తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

టాకీలు రాకముందు అంటే 1932 కు పూర్వం ప్రజలకు వినోద సాధనం నాటకాలే. టాకీలు వచ్చిన కొత్తల్లో నాటకరంగం నుంచి సినిమారంగంలోకి ఎంతోమంది గొప్పగొప్ప రంగస్థలనటులు వచ్చారు. వారిలో కొందరు ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించారు. హరిశ్చంద్రుడు అంటే డి.వి.సుబ్బారావు, సత్యభామ అంటే స్థానం నరసింహారావు, దుర్యోధనుడు అంటే మాధవపెద్ది వెంకట్రామయ్య, యముడు/కంసుడు అంటే వేమూరు గగ్గయ్య, నారదుడు అంటే పువ్వుల సూరిబాబు, ధర్మరాజు అంటే అద్దంకి శ్రీరామమూర్తి, వసుదేవుడు అంటే పారుపల్లి సుబ్బారావు…వీరే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవారు. అయితే వారి ప్రస్థానం యెంతోకాలం కొనసాగలేదు. కానీ ఆనాటినుంచి సినీరంగంలో నిలదొక్కుకున్న అతి తక్కువమంది నటులలో సి.ఎస్.ఆర్ అని పిలవబడే చిలకలపూడి సీతారామాంజనేయులుది ప్రధమస్థానం. రంగస్థలం అనే ఒక నటనాలయంలో సాటి నటులందరూ సి.ఎస్.ఆర్ కు గురువులు. వీరందరి కలబోత సి.ఎస్.ఆర్. ఆయనకున్న ప్రత్యేకత పద్యం ఆలపించే విధానం. ఆయన అదృష్టం నాటకాలలో శ్రీకృష్ణుడు పాత్ర దొరకడం. ఆరోజుల్లో శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ వంటి నాటకాల్లో కృష్ణ పాత్ర ధరించాలి అంటే సి.ఎస్.ఆర్ లేకుంటే కల్యాణం రఘురామయ్యే. తన సమకాలీనులైన అద్దంకి శ్రీరామమూర్తి, తుంగల చలపతి, పారుపల్లి వంటి గాయకులున్న రోజుల్లో సి.ఎస్.ఆర్ వారిని అధిగమించి పేరు చేచ్చుకోవడం విశేషమే. అర్ధయుక్తంగా, శ్రావ్యంగా పద్యాలు పాడడంలో సి.ఎస్.ఆర్ ప్రవీణుడు. రంగస్థల నటుడుగా ఆర్జించిన పేరుతోనే ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో తొలిసారి కృష్ణుడుగా వెండి తెరమీద దర్శనం ఇచ్చారు. అదే పరంపర కొన్నేళ్ళు అప్రతిహతంగా కొనసాగింది. తరవాత సాంఘిక చిత్రాల్లో హీరోగా వెలిగారు. నలభై ఏళ్ళు పైబడినతరవాత క్యారక్టర్ నటుడుగా స్థిరపడ్డారు. కేవలం స్వయంకృషితోనే సి.ఎస్.ఆర్ అగ్రశ్రేణి నటుడయ్యారు. మాయాబజార్ లో శకుని పాత్ర ద్వారా శాశ్వతంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

తొలిరోజుల్లో నటనమీద మోజుతో…

సి.ఎస్.ఆర్. జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. జూలై 11, 1907న వారు జన్మించారు. తండ్రి లక్ష్మినరసింహ మూర్తి నరసరావుపేట రెవెన్యూ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో సి.ఎస్.ఆర్ అందరికన్నా పెద్దవాడు. తండ్రికి నాటకాలమీద అభిలాష. ఆ కళాభిమానమే సి.ఎస్.ఆర్ కు కలిసివచ్చిన అంశం. తండ్రికి అద్దంకి బదిలీ కావడంతో సి.ఎస్.ఆర్ విద్యాభ్యాసం ఆవూరిలోనే జరిగింది. ఐదవ తరగతిలోనే సుమతి శతకం, వేమన శతకం కంఠతా నేర్చుకున్నారు. పైగా ఆ పద్యాలను రాగం మేళవించి ఆలపిస్తుంటే ఉపాధ్యాయులు మెచ్చుకునేవారు. అప్పుడు వారి పాఠశాలకు టి.వి. సుబ్బారావు ప్రధాన ఉపాధ్యాయునిగా వుండేవారు. సి.ఎస్.ఆర్ లోని ప్రతిభను గుర్తించి ఒక మంచి నాటకం వేయించాలనుకున్నారు. ఆ హెడ్మాస్టర్ కు షేక్ స్పియర్ నాటకాలంటే తగని అభిమానం. ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’ నాటకంలో సి.ఎస్.ఆర్ చేత షైలాక్ పాత్రను పోషింపజేయాలని ఆశించారు. అప్పుడు సి.ఎస్.ఆర్ ఆరవ తరగతిలో వున్నారు. వయసు కేవలం 11 ఏళ్ళు మాత్రమే. ఆ హెడ్మాస్టారు సి.ఎస్.ఆర్ కు ఇంగ్లీషు నేర్పి, ఆ నాటకంలో వున్నప్రాచీన ఇంగ్లీషు పదాలను ఎలా ఉచ్చరించాలో తర్ఫీదు ఇచ్చారు. హైస్కూలు ఇనస్పెక్షన్ జరిగే సమయంలో, స్కూల్స్ ఇనస్పెక్టర్ వారి సమక్షంలో సి.ఎస్.ఆర్ చేత షైలాక్ పాత్రను నటింపజేశారు. అధికారి మన్ననలే కాక, ఉపాధ్యాయులు, సహచర విద్యార్దులనుండి కూడా సి.ఎస్.ఆర్ కు అభినందనలు దక్కాయి. అలా నటనమీద సి.ఎస్.ఆర్ కి ఆసక్తి పెంచింది ఆహెడ్మాస్టారుగారే. 1919లో తండ్రి గారికి ఒంగోలు బదిలీ కావడంతో సి.ఎస్.ఆర్ చదువుసంధ్యలు అక్కడే కొనసాగాయి. ఆ పట్టణంలో మూడు నాటక సమాజాలు ఉండేవి. హిందూ నాటక సమాజం, కృష్ణ విలాస సభ, శృంగార విలాస సభ పేర్లతో ఆ సమాజాలు తరచూ నాటక ప్రదర్శనలు ఇస్తుండేవి. సి.ఎస్.ఆర్ చక్కగా పాటలు పాడేవారు. తన తోటి మిత్రులతో కలిసి ‘బొబ్బిలి యుద్ధం’ నాటకం ప్రదర్శిస్తే సి.ఎస్.ఆర్ అందులో మంచన బుచ్చన్న పాత్ర పోషించారు. దాంతో సి.ఎస్.ఆర్ నాటక సమాజాల దృష్టిని ఆకర్షించారు. ఆయా సంఘాలు ప్రదర్శించే నాటకాల్లో సి.ఎస్.ఆర్ చేత నారద, కృష్ణ పాత్రలు పోషింపజేశారు. సాంఘిక నాటకం ‘వరవిక్రయం’ లో సి.ఎస్.ఆర్ లింగరాజు పాత్ర ధరించేవారు. అప్పుడు సి.ఎస్.ఆర్ వయసు కేవలం పదిహేనేళ్ళు మాత్రమే. అప్పుడే సి.ఎస్.ఆర్ పేరు ప్రముఖ నటులు స్థానం నరసింహా రావు దృష్టిని ఆకర్షించింది. స్కూలు ఫైనలు పరీక్షా సమయంలో కూడా ఒక నాటకంలో తప్పనిసరి వేషం వేయాల్సి వచ్చింది. అయినాసరే అటు నాటకం వేస్తూ, పరీక్ష ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతుండగా, తండ్రికి పొన్నూరు బదిలీ అయింది. తండ్రికి చదివించే స్థోమత లేకపోవడంతో సి.ఎస్.ఆర్ చదువుకు స్వస్తి పలికారు. ఉద్యోగార్ధం బెజవాడ (ఇప్పుడు విజయవాడ)లో కోఆపరేటివ్ ఇనస్పెక్టర్ శిక్షణ తీసుకున్నారు. అ శిక్షణా సంస్థ ప్రిన్సిపాలు సి.ఎస్.ఆర్ చేత ఒక నాటకం వేయించారు. దానికి అందరి ప్రశంసలు లభించాయి. రాజమండ్రిలో ‘రామదాసు’ నాటక ప్రదర్శనకు యడవల్లి సూర్యనారాయణ చేరుకోలేకపోవడంతో సి.ఎస్.ఆర్. కు కబురొచ్చింది…వెంటనే రాజమండ్రి రమ్మని. సి.ఎస్.ఆర్ రాజమండ్రి వెళ్లి రామదాసు నాటకంలో ప్రధానమైన రామదాసు పాత్రను పోషించారు. అలా సి.ఎస్.ఆర్ పేరు మూడు జిల్లాలకు ప్రాకింది. 1927లో చల్లపల్లి రాజా గారి పట్టాభిషేకం జరిగినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ‘రామదాసు’ నాటకం ప్రదర్శిస్తే సి.ఎస్.ఆర్ అందులో రామదాసుగా నటించారు. దాంతో బెజవాడలోని రామాగ్రాఫ్ గ్రామఫోన్ రికార్డింగ్ కంపెనీ వారు సి.ఎస్.ఆర్, స్థానం నరసింహారావు కాంబినేషన్ లో రామదాసు పద్యాలు, పాటల్ని రికార్డు చేశారు. ఆ రికార్డులు వేలాదిగా అమ్ముడుపోయాయి. తరవాతనుంచి సి.ఎస్.ఆర్-స్థానం నరసింహారావు లు కలిసి అనేక నాటకాలు ప్రదర్శించారు. సి.ఎస్.ఆర్ రూపొందించిన ‘తుకారాం’ నాటకానికి మంచి పేరు వచ్చింది.

CSR

సింహద్వారం గుండా సినిమాలలోకి ప్రవేశం…

టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో తెలుగు సినిమాల నిర్మాణం క్రమంగా వూపందుకుంటున్నది. తొలిరోజుల్లో పౌరాణిక సినిమాలనే ఎక్కువగా నిర్మించేవారు. నాటకాలలో నటించిన పాత్రలనే రంగస్థల నటులు సినిమాలలో కూడా పోషించేవారు. నాటక స్క్రిప్టులనే యధాతధంగా వుపయోగించి అందులోని పాటలు, పద్యాలను నటీనటులే పాడేవారు. అప్పటికే సి.ఎస్.ఆర్ రంగస్థల కృష్ణుడు గా పేరు సంపాదించారు. 1936లో బెజవాడ సరస్వతి టాకీస్ అధిపతులు కురుకూరి సుబ్బారావు, పారుపల్లి వెంకట శేషయ్య ‘ద్రౌపది వస్త్రాపహరణము’ అనే మల్లాది అత్యుతరామ శాస్త్రి పౌరాణిక నాటకాన్ని కొల్హాపూర్ సినీటోన్ కంపెనీలో సినిమాగా నిర్మించారు. బ్రిటీష్ ఎకోస్టిక్ ఫోటోఫోను యంత్రం మీద ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. హెచ్.వి. బాబు దర్శకత్వం వహించగా హెచ్. ఎం. రెడ్డి నిర్మాణ పర్యవేక్షణ గావించారు. పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి పాటలు, పద్యాలు రూపొందించగా జి. మాధవ టాంబే సంగీత పర్యవేక్షణ చేశారు. ఇందులో శ్రీకృష్ణుడు గా సి.ఎస్.ఆర్, ద్రౌపదిగా కన్నాంబ నటించారు. చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ (ధర్మరాజు), దొమ్మేటి సూర్యనారాయణ(భీముడు), దొమ్మేటి సత్యనారాయణ(అర్జునుడు), యడవల్లి సూర్యనారాయణ(దుర్యోధనుడు), నెల్లూరి నగరాజరావు(శకుని), కడారు నాగభూషణం(అశ్వథ్థామ), ఆరణి సత్యనారాయణ (విదురుడు) పి. సూరిబాబు (నారదుడు), రామతిలకం (సత్యభామ), నగరాజకుమారి (రుక్మిణి) ఇతర పాత్రలు పోషించారు. అదే సమయంలో లక్ష్మి ఫిలిమ్స్ సంస్థ ‘ద్రౌపది మానసంరక్షణము’ పేరుతో ఎం. జగన్నాథస్వామి దర్శకత్వంలో పోటీగా సినిమా నిర్మించింది. దైతా గోపాలం చిత్ర రచన చేయగా బొంబాయి ఫిలిం సిటీ స్టూడియోలో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో బళ్ళారి రాఘవ దుర్యోధనుడుగా, బందా కనకలింగేశ్వరరావు శ్రీకృష్ణుడుగా, సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించగా, ఇతర పాత్రలను బి. చలపతిరావు (అర్జునుడు), పారుపల్లి సుబ్బారావు(ధర్మరాజు), ఎ.వి. సుబ్బారావు(భీముడు), దైతా గోపాలం(విదురుడు), రంగస్వామి అయ్యంగార్ (శకుని), మాధవపెద్ది వెంకట్రామయ్య(శిశుపాలుడు), లీలాబాయి(సత్యభామ), శ్రీహరి (రుక్మిణి) పోషించారు. ద్రౌపది వస్త్రాపహరణము చిత్రం ఫిబ్రవరి 29 న విడుదల కాగా, ద్రౌపది మానసంరక్షణం చిత్రం 24 మార్చి న విడుదలైంది. అయితే సియ్యస్సార్ నటించిన సినిమా మాత్రమే విజయవంతమైంది. జయా ఫిలిమ్స్ వారు 1938లో ‘తుకారాం’ చిత్రాన్ని కోయంబత్తూరు సెంట్రల్ స్టూడియోలో నిర్మించారు. అందులో తుకారాం పాత్రను సి.ఎస్.ఆర్ పోషించారు. ఆ పాత్ర పోషించిన సి.ఎస్.ఆర్ కు మంచి పేరొచ్చింది.

హీరోగా సి.ఎస్.ఆర్ జైత్రయాత్ర…

పుల్లగూర శేషయ్య అధ్వర్యంలో శ్రీశారదా రాయలసీమ ఫిలిమ్స్, కడప వారు 1939లో ‘జయప్రద’ సినిమా నిర్మించారు. అందులో పురూరవుడుగా సి.ఎస్.ఆర్ నటించగా సీనియర్ శ్రీరంజని జయప్రడగా నటించింది. సాలూరు రాజేశ్వరరావు ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అదే సంవత్సరం ఫేమస్ ఫిలిమ్స్ వారు ‘తిరుపతి వేంకటేశ్వర మహాత్మ్యం’ (బాలాజి) సినిమా నిర్మించారు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాసుడుగా సి.ఎస్.ఆర్ నటించగా శాంతకుమారి పద్మావతిగా నటించింది. కవికోకిల దువ్వూరు రామిరెడ్డి, బుచ్చన్నశాస్తి రచనా సహకారం, ఆకుల నరసింహారావు సంగీత సహకారం అందించారు. దిగ్విజయంగా ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే. రాజా శాండో దర్శకత్వం వహించిన ‘చూడామణి’ (1941) సాంఘిక చిత్రంలో సి.ఎస్.ఆర్ హీరోగా నటించగా పుష్పవల్లి హీరోయిన్ గా నటించింది. దాంతో సి.ఎస్.ఆర్ సినిమా రంగంలో స్థిరపడ్డారు. అదే సంవత్సరం రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి ‘తల్లిప్రేమ’ సాంఘిక చిత్రం విడుదలైంది. కడారు నాగభూషణం దర్శకత్వం వహించగా కన్నాంబ సి.ఎస్.ఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఆరోజుల్లో గొప్ప విజయాన్ని నమోదుచేసింది. రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారే నిర్మించిన ‘సుమతి’ చిత్రంలో కూడా సి.ఎస్.ఆర్. హీరో. 1945లో రాజేశ్వరి ఫిలిమ్స్ సంస్థ కడారు నాగభూషణం దర్శకత్వంలోనే ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమా నిర్మించింది. శ్రీరాముడుగా సి.ఎస్.ఆర్ నటించగా, పుష్పవల్లి సీతగా నటించింది. కైకేయిగా కన్నాంబ, భరతుడుగా బందా కనకలింగేశ్వరరావు, దశరథుడుగా అద్దంకి శ్రీరామమూర్తి, లక్ష్మణుడుగా కొచ్చెర్లకోట సత్యనారాయణ నటించారు. అదే సంవత్సరం గూడవల్లి రామబ్రహ్మం అక్కినేని ని పరిచయం చేస్తూ నిర్మించిన సూపర్ హిట్ జానపద చిత్రం ‘మాయాలోకం’ లో నవభోజరాజు అనే ఒక వెర్రిబాగుల రాకుమారుడు పాత్రను సి.ఎస్.ఆర్ పోషించారు. నిజానికి రామబ్రహ్మం సి.ఎస్.ఆర్ ని హీరోగా నటించమని కోరారు. కానీ ఆ హీరో పాత్రకు కుర్రవాడైతే బాగుంటుందని సి.ఎస్.ఆర్ సలహా ఇచ్చారు. “హీరో వేషానికి మంచి యువకుడు దొరికితే సరేసరి. లేకుంటే ఆ పాత్రను మీరే వేయాల్సి వుంటుంది” అని రామబ్రహ్మం సి.ఎస్.ఆర్ తో అన్నారు. అలా తెలుగు వెండితెరకు అక్కినేని నాగేశ్వరరావు ను హీరోగా పరిచయం చేసే విషయంలో సి.ఎస్.ఆర్ కూడా ఒక చెయ్యి వేసినట్లయింది. సి.ఎస్.ఆర్ కు వైవిధ్యం గలిగిన పాత్రలు కూడా అదే సంవత్సరం దొరికాయి.

క్యారక్టర్ నటుడుగా…

భరణీ సంస్థ నిర్మించిన ‘రత్నమాల’ (1947) సినిమాలో నటించేనాటికి సి.ఎస్.ఆర్ కు నలభై ఏళ్ళు నిండాయి. భరణీ రామకృష్ణరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ జానపద చిత్రంలో భానుమతి మేనమామ ధూమకేతుగా సి.ఎస్.ఆర్ నటించి మెప్పించారు. 1950లో ఎ.వి.ఎం వారు మెయ్యప్పన్ దర్శకత్వంలో ‘జీవితం’సాంఘిక చిత్రం నిర్మించారు. ఎస్. వరలక్ష్మి ఈ చిత్రంతోనే వెండితెర ప్రవేశం చేసింది. ఇందులో సి.ఎస్.ఆర్ శివశంకర లింగేశ్వరప్రసాద్ పాత్ర పోషించారు. హాస్యనటుడు కస్తూరి శివరావు ఎలైడ్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపింఛి స్వీయ దర్శకత్వంలో ‘పరమానందయ్య శిష్యులు” చిత్రాన్ని నిర్మించారు. అందులో సి.ఎస్.ఆర్ పరమానందయ్యగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో అక్కినేని చంద్రసేన మహారాజుగా, లక్ష్మీరాజ్యం లీలావతిగా నటించారు. సి.ఎస్.ఆర్ శిష్యులుగా శివరావు, రేలంగి, నల్ల రామ్మూర్తి, ఇమామ్, రావులపల్లి, ఇమిటేషన్ ఆచారి నటించారు. సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు. 1951లో రాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కడారు నాగభూషణం నిర్మాణ దర్శకత్వంలో ‘సౌదామిని’ చిత్రాన్ని నిర్మించారు. అందులో విక్రమసేన మహారాజుగా సి.ఎస్.ఆర్ నటిఒంచారు. మహారాణి సౌదామినిగా కన్నాంబ నటించింది. సినిమా విజయవంతమైంది.

మై డియర్ తులసమ్మక్కా…

1946లో సారథిఫిలిమ్స్ సంస్థ తమ నాలుగవ చిత్రంగా ‘గృహప్రవేశం’ చిత్రాన్ని నిర్మించింది. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుమతి, ఎల్.వి. ప్రసాద్ ప్రధాన పాత్రధారులు. ఇందులో సి.ఎస్.ఆర్ రమణారావు పాత్రలో హేమలతకు మేనల్లుడిగా నటించారు. సి.ఎస్.ఆర్ జూనియర్ శ్రీరంజనితో ప్రేమ నటిస్తూ, భానుమతిని వివాహం చేసుకోవాలని శ్రీరంజనిని నిరాకరించి మోసానికి ఒడికడతాడు. ఇందులో భానుమతి-సి.ఎస్.ఆర్ మధ్య జరిగే వినోద సన్నివేశాలు సినిమాకు నిండుదనం చేకూర్చడమే కాకుండా సినిమా విజయానికి దోహదపడ్డాయి. “జానకి నాదేనోయ్, మదిలో కోరిక లీడేరాయ్ అక్కా తులశమ్మక్కా” అనే పాటను రమణారావు పాత్రకోసం సి.ఎస్.ఆర్ చేత పాడించి నటింపజేశారు. ఆ పాట ప్రేక్షకుల్ని బాగా అలరించింది. హాస్యాన్ని మిళితంచేసిన విలనీతో నిండిన గిరీశం వంటి పాత్రను సి.ఎస్.ఆర్. అద్భుతంగా పండించారు. వినోదా వారు నిర్మించిన ‘దేవదాసు’ (1953)లో దుర్గాపురం జమీందారు గా, సావిత్రికి వృద్ధ భర్తగా నటించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. 1954 లో భరణీ సంస్థ ‘చక్రపాణి’ అనే సినిమా నిర్మించింది. అక్కినేని, భానుమతి ఇందులో హీరో హీరోయిన్లు. అయితే టైటిల్ రోల్ చక్రపాణిగా, పిసినిగొట్టు జమీందారుగా సి.ఎస్.ఆర్ నటించడం విశేషం. ‘లైలామజ్ను’, ‘జీవితం’ వంటి సినిమాలలో సి.ఎస్.ఆర్ కు క్యారక్టర్ నటుడిగా పేరొచ్చింది. కన్యాశుల్కం, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు వంటి 175 సినిమాలలో సి.ఎస్.ఆర్ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. సి.ఎస్.ఆర్. కు ఇద్దరు సోదరులు. సువర్ణసుందరి, గుణసుందరి కథ, మాయాబజార్ వంటి సినిమాలకు సహాయ దర్శకులుగా పనిచేసిన సి.ఎస్. నాగేశ్వరరావు ఒక సోదరుడు కాగా, భరణీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన సి.వి. రత్నం మరో సోదరుడు. అటువంటి అసమాన ప్రతిభగల సి.ఎస్.ఆర్ 1963 అక్టోబరు 8 వతేదీ తన 56 వ సంవత్సరంలో చనిపోయారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap