశ్వనాథవారు చెబుతుంటే వారి తమ్ముడు రాసేవారట. ఈ పని 29 రోజుల్లోనే పూర్తయింది. 1968లో పి.వి. నరసింహారావుగారు “సహస్రఫణ్” పేర హిందీలోకి అనువదించాడు. 1976లో గుజరాతీ అనువాదం కూడా వచ్చింది. ఈ నవలలో సాహిత్యం , సంగీతం, నాట్యం, నాటకం, వైద్యం, ధ్యానయోగం వంటి ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి. కథా కథనంలో, పాత్రచలనంలో విశ్వనాథవారు తనదైన శైలిని చూపారు. విశ్వనాథవారు ఇంకా అనేక నవలలు రచించారు.
కథలు రాసింది కొన్నయినా, విలువలో ఉన్నతమైనవి. మానవీయ సంబంధాలు, వివిధ చిత్తవృత్తులు అపూర్వంగా, కరణరసంలో చిత్రితమయ్యాయి. విశ్వనాథవారికి విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టిన గ్రంథం “రామాయణ కల్పవృక్షం” ఈ రచనకు జ్ఞానపీర్ బహుమతి లభించింది.
విశ్వనాథవారు 1913లో తన తండ్రికి ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేమంటే కవిగా తను ఎదిగితే రామాయణాన్ని తెలుగులో రచిస్తానని, ఇలా 1934నుండి “రామాయణ కల్పవృక్షం” రాయడం మొదలుపెట్టారు. ఈ రచనకై ఎంతో అధ్యమనం చేయవలసి వచ్చింది. సృష్టి క్రమాన్ని, ప్రకృతి గురించి, చరిత్ర, అర్థశాస్త్ర, పౌరశాస్త్రాలు, సమాజ శాస్త్రాలు, జ్యోతిష్యశాస్త్రాలు చదవవలిసి వచ్చింది. ప్రాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని, డార్విన్ సిద్ధాంతాన్ని చదవడం జరిగింది. 1955-63 మధ్య భారతీయ భాషలలో వెలుబడిన సృజనాత్మక సాహిత్యరచనలలో సర్వోత్యష్టరచనగా ఎంపికైనది. 1970 సం. ప్రధానం చేయబడింది. ఈ సభ 1971 నవంబర్ 16 మంగళవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతులమీదుగా జ్ఞాన్ పీర్ పురస్కారం జరిగింది.
విశ్వనాధవారి అధ్యయనం ఎంత విస్తృతమో, ఆలోచన అన్నది ఎంత సునిశితమో, ఎంతటి వినూత్న కోణాల నుండి ఆ వెలుగు ప్రసరిస్తుంటుందో ఆయన రచనలన్నిటా అది పరచుకొని ఉంటుంది. తెలుగు సాహిత్యం మీదనే కాక, తెలుగు సాహిత్య విమర్శపై కూడా మంచి పట్టు సాధించినవారు సంస్కృత సాహితీ విమర్శకు కొత్త దారులు తెరిచారు. సంస్కృత రూపకాల గురించీ, కాళిదాసు, భవభూతి సాహిత్యం గురించి విలువైన వ్యాసాలు అందించారు.

1923లో విశ్వనాథవారు తన తండ్రి వెంట భద్రాచల ప్రాంతానికి వచ్చినపుడు గోదావరి ఉపనది కిన్నెరసాని వారు చూసి ఆయనలో కవితా హృదయం పొంగి పొరలింది. దీంతో రసమయ కావ్యంగా “కిన్నెరసాని పాటలు” రూపుదాల్చాయి.
“ముద్దు ముద్దుగా నడిచి ప్రోడవోలిక నాది మురిపెమ్ముగా పాది ముగుద కిన్నెర సాని ఎడదలో ఎదురైన కలగాంచెనో కన్నీటి కడవలై ప్రవహించెనో అంటూ కిన్నెర కావ్య స్రవంతిని ఎనిమిది కండాలుగా కిన్నెర పుట్టుక, కిన్నెర నడకలు; కిన్నెర నృత్యం, కిన్నెర సంగీతం; కడలిపొంగు; కిన్నెర దు:ఖం; గోదావరి సంగమం; కిన్నెర వైభవం పేర్లలో కావ్య స్రవంతిని ముందుకు నడిపాడు.
ఇంకా ఎన్నో నాటికలు, నాటకాలు రచించారు విమర్శ గ్రంథాలు రచించారు. సంస్కృత రూపకాలు దిద్దారు. వీరిపై, వీరి రచనలపై ఎం.ఫిల్, పిహెచ్.డి డిగ్రీలు ప్రధానం చేయబడినాయి.
విశ్వనాధవారు అందుకున్న పురస్కారాలకు కొదవేలేదు, కవిసమ్రాట్ బిరుదు, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి బహుమతి, కళాప్రపూర్ణ బిరుదు, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారం ఇలా ఎన్నో అందుకున్నారు విశ్వనాధవారు. విశ్వనాథవారు పొరుగు రాష్ట్రాలలో కూడా ఘన సన్మానాలు అందుకన్నారు. కలకత్తాలో వంగీయ సాహిత్య పరిషత్ సన్మానాన్ని 1967లో అందుకున్నారు. నాగపూర్ 1975లో పొందిన సన్మానం, వారణాసిలో జరిగిన సన్మానాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్ష పదవిని 1957లోనూ; రాష్ట్ర శాసన మండలి సభ్యత్వం 1958లో ఆయన పొందారు. 1971లో విశ్వనాథవారు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవిని అలంకరించారు. గుడివాడ ప్రజలు 1942లో “గజారోహణం”లో ఊరేగించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదుతో 1965లో సత్కరించారు, 1936లో “కవిసమ్రాట్” బిరుదు అందుకున్నారు.

1976 అక్టోబర్ 18వ తేదీన సాహితీ వినీలాకాశానికి ఏగుచుక్కయై తరలివెళ్ళాడు. దూషణ, భూషణాలు రెంటిని పొందాడు. పురస్కారాలు, తిరస్కారాలను చవిచూశాడు. ఆయనను కరడుకట్టిన సంప్రదాయవాదిగా లోకం చూసింది. కానీ ఆయన ఆధ్యాత్మికతతో కలగలసిన సామ్యవాదాన్ని కోరుకున్నాడు. తెలుగు సాహిత్యమున్నంత వరకూ ఒక చెరగని చిరునామా విశ్వనాథ సత్యనారాయణ.
ఎల్.ఆర్. వెంకటరమణ (6281461578)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap