మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు  కృష్ణారెడ్డి

లలిత కళల్లో చిత్రకళ అనునది ఒక విశిష్టమైన ప్రక్రియ. సృజనాత్మకమైన ఈ కళలో మనిషి మస్తిష్కంలో కదిలే భావాలను వ్యక్తీకరించడానికి ఎన్నో ప్రక్రియలను కళాకారుడు అనుసరించడం జరుగుతుంది. ఒకరు కేవలం రేఖల్లో భావాలను వ్యక్తం చేస్తే, మరొకరు రంగుల్లో వ్యక్తం చేస్తాడు. ఇంకొకరు రంగు రేఖల కలయికతో తాననుకున్న భావాలను వ్యక్తం చేస్తాడు. వేరొకరు ఇంకా వినూత్నమైన లినోకట్, వుడ్కట్ లాంటి రకరకాల ప్రయోగాలతో క్లిస్త్తరమైన తన భావాలను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాడు. క్లిష్టతరమైన అలాంటి వినూత్నమైన ప్రక్రియల్లో ప్రింట్ మేకింగ్ అన్న విదానం ఒకటి. ఎంతో పురాతనం మరియు విశిష్టమైన ఈ ప్రక్రియలో జీవిత కాలం అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు చేసి మనదేశం కంటే అంతర్జీయంగా గణనీయమైన ఖ్యాతి గడించిన గొప్ప భారతీయ చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి.

పద్మశ్రీ కృష్ణారెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి చిత్తూర్ జిల్లాలో నందనూర్ అనే గ్రామంలో 1925 జూలై 15 వ తేదిన జన్మించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో 1941 నుండి 1946 మధ్యకాలంలో ప్రఖ్యాత చిత్రకారుడు నందలాల్ బోస్ శిష్యరికంలో చిత్రకళలో డిగ్రీ పూర్తి చేసారు. ఆపై 1949 వరకు చిత్రకళా ఆచార్యుడిగా కళా క్సేత్రనందు పనిచేసారు. తదుపరి మద్రాస్ లో కూడా కొంతకాలం ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్న సమయంలో వీరికి శిల్పం మరియు ప్రింట్ మేకింగ్ పై ఆసక్తి ఏర్పడడంతో 1949 లోనే కృష్ణా రెడ్డి లండన్ వెళ్ళి అక్కడ ప్రఖ్యాత స్లేడ్ స్కూల్ అఫ్ ఫైన్ ఆర్ట్ కళాశాలలో హెన్రీ మూర్ తో కలిసి శిల్పకళలో శిక్షణ పొందారు. ఆపై 1950లో దీనిలో మెళకువలు మరింతగా నేర్చుకొనేందుకు పారిస్ వెళ్లి కాన్స్తాన్తిన్ బాన్సుచి అనే ప్రముఖ చిత్రకారుని వొద్ద చేరారు.ఈ కాలంలోనే అక్కడ ప్రముఖ చిత్రకళా స్టూడియోలలో జరిగే వివిధ చిత్రకళా వర్క్ షాపులలో విరివిగా పాల్గొనే అవకాసం వొచ్చింది. మరలా ఇదే సమయంలో పారిస్ నందు స్థిరపడ్డ ప్రముఖ రష్యన్ శిల్పి ఓసిప్ జెడ్ కిన్ వొద్ద మరియు ఇంగ్లండు కు చెందిన మరో ప్రముఖ చిత్రకారుడు మరియు ప్రింట్ మేకర్ స్టాన్లీ విలియం హాయట్లర్ వొద్ద శిక్షణ పొందారు. ఆపై మరలా 1957లో మిలన్ నందలి బ్రేరా అకాడమి లో మరొక ప్రముఖ చిత్రకారుడు “మారినో మేరీని“వొద్ద కొంతకాలం శిక్షణ పొందారు. అంతర్జాతీయ స్థాయిలో ఎందరో ప్రముఖుల వొద్ద శిక్షణ పొందిన శ్రీ రెడ్డి అంతే స్థాయిలో ఈ మాధ్యమంలో అంతర్జాయంగా గుర్తింపబడ్డ ప్రఖ్యాత ప్రింట్ మేకర్ గా పేరు గాంచారు, ఆపై ప్రఖ్యాత శిల్పి హయట్లర్ చే 1925 లో పారిస్ లో స్థాపించబడి కొంతకాలం న్యూయార్క్ నగరంలోను మరల పారిస్ కి తరలించబడ్డ ప్రఖ్యాత స్టూడియో ఎటీలియర్ 17కు అసోసియేట్ డైరెక్టర్ గ ఎంపికయ్యారు. ఈ సమయంలోనే అంతర్జాతీయంగా పేరు గడించిన ప్రఖ్యాత అమెరికన్ మరియు యురోపియన్ దేశాలకు చెందిన చిత్రకారులు శిల్పులు అయిన జాన్ మీరో, పాబ్లో పికాసో, అల్బర్తో గ్లాకోమేట్టి. జాన్ గార్ద్నాస్, కాన్స్తాన్తిన్ బాన్సుచి ,జరీనా హస్మి లాంటి ప్రముఖులతో చిత్రకళ, శిల్పకళ, ప్రింట్ మేకింగ్ తదితర ప్రక్రియలలో వివిధ ప్రయోగాలు చేసే వారు.

artist Krishna Reddy

చిత్రకళలో చాల పురాతన మాధ్యమమైన లినోక్కట్ ,ఉడ్కట్ తదితర మాధ్యమాలనే 1964 లో ప్రింట్ కౌన్సిల్ అఫ్ అమెరికా వారు ప్రింట్ మేకింగ్ గ నామకరణం చేయడం జరిగింది. సాదారణ చిత్రకళలో మాదిరిగా ఒక డ్రాయింగ్ షీట్ పైనో లేదా కాన్వాస్ పై కుంచె పాలెట్ నైఫ్ తదితరమైన వాటితో నేరుగా బొమ్మలు వేయడం కాకుండా అంతకంటే బిన్నమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ .ముందుగ చిత్రకారుడు తాననుకున్న భావాన్ని సన్నని సూదితో జింక్ ప్లేట్ పై గీసి ఆపై దానిని ఆసిడ్ లో ముంచినప్పుడు ఆ ప్లేట్ పై సన్నని గీతలు రావడం జరుగుతుంది. అప్పుడు అందులో కావాల్సిన రంగులు వేసి ప్రింట్ తీయడం ద్వారా ఎచ్చింగ్ చిత్రాలు తీయడం జరుగుతుంది. అలాగే వుడ్ కట్ చిత్రాలలో కూడా రకరకాల టూల్స్ ని ఉపయోగించి అనేక సార్లు తాననుకున్న భావం వ్యక్తం అయ్యేవరకు ఆ ప్లేట్ పై రకరకాలుగా కట్ చేస్తూ పలుసార్లు తనకు కావాల్సిన రంగులు మార్చి మార్చి అద్దుతూ ప్రింట్ తీయడం ద్వారా ఒక వినూత్నమైన చిత్రాలు సృష్టించడం జరుగుతుంది. ఎంతో క్లిష్టతరమైన ఈ ప్రక్రియలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఈ గొప్ప చిత్రకారుడు మనదేశంలో అంతగా తెలియకపోవడం విచిత్రం, అంతే కాకుండా తనకు సమకాలికులైన రజా, ఏం.ఎఫ్ఫ్ హుస్సేన్, ఎఫ్.యెన్ సౌజలతో సమాన స్థాయి గల చిత్రకారుడైనప్పటికి మన దేశంలో పై ముగ్గిరికి వొచ్చినంత గుర్తింపు రాకపోవడం విచారకరం. దానికి కారణం విధ్యాభ్యాసము నాటి నుండే విదేశాలకు వెళ్ళడం అక్కడే స్థిరపడి పోవడం ఒక కారణమైతే రెండవది తాను చిత్రకళా రంగంలో ఎంచు కున్న ప్రింట్ మేకింగ్ అనే మాధ్యమం కుడా ఒకింత కారణం అని చెప్పవచ్చు.విదేశాలతో పోలిస్తే మన దేశంలో పెయింటింగ్ కే ఆదరణ తక్కువ అలాంటిది ఎంతో గొప్ప టెక్నిక్ అయినప్పటికీ ఒక ప్లేట్ పై రెండు మూడు ప్రింట్స్ మార్చి మార్చితీయడానికి వీలుండే ఈ విదానానికి ఇంకెక్కడ అంత ఆదరణ వుంటుంది? శ్రీ కృష్ణారెడ్డి స్వదేశం కాకుండా విదేశాలలోనే స్తిరపడడానికి ఇది కూడా ఒక కారణం అనేది కొందరి కళా విశ్లేషకుల అభిప్రాయం.

ప్రింట్ మేకింగ్ లో అతడు చేసిన వినూత్న ప్రయోగాలు రెడ్డిని విఖ్యాత ప్రింట్ మేకర్ గా గుర్తింప బడేలా చేసాయి, క్లిష్టతరమైన ఈ మాధ్యమం ద్వారా అతడు క్రియేట్ చేసిన నైరుప్యాలతో బాటు పాక్షిక వైరుప్య చిత్రాలు,సాధారణ చిత్రకళలో మాదిరి వివిధ రంగులతో చేసిన ప్రయోగాలు వీక్షకులను సంబ్రమాచార్యాలకు గురి చేసేలా ఇతడు సృష్టించిన ప్రింట్స్ వీరికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. వీరి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1972లోనే పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించడం జరిగింది. చిత్రకళా రంగం గురించి బాగా తెలిసిన ప్రముఖ వర్గంలోనే గుర్తింపబడ్డ వీరు మన దేశంలోని సామాన్య జనావళికి తెలియక పోవడం వీరి ఈ చిత్ర రచన మాధ్యమం కూడా ఒక కారణం .
ఎవరో వొకరి గుర్తింపు కోసమో లేదా పొగడ్తల కోసమో కాకుండా తాననుకున్న భావాల్ని తనదైన రీతిలో కళా సృజనను చేసుకుంటూ వెళతాడు నిజమైన కళాకారుడు. కృష్ణా రెడ్డి అలాంటి కోవకు చెందిన నిజమైన కళాకారుడు కనుకనే క్లిష్టతరమైనదైనా తన మనసుకు నచ్చిన తన కళలో జీవితాంతం ఎన్నో ప్రయొగాలు చేస్తూ ముందుకు నడిచారు, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అంతటి గొప్ప కళాకారుడు గత సంవత్సరం ఆగస్ట్ 22వ తేదీన న్యూయార్క్ నగరంలో తన 93వ ఏట శాశ్వతంగా రంగుల లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం చిత్రకళాలోకానికి ఒక గొప్ప తీరని లోటు.

నేడు ఆ మహా చిత్రకారుడు మనమధ్య లేకపోవోచ్చు. కాని అతడు సృష్టించిన అజరామమైన కళాసంపద మనతోనే కాదు మన తరువాత తరంలో కుడా నిలిచేవుంటుంది.

వెంటపల్లిసత్యనారాయణ (9491378313)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap